ఒకప్పుడు తెలంగాణలో చేనేత రంగం ఓ వెలుగు వెలిగింది. చేనేత వైభవం కీర్తి పతాకం ఎగురవేసింది. లక్షలాది మంది చేనేత కార్మికులు దర్జాగా జీవించారు. కానీ ఇప్పుడు కాలం మారింది. చేనేత రంగం వెలవెలబోయింది. నేతన్నల ఇంట ఆకలి తాండవిస్తోంది. ఆదుకునే వారు లేక నేతన్నల కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇలా దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కష్టాల గురించి నేటి కొలువులో...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలకులు చేనేత కార్మికుల చేతి వేళ్ళను నరికి చేనేతను దెబ్బతీశారు. ఆ తర్వాత భారత దేశంలో చేనేతకు చేయూత కరువైంది. నూతన జౌళీ విధానంలో చిక్కి సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్నది. టైక్స్టైల్స్ పాలసీ ఉక్కుపాదాల కింద చేనేత ధ్వంసం అవుతుంది. దీనితో చేనేత కార్మికులకు ఉపాధి కరువు. చాలీచాలని ఆదాయంతో ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిల్లో చేనేతను దానిపై ఆధారపడిన వారిని రక్షించుకోవడం కోసం పౌరసమాజం మద్దతు కూడగట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవల్సిన అవసరమున్నది.
కూలి సంగతేంటి...
చేనేత కార్మికులను కాపాడాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చేనేత వస్త్రాలే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మంచి ప్రయత్నమే. దీని వల్ల నేతన్నలకు కొంత ఉపాధి పెరుగుతుంది. కానీ ఇది ఒక్కటే చేనేత సమస్యలన్నింటికీ పరిష్కారం కాదు. ఉపాధి అయితే దొరుకుతుంది. మరి కార్మికుడి రోజువారి ఆదాయం ఎంత? ప్రస్తుతం మన ప్రాధమిక చేనేత సహకార సంఘాలలో ఉత్పత్తి చేస్తున్న చేనేత కార్మికుడు రోజుకి మీటర్ ఉత్పత్తికి టెస్కో ఇస్తున్న కూలి 22 రూపాయలు, షర్టింగ్కి 20 రూపాయలు. ఒక్క చేనేత కార్మికుడు రోజుకి 7 నుండి 9 మీటర్లు నేస్తాడు. అంటే 9 మీటర్లు నేసినందుకు ఇచ్చే కూలి 198 రూపాయలు మాత్రమే. దీనిలో మగ్గం నేసేవారికి, కండెలు చుట్టేవారికి, అచ్చు అతికే వారికి, బీమ్ పోసే వారికి, రంగులు అద్దెవారి కూలి కూడా ఈ 198 రూపాయలలోనే చెల్లించాలి. అది మన టెస్కో మన చేనేత కార్మికులకు ఇస్తున్న కూలి. ఇంత తక్కువ కూలితో కార్మికులు తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారో ఒక్కసారి ఆలోచించాలి. కార్మికులకు ఇస్తున్న కూలి, ఆదాయం పెంచకుండా చేనేత వస్త్రాలు ధరించడం వలన వారి జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు. ప్రభుత్వం కొంటున్న వస్త్రాలకే కూలి తక్కువగా ఉంటే ప్రైవేట్ రంగంలోని కార్మికుల కూలి ఏవిధంగా ఉన్నదో అర్థమవుతుంది.
హామీలు ఎటుపోయాయి...
2014లో టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో అధికారంలోకి వచ్చిన తరువాత చేనేతకు ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చారు. చేనేత కార్మికుల సామాజిక ఆర్ధిక, స్థితిగతులపై సర్వే చేసి మరీ విధి విధానాలను రూపొందించి అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు నిర్ధిష్ట విధానం రూపొందించకపోవడం వలన రోజురోజుకి చేనేతలు చతికిలబడిపోతున్నారు. కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి అభివృద్ది చేస్తామన్నారు. ఇప్పటి వరకు కేటాయించలేదు. చేనేత, జౌళిని విడదీసి వేరు వేరుగా బడ్జెట్ కేటాయిస్తామన్నారు. వేరు వేరుగా కేటాయించకపోగా కనీసం ఉమ్మడిగానైనా బడ్జెట్లో నిధులు లేవు. దీనివల్ల చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నది. చేనేతకు ప్రత్యేక పాలసీని ప్రకటిస్తామని 2016 జూలై 22న ప్రకటించారు. ఆ పాలసీని నేటికీ రూపొందించలేదు.
అమలు సంగతేంటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేండ్లు దాటినా చేనేత సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయింది. ముఖ్యంగా ఇటీవలి పెరిగిపోతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాల్సిన అవసరమున్నది. సహకార సంఘాలకు ఇస్తున్న పథకాలు సహకారేతర కార్మికులకు వర్తింపజేసి అమలు చేయాలి. సంక్షేమ పథకాలు నేరుగా చేనేత కార్మికులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. చేనేతను జౌళి నుండి వేరు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం నిరంతరం పోరాటాలు చేస్తున్నది.
కార్మికుల పరిస్థితి ఇదీ...
'నెల రోజుల నుంచి కూలి డబ్బులు చేతికి రాలేదు. ఇంటామెకు బీడీలు చేసిన పైసలు అందలేదు. రోజు వారి ఖర్చులకు ఇబ్బంది అవుతోంది. కూరగాయలు, ఇతర సరుకులు కొనలేకపోతున్నాం' ఇది సిరిసిల్లలోని ఓ చేనేత కార్మికుడి ఆవేదన. 'ఆరుగాలం శ్రమించి చీరను తయారు చేశాం. నెల రోజుల నుంచి కొనడానికి ఎవ్వరూ రావడం లేదు. మరో రెండు రోజులు పోతే పాతదై పోయేలా ఉంది' అంటూ ఆవేదన చెందుతున్నాడు పోచంపల్లి కార్మికుడు. 'మేం ఉత్పత్తి చేయించిన ఉత్పత్తులను ప్రతి నెలా పది లక్షల వరకు విక్రయించే వాళ్లం. ఇప్పుడు లక్ష రూపాయలు కూడా రావడం లేదు' అంటూ రాజోలి చేనేత పరపతి సంఘం సభ్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. 'రోజువారి మా అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి రోజుకు ఒక్క వస్త్రాన్ని కూడా ఎవరూ కొనడం లేదు' అని హైదరాబాద్లోని టెస్కో ఉద్యోగి నిట్టూర్పు విడిచాడు. ఇవన్నీ తెలంగాణ వ్యాప్తంగా నేతను, చేనేతను నమ్ముకొని జీవితాలను వెళ్లదీస్తున్న వారి ప్రత్యక్ష ఉదాహారణలు.
నోట్ల రద్దు ప్రభావాన్ని మర్చిపోలేదు
గత ఏడాది నోట్ల రద్దు ఈ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘాల పరిస్థితి అగమ్యగోచరమయింది. ఆ సమయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఏకంగా 80 శాతానికి పైగా అమ్మకాలు పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో చీరలు, ధోవతులు, దుప్పట్లు, తువ్వాళ్లు, ఇతర వస్త్రాలు ప్రతి నెలా వేయి కోట్ల మేరకు తయారవుతున్నాయి. ఈ వ్యాపారం ఎక్కువగా నగదు ఆధారంగానే సాగుతోంది. ఐదు వందల రూపాయలు వేయి నోట్ల రద్దు అయినప్పుడు సిరిసిల్లలో సంక్షోభం తలెత్తింది. ఆర్థికలావాదేవీలలో ప్రతిష్టంబనతో ఉత్పత్తి తగ్గిపోయింది. డబ్బులు చేతికందక వస్త్రవ్యాపారులు ముడిసరుకులు కొనుగోలు చేయలేదు. మరోవైపు ఆసాములకు చెల్లింపులు నిలిపివేశారు. దీంతో వారు కూలీలకు డబ్బులు ఇవ్వలేదు. సిరిసిల్లలో వారం వారం కూలీ డబ్బులు ఇచ్చేవారు. వస్త్రవ్యాపారి ఆసాములకు డబ్బులు ఇస్తే వారు కూలీలకు చెల్లించే వారు. దీంతో కార్మికులు కూలి డబ్బుల కోసం అల్లాడుతున్నారు. కార్మికులకు కూలి డబ్బులే ఆధారం. వాటితోనే కుటుంబాలు గడుస్తాయి. నోట్ల రద్దుతో నేతన్నలకు ఆదాయం లేకపోతే ఇండ్లలో మహిళలు బీడీలు తయారు చేసి వచ్చే మొత్తంతో ఇంటిని నడిపించారు.
డిమాండ్స్
- చేనేత సంక్షేమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి.
- రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు 500 కోట్లు నిధులు కేటాయించి కార్మికులను ఆదుకోవాలి.
- ప్రతి చేనేత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలి.
- కనీస వేతన చట్టం అమలు చేస్తూ ప్రతి కార్మికునికి నెలకు 18 వేలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
- చేనేతకు ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేసి రెండు లక్షలు వడ్డీ లేని రుణాలు అందజేయాలి.
- 50 సంవత్సరాలు నిండిన కార్మికుడు, కార్మికురాలికి రెండు వేలు పెన్షన్ రూపంలో జీవించి ఉన్నంత వరకు ఇవ్వాలి.
- చేనేత కార్మికులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు మాఫీ చేయాలి.
- కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వర్క్ షెడ్డు నిర్మించి ఇవ్వాలి.
- గతంలో ఇచ్చిన మాదిరిగా అంత్యోదయ కార్డులు ఇచ్చి 35 కిలోల బియ్యం ఇవ్వాలి.
- బీడీ మహిళా కార్మికులకు ఇస్తున్నట్టుగా చేనేత మహిళా కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు జీవన భృతి ఇవ్వాలి.
చేనేతకు అవసరమైన ముడి సరుకులు, పట్టు, కాటన్ రంగులు, రసాయనాలను నూలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్గేట్ రేటుకు సబ్సిడీతో అందించాలి.
- చేనేత హ్యాడ్లూమ్ పార్క్ను పటిష్టపరిచి కార్మికులకు ఇఎస్ఐ, పీఎఫ్ మొదలగు సౌకర్యాలు కల్పించాలి.
Authorization