అంతర్జాతీయ మెట్టపంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్), భారత వ్యవసాయ పరిశోధనమండలి (ఐసీఏఆర్) శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎనిమిదేళ్ల పాటు కృషిచేసి సరికొత్త వేరేశెనగ వంగడాలను అభివృద్ధి చేశారు. వీటిని త్వరలోనే వాణిజ్యపరంగా అందుబాటులోకి తేనున్నారు. దేశంలోని రైతులు సాగుచేసేందుకు అనువుగా వీటిని మార్కెట్లో విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది.
ఈ నూతన వంగడాల్లో 80 శాతం ఓలిక్ ఆమ్లం ఉంటుంది. ఈ గింజల నుంచి తీసిన నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను తింటె గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా మనం ఇప్పుడు పండిస్తున్న వేరు శెనగ రకాల్లో ఓలిక్ ఆమ్లం 40-45 శాతం వరకు మాత్రమే ఉంటుంది. త్వరలో అందుబాటులోకి రానున్న గిర్నార్-4 (ఐసీజీవీ-15083), గిర్నార్-5 (ఐసీఈవీ-15090) రకాల్లో ఇది 80 శాతం వరకు ఉంటుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను ఓలిక్ యాసిడ్ తగ్గిస్తుంది. అదే సమయంలో గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగినంత ఉండేలా చూస్తుంది. ఇటీవల వేరుశెనగ పంటకు సంబంధించి నిర్వహించిన వార్షిక కార్యశాలలో 'వెరైటీ ఐడెంటిఫికేషన్ కమిటీ' ఈ రెండు రకాల వంగడాల్లో 80 శాతం ఓలిక్ ఆమ్లం ఉన్నట్లు గుర్తించారు.
ఆరోగ్యానికి మేలు
ఈ నూతన వంగడాలతో పండించిన వేరుశెనగ నుంచి వచ్చే నూనెతో తయారుచేసే పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వీటిలో అధికంగా ఉండే ఓలిక్ ఆమ్లం ఆక్సీకరణ వేగాన్ని అడ్డుకోవటమే ఇందుకు కారణం. ఇతర వంగడాలతో పోల్చి చూసినప్పుడు దిగుబడి కూడా అధికంగా వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. గిర్నార్-4, గిర్నార్-5 రకాలు మామూలు వాటికంటే వరుసగా 42, 46 శాతం అధికంగా దిగుబడి ఇస్తాయంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, అర్జెంటీనాల్లో ఓలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే వంగడాల సాగుతో ఎగుమతులు పెరిగాయని ఇక్రిశాట్ డైరెక్టర్ తెలిపారు. నిల్వ సమయం అధికంగా ఉండటం, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉండటంతో పండించే రైతుల నుంచి అమ్మకందారులు, వినియోగదారులకు ఈ నూతన వంగడాలు మేలు చేస్తాయి.
Authorization