శీతాకాలంలో సాగు చేసే కూరగాయలలో క్యాబేజి చాలా ముఖ్యమైనది. ఈ క్యాబేజిని కూరగాయగానే కాకుండా సలాడ్గా ఎక్కువ ఉపయోగిస్తారు. గ్లూకోసినోలేట్ సినిగ్రిన్ అనే పదార్థం కలిగి ఉండడం వల్ల ఈ క్యాబేజి ఒక రకమైన వాసనను కలిగి ఉంటుంది. అయినా దీని ప్రాధాన్యత దీనికి ఉంది. అందుకు చాలా మంది రైతులు క్యాబేజీ సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. మరి దీని సాగులో తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం...
వాతావరణం: క్యాజేజికి చల్లని తేమగల వాతావరణం అత్యంత అవసరం. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ మించకుండా ఉంటే ఎక్కువ దిగుబడి వస్తుంది.
నేలలు: చౌడు క్షార నేలలు పనికిరావు, ఇసుకతో కూడిన బంక నేలలు రబీలో ముందుగా వేసే పంటలకు అనుకూలం. సారవంతమైన గుల్ల, ఒండ్రు నేలలు అధిక దిగుబడినిస్తాయి. ఉదజని సూచిక 5.5 నుండి 6.5 గల నేలలు మిక్కిలి అనుకూలం.
విత్తనం, విత్తన శుద్ధి, విత్తన మోతాదు: ఒక ఎకరంలో విత్తుకోవడానికి సూటి రకాలకు 300గ్రా, హైబ్రిడ్స్కు 100నుండి 150 గ్రా. విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3గ్రా. థైరమ్ను కలిపి విత్తన శుద్ది చేయాలి.
రకాలు
గోల్డెన్ ఏకర్: దీని గడ్డ గట్టిగా గుండ్రంగా 1.0 నుంచి 1.5కిలో బరువు ఉంటుంది. గడ్డ పగులుట నివారించడానికి కోతకు సిద్ధమైన వెంటనే కోసుకోవాలి. 60నుండి 65 రోజులలో కోతకొస్తుంది. మొక్కలు గుబురుగా ఉండి చిన్నగా ఉంటాయి. కాండం పొట్టిగా ఉండి కొన్ని ఆకులను కలిగి ఉంటుంది. ఈ ఆకులు డొప్ప ఆకారంలో ఉంటాయి.
ఎర్లీడ్రమ్ హెడ్: గడ్డ చదునుగా పెద్దదిగా ఉంటుంది. 60 నుండి 70 రోజులలో కోతకొస్తుంది.
ఫ్రైడ్ ఆఫ్ ఇండియా: గడ్డ చదునుగా పెద్దదిగా ఉంటుంది. 1.5నుండి 2కిలోల బరువుంటాయి. 60 నుంచి 80 రోజులలో కోత కొస్తుంది.
హరిరాణిగోల్, గణేశ్గోల్: ఇవి ఎఫ్1 హైబ్రిడ్ రకాలు. గడ్డ గట్టిగా ఉండి 85నుంచి 90 రోజుల్లో కోతకొస్తుంది. ఎక్వు కాలం నిల్వ ఉంటుంది.
లేట్ డ్రమ్ హెడ్: గడ్డలు పెద్దగా గుండ్రంగా ఉంటాయి. మధ్యకాలిక రకం. నల్లకుళ్లు తెగులును తట్టుకుంటుంది. 100నుండి 120 రోజుల్లో కోతకొస్తుంది.
పూసడ్రమ్హెడ్: గడ్డ చదునుగా ఉంటుంది. దీర్ఘకాలిక రకం. 120 రోజుల్లో కోతకొస్తుంది.
పూనముక్త (సెలక్షన్-8): గడ్డ గట్టిగా ఉంటుంది. ఒక్కో గడ్డ 2 కిలోల బరువు ఉంటుంది. బ్యాక్టీరియా నల్లకుళ్లు తెగులును తట్టుకుంటుంది. నల్లకుళ్లు తెగులు సమస్య ఉన్న ప్రాంతాల్లో నాటుకోవడానికి అనువైనది.
హైబ్రిడ్: బిఎస్ఎస్-150, బిఎస్ఎస్-126, మహికో, ఇండోఅమెరికన్, నామ్ధారి హైబ్రిడ్ రకాలు.(నాథ్లక్షి-401,గ్రీన్ ఎక్స్ప్రెస్, సోనా, శ్వేత, అవంతి, గ్రీన్ ఛాలెంజ్,(గీన్బోరు), మీనాక్షి.
నాటుకునే కాలం: స్వల్ప కాలపు రకాలకు ఆగస్టు రెండో పక్షం నుండి సెప్టెంబరు చివరి వరకు, దీర్ఘకాలపు రకాలకు అక్టోబరు మొదటి పక్షం నుండి నవంబరు చివరి వరకు నాటుకోవచ్చు.
నారుమడి: నేల అదునుకు వచ్చే వరకు నాలగైదు సార్లు కలియ దున్నాలి. 100 చ.మీ విస్తీర్ణంలో 25 నుంచి 30 గంపల పశువుల ఎరువ వేసి కలియదున్నాలి. 10 నుంచి 15 సెం.మీ ఎత్తు, 4సెం.మీ పొడవు, 1 మీటరు వెడల్పుతో నారుమళ్లు తయారు చేయాలి. విత్తనాలను సన్నని ఇసుకతో కప్పాలి. విత్తనాలు మొలిచే వరకు (సుమారు వారం రోజుల వరకు) ప్రతి రోజు నీరు పెట్టాలి. మొక్కలు మొలకెత్తిన తర్వాత ఎండిన ఆకులను తీసివేయాలి.
నారుకుళ్లు తెగులు సోకకుండా లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్తో నేలను తడపాలి. నారుమడిని ఆకుతినే పురుగు బారి నుండి రక్షించేందుకు 2.5 మి.లీ మలాథియాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నాటటం: నేలను అదును వచ్చే వరకు బాగా దున్నాలి. సుమారు 10నుండి 15 రోజుల ముందు నేలను సిద్ధం చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలను 60×45 సెం.మీ, స్వల్పకాలిక రకాలకు 45× 45 సెం.మీ దూరాన్ని ఉంచాలి. 25 నుంచి 30 రోజుల వయసు గల నారును జాగ్రత్తగా నాటుకోవాలి. నాటే ముందు తడి ఇవ్వాలి.
నీటి యాజమాన్యం: తేలిక నేలల్లో వారం రోజులకు ఒకసారి, బరువైన నేలల్లో 10 రోజులకు ఒకసారి(5-6 సెం.మీ) నీటి తడిని ఇవ్వాలి.
ఎరువులు: తొలి దఫాగా ఎకరానికి 10 టన్నుల పశుల ఎరువుతో పాటు 32నుంచి 40 కిలోల భాస్వరం, 40కిలోల పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. 24నుంచి 32 కిలోల నత్రజని, 3 దఫాలుగా నాటిన 25నుంచి 30రోజులకు మొదటిసారి, 50నుంచి 60 రోజులకు రెండోసారి,దీర్ఘకాలిక రకాలయితే 75నుంచి 80 రోజులకు మూడోసారి వేయాలి. ఎరువులు వేసిన వెంటనే నీరు పెట్టాలి.
కలుపు నివారణ, అంతరకృషి: ఎకరానికి పెండీమిథాలిన్ 30శాతం, 1.25 లీ. లేదా అలాక్లోర్1.0 లీ (తేలిక నేలలు)1.2లీ (బరువు నేలలు) చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 24 నుంచి 48 గంటల లోపు పిచికారీ చేయాలి. నాటిన 20 నుంచి 25 రోజులప్పుడు అంతర కృషి చేయాలి.
సస్యరక్షణ
క్యాబేజి రెక్కల పురుగు: ఈ పురుగు ఆకుల అడుగు భాగన ఉండి ఆకులను తిని నాశనం చేస్తాయి. పురుగులు ఆశించిన ఆకులు వాడి, ఎండిపోతాయి. రెక్కల పురుగులు చిన్నవిగా, ఆకుపచ్చ, గోధుమ రంగుల కలయికలో ఉండి పాలిపోయిన తెలుపు, రంగు, సన్నని ముందు రెక్కలు, పొడుగాటి వెంట్రుకలు కలిగిన వెనుక రెక్కలు కలిగి ఉంటాయి. పురగు ఉధృతి ఎక్కువగా ఉంటే పైరులో ఆకులన్నీ రంధ్రాలతో ఉండి, క్యాబేజి పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజి వరుసలకు 2 వరుసల చొప్పున ఆవ మొక్కలను ఎరపంటగా వేయాలి. గుడ్లను నాశనం చేసేందుకు వేపగింజల ద్రావణాన్ని (5శాతం) పిచికారి చేయాలి. పురగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఎసిఫేట్ 1.5గ్రా. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ కలిపి కోతకు 15 రోజుల వ్యవధి ఉంటే పిచికారి చేయాలి. నాటిన తర్వాత 45 రోజుల్లో బిటి మందులు 1గ్రా.ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
పేనుబంక: ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగచేస్తాయి. మలాథియాన్ లేదా డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నారుకుళ్లుతెగులు: నారు మొక్కల కాండపు మొదళ్లు మెత్తగా మారి, కుళ్లి, వడలిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఎతైన మడులపై నారును పెంచాలి. విత్తనం పలుచగా వరుసల్లో వేయాలి. ఎక్కువ నీటి తడులను ఇవ్వకూడదు. నారు మొలిచిన తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి.
నల్లకుళ్లు తెగులు: ఈ తెగులు పంట ఏ దశలో ఉన్నా ఆశించవచ్చు. ఆకుల పత్ర హరితాన్ని కోల్పోయి వి ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారుతాయి. (స్టైప్టోసైక్లిన్(1గ్రా.10లీటర్ల నీటికి ) మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఇదే మందును ( 50మి.గ్రా ఒక లీటరు నీటికి) నారు నాటినప్పుడు, గడ్డ తయారవుతున్నప్పుడు పైరుపై పిచికారి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ (3గ్రా. ఒక లీటరు నీటికి) మందు ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరానికి 5కిలోల బ్లీచింగ్ పౌడర్ను భూమిలో వేయాలి. ఏదైనా నూనె గింజల పంటతో 2 సంవత్సరాల పాటు పంట మార్పిడి చేయాలి.
కోత కోయడం: తగిన పరిమాణం వరకు ఎదిగిన తర్వాత కోయాలి. లేతగా ఉన్న గడ్డలను కోసుకోవాలి.
దిగుబడి: ఎకరానికి 14 వేల నుండి 16 వేల కిలోల దిగుబడి వస్తుంది.
Authorization