పత్తి పంట ప్రస్తుతం పూత, కోత కొచ్చే దశకు చేరింది. ఈ దశలో పంటకు ప్రధానంగా పోషకాల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. భూమిలో పంటకు వేసే ఎరువులతోపాటు పైపాటుగా పైరు ఎదుగుదలను అనుసరించి, అవసరాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకొకసారి పోషకాలు పిచికారి చేసుకోవాలి.
ఈ పోషకాల పిచికారి లీటరు నీటికి 10 గ్రా. పొటాషియం నైట్రేట్ (మల్టీ-కె) లేదా 10 గ్రా. 19:19:19 (పాలీఫీడ్) లేదా 20 గ్రా. యూరియాను కలిపి చేనుపై వాడవచ్చు. లేదా పిచికారి చేయవచ్చు. పోషకాలను మారుస్తూ అవసరాన్ని బట్టి పిచికారి చేసుకోవాలి. వీటిని పురుగు మందులతో కలిపి కూడా పిచికారి చేయవచ్చు. పోషకాల పిచికారి వల్ల పైరు ఎదుగుదల, కాపు బాగుంటుంది.
పైరు 100 రోజుల వరకు ఎకరానికి ప్రతిసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువును 20 రోజుల వ్యవధిలో 4,5 సార్లు భూమిలో మొక్కలకు దగ్గరగా వేయాలి.
ఈ దశలో పైరులో పూత, పిందె రాలడం, ఆకులు ఎరుపు, పండాకుగా మారడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్న పంటకు లీటరు నీటికి బోరాన్, బోరాక్స్లను కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. దీనికి లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున యూరియాను కలిపి పిచికారి చేస్తే ఫలితం ఉంటుంది. పూత, పిందె మరీ ఎక్కువగా రాలుతున్నట్టయితే (ఎన్ఎఎ10 పిపిఎం) ప్లానోఫిక్ అనే మందును 5 లీటర్ల నీటికి 1 మి.లీ చొప్పున కలిపి ఆ ద్రావణానికి లీటరు నీటికి 10 గ్రా. చొప్పున యూరియా, డీఏపీ లేదా 10 గ్రాముల మల్టికేను కలిపి 10 రోజుల వ్యవధిలో ఒకటి లేదా రెండుసార్లు పిచికారి చేస్తే సమస్య తగ్గుతుంది.
ఆగస్టు నెలలో మొదటి 10 నుంచి 15 రోజుల బెట్ట వాతావరణం తర్వాత చివరి 10నుంచి 12 రోజులలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అధిక వర్షాలకు పత్తి చేన్లలో చాలా చోట్ల మొక్కలు తెప్పలు తెప్పలుగా ఎండిపోయాయి. ఇది బీటి పత్తిలో అకస్మాత్తుగా వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వచ్చే 'ప్యారావిల్ట్ '. దీనికి గాను లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్, 0.1 గ్రా.(స్టెప్టోపైక్లిన్) మందును కలిపి మొక్కల చుట్టూ భూమిని తడపాలి. వారం రోజుల తర్వాత కార్బండజిమ్ మందును లీటరు నీటికి 1 గ్రా. చొప్పున కలిపి మళ్లీ మొక్కల చుట్టూ భూమిని తడపాలి. మొక్కలు నెమ్మదిగా కొంత వరకు తిరిగి కోలుకుంటాయి. అధిక వర్షపాతం ఉన్నప్పుడు చేనులో ఎక్కువ నీరు నిల్వకుండా కాల్వల ద్వారా బయటికి పోయే విధంగా చూసుకోవాలి. పైరుపై లీటరు నీటికి 2.5గ్రా సాఫ్, కంపానియన్ (కార్బండజిమ్, మ్యాంకోజెబ్ కలిపిన మందు) కలిపి ఒకే సారి పిచికారి చేయాలి. వారం పది రోజుల తర్వాత కార్బండజిమ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే ఆకులపై వచ్చే మచ్చ, కాయకుళ్లకుండా, నల్లబడకుండా నివారింప బడుతాయి.
ప్రస్తుతం పత్తి పంటలో తామరపురుగు, పేనుబంక, పచ్చదోమ వంటివి ఆశిస్తున్నాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2 గ్రా. ఫిప్రోనిల్, 0.2 గ్రా. థయామిథాక్సామ్, 0.3 గ్రా. ప్లోనికామిడ్ 2 మి.లీ మోనోక్రోటోఫాస్ 1.25గ్రా. డైఫెన్త్యురాన్ లాంటి మందులను పిచికారి చేసుకోవాలి. ఒకేసారి 2 లేదా 3 మందులు కలిపి పిచికారి చేయకూడదు. అంతేకాకుండా మందులు మారుస్తూ పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగులే కాకుండా, గులాబి రంగు కాయతొలుచు పురుగు, పొగాకు లద్దె పురుగు ఆశించకుండా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణకు చేనులో వాటి లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 లేదా 8 చొప్పున అమర్చి, పురుగు ఉధృతిని గమనిస్తూ నివారణ చర్యలు చేపట్టాలి. అవసరాన్ని బట్టి థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా ప్రొఫోనోఫాస్ 2 మి.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లీటరు నీటికి పిచికారి చేసి మొదటి దశలో ఉన్న పురుగులను నిర్మూలించుకోవాలి.
- ఎ. సుదర్శనమ్
పత్తి ప్రధాన శాస్త్రవేత్త
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల
Authorization