మన రాష్ట్రంలో శనగ రబీ పంటగా నల్లరేగడి భూముల్లో సాగు చేయబడుతుంది. రాష్ట్రంలో శనగ విస్తీర్ణం సుమారుగా 2.75 లక్షల ఎకరాలు. ఉత్పత్తి 1.29 లక్షల టన్నులు. సరాసరి దిగుబడి ఎకరానికి 55 కిలోలు. నిజామాబాద్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఈ పంటకు అనుకూలమైనది.
నేలలు: సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలం. నల్లరేగడి నేలల్లో నిల్వ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మందుతో మొక్కలు పెరుగుతాయి. చౌడు భూములు పనికిరావు.
నేల తయారీ: తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమిని నాగలితో ఒక సారి, గొర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదును చేయాలి.
రకాలు: జెజె 11, జెఎకెబి 9218, క్రాంతి(ఐసిసిసి 37), అన్నెగిరి, జ్యోతి, ఐసిసివి 10, నంద్యాల శనగ,1,
కాబూలీ రకాలు: కెఎకె 2, పూలే జి 95311, శ్వేత (ఐసిసివి 2)
యాజమాన్య పద్దతులు:
విత్తే సమయం: అక్టోబరు నుంచి నవంబరు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై, అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గవచ్చు.
విత్తే విధానం: సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేస్తారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని 5నుంచి 8 సె.మీ లోతులో తడిమట్టి తగిలే విధంగా విత్తుకోవాలి. వరుసల మధ్య 30సెం.మీ మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు లావు గింజ కాబూలి రకాలను ఎంచుకున్నప్పుడు వరుసల మధ్య 45నుంచి 60 సెం.మీ దూరం పాటించాలి.
విత్తన మోతాదు: శనగ రకాలలో విత్తన బరువును బట్టి ఎకరానికి వేసుకోవాల్సిన విత్తన మోతాదు మారుతుంది. దేశవాళి రకాలు ఎకరానికి 25నుంచి 30 కిలోలు. కాబూలి రకాలు ఎకరాని ఇ 45 నుంచి 60 కిలోలు.
విత్తన శుద్ధి: విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3గ్రా. థైరామ్ లేద కాప్టాన్ లేదా 2.5 గ్రా. కార్బండజిమ్ లేదా 1-1.5 గ్రా. కార్బాక్సిన్తో విత్తనశుద్ది చేయడం వల్ల విత్తనం ద్వారా, నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టవచ్చు. శనగను మొదటిసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రా. రైజోబియం మిశ్రమాన్ని 300మి.లీ 10శాతం బెల్లం మిశ్రమం 8 కిలోల విత్తనాలకు సరిపోతుంది. బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట శిలీంద్రనాశక మందుతో శుద్ది చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి.
ఎరువుల యాజమాన్యం : నేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులు వాడాలి. ఎకరం శనగ సాగుకు 8కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8కిలోల పోటాష్నిచ్చే ఎరువువులను వేయాలి. నేలలో నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరం, పొటాష్ ఎరువులు వేయనవసరం లేదు. పై సూచించిన అన్ని ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి.
ఎకరానికి 18 కిలోల యూరియా, 125 సింగిల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50 కిలోలు డిఎపిని వేసినట్టయితే పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం, అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో వేసిన పంటకు కావాల్సిన గంధకము కూడా అందుతుంది.
నీటి యాజమాన్యం: సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేస్తారు. నీటి వసతి ఉన్నప్పుడు పూత దశకు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
కలుపు యాజమాన్యం: విత్తిన 24 గంటలలోపు ప్లూక్లోరాలిన్ ఎకరానికి 1లీటరు లేదా పెండిమిథాలిన్ 1-1.3 లీటర్ల చొప్పున పిచికారి చేస్తే కలుపును పంట తొలిదశలో సమర్థవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. గొర్రుతో అంతరకృషి చేసి కూడా కలుప నివారించవచ్చు.
పంటల సరళి: మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, శనగ, జొన్న -శనగ, సోయా చిక్కుడు-శనగ, నువ్వులు, శనగ, వరి (ఎడగారు) శనగ, వనగ, ధనియాలు(16:4)
Authorization