తొలకరిలో ఏ పంటా వేసుకునేందుకు అవకాశం లేని నేలలు కంది పంటకు అనుకూలం. అలాగే అధిక వర్షాల దెబ్బకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్నప్పుడు, తొలకరిలో స్వల్ప కాలిక పంటలు (పెసర, మినుము) వేసుకొని, రెండవ పంటగా కంది వేసుకోవచ్చు. రబీలో కంది తక్కువ ఎత్తులో ఉండడం వల్ల కాయ తొలుచు పురుగు, శనగపచ్చ పురుగు, మచ్చలపురుగుల నివారణ తేలికవుతుంది. ఖరీఫ్లో స్వల్పకాలిక రకాలను పండించిన తర్వాత గానీ ఎడగారు వరి తర్వాత కూడా కందిని అక్టోబర్ నెలాఖరు వరకు వేసుకోవచ్చు.
కంది రకాలు - లక్షణాలు
డబ్ల్యు.ఆర్.జి-65(రుద్రేశ్వర): మొక్కలు ఎత్తుగా గుబురుగా పెరుగుతాయి. రబీ సీజన్లో 120 నుంచి 130 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఎండు తెగులను కొంత వరకు తట్టుకుంటుంది. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
డబ్ల్యు.ఆర్.జి-(వరంగల్ కంది): 160 రోజుల పంట కాలం. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
ఎల్.ఆర్.జి-41: శనగపచ్చ పురుగుని తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే రకం. నల్లరేగడి భూములకు మంచి అనుకూలం. రబీలో 120 నుంచి 130 రోజుల పంట కాలం కలిగి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది.
ఐసిపిఎల్-85063(లక్ష్మి): 160 నుంచి 170 రోజుల పంట కాలం. ఎండు తెగులను కొంత వరకు తట్టుకుంటుంది. ఎకరానికి 7నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఐసిపిఎల్-87119(ఆశ): ఎండు, వెర్రి తెగుళ్లను తట్టుకుంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. 170 నుంచి 180 రోజలు పంట కాలం కలిగి ఉంటుంది. ఎకరానికి ఏడెనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఐసిపి-8863(మారుతి): ఎండు తెగులును తట్టుకుంటుంది. 155 నుంచి 160 రోజుల పంట కాలం కలిగి, ఏడెనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్కలు నిటారుగా పెరగడం వల్ల వరి పొలం గట్ల (ఒరాల) మీద పెంచడానికి అనువైనది.
పిఆర్జి-158 (పాలెం కంది): ఈ రకం దక్షిణ తెలంగాణకు అనువైనది. ఎండు తెగులును తట్టుకుంటుంది. 150 నుంచి 155 రోజుల పంట కాలం. ఎకరానికి ఆరేడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
నేలలు
నీరు త్వరగా ఇంకిపోయే గరప నేలలు, ఎర్రరేగడి నేలలు, చెల్క నేలలు, మురుగు నీరు పోయే వసతిగల నల్లరేగడి నేలలు కూడా సాగుకు అనుకూలం. నీటి ముంపుకు గురయ్యే నేలలు, చౌడు నేలలు పనికిరావు.
నేల తయారీ:
భూమిని ఒక సారినాగలితో దున్నిన తర్వాత గొర్రుతో రెండు సార్లు చదును చేసుకోవాలి.
విత్తన మోతాదు
ఒక ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనాలు అవసరం ఉంటుంది.
విత్తే దూరం
రబీలో వర్షాధారంగా 60×10 సెం.మీ, నీటిపారుదల కింద అయితే 80×10 సెం.మీ దూరంలో విత్తుకోవాలి.
విత్తన శుద్ధి
మొదటగా విత్తనాలకు థైరామ్ లేదా కాప్టాన్ ఒక కిలో విత్తనానికి 3గ్రా. చొప్పున పట్టించాలి. ఆ తరువాత విత్తుకునే ముందు రైజోబియంను 200 గ్రా.ఎకరం విత్తనాలకు సరిపడే విధంగా కలిపి విత్తుకోవాలి.
ఎరువులు
చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. నత్రజని 16 కిలోలు, భాస్వరం 2 0కిలోలు వేసుకోవాలి. మొక్కకు తొలి రోజులలో ఎక్కువ పోషకాల ఆవశ్యకత ఉంటుంది. కనుక పూర్తి నత్రజని, భాస్వరం తప్పనిసరిగా ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
నీటి యాజమాన్యం:
కంది పంటకు 2లేదా 3 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మొగ్గ రాబోయే ముందు ఒక తడి, కాయలు రాకముందు ఒక తడి ఇవ్వాల్సి ఉంటుంది. నీరు ఎక్కువైతే లేక బెట్టకు గురైనా పూత, కాత రాలిపోతుంది. విత్తే ముందు ప్లూకోరాలిన్ 45శాతం ఎకరానికి లీటరు చొప్పున 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. లేదా పెండిమిథాలిన్ 30శాతం, ఎకరానికి 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమాన్ని విత్తిన వెంటనేగానీ మరుసటి రోజుగానీ నేలలో తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి. విత్తిన నెల రోజులకు ఒకసారి రెండు నెలలకోసారి గుంటకతోగానీ గొర్రుతోగానీ దంతె తోలాల్సి ఉంటుంది. ఎడంగా విత్తిన పైర్లలో ట్రాక్టరుతో అంతరకృషి చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కలుపును నివారించుకోవచ్చు, నేలలో తేమను రక్షించుకోవచ్చును.
అంతర పంటలు
తక్కువ కాలపరిమితిగల మినుము, పెసర, తృణధాన్యాలు, వేరుశనగ వంటి పంటలను అంతరపంటలుగా వేసుకోవచ్చు.
కందిలో పురుగులు - సమగ్ర సస్యరక్షణ
పచ్చదోమ
ఇవి ఆకుపచ్చ రంగులో ఉండి త్రికోణంగా ఉంటాయి. పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకుల చివరిభాగం పసుపు పచ్చగా మారి ఆకులు ముడుచుకొని దోనెలుగా కనిపిస్తాయి. ఉధృతి ఎక్కువైతే ఆకులు ఎర్రబడి రాలిపోతాయి. దీనివల్ల మొక్కల ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. వీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్వినాల్ఫాస్ 2.0 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పూత పెంకు పురగులు
ఎర్రటి లేదా నారింజ మచ్చలు, నల్లగి గీతలున్న పూత పెంకు పురుగులు కందిని పూత దశలోఆశించి మొగ్గలను తినడం వల్ల కాత శాతం తగ్గిపోతుంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మారుకా మచ్చల పురుగు
తల్లి రెక్కల పురుగు కోడి గుడ్డు ఆకారం గల పసుపు పచ్చని గుడ్లని పూత, లేత ఆకులు, పిందెలపై పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు ఆకులను, పువ్వులను, కాయలను కలిపి గూళ్లుగా చేసి మొగ్గలు, పిందెలు, కాయలను తొలిచి తింటాయి. తొలిచిన కాయ రంధ్రం ద్వారా లార్వా విసర్జితములు కనిపిస్తాయి. వీటి నివారణకు గాను క్లోరోఫెరిఫాస్ 2మి.లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా లేదా క్లోరాన్ట్రానిల్ప్రోల్ 0.3 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
శనగ పచ్చ పురుగు
తల్లిపురుగు లేత చిగుళ్లపై పూత, మొగ్గలపై లేద పిందెలపై విడివిడిగా లేత పసుపురంగు గుడ్లనుపెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తరువాత దశలో మొగ్గల్ని తొలిచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటుంచి లోపల గింజను తిని డొల్ల చేస్తాయి. పురుగు తిన్న కాయకు గుండ్రని రంధ్రాలు కనిపిస్తాయి.ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సాకార్స్ 1మి.లీ లేదా స్పైనోశాడ్0.3 మి.లీ లేదా క్లోరాన్ట్రానిల్ప్రోల్ 0.3 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నీలి సీతాకోక చిలుకలు
ఇవి సున్నితమైన నీలి రంగు రెక్కలు కలిగి, వెనుక రెక్కకు చిన్న తోకతో ఉంటాయి. తోక దగ్గర నల్లని మచ్చ ఉంటుంది. ఇవి చిన్న గుడ్లను మొగ్గలపై పెడతాయి. వీటి నుండి వెలువడిన లార్వాలు ఆకుపచ్చని రంగులో వెడల్పుగా గరుకుగా ఉంటాయి. లార్వాలు పూలమొగ్గలను, కాయలను తొలిచి తింటాయి. వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్వినాల్పాస్ 2.మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కందిలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు
వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. పంట మార్పిడి చేయాలి. జొన్న లేదా మొక్కజొన్నలను అవరోధ పంటగా వేయాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. ఎరపంటగా బంతి చెట్లు నాటాలి. పక్షిస్థావరాలు ఏర్పాటు చేయాలి.
పంట కోత - నిల్వ
అన్ని కాయలు ఎండిన తర్వాతనే కంది పంట కోయాలి. ఎందుకంటే పూత రెండు నెలల వరకు పూస్తూనే ఉంటుంది. కోసిన కంది కర్రలను ఎండిన తర్వాత కర్రలతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేయాలి. కందులను నిల్వ చేసినప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బూడిదగానీ, వేప ఆకుల గానీ కలిపి నిల్వ చేసుకోవచ్చును.
Authorization