సోయా చిక్కుడు ప్రపంచ వ్యాప్తంగా పండించే ముఖ్యమైన నూనె గింజల పంట. కాయ జాతి లెగ్యూమ్ పంట. ఈ పైరు అధిక దిగుబడి సామర్ధ్యం కలిగి గింజలలో 83 శాతం మంసకృత్తులు కలిగి ఉంటుంది. నల్లరేగడి భూములలో సాగు చేయడానికి వీలైన, శక్తివంతమైన లెగ్యూమ్ జాతి పంట. 17 శాతం నూనె కలిగి ఉంటుంది. మన రాష్ట్రంలో సోయా చిక్కుడు దాదాపు 3.0 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. 2.5 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది. మన రాష్ట్రంలో దీని దిగుబడి సామర్థ్యం ఎకరానికి ఇంచుమించు 1000 కిలోలు. అమెరికా, బ్రెజిల్ దేశాలలో దీనిని జీవ ఇంధన నూనె తయారీకి కూడా ఉపయోగిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, జిల్లాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.
రకాలు - గుణగణాలు
జెఎస్ 335: కాయపై నూగుండదు. గింజ మొలకశక్తి ఎక్కువ. కాయలు చిట్లడం తక్కువ. మొవ్వు కుళ్లు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 90 నుంచి 95 రోజులు, ఎకరానిరి 8నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది.
పికె 1029: నిటారుగా మధ్యస్థ ఎత్తుగా పెరుగుతుంది. ఎక్కువ కాపు కాస్తుంది. పూత తెలుపు రంగు, తర్పు తెగులను తట్టుకుంటుంది. కాయ చిట్లుట తక్కువ. 100నుంచి 110 రోజులు పంట కాలం.
ఎల్ఎస్బి 1: స్వల్ప కాలిక పొట్టి రకం. కాపు గుబురుగా కాస్తుంది. పత్తి, కంది పైర్లలో అంతర పంటకు అనువైనది.పంట కాలం 65 రోజులు, ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఎల్ఎస్బి 3: కాయలపై నూలు రంగు, నూగు ఉండదు. కాయలు చిట్లుట తక్కువ. బ్యాక్టీరియా పొక్కు, మొగ్గమాడుటలను తట్టుకుంటుంది.110 నుంచి 115 రోజుల పంట కాలం, ఎకరానికి 6నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
జెఎస్ 93-05: ఆకులు పొడువుగా ఉంటాయి. ఎండిన తరువాత కాయలు నల్లగా కనిపిస్తాయి. కాయలకు నూగు ఉండదు. ఒక్కొక్క కాయలో 3 నుంచి 4 గింజలు ఉంటాయి. అంతర పంటకు అనువైనది.
ఎల్ఎస్బి 18(భీమ్): కాండము, కాయలపై బూడిద రంగు నూగు కలిగి ఉంటుంది. ఆకుమచ్చ తెగులు, తలమాడు తెగులు, మొజాయిక్ తెగులును తట్టుకుంటుంది. విత్తనము లేత పసుపు వర్ణము కలిగి గుండ్రంగా మథ్యస్థ సైజులో ఉంటుంది.
ఎఎమ్బి-22 (భాసర్): కాండము, కాయలపై గోధుమ రంగు నూగు కలిగి ఉంటుంది. కోత ఆలస్యమైన కాయలు చిట్లుట ఉండదు. గింజలు లేత పసుపు వర్ణంలో గుండ్రంగా ఉంటుంది.
విత్తనం : ఎకరానికి 25 నుంచి 35 కిలోలు (విత్తన మోతాదు గింజ పరిమాణం, మొలక శాతంపై ఆధారపడుతుంది.
విత్తే సమయం: సెప్టెంబరు నుంచి అక్టోబరు మొదటి వారం వరకు విత్తుకోవచ్చు.
విత్తన శుద్ధి: ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాముల థైరమ్, 1 గ్రాము కార్బండిజమ్ లేదా 3 గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ మందుతోను, తరువాత 5మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రా. కార్బోసల్ఫాన్తో విత్తన శుద్ధి చేయాలి. ప్రతి 8నుంచి 10 కిలోల విత్తనానికి 200గ్రా. రైబోబియం జపానికం కల్చరును కలిపి నీటిలో ఆరబెట్టి విత్తుకోవాలి.
విత్తే దూరం: నల్లరేగడి భూముల్లో45ఇంటు5 సెం.మీ తేలిక భూముల్లో 30ఇంటు 7.5 సెం.మీ చ.మీ.కు 40 మొక్కల చొప్పున ఎకరానికి లక్షా అరవైవేల మొక్కలు నాటాలి.
ఎరువులు: ఎకరానికి 12 కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం, 16కిలోల పొటాష్, చివరి దుక్కిలో వేయాలి. భాస్వరంఎరువును సింగిల్ సూపర్ఫాస్ఫేట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభ్యమవుతుంది. 50శాతం నత్రజనిని విత్తేటప్పుడు మిగిలిన సగం నత్రజనిని పైరు నెలరోజుల దశలో వేయాలి. గింజ ఎదుగుదలకు పూత, కాత దశలో 2శాతం యూరియా పిచికారి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు చేయాలి.
కలుపు నివారణ, అంతరకృషి: విత్తే ముందు ప్లుక్లోరాలిన్45శాతం ఎకరానికి లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. లేద పెండిమిథాలిన్ 30శాతం 1.4 లీ.చొప్పున విత్తిన వెంటనే గానీ మరసటి రోజున గాని పిచికారి చేయాలి. విత్తిన 20నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. లేదా విత్తిన 25 రోజులప్పుడు క్విజాలాపాస్ ఇథైల్ 5శాతం 400మి.లీ చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను, ఇమాజిధాపైర్ 10శాతం 250 మి.లీ చొప్పున పిచికారీ చేసి వెడల్పాకు, గడ్డిజాతి కలుపునూ నిర్మూలించుకోవచ్చును.
నీటి యాజమాన్యం: సోయా చిక్కుడు వర్షాధారపు పంట. నీటి సౌలభ్యత ఉన్న చోట విత్తిన 15నుంచి 20 రోజులకు ఒకసారి, కాయదశలో మరోసారి సీటి తడులను ఇచ్చి అధిక దిగుబడులు సాధించవచ్చు.
అంతర పంటలు, పంటల సరళి: సోయా చిక్కుడును కంది (1:7), పత్తి, జొన్న. మొక్కజొన్న(1:1), పండ్ల తోటలలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో సోయా తరువాత రబీలో మొక్కజొన్న, వేరుశనగ,శనగ, పెసర, మినుము, ధనియాలు, గోదుమ పంటలను సాగు చేసి వాణిజ్య పంటల కంటే అధిక నికర ఆదాయం పొందవచ్చు.
సస్యరక్షణ పురుగులు: చిత్తపురుగులు, రసంపీల్చు పురుగులు: ఆకుల్లోని రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు, గోధుమ రంగులోకి మారి దిగుబడులు తగ్గుతాయి. తామర పురుగుల ద్వారా మొవ్వకుళ్లు, తెల్లదోమ ద్వారా మొజాయిక్ తెగులు వ్యాపిస్తుంది. వీటి నివారణకు పురుగు మందుతో విత్త శుద్ధి చేయాలి. పైరుపై ఆశించినప్పుడు ఎసిఫేట్ 1గ్రా. లేదా డైమిదోయేట్ 2 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆకుముడత పురుగు: ఆకుల అంచులను కలిపి పత్రహరితాన్ని గీకి నష్టపరుస్తాయి. ఈ పురుగు ఉధృతి బెట్ట పరిస్థితులలో ఎక్కువ అవుతుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ కలిపి పిచికారి చేయాలి.
కాండం తొలిచే ఈగ: ఈ పురుగులు లేత ఆకులపై చిన్న గుంటలు చేసి గుడ్లను పెడతాయి. గుడ్ల నుండి వెలువడిన లార్వాలు కాండంలోకి చేరి తినడం వల్ల మొక్కలు వడలి సమూలంగా నాశనమవుతాయి. ఇమిడాక్లోప్రిడ్ మందు7గ్రా. ఒక కేజీ విత్తనానికి శుద్ధి చేయడం ద్వారా ఈ పురుగును నివారించవచ్చు.పైరుపై ఈగ ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా ఎసిఫేట్ 1.0 గ్రా.లీటరు నీటకి కలిపి పిచికారీ చేయాలి.
ఆకు గూడుపురుగు: ఈ పురుగు ఆకులను కలిపి గూడులా కట్టుకొని దానిలో ఉండి ఆకులలోని పత్రహరితాన్ని తీకి తింటాయి. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా ఎసిఫేట్ 1.0 గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Authorization