మంచినీటి సరస్సులు, చెరువులు చేపల పెంపకానికి అనువుగా ఉంటాయి. చేపలే కాక మంచినీటి చెరువుల్లో రొయ్యలు పెంపకం కూడా బహు జనాదరణ పొందింది. రొయ్యల ఉత్పత్తి మొత్తం దాదాపు ఎగుమతి కావడం వల్ల మన రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. అలాంటి చేపలు, రొయ్యల పెంపకం గురించి ఈ వారం తెలుసుకుందాం.
చేపల చెరువుల నిర్మాణానికి రుణ సదుపాయం
కొన్ని జాతీయ చేయబడిన బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు చేపలు, రొయ్యల చెరువుల నిర్మాణానికి అవసరమైన దీర్ఘకాలిక రుణాలను అందజేస్తున్నాయి. స్వల్పకాలిక పంట రుణాలను కూడా ఇస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులకు, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థలు ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఎజెన్సీలు, వెనుకబడిన జాతుల, తరగతుల సంస్థ కొంత పరిమితికి లోపడి చేపలు, రొయ్యల పెంపకానికి సబ్సిడీ, మార్జిన్ మనీ అందజేస్తున్నాయి. ఇప్పుడు మంచి నీటి రొయ్యల పెంపకానికి సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ కూడా సబ్సిడీ ఇస్తోంది.
చేపల చెరువు నిర్మాణానికి కావాల్సిన స్థలం
సారవంతమైన నేలను చెరువు నిర్మాణానికి ఎన్నుకోవాలి. సాధారణంగా వ్యవసాయానికి యోగ్యమైన నేలలన్నీ చేపల పెంపకానికి అనువైనవే. నేలకు నీటిని పట్టి ఉంచే గుణం ఉండాలి. నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, కొంత శాతం ఇసుక కలిసిన ఒండ్రు నేలలు, గరప నేలలు చేపల పెంపకానికి మిక్కిలి అనుకూలమైనవి. చెరువుకు సంవత్సరం పొడవునా తగిన పరిమాణంలో నాణ్యత గల నీటిని అందించే జలవనరులుండాలి. అనుబంధాహారం, ఎరువులు, మొదలైన వాటిని చెరువు దగ్గరకు రవాణా చేయడానికి, ఉత్పత్తి అయిన చేపలను మార్కెట్కు చేరవేయడానికి, అన్ని కాలాల్లోనూ ఉపయోగపడే రహదారి సౌకర్యముండాలి. తక్కువ ఖర్చుతో నీటి యాజమాన్యం చేయడానికి, దొంగతనాలు జరగకుండా ఉండడానికి విద్యుత్ సరఫరా ఉంటే మంచిది. తరచుగా వరదలకు, తుఫానులకు గురయ్యే ప్రాంతంగా ఉండకూడదు. చెరువుకు నీరు సరఫరా చేసే జలవనరులు అన్ని రకాల కాలుష్యాలకు దూరంగా ఉండాలి.
చెరువు యాజమాన్యం
పెంపకానికి చెరువును సిద్దపరిచే విధానం: చేప పిల్లలను విడుదల చేసే ముందు చెరువులోని నీటిని మొత్తం తీసివేసి చెరువును ఎండబెట్టాలి. మాంసాహార, కలుపు చేపలను పూర్తిగా నిర్మూలించాలి. చేప పిల్లలను విడుదల చేయడానికి వారం రోజుల ముందు మొదట విడత సున్నం, ఎరువు చల్లినీరు వదలాలి. అనవసర జాతి చేపలు,మాంసాహార చేపలు లోనికి రాకుండా ఇన్లెట్కు మెష్ అమర్చాలి. చెరువులో 6 నుండి 8 అడుగులలోతు వరకు నీటిని నింపాలి. చెరువులో నీరు మూడు అడుగుల కంటే తక్కువ లోతు ఉంటే త్వరగా వేడి ఎక్కడం, కలుపు మొక్కలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చేపలకు సహజసిద్దంగా లభ్యమయ్యే ఆహార పరిమాణం తగ్గిపోతుంది.
మంచినీటి చేపలు, రొయ్యల మిశ్రమ పెంపక విధానం: సాధారణంగా మంచినీటిలో పెంచబడే ఇండియన్ మేజర్ కార్స్జాతి చేపలు, బొచ్చె, రగండి, మోసులతో పాటు ఏటిరొయ్యని (మాక్రోబ్రేఖియం మాల్యమ్సోని), నీలకంఠ రొయ్య (మాక్రోబ్రేఖియం రోజన్బెర్గి)లను పెంచి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయానికి చెందిన మత్స్య విజ్ఞాన శాస్త్రశాఖకు చెందిన హేచరీలోను, ప్రయివేట్ హేచరీలు నీలకంఠ రొయ్య విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రకృతిలో రొయ్య విత్తనాన్ని సేకరించినప్పుడు ఈ రెండు రకాల రొయ్య విత్తనాలతోపాటు స్కేబ్రిక్యులమ్ (తేలురొయ్య), లామెరై (గోంగూర రొయ్య)ల వంటి అనవసర జాతి రొయ్యల విత్తనం కూడా కలిసి ఉంటుంది. రొయ్యపిల్ల రోష్ట్రం(ముక్కు) ఆకారాన్ని పొడవును దానిపైనున్న కంటకాల సంఖ్యనుబట్టి వేర్వేరు జాతుల రొయ్యలను గుర్తించవచ్చు. ఏటి రొయ్య రోష్ట్రం పొడవుగా ఉండి పై అంచున 9 నుంచి 11 కంటకాలను కలిగి ఉంటుంది. నీలకంఠ రొయ్య రోష్ట్రం పొడవుగా ఉండి మధ్యలో పెద్ద ఒంపును కలిగి ఉంటుంది. ఇది పై అంచున 11నుంచి 14 కంటకాలను కలిగి ఉంటుంది. తేలురొయ్య రోష్ట్రం పొట్టిగా ఉండి పై అంచున 13 వరకు కంటకాలను కలిగి ఉంటుంది. గోంగూర రొయ్య రోష్ట్రం పొడవుగా ఉన్న 5నుంచి 7 కంటకాలను మాత్రమే కలిగి ఉంటుంది. రొయ్య విత్తనాన్ని చెరువులోకి వదిలే ముందు నేరుగా కాకుండా స్థానిక జలాలకు క్రమంగా అలవాటు చేసి వదలాలి. చురుకుగా ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే ఎన్నుకోవాలి. రొయ్య సర్వభక్షకి. చెరువులో లభ్యమయ్యే జంతు,వృక్ష సంబంధమైన ఆహార పదార్ధాలను తింటుంది. విడుదల చేసిన తరువాత 4నుండి 6 నెలల్లో రొయ్యలు మార్కెట్ సైజుకి పెరుగుతాయి. మిశ్రమ పెంపకంలో చేపలకు ఇచ్చే ఆహారాన్ని రొయ్యలకు కూడా కొంత పరిమాణంలో పెంచి ఇవ్వవచ్చు.
ట్రయిల్ నెట్టింగ్ ఆవశ్యకత: ప్రతి 15 రోజులకొకసారి ట్రయిల్ నెట్టింగ్ వేసి చేపల పెరుగుదలను,ఆరోగ్యాన్ని అంచనా వేయాలి. చేపల సగటు పెరుగుదలను అంచనావేసి అందుకు తగ్గట్టుగా అనుబంధాహారం పరిమాణాన్ని పెంచాలి. వ్యాధులు, పరాన్న జీవులు ఏమైనా ఉన్నట్టయితే అందుకు తగిన నివారణ, చికిత్స చర్యలను తీసుకోవాలి.
వ్యాధుల నివారణ: చేపలకు వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రొటోజోవాన్, ప్లాటీ హెల్మింథ్, క్రష్టేషియన్ వ్యాధులే కాక, పోషక పదార్ధాల లోపం వల్ల, వాతావరణంలో మార్పుల వల్ల కూడా అనేక వ్యాధులు వస్తాయి. మన రాష్ట్రంలోని చేపలకు సాధారణంగా ఈ కింది వ్యాధులు వస్తాయి.
బ్యాక్టీరియా: హెమర్రేజిక్ సెప్టిసీమియా
ప్రోటోజోవన్: మిక్సోబోలస్, ఇక్తియోప్తిరియస్, ట్రెఖోడైనా
ప్లాటీ హెల్మింథ్ : డాక్టైలో గైరస్(గిల్ప్లూక్), గైరోడాక్టైలస్ (బాడీప్యూక్)
క్రష్టేషియన్: ఆర్గ్యులస్, లెర్నియా
ఈ వ్యాధులు రాకుండా ఉండడానికి పరాన్న జీవులులేని, కలుషితం కాని స్వచ్చమైన నీటికి మాత్రమే చెరువుల్లోనికి తోడాలి. దీనికి తోడు చెరువు పరిశుభ్రతను పాటించినట్టయితే చాల వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. ఇందుకు క్రమం తప్పకుండా సున్నం వాడడం అవసరం. బ్యాక్టీరియా వ్యాధులను ఆహారంలో యాంటిబయాటిక్ మందులు వాడడం ద్వారాను, ప్రోటోజోవాన్ వ్యాధులను సాధారణ ఉప్పు వాడడం ద్వారాను, ప్లాటీ హెల్మిథ్, క్రస్టేషియన్ వ్యాధులను నువాన్ (ఆర్గనోఫాస్ఫేట్ క్రిమిసంహారక మందును) పిచికారి చేయడం ద్వారా చికిత్స చేయవచ్చు.
చెరువు యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెరువుల్లో ఎప్పుడు తగినంత లోతునీరు ఉండాలి. చెరువుల్లో పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. చెరువులో ఆకుపచ్చ లేక ముదురు, గోధుమరంగు లేక ఇటుక రంగు, అల్గర్బ్లూమ్స్ ఏర్పడినప్పుడు ఎప్పటికపుడు తొలగిస్తుండాలి. చెరువు నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు తగ్గి పోవడమనేది సాధారణంగా ఏర్పడే ప్రమాదకరమైన పరిస్థితి.దీంతో చేపలన్నీ ఒకేసారి చనిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా వేసవికాలం తెల్లవారుజామున లేక వర్షాకాలంలో మబ్బులు పట్టిన రోజుల్లోనూ కరిగిఉన్న ప్రాణవాయువు శాతం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. ఈ సమయంలో చేపలన్నీ నీటి ఉపరితలానికి వచ్చి నోటితో గాలి పీల్చుకుంటాయి. ఈ పరిస్థితిలో అనుబంధాహారాన్ని ఇవ్వడం, ఎరువుల వాడకం తాత్కాలికంగా నిలిపి వేయాలి. వీలుంటే కొంత నీరు తీసివేసి కొత్త నీరుపెట్టాలి. చేపలను తినే పక్షులు, తాబేళ్లు, పాములు, నీటి పిల్లులను చెరువు నుంచి తొలగించాలి.
చేపల పట్టుబడి
చేపలను ఏ సైజుకు పెంచి అమ్మాలి అనేది అక్కడ అమ్మే మార్కెట్ డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. సాధారణ స్టాకింగ్ సాధ్రతతో కిలో సైజు పెరగడానికి 10నుంచి12 నెలలు పడుతుంది. ఇంకా పెద్ద సైజు చేపలకు మార్కెట్ డిమాండ్ ఉంటే సాంధ్రత తగ్గించాలి.మార్కెట్ సైజుకు ఎదిగిన చేపలను ఎప్పటికప్పుడు పట్టి వేయడాన్ని పాక్షిక పట్టుబడి అంటారు. పెద్ద చేపలన తీసివేసిన తర్వాత చిన్న చేపలు తొందరగా పెరుగుతాయి.
చేపలను నిల్వ చేసి, రవాణ చేయడం
చేపలను నీటిలో నుండి తీసిన తరువాత అతి త్వరగా చెడిపోతాయి. కనుక పట్టుబడి అయిన వెంటనే చేపలను స్వచ్ఛమైన నీటిలో కడిగి ప్యాక్ చేయాలి. దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి చేపలను ఐస్తో ప్యాక్ చేయాలి. వెదురు బద్దలతో అల్లిన పెద్ద బుట్టలతో చేపలను, పొడి చేసిన ఐస్ను ఒకదానిపై ఒకటి పొరలుగా పేర్చి బుట్ట మూతిని కప్పి తాడుతో కట్టివేయాలి. ఈ పద్ధతిలో చేపలను తాజాగా 48 గంటల వరకు రవాణా చేయవచ్చు. ఇంకా దూర ప్రాంతాలకు రవాణ చేయాలంటే మధ్యలో తిరిగి ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది.
చేపల చెరువును నిర్మించే విధానం
ఏ చేపల క్షేత్రమైనా మూడు విధాలైన చేపల చెరువులను కలిగి ఉండాలి.
1. చేప నారుమడులు (నర్సరీ చెరువు): చిచ్చురు చేప దశనుండి చిరుచేప దశవరకు పెంచడానికి.
2. చేప పిల్లలను పెంచే చెరువులు (రేరింగ్ చెరువు): చిరు చేప దశ నుండి పెద్ద చేప పిల్ల దశవరకు పెంచడానికి.
3. పెద్ద చేపలను పెంచే చెరువులు (స్టాకింగ్ చెరువు): పెద్ద చేప పిల్లల దశనుండి మార్కెట్ సైజు వరకు పెంచడానికి.
పెద్ద చేపలను పెంచే చెరువు నిర్మాణం
స్టాకింగ్ చెరువు చేపల క్షేత్రంలో అతి ముఖ్యమైనది. ఈ చెరువును రెండు రకాలుగా నిర్మించవచ్చు.
1. చెరువు నిర్మించాల్సిన ప్రదేశం చుట్టూర ఒక ట్రెంచ్ తవ్వి వచ్చిన మట్టిని గట్ల నిర్మాణానికి ఉపయోగించడం.దీన్ని ట్రెంచ్ పద్ధతి అంటారు.
2. చెరువు నిర్మించాల్సిన ప్రదేశం అంతా కొంత లోతున తవ్వి వచ్చి మట్టితో చుట్టూ గట్లు నిర్మించడం, దీన్ని 'సాసర్' పద్దతిలో నిర్మించిన చెరువు అంటారు.
ట్రెంచ్ పద్ధతి చెరువుకు నిర్మాణం ఖర్చు తక్కువ. స్టాకింగ్ చెరువు 2 నుండి 10 ఎకరాల వరకు ఉండవచ్చు. రెండెకరాల కంటే చిన్న చెరువు లాభ దాయకం కాదు. 10 ఎకరాల కంటే పెద్ద చెరువుల యాజమాన్యం కష్టం. చేపల చెరువులో మూడు ముఖ్య భాగాలున్నాయి. అవి 1 చెరువు అడుగు భాగం, 2 చెరువు గట్లు, 3 లోపలికి నీరు తీసుకునే ద్వారం (ఇన్లెట్) మురుగు నీరు బయటకు పంపే ద్వారం (అవుట్లెట్).
- డాక్టర్ జి. విద్యాసాగర్రెడ్డి
సీనియర్ శాస్త్రవేత్త
మత్స్య పరిశోధనా స్థానం, పాలేరు
తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం
Authorization