దక్షిణ భారతదేశంలో పేరు పొందిన బహు వార్షిక కూరగాయల్లో మునగ ఒకటి. పెరటి తోటల్లో పెంచబడే ఈ పంట ప్రస్తుతం వాణిజ్యపరంగా పండించబడుతోంది. కాయలతో పాటుగా మునగ ఆకులు వైద్యపరంగానూ ఉపయోగిస్తున్నారు. అందుకే మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
వాతవరణం: 20నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన ప్రాంతాలు అనుకూలం. 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పూత రాలిపోతుంది. మంచును, అధిక చలిని తట్టుకోదు.
నేలలు: అన్ని రకాల నేలు అనుకూలం. అధిక సేంద్రియ పదార్ధాలతో కూడిన ఇసుక నేలలు శ్రేష్టం. నేల ఉదజని సూచిక 6.0 నుండి 7.5 మధ్యన ఉంటే మంచిది.
విత్తే సమయం: వార్షిక మునగ ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకొస్తుంది. కనుక ఆగస్టు నుండి సెప్టెంబరు నెలలో గింజలను పాలిథీన్ సంచుల్లో గానీ నేరుగా పొలంలోగానీ విత్తుకోవాలి. బహువార్షిక రకాలలో కత్తిరింపులను జూన్ రెండవ వారం నుండి ఆగస్టు నెలాఖరు వరకు నాటుకోవచ్చు.
రకాలు: దేశావాలీ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో జాఫ్నా, పికెఎం-1రకాలు ఎక్కువ సాగులో ఉన్నాయి.
పికెఎం-1: వార్షిక రకం. మొక్క 4-5 మీ. ఎత్తు వరకు పెరిగి విత్తిన 160 నుండి 170 రోజులలో పూతకొస్తుంది. కాయ పొడవు 65నుండి 70సెం.మీ. కాయబరువు 150గ్రా.
దిగుబడి : మొక్కకు 33కిలోలు లేదా 200 నుండి 225 కాయలు వస్తాయి.
జాఫ్నా: బహువార్షిక రకం. కాయ పొడవు 60-90 సెం.మీ మెత్తని గుజ్జుతో రుచికరంగా ఉంటుంది. రెండో సంవత్సరం నుండి కాపుకొస్తుంది.
దిగుబడి: మొదటి రెండు సంవత్సరాలు సంవత్సరానికి చెట్టుకు 80నుండి 90 కాయలను నాలుగో సంవత్సరం నుండి సంవత్సరానికి చెట్టుకు 500నుండి 600 కాయలను పొందవచ్చు.
నేల తయారీ: నేలను 4నుంచి 5సార్లు దుక్కి వచ్చే వరకు దున్నాలి. బహువార్షిక రకాలకు 5ఇంటు5మీ. దూరం, ఏకవార్షిక రకాలైతే 2.5ఇంటు 2.5 మీ. దూరం ఉండాలి. గుంటల పరిమాణం 45 ×45 ×45 సెం.మీ ఉండాలి. ప్రతి గుంటకు 10కిలోల పశువుల ఎరువు , 250గ్రా. వేపపిండి, సూపర్ ఫాస్ఫేట్ వేయాలి.
వ్యాప్తి చేసే విధానం: బహువార్షిక రకాలను 90నుంచి 100సెం.మీ పొడవు 5-8సెం.మీ మందం గల కొమ్మల కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేయవచ్చు. ఎకరానికి 160 కాండం ముక్కలు కావాలి. ఏక వార్షికాలను విత్తనాల ద్వారా వ్యాప్తి చెందించవచ్చు. (ఎకరానికి 250గ్రా. చొప్పున) గింజలను నేరుగా పొలంలో విత్తుకోవాలి. లేదా పాలిథీన్ సంచుల్లో విత్తి 15నుంచి 20 సెం.మీ ఎత్తు పెరిగిన తర్వాత పొలంలో నాటుకోవచ్చు.
అంతరకృషి: మొక్కలు 60నుంచి 75 సెం.మీ ఎత్తు పెరిగాక మొక్కల చివర్లు తుంచివేయాలి.
ఎరువులు: గింజలు విత్తిన 3 నెలలకు ఒక్కొక్క గుంటకు 100గ్రా. యూరియా, 50గ్రా.మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీరు పెట్టాలి. మొక్కలకు ఆరు నెలలక ఒకసారి, 9నెలలకు మళ్లీ ఒకసారి 100గ్రా. యూరియా, 50గ్రా. మ్యూరేట్ఆఫ్ పొటాష్ను వేసి నీరు పెట్టాలి.
నీటి యాజమాన్యం: విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి 3 రోజులకు నీటితడి ఇవ్వాలి. తర్వాత 10నుంచి 15 రోజులకు ఒకసారి నీటితడి ఇవ్వాలి. వరుసల మధ్య అంతర పంటలుగా అలసంద, బెండ, వంగ, ఫ్రెంచి చిక్కుడు వంటి పంటలను వేసుకోవాలి.
సస్యరక్షణ: చిన్న గొంగళి పురుగులు గుంపులు గుంపులుగా కాండంపై చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. పెద్ద పురుగులు ఆకులన్నీ తిని ఈనెలను మిగులుస్తాయి. నివారణకు లీటరు నీటికి కారజెన్ రైనాక్సిపైర్ 0.3 మి.లీ కలిపి పురుగులు చిన్నవిగా ఉన్న దశలో పిచికారి చేయాలి.
కాయతొలుచు ఈగ: కాయతొలుచు ఈగ పూత దశలో ఆశించి పిందె దశలో కాయలోనికి ప్రవేశించి, లోపలి పదార్ధాన్ని తిని నాశనం చేయడం వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫాసలన్ 2 మి.లీ కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటికి డైక్లోరోవాస్ను 1మి.లీ కలిపి మళ్లీ పిచికారీ చేయాలి. అవసరమైతే మరోసారి 25రోజులకు పిచికారీ చేయాలి.
వేరు కుళ్లు, కాండం కుళ్లు: వర్షాకాలంలో మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్లిపోయి, చెట్టు విరిగిపోతుంది. వేర్లు కూడా కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు మొక్కల మొదలు వద్ద 1గ్రా. కార్బండైజిమ్ లేదా 3గ్రా. డైథేన్ ఎం-45 ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణం కానీ లేదా 1శాతం బోర్డోమిశ్రమంగానీ ముంపుగా తడపాలి. మొక్క మొదలు వద్ద మురుగు నీరు నిలవకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి చెట్టు మొదలులో ట్రైకోడెర్మా విరిడి (ఎకరానికి 2 కిలోలు ) కలిపిన పశువుల ఎరువును 5కిలోల చొప్పున వేయాలి.
కోత కోయడం: బహువార్షిక రకాలు నాటిన 8నుంచి 9 నెలలకు కాపుకొస్తాయి. మొదటి పంట మార్చి నుంచి జూన్ నెలలో రెండో పంట సెప్టెంబరు-అక్టోబరు నెలలో వస్తుంది. పంట పెరిగినపుడు మొక్కకు ప్రతి సంవత్సరానికి 500నుంచి 600 కాయల వరకు దిగుబడి వస్తుంది. ఏకవార్షిక మునగ రకాలు గింజలు విత్తిన 6 నెలలకే కాపుకొస్తాయి.
Authorization