మన రాష్ట్రంలో సుమారు 33,851 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. 18.0 టన్నుల సరాసరి దిగుబడి వస్తుంది. ఉల్లిగడ్డ కూరగాయలతో కలిప,ి పచ్చికూరగా, ఇంకా తినే పదార్థాలకు రుచి కల్పించేందుకు, సలాడ్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎన్నో ఉపయోగాలు కలిగి ఉల్లి సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి వస్తుందో తెలుసుకుందాం...
విత్తే సమయం: ఖరీఫ్ సీజన్లో జూన్ జులై నుంచి మొదులుకొని నవంబరు వరకు సాగు చేస్తారు. వాతావరణంలో పెద్దగా మార్పులేని ప్రాంతాల్లో ఎదుగుదల బాగుంటుంది.
నేలలు: నీరు నిలువని సారవంతమైన మెరక నేలలు అనుకూలం. ఉప్పు, చౌడు, క్షారత్వం, నీరు నిలువ ఉండే నేలలు పనికిరావు.
రకాలు: బళ్లారిరెడ్, రాంపూర్రెడ్, వైట్ ఆనియన్, పూసారెడ్, అర్కనికేతన్, అర్కకళ్యాణ్, అర్కప్రగతి, కళ్యాణ్పూర్, రెడ్రౌండ్, ఎన్-53, అగ్రిఫౌండ్ లైట్రెడ్, అగ్రిఫౌండ్ డార్క్రెడ్, తెలుపు రకాలైన పూసావైట్ రౌండ్, పూసావైట్ఫ్లాట్.
బళ్లారిరెడ్: పాయలు పెద్దగా ఉండి, పాయలు ఒకటిలేదా రెండుగా కలిపి ఉంటాయి. ఘాటు తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో సాగు చేసేందుకు అన్ని ప్రాంతాల్లో అనువైనది.
రాంపూర్రెడ్: బళ్లారిరెడ్ రకం వలే ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ప్రసిద్దిచెందింది. పాయలు పెద్దగా ఉండి ఘాటు ఎక్కువగా ఉంటుంది. దిగుబడి తక్కువ, పాయలు తెల్లగా ఉంటాయి.
నాసిక్రెడ్: పాయలు మధ్యస్థంగా ఉండి, ఎరుపు రంగులో ఉంటాయి. ఘాటుగా ఉంటాయి.
అగ్రిఫౌండ్ డార్క్రెడ్: పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఉండి ఘాటుగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. ఖరీఫ్లో నాటేందుకు అనువైన రకం.
పూసారెడ్: పాయలు ఎరుపు రంగులో మధ్యస్థంగా ( 70నుంచి 90గ్రా.) ఉంటాయి. తక్కువ ఘాటుతో నిల్వనాణ్యత ఎక్కువ. దిగుబడి ఎకరానికి 100నుంచి 120 టన్నులు.
అర్కనికేతన్: పాయలు ఎరుపు రంగుతో 100నుంచి 180గ్రా. బరువుంటాయి. టిఎస్ఎస్ 12-14శాతం నిల్వనాణ్యత హెచ్చు. ఘాటు ఎక్కువ. దిగుబడి ఎకరానికి 132క్వింటాళ్లు.
అర్క కళ్యాణ్: పాయల బరువు 100నుంచి 190గ్రా. దిగుబడి 136 క్వింటాళ్లు. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకుంటుంది. ఖరీఫ్కు అనుకూలం.
అర్క ప్రగతి: 120 రోజుల్లో కోతకొచ్చే గుండ్రని ఎరుపు రకం. ఖరీఫ్కు అనుకూలం. ఎకరానికి 130క్వింటాళ్లు.
కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్: ఎరుపు రకం. 130నుంచి 150 రోజుల్లో కోతకొస్తుంది. ఎకరానికి 120 క్వింటాళ్లు దిగుబడి.
ఎస్-53: పాయలు మధ్యస్థంగా గుండ్రంగా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. 140 రోజుల్లో కోతకొస్తుంది. ఎకరానికి 120క్వింటాళ్ల దిగుబడి.
అగ్రిఫౌండ్ లైట్రెడ్: పాయలు చిన్నవిగా గట్టిగా గులాబి రంగులో ఘాటుగా ఉంటాయి.నారుపోయకుండానే నేరుగా విత్తనం విత్తుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు తట్టుకుంటుంది.ఎగుమతులకు అనువుగా ఉంటుంది.
ఇవి కాకుండా తెలుపు రకాలైన పూసావైట్ రౌండ్, పూసావైట్ ప్లాట్ డీహైడ్రీషన్కు అనువైనది.
విత్తన మోతాదు: 3నుంచి 4.0 కిలోలు
నారు పెంచడం: నేలను భాగా దున్ని120 సె. మీ వెడల్పు, 3 మీ. పొడవుగల ఎత్తైన నారుమళ్లను తయారు చేసుకోవాలి. 2-2.5 కిలోల విత్తనాన్ని 200-250 చ.మీల నారుమడిలో పెంచిన నారు ఒక ఎకరాలో నాటడానికి సరిపోతుంది. విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. (3గ్రా. కాప్టాన్ లేదా థైరమ్ కిలో విత్తనానికి) నారుమడిలో విత్తనాన్ని పల్చగా వరుసల్లో పోయాలి. నారుకుళ్లు తెగులు సోకకుండా 10 రోజులకొకసారి కాపర్ అక్సీక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నారు పెరుగుదల దశలో రసం పీల్చే పరుగు ఆశించకుండా కార్బోప్యూరాన్ 3జి గుళికలు నారుమడిలో చల్లి నీరు కట్టాలి.
నారు నాటడం: రెండుమూడు సార్లు దుక్కిదున్ని పొలాన్ని చదును చేయాలి. బోదెలు 30 సెం. మీ ఎడంలో చేసి బోదెకు రెండు వైపులా నాటుకోవాలి. నారును ఒక శాతం బోర్డో మిశ్రమంలో ముంచి నాటడం వల్ల నారు కుళ్లు సోకకుండా ఉంటుంది.
కలుపు నివారణ,అంతర కృషి: నాటే ముందు ప్లుక్లోరాలిన్45శాతం ఎకరానికి ఒక లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30 శాతం ఎకరానికి 1.3 నుండి 1.6 లీ. లేదా ఆక్సీఫ్లోరోఫిన్ 23.5శాతం200 మి.లీ చొప్పున ఏదో ఒకదాన్ని నాటే ముందు పిచికారీ చేయాలి. లేదా నాటిన రెండు మూడు రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరానికి ఆక్సీఫోరోఫిన్23.5శాతం 200 మి.లీ 200లీ నీటిలో కలిపి పిచికారి చేయాలి. నాటిన 30 నుంచి 45 రోజుల మధ్య మళ్లీ కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. నారునాటిన 75 రోజుల తర్వాత మాలిక్ హైడ్రజైడ్0.25 శాతం(2.5 గ్రా.లీ నీటికి) ద్రావణాన్ని చల్లడం వల్ల ఉల్లిగడ్డ మొలకెత్తడం వల్ల కలిగే నష్టం బాగా తగ్గుతుంది. నారు నాటిన 100, 110 రోజులకు 1గ్రా. కార్బండైజిమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే నిల్వలో ఉల్లి కుళ్లడం చాలా వరకు తగ్గుతుంది.
ఎరువులు: ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు 60 నుంచి 80కి. నత్రజని, 24 నుంచి 32కి. భాస్వరం, 24కిలోల పోటాష్నిచ్చే ఎరువులను వేయాలి. వేరుశనగ పిండి లేదా ఆముదపు పిండి వేసి మట్టిని ఎగదోయడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. నత్రజనిని రెండు దఫాలుగా నాటినప్పుడు, నాటిన 30 రోజుల తర్వాత వేసుకోవాలి.నత్రజనితోపాటు పొటాష్ను రెండు దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగు ఊరుతుంది.
నీటి యాజమాన్యం: నాటిన 60 రోజుల వరకు 12నుంచి 15 రోజుల వ్యవధితో 4నుంచి 5 తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6నుంచి 7 రోజుల వ్యవధితో 8తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందుగా నీరు పెట్టడం ఆపేయాలి.
సస్యరక్షణ: తామర పురుగులు ఆకుల అడుగు భాగానచేరి రసాన్ని పీల్చివేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దానితోపాటు ఆకులు, కాడలపై ఊదారంగుమచ్చలు కూడా ఏర్పడతాయి. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ, మాంకోజెట్ 3గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో మూడుసార్లు పిచికారి చేయాలి.
ఉల్లిలో ఆకుతినే పచ్చపురుగు నివారణకు కార్బరిల్ 3గ్రా.లేదా ప్రొఫెనోఫాస్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఉల్లిలో ఆకుమచ్చ తెగులు: ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు తెగులు ఉధృతి ఎక్కువ అవుతుంది.దీని నివారణకు మాంకోజెట్ 3గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2.5 గ్రా. లేదా కార్బండజిమ్, మాంకోజెట్ కలిపిన మందును 2 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఉల్లిలో సమగ్ర సస్యరక్షణ
1.ధాన్యపు పంటలతో పంటల మార్పిడి చేయాలి.2. ఎకరానికి 80 కిలోల చొప్పున వేప పిండిని వేయడం వల్ల నులిపురుగులు, నేలలో ఉన్న శిలీంధ్రాలు నాశనం అవుతాయి.3. పొలంలో అక్కడక్కడ పసుపు రంగుపూసిన డబ్బాలు(జిగురుగ్రీజ్ పూసిన) ఎకరానికి 2చొప్పున పెట్టాలి.4. తామర పురుగుల నివారణకు జెట్నాజిల్ పంపుతో నీటిని చల్లాలి. 5. కిలో విత్తనానికి 8గ్రా. ట్రైకోడెర్మావిరిడి లేదా 3గ్రా. థైరమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.6. రసం పీల్చే పురుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి.7. పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5శాతం వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
పంటకోత ఆరబెట్టుట: గడ్డలు పీకడానికి ముందు నీళ్లు పెట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెం.మీ కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరపెట్టాలి. 50 శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు.
Authorization