సమస్యలు పరిష్కరించాలని అడగటమే అనూరాధ చేసిన తప్పా? యూనియన్ నాయకురాలిగా ఉండడం ఆమె నేరమా? ఇవి వాళ్ళ దృష్టిలో పెద్ద పొరపాట్లు. అందుకే కారణం లేకుండా సస్పెండ్ చేశారు. ఇదేంటని అడిగితే వేధింపులు. మంత్రిని కలిసినా ఫలితం లేదు. నెల రోజుల నుంచి పని లేదు. ఇద్దరు ఆడపిల్లలకు ఆమే దిక్కు. భవిష్యత్ అంధకారమైంది. కండ్ల ముందే పిల్లల బంగారు భవిష్యత్ ఏమైతుందో అనే భయం పట్టుకుంది. చివరకు ప్రాణాలు తీసుకోవాలనుకుంది. తోటి కార్మికురాలు ఆమెకు అండగా నిలిచారు. అన్యాయంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఆమెకు తోడై పోరాటం మొదలుపెట్టారు. అసలు ఏం జరిగిందో ఈ వారం కొలువులో...
అనూరాధ గత ఎనిమిదేండ్లుగా కాంట్రాక్ట్ పద్దతిలో సనత్నగర్ ఇఎస్ఐ ఆస్పత్రిలో హౌస్కీపర్గా పని చేస్తున్నది. అక్కడ పని చేసే కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి తరపున ఆమె గొంతు విప్పింది. కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా నిలబడేది. అధికారులను, కాంట్రాక్టర్ను నిలదీసేది. ఆమెకు ఈ ధైర్యం ఇచ్చింది సీఐటీయూ. అక్కడి యూనియన్కు అనూరాధ జనరల్ సెక్రటరీ. యూనియన్లో పని చేస్తుందని కాంట్రాక్టర్ ఆమెపై కక్ష కట్టాడు. గత ఏడాది డేవిడ్ అనే కార్మికుడిని ఎలాంటి కారణం లేకుండా సస్పెండ్ చేశాడు. ఈమెను కూడా డేవిడ్ మాదిరిగానే తొలగిస్తానని కాంట్రాక్టర్ బెదిరించేవాడు. అతని బెదిరింపులకు భయపడకుండా అనూరాధ తన పని తాను చేసుకుపోయేది. కార్మికుల సమస్యలపై స్పందిస్తూనే ఉండేది.
కాచుక్కూర్చున్న కాంట్రాక్టర్
ఎలాగైనా అనూరాధను ఉద్యోగం నుంచి తొలగించాలని కాచుక్కూర్చున్న కాంట్రాక్టర్కు ఓ అవకాశం దొరికింది. ఆ రోజు ఎప్పటి మాదిరిగానే అనూరాధ డ్యూటీకి వచ్చింది. సాధారణంగా ఆమె తోటి కార్మికులతో ఎప్పుడూ సరదాగా ఉంటుంది. అలాగే ఆ రోజు కూడా తన తోటి కార్మికుడైనా విరప్పతో మాట్లాడుతుంది. పెన్ను విషయంలో వారిద్దరి మధ్య సరదాగా చిన్న కొట్లాట జరిగింది. దాన్ని సాకుగా చూపించి కాంట్రాక్టర్ అనూరాధను ఉద్యోగంలో నుంచి తొలగించాలని ప్లాన్ చేశాడు. విరప్పను పిలిచి ఆమెపై కంప్లెంట్ ఇవ్వమని బెదిరించాడు. ఓ పేపర్ ఇచ్చి దానిపై సంతకం చేయమన్నాడు. కానీ దానికి విరప్ప ఒప్పుకోలేదు. అతను ఎంతకీ ఒప్పుకోకపోవడంతో మరో కాగితం తీసుకొచ్చి 'ఇందులో మరెప్పుడూ మేమూ గొడవ పడము' అని రాసి ఉంది దీనిపై సంతకం చెయ్యి' అని విరప్ప చేతికి ఇంగ్లీష్లో రాసి ఉన్న ఓ కాగితం ఇచ్చాడు. నిజమే అనుకుని అతను అందులో సంతకం చేశాడు. కానీ అందులో విరప్పను, అనూరాధను సప్పెండ్ చేస్తున్నట్టు ఉంది. ఇలా మోసం చేసి కాంట్రాక్టర్ వీరిద్దరని ఉద్యోగం నుంచి తొలగించాడు.
ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తే...
అనురాధకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్ చదువుకుంటున్నారు. ఒంటరిగా పిల్లల్ని పెంచుతుంది. భర్త ఉన్నా లేనట్టే. ఏడో తరగతి చదువుకున్న అనూరాధకు తల్లిదండ్రులు చిన్నతనంలోనే పెండ్లి చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. పసిపిల్లల్ని చూసుకోడానికి అనూరాధ ఎన్నో కష్టాలు పడింది. తల్లిదండ్రులు వయసులో పెద్దవారు. వారిని కూడా అనూరాధనే చూసుకోవాలి. ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్న ఆమె ఇఎస్ఐలో ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషించింది. వచ్చిన జీతంలో పిల్లల్ని చదివించుకోవచ్చనుకుంది. కానీ అది కాంట్రాక్ట్ ఉద్యోగం. వచ్చే జీతం తక్కువ. దాంతో పిల్లల చదువులు పదో తరగతితోనే ఆపేయాలనుకుంది. అయితే స్కూల్ ప్రిన్సిపల్ సహకారంతో శారదా జూనియర్ కాలేజీలో స్కాలర్షిప్తో పిల్లలకు చదువుకునే అవకాశం వచ్చింది. ఆమె సంతషానికి అవధులు లేవు.ఇక పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు. తనకు వచ్చే ఆదాయంతో పిల్లల్ని చూసుకుంటూ బతుకుతుంది.
ఆశలు ఆవిరై...
ఇలాంటి పరిస్థితుల్లోనే అనూరాధ ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిందని ఆమె చేతులు ముడుచుకుని కూర్చోలేదు. యూనియన్ సహకారంతో మంత్రి బండారు దత్తత్రేయ వరకు వెళ్ళింది. అయినా కక్ష కట్టిన కాంట్రాక్టర్ ఒప్పుకోలేదు. నెల రోజుల పాటు తిరిగిన తర్వాత ఇక ఆమెలోని ఆశలు ఆవిరయ్యాయి. పిల్లల భవిష్యత్ గుర్తుకొచ్చి కనికరించమంటూ కాంట్రాక్టర్ కాళ్ళు పట్టుకుంది. అయినా కరగలేదు ఆ కఠినాత్ముడు. చివరకు ఏమీ చేయలేని పరిస్థితి. తను బతికుండగానే పిల్లల బతుకు ఎక్కడ నాశనం అవుతుందో అని ప్రాణాలు తీసుకోడానికి సిద్దపడింది. ఆత్మహత్యకు పాల్పడింది. చూసిన వారు వెంటనే ఆస్పత్రిలో చేర్చడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి.
యూనియన్ అండతో...
తమ కోసం నిరంతరం పోరాడే నాయకురాలికి వచ్చిన సమస్యకు ఉద్యోగులంతా ఏకమయ్యారు. సీఐటీయూ నాయకత్వంలో పోరాటం మొదలుపెట్టారు.చివరకు ఉద్యోగం నుంచి తొలగించిన విరప్ప, అనూరాధను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం అనూరాధ సనత్నగర్ ఇఎస్ఐ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటుంది.
గూండాలుగా మారిన పోలీసులు
యూనియన్ నాయకత్వంలో చర్చలు సఫలం అవుతున్నాయి అనుకున్న సమయంలో పోలీసులు గూండాల్లా మారారు. నాయకులు చెప్పే చల్లని కబురు కోసం ప్రశాంతంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.మహిళలని చూడకుండా పచ్చి బూతులు తిట్టారు. బట్టలు చించారు. పదిమంది మహిళా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తమ ఐక్యమత్యాన్ని చూసి భరించలేని కాంట్రాక్టరే పోలీసులకు డబ్బులిచ్చి ఈ దాడి చేయించాడని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తమపై దాడికి పాల్పడిన పోలీసులను వెంటనే సప్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇఎస్ఐ నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది కోర్కెలు
- 19.1.2017న కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి. 2017 జనవరి నుంచి వేతన బకాయిలు చెల్లించాలి.
- చట్ట ప్రకారం రావాల్సిన సెలవులు, క్యాజువల్, ఎరన్డ్ లీవులు అమలు చేయాలి.
- ఇ.పి.ఎఫ్ ఖాతాల్లో కార్మికుల వేతనాల నుంచి కట్ చేసిన డబ్బులతో పాటు యాజమన్యాం షేర్ ఎంత జమచేస్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలి.
- ఇ.ఎస్.ఐ కార్డులు అందరికీ అందచేయాలి.
- కార్మికులందరికీ ప్రతి నెల 7వ తేదీనే జీతాలు చెలించాలి. పే స్లిప్లు ఇవ్వాలి.
- 2016 మార్చి నెలలో బ్యాలన్స్ జీతం(12 రోజులు) తక్షణమే చెల్లించాలి.
- కార్మికులందరికీ సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలి.
- ఇ.ఎస్.ఐలో పని చేస్తున్నట్టు అపాయిన్ట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి.
- జనరల్ వార్డులో 10 మంది రోగులకు ఒక స్టాఫ్నర్సు, ఐసీయూలో ముగ్గురు రోగులకు ఒక స్టాఫ్నర్సు వుండేలా నిర్ణయించాలి.
- సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా సూపరింటిండెంట్, డీన్ కేంద్ర కార్మిక శాఖ దృష్టికి తీసుకెళ్ళాలి.
- ఖాళీ బాండ్ పేపర్స్పై సంతకాలు చేయించుకున్న పేపర్స్ తిరిగి కార్మికులకు ఇవ్వాలి.
- నిర్ధిష్టమైన పని గంటలు అమలు చేయాలి.
ఉద్యోగంలో చేర్చుకోవాలి
నేను యూనియన్ వైస్ ప్రెసిడెంట్ని. కేవలం యూనియన్లో ఉన్నాననే నన్ను ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఇప్పటికి ఏడాది న్నర గడిచింది. ఇప్పటి వరకు నన్ను ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఏ కారణం లేకుండా మొదట వారం రోజులు సప్పెండ్ అన్నారు. వారం తర్వాత మళ్ళీ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ తీసుకోలేదు. మూడు నెలలు అధికారుల చుట్టూ తిరిగాను. చివరకు నన్ను గేటు లోపలికి కూడా రాకుండా ఆపేశారు. ఇక్కడ కాంట్రాక్టర్ దారుణంగా వ్యవహరిస్తున్నాడు. యూనియన్లో ఉన్నవారిని రకరకాలుగా వేధిస్తున్నాడు. ఇప్పటికైనా నా ఉగ్యోగం నాకు ఇవ్వాలి.
- డేవిడ్
సెలవుపెడితే ఉద్యోగం ఉండదు
నేను లాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నా. మేము సుమారు 300 మంది వరకు ఉంటాము. జనవరిలో మా జీతాలు పెంచుతున్నట్టు జీవో వచ్చింది. కానీ ఇప్పటి వరకు చేతికి రాలేదు. సీఎల్స్ లేవు. మెటర్నటీ లీవ్స్ లేవు. అత్యవసరమై రెండు రోజులు సెలవులు పెడితే ఉద్యోగంలో నుంచి తొలగిస్తారు. ఇప్పటికి ఎంతో మందిని ఇలా తొలగించారు. అందుకే మా సమస్యలు పరిష్కరించుకోడానికి ఐదు నెలల కిందట సీఐటీయూ యూనియన్ పెట్టుకున్నాం. అప్పటి నుంచి మమ్మల్ని రకరకాలుగా వేధిస్తున్నారు. కారణం లేకుండా నాతోపాటు అక్షరు, మహేష్ అనే వారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం.
-సాయినాథ్
యూనియనే బతికిస్తున్నది
మేము సుమారు 50 మంది వరకు ఉంటాం. మమ్మల్నందరినీ ఉద్యోగం నుంచి తొలగించి కొత్తవారిని పెట్టుకోవాలని కాంట్రాక్టర్ ఆలోచన. ఒక్కో ఉద్యోగాన్ని లక్షన్నరకు అమ్ముకుంటారు. యూనియన్లో ఉన్నందుకే మమ్మల్ని ఇలా వేధిస్తున్నాడు. కానీ సీఐటీయూ లేకపోతే మా బతుకులు రోడ్డున పడేవి. యూనియన్లో ఉన్నందుకే మా సమస్యలు కొద్దిగైనా పరిష్కారమవుతున్నాయి. ఇప్పుడు అనూరాధకు సమస్య వచ్చింది. మేము మౌనంగా ఉంటే తర్వాత అదే పరిస్థితి మాకు వస్తుంది. అందుకే ఆమెకు మేమంతా అండగా నిలబడ్డాం.
- అంజీల
- సలీమ
Authorization