సురేష్ ఎంఏ, బీఎడ్ చేశాడు. ప్రభుత్వం పాఠశాలలో పోస్ట్ వస్తుందని ఎంతో ఆశగా డీఎస్సీ రాశాడు. ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డాడు. పోస్ట్ రాకముందే ఇంట్లో సంబంధం చూసి పెండ్లి చేశారు. తీరా చూస్తే ఎవరో కోర్టులో కేసు వేశారు. ఆ ఏడాది నుంచి డీఎస్సీ పోస్టులు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఈలోపు సురేష్ ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. కుటుంబం భారం పెరిగింది. చిన్నతనం నుంచి టీచర్ కావాలని అతని కోరిక. వేరే ఉద్యోగం చేయడానికి మనసు అంగీకరించలేదు. అందుకే ఓ ప్రయివేటు పాఠశాలలో చేరిపోయాడు. చాలీ చాలని జీతం. కానీ వెట్టి చాకిరి చేయాలి. ఇంటికి వచ్చే సరికి అలసిపోతాడు. భార్య బిడ్డలతో సరదాగా మాట్లాడే ఓపిక కూడా ఉండదు. ఇలా సురేష్ మాదిరిగా ప్రయివేటు పాఠశాలల్లో వెట్టిచాకిరి చేస్తున్న ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. కష్టాల కడలిలో బతుకు భారంగా ఈదుకొస్తున్నారు.
గురువులు... పిల్లలకు విద్యాబుద్దులు నేర్పుతారు. వారి భవిష్యత్కు బంగారు బాటలు వేస్తారు. సమాజానికి మంచి పౌరులను అందించడానికి అహర్నిశలూ కృషి చేస్తారు. అలాంటి ఉపాధ్యాయుల బతుకులు నేడు వెట్టి చేసే బానిసలకంటే దౌర్భాగ్యంగా తయారయ్యాయి. గల్లీకి ఒకటి పుట్టుకొస్తున్న ప్రయివేటు స్కూల్స్... ఫీజులు మాత్రం ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారు. అందులో గంటల కొద్ది నిలబడి గొంతు చించుకుని పాఠాలు చెప్పే టీచర్ల కష్టాలు మాత్రం పట్టించుకోరు. రోజువారి కూలి చేసే వారికన్నా తక్కువ వేతనాలు పొందుతున్న ప్రయివేటు స్కూల్ టీచర్స్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఏండ్లుగా ప్రయివేటు స్కూల్స్లో పని చేస్తూ చాలీ చాలని జీతంతో బతుకును నెట్టుకొస్తున్నారు.
జ్ఞానాన్ని దోపిడీ చేస్తున్నారు
వెట్టిచాకిరి చేసే బానిసలు ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయులు. వారి జ్ఞానాన్ని దోపిడీ చేసే దౌర్భాగ్యులు ప్రయివేటు స్కూల్ యాజమాన్యాలు. తల్లిదండ్రుల దగ్గర వేలకు వేలు ఫీజులు గుంజుతారు. అహర్నిశలూ కష్టపడి పనిచేసే టీచర్లకు మాత్రం చాలీ చాలని జీతాలు ఇస్తారు. వారి పాఠశాల అభివృద్ధి కోసం, అందులో చదివే విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం నిరంతరం కష్టపడే వారి నోటికాడి అన్నం ముద్దను లాక్కుపోయే అత్యంత రాక్షస ప్రవృత్తి కలిగిన ప్రయివేటు యజమానులు చాలా మంది ఉన్నారు. ప్రైవేటు టీచర్స్ రక్తాన్ని, శ్రమను సమయాన్ని, సంతోషాన్ని, న్యాయంగా వారికి రావల్సిన జీతాలను దోచుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న ప్రయివేటు ఉపాధ్యాయుల శ్రమని అప్పనంగా దోచుకుంటున్నారు.
జలగల్లా పీల్చుకుంటూ...
వేరే దారి లేక, ప్రభుత్వ ఉద్యోగం దొరకక, ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న అంచెంచల గౌరవంతో ఎంతోమంది ఉపాధ్యాయులు ప్రయివేటు పాఠశాలల్లో వెట్టిచాకిరి చేస్తున్నారు. అలాంటి ఉపాధ్యాయుల రక్తాన్ని జలగల్లా పీల్చుకుంటూ పాఠశాల యాజమాన్యాలు వారి ధన దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇలాంటి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరూ తమ నిజ వేతనాలను బయటకు చెప్పుకోలేరు. మూడు, నాలుగు వేలకే పని చేస్తున్నారని తెలిస్తే వారి పరువు పోతుందేమోనని భయపడే అమాయకులు వీరు. అందరూ 15-20 వేలుకు పైగా వస్తాయని అబద్దాలు చెప్పుకుంటూ భ్రమల్లో బతుకుతున్నారు.
సంఘంలో ఉంటే...
రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ పని చేస్తున్నా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సంఘం ఉంది. వారంతా వారి సమస్యలపై కలిసి కట్టుగా పోరాటం చేస్తారు. కానీ ఏ సంఘం లేనివారు ప్రయివేటు టీచర్స్. పొరపాటున ఎవరైనా సంఘం పెట్టినట్టు తెలిసినా, తమ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు ఎవరైనా ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నా ఆ టీచర్స్ను ఉద్యోగం నుంచి తొలగించడమే కాదు, ఇక ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తారు. అన్నింటికీ తెగించి పోరుబాటపట్టినా స్కూల్కు వెళ్ళకపోతే జీతం రాదు. జీతం రాకపోతే కుటుంబం గడవదు. అందుకే ఏ ఒక్క ఉపాధ్యాయుడు బయటకు రాడు. సంఘంలో పని చేయడానికి ధైర్యం చేయరు.
పని గంటలు పెంచుతారు
గ్రామం, మండలం, డివిజన్, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో దాదాపుగా అన్ని ప్రయివేటు స్కూల్స్లో నెలకు మూడు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల మాత్రమే జీతం పొందే వారే అధికం. ఎక్కడో ఏదో ఒక స్కూల్లో పది వేల నుంచి 15 వేల వరకు జీతాలు పొందుతుంటారు. ఇక ఆ స్కూల్స్లో పనిచేసే వారి కష్టాలు దారుణంగా ఉంటాయి. విపరీతమైన శ్రమ చేయిస్తారు. పని గంటలు పెంచుతారు.
ఏ ఉద్యోగికైనా నెలకు 30 రోజుల జీతం ఉంటుంది. కానీ ఈ ప్రయివేటు స్కూల్స్లో నెలకు ఒక సెలవు మాత్రమే ఇస్తారు. అంతకంటే ఒక్కటి ఎక్కువ సెలకు వాడుకున్నా జీతం కత్తిరిస్తారు. ఆదివారాలు సెలవులు తీసేసి మిగిలిన రోజులకు మాత్రమే జీతం ఇస్తుంటారు. చాలా ప్రయివేటు బడులలో ఆదివారంకు ముందురోజు గానీ తర్వాత రోజు గానీ సెలవు పెట్టుకుంటే రెండు రోజుల జీతం కత్తిరిస్తారు. ఏదైనా అనారోగ్యం గానీ అత్యవసరంగా సెలవు పెట్టాలంటే సెలవులు ఇవ్వరు. వారి స్థానంలో కొత్త వారిని పెట్టుకుంటారు. విద్యార్థుల ఇండ్ల చుట్టూ తిరిగి వారిని స్కూల్స్లో చేర్పించాలి.ఉదయం నుంచి రాత్రి వరకు పాఠాలు చెప్పాలి. పరీక్ష పేపర్లు దిద్దాలి.ఎలాంటి విద్యార్థికైనా ర్యాంకు తెప్పించాలి. పిల్లలకు సరైన మార్కులు రాకపోతే తల్లిదండ్రులకు జవాబు చెప్పాలి.
వారికి లాభాలే ముఖ్యం
ఇన్ని రకాల పనులు చేస్తూ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ బాధలు పడుతున్నా చివరకి ఇంక్రిమెంటు అడగాలంటే భయం. సెలవు అడగాలంటే భయం. మన పిల్లలను ఉచితంగా చేర్చుకొమ్మని అడగాలంటే భయం. యాజమాన్యాలు మాత్రం ఏసీ గదుల్లో సీసీ కెమేరాల కింద కూర్చొని రోజుకు ఎంత ఫీజు వచ్చింది, వచ్చిన డబ్బుతో ఏ కారు కొనాలి, ఏ ఇల్లు కొనాలి, ఏ ఫ్లాటు కొనాలి, ఏ భూమి కొనాలి? ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ ఏ ఉపాధ్యాయుడైనా జీతం సరిపోక బాధపడుతున్నాడా, అధ్యాపకులకు అడ్వాన్స్ అవసరమా, నా సంస్థను మోస్తూ నన్ను అభివృద్ధి చేసే ఉపాధ్యాయులకు ఇంకా ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి... అని ఏ ఒక్క యాజమాన్యమైనా ఆలోచిస్తుందా...ఇక అడ్మిషన్ల సీజన్లో ఒకవేళ అడ్మిషన్లు సరిపడా రాకపోతే... 'మీవల్లే ఇంత వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేదు' అని సమావేశాలు పెట్టి మరీ నిలదీస్తారు. ఈ ఉపాధ్యాయుడి ఆవేదన మాత్రం ఒక్కక్షణం కూడా వినరు.
ప్రశ్నిస్తే తొలగిస్తారు
ఎవరైనా ఉద్యోగం ఎందుకు చేస్తారు. నెల జీతం కోసం. సమాన్య ప్రజలు ఈ జీతంతోనే కుటుంబాన్ని పోషించాలి. ఇంటి అద్దెలు కట్టాలి. పిల్లల చదువులు చూసుకోవాలి. కుటుంబానికి అవసరమైన వైద్య ఖర్చులు భరించాలి. కానీ ఎక్కడ ఎవరికీ జరగనంత అన్యాయం ప్రయివేటు ఉపాధ్యాయులకు జరుగుతుంది. యాజమాన్యం మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర 12 నెలల ఫీజులు వసూలు చేస్తారు. ఇవి కాకుండా స్టడీ మెటీరియల్స్, నోట్బుక్స్, బెల్టులు, బ్యాడ్జ్లు, బస్ ఫీజులు అదనం. ఇలా గ్రామం నుండి పట్టణాల వరకు అన్ని ప్రయివేటు స్కూళ్ళలో ఓ పెద్ద పాటి దుకాణాలే నడుస్తూ ఉంటాయి. ఈ పాఠశాలల్లో పని చేసే టీచర్స్ స్కూల్ మేనేజ్ మెంట్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఏదో వంక పెట్టి హింసిస్తారు. చివరకు స్కూల్ నుంచే తొలగిస్తారు. రోజువారీ జీతగాళ్ళు ప్రయివేటు ఉపాధ్యాయులు.ఉద్యోగం ఉండాలంటే స్కూల్ యాజమాన్యానికి భయపడుతూ, వాళ్ళ అడుగులకు పడుగులు ఒత్తుతూ ఉండాల్సిందే. అలా చేయకుండా వారి దోపిడీని ప్రశ్నించారా ఇక ఉద్యోగం ఊడినట్టే. అందుకే పిల్లలకు పాఠాలు చెప్పడానికి తప్ప తమ సమస్యలు చెప్పుకోవడానికి ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా నోరు విప్పడు.
ఎలా బతకాలి?
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రయివేటు ఉపాధ్యాయుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. సంవత్సరంలో 12 నెలల జీతం ఉద్యోగాలు చేసే ప్రతిఒక్కరికీ ఉన్నాయి. కానీ ఈ ఉపాధ్యాయుల బతుకులు మాత్రం ఘోరం. ఒక్క ఏడాదిలో కేవలం 8, 9 నెలల జీతం మాత్రమే తీసుకుంటున్నారు. మరి మిగిలిన నెలల్లో వీరు ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, పిల్లలకు చదువులు, వారి భవిష్యత్ కలలు ఎలా నెరవేరుస్తారు..? బతకలేక బడిపంతులు అనే సామెత ఈ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు సరిగ్గా సరిపోతుంది.
ప్రభుత్వం పట్టించుకోవాలి
ఏప్రిల్, మే నెలల్లో జీతాలకు గతి వుండదు. కుటుంబం గడవాలంటే ఆదాయం కావాలి. అందుకే స్పాట్ వాల్యూషన్ కోసం నానా తంటాలు పడతారు. క్లాసు రూముల్లో గంటల కొద్దీ నిలబడి పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే వీరి జీవితాలకు అర్థం లేకుండా పోతుంది. ప్రతి పనికి కష్టం, ఫలితం ఉంటాయి. కానీ వీరికి మాత్రం కష్టం మాత్రం ఉంది. ఫలితం శూన్యం. అయినా వీరి కష్టం ఎవరికీ పట్టదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ప్రయివేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పట్ల జరుగుతున్న శ్రమ దోపిడిని నివారించాలి. విచ్చల విడిగా ప్రయివేట్ పాఠశాలలకు పర్మిషన్లు ఇవ్వడం కాదు. అందులో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవాలి. మిగిలిన ఉద్యోగుల వలె వీరికి కూడా కనీస వేతనాలతో పాటు మిగిలిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి.
Authorization