పెన్షన్ సామాజిక భద్రతగా ఉద్యోగి హక్కు. జీవిత కాల సేవలకు గాను ఉద్యోగ విరమణానంతర కాలంలో ఉద్యోగి కుటుంబం సాధారణ జీవితం గడపాలని కల్పించబడిన సౌకర్యమే పెన్షన్. ఈ పెన్షన్ సౌకర్యం కోసం ప్రభుత్వం వెచ్చించే ఆర్థికాన్ని ఎలాంటి లాభనష్టాల దృష్టితోనో, రిటైరైన వారికిచ్చే నజరానాగానో చూడకూడదు. అలాంటి డిఫైన్డ్ ఫైన్షన్ సౌకర్యానికి పిఎఫ్ఆర్డిఎ చట్టం నూతన పెన్షన్ విధానం పేరుతో మంగళం పాడింది. ఈ విధానం వల్ల ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు అభద్రతలో ఉన్నాయి. ఈ విధానంపై సీపీఎస్ ఉద్యోగుల అభిప్రాయలు ఈ వారం కొలువులో...
22 డిసెంబర్ 2003 నాడు నాటి ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్య నిర్వాహక ఉత్తర్వుల రూపంలో ఉరిమిన ఉరుము, సెప్టెంబర్ 4, 2013న ప్రతిపక్ష బీజేపీ మద్దతుతో యుపిఎ ప్రభుత్వం తెచ్చిన పిఎఫ్ఆర్డిఎ చట్టంతో ఉపాధ్యాయ, ఉద్యోగులపై పిడుగుపాటైంది. వర్కింగ్ క్లాస్కు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలచే అభ్యుదయ, వామపక్షవాదులు బిల్లును వ్యతిరేకించడంతో దశాబ్ద కాలం బిల్లు ఆగింది. 2013లో పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు ఒక్కటై ఈ చట్టాన్ని చేశాయి.
సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ధర్మాసనం డిసెంబర్ 12, 1982లో 'పెన్షన్ ఉద్యోగి హక్కు. దానంగా ఇచ్చే పారితోషకం కాదు' అంటూ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సైతం గౌరవించకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు పరాకాష్ట. పెన్షన్ నిధులను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టడమంటే ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాయడమే. అలాంటప్పుడు శ్రేయోరాజ్యమని చెప్పుకున్న దానికర్థమేముంది? పెన్షన్ నిధులను షేర్ మార్కెట్కు తరలించడం ఉద్యోగుల శ్రేయస్సును మంటగలపడమే. ఇది ముమ్మాటికీ విద్రోహమే.
నూతన పెన్షన్ బిల్లుపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఈ విధానం చాలా లాభదాయకమైంది. సరిపోయినంత సందప పోగవుతుందని భ్రమలు కల్పించారు. మరి అలాంటపుడు 'కనీస పెన్షన్ గ్యారంటీ సౌకర్యం కల్పించడానికి ఆటంకాలేమిటని వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తే అది సాధ్యం కాదు. పెన్షన్ చెల్లింపు ఎంత అనేది మార్కెట్ ఒడిదుడుకుల కదిలికపై ఆధారపడి ఉంటుంది' అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానమిచ్చారు. అత్యంత మేలు చేసేదని మీరు చెప్పుతున్న ఈ నూతన పెన్షన్ విధానం అన్ని శాఖలకు లాభదాయకమైనప్పుడు రక్షణరంగాన్ని ఎందుకు మినహాయించారని రాజ్యసభ సభ్యులు ఏచూరి వేసిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి చిందంబరం సమాధానం లేక నీళ్లునమిలారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఇరవై వేల మంది ఉపాధ్యా, ఉద్యోగుల కుటుంబాల భద్రత అగమ్యగోచరమవుతుంటే అధికార పార్టీ అనుయాయులు మాత్రం సిపిఎస్ విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే సమస్య కాదనడం ఉపాధ్యాయ, ఉద్యోగులను మభ్యపెట్టడమే. త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలియనంత అమాయకులా వీరు? కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలోనే ఎక్కువ పెన్షన్, గ్రాట్యుటీ వస్తుందని సాక్షాత్తు ఆర్థికమంత్రి అసెంబ్లీలోనే ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో కుండబద్దలు కొట్టిన తర్వాత కూడా మా పోరాటం రాష్ట్ర ప్రభుత్వంపై కాదు కేంద్ర ప్రభుత్వ విధానంపైనే, రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేస్తుందనే నమ్మకం మాకుంది అంటూ భ్రమలు కల్పిస్తూ పోరాటంలో భాగస్వాములమైనట్టుగా చెప్పుకోవడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలను ఉద్యోగ, ఉపాధ్యాయులు గమనిస్తున్నారు.
నూతన పెన్షన్ విధానం నుంచి వైదొలిగి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. 'ఎంప్లాయూస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్' అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిపియస్ విధానం నుంచి వైదొలగాలి. పాతపెన్షన్ విధానాన్ని అమలుచెయ్యాలి. దానితోపాటు సిపిఎస్ పీడ పూర్తి విరగడ కావాలంటే కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డిఎ చట్టాన్ని రద్దు చేయాలి.
ఏదేమైనా జీవించే హక్కును కాపాడుకోవడం కోసం ఉపాధ్యాయ, ఉద్యోగ లోకం సన్నద్ధమైంది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుకోవడానికి జరుగుతున్న ఉద్యమం 'మహోద్యమం'గా సాగుతోంది. సెప్టెంబర్ 1న 'పెన్షన్ విద్రోహ దినం'గా పాటించారు.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
నూతన పెన్షన్ విధానం సీపీఎస్ ఉద్యోగులకు శాపంగా మారింది. జీవితకాలం పని చేసిన ఉద్యోగికి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, సర్వీస్ పెన్షన్ లాంటివి ఏమీ రావు. ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి అతని అకౌంట్లో ఉన్న మొత్తంలో 60 శాతం ఉద్యోగికి ఇచ్చి, మిగిలిన 40 శాతం షేర్ మార్కెట్లో పెడతారు. షేర్ మార్కెట్లో లాభం వస్తే ఉద్యోగికి ఉపయోగం. నష్టం వస్తే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు షేర్ మార్కెట్ ఎప్పుడు లాభాల్లో ఉంటుందో, ఎప్పుడు నష్టాల్లో ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాంటిది పెన్షన్ ఒక ఉద్యోగి జీవితాంతం కష్టడితే తన చివరి జీవితం ప్రశాంతంగా బతకడానికి ఇస్తారు. పెన్షన్ ఉద్యోగి హక్కు. సుప్రీం కోర్టు కూడా ఇదే చెప్పింది. ఈ కొత్త పెన్షన్ విధాన పరిధిలోకి 1, 25,000 మంది ఉద్యోగులు వస్తారు. వీరి రిటైర్మెంట్ జీవితమంతా కష్టాలతో గడవాల్సిందే. అందుకే పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని మేం కోరుతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. నిజంగా ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులపై ప్రేమ ఉంటే వెంటనే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి.
- శ్రీనివాస్, సీపీఎస్ ఉద్యోగి
భద్రత లేదు...
సామాజికి భద్రత ప్రతి ఉద్యోగికీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఆ బాధ్యత నుంచి మన ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి. అసలు ఉద్యోగి పెన్షన్ డబ్బులు తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టడం ఎంత అన్యాయం. చట్టం 21/ ఎ ప్రకారం షేర్ మార్కెట్లో నష్టాలు వస్తే ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఇక ఉద్యోగి పెన్షన్ డబ్బులు పోయినట్టే. అలాగే ఎన్ఎస్డీఎల్, పీపీఆర్డీఏ కమిటీల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగి గానీ, ఐఎస్ఎస్ అధికారిగానీ లేరు. కేవలం ప్రైవేటు, కార్పొరేట్ వాళ్ళే దీన్ని నిర్వహిస్తారు. 2004 తర్వాత సుమారు 1,25,000 వేల మంది ఉద్యోగులు చేరితే, దీని కంటే ముందు సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వీరంతా ఒకే రకమైన పనులు చేస్తున్నారు. కానీ ఒకే రకమైన భద్రత లేదు. సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదు. ఒక్క మంత్రి కూడా దీనిపై నోరు తెరిచి మాట్లాడలేదు. వేలమంది ఉపాధ్యాయులు రోడ్లపైకి వస్తే పట్టించుకునే వారు లేరు.
- ఉప్పలయ్య, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా సీపీఎస్ ఉద్యోగి
కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి
కొత్త పెన్షన్ విధానం వచ్చిన తర్వాత సుమారు 300 మంది ఉద్యోగులు రకరకాల కారణాల వల్ల సర్వీసులో ఉండగా చనిపోయారు. వారికి ఎలాంటి కుటుంబ పెన్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడు వారి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. నిర్మల్ జిల్లా, కానాపూర్ మండలంలో ఒక ఉపాధ్యాయురాలు డెలివరీ సమసయంలో పాపకు జన్మనిచ్చి చనిపోయింది. ఆమె 21 రోజులు ఉద్యోగం చేసింది. తల్లి చనిపోతే ఆ పాపకు ఆ 21 రోజుల జీతం తప్ప వేరే ఆధారం ఏమీ లేదు. అదే పాత పెన్షన్ విధానం ఉన్నట్టయితే తల్లిని పోగొట్టుకున్న ఆ పాపకు నెల నెలా ఎంతో కొంత పెన్షన్ వచ్చేది. అలాగే 2015లో దైవాదీనం అనే ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యాడు. అతనికి ఇప్పుడు వస్తున్న పెన్షన్ 1190 రూపాయలు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పధకాలు ఉన్నాయి. ఆసరా ద్వారా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పెన్షన్ పొందుతున్నారు. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ జీవితం అంతకన్నా దారణంగా ఉంది. నూతన పెన్షన్ విధానం వల్ల ఇలా సీపీఎస్ ఉద్యోగులు నష్టపోతున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
- కృష్ణకుమార్, తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు.
పింఛనుదారుల భవిష్యత్తుకు పెనుముప్పు
ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తూ అనారోగ్యం పాలైనా, ప్రమాదానికి గురైనా, అకాల మరణం చెందినా, ఉపాథి కోల్పోయినా, వృద్ధాప్యం వల్ల రిటైర్ అయినా ఆర్థికంగా ఆదుకోవలసిన బాధ్యత సమాజంపై ఉన్నది. వీటిలో ఏ ఒక్క కారణంగానైనా ఆ కుటుంబ జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. వృద్ధాప్య పింఛను పథకం సామాజిక భద్రతా పథకాల్లో అత్యంత కీలకమైనది . జీవితాంతం శ్రమను వెచ్చించి సమాజానికి సేవ చేసిన పౌరునికి వృద్ధాప్యంలో ప్రశాంత జీవితం గడపడానికి కనీస రక్షణకు హామీ ఉండాలి. కాస్త స్థిరమైన ఆర్థిక వనరు ఉన్నప్పుడే దానికి బరోసా ఉంటుంది . కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. చట్టబద్దమైన ఎలాంటి సామాజిక భద్రత లేదు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాల పెరుగుదల ఎండమావే. విద్య , వైద్యం నివాసం లాంటివి మార్కెట్లో ఖరీదైన సరుకులుగా మారిపోయాయి. ఇవేవీ కల్పించకపోగా కనీసం వృద్ధాప్యంలో కూడా రక్షణ కల్పించలేని విధంగా నూతన పింఛను పథకం (యన్. పి.యస్) ను అమలు చేస్తే దుప్షరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం. ఆర్థిక సంస్కరణలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి దోహదపడాలే గానీ, సామాన్యుల జీవన ప్రమాణాలను గొడ్డలి పెట్టుకు గురిచేసి, జీవితాలను చిద్రం చేయడానికి దారితీయకూడదు. అభద్రతాభావంతో ''దినదిన గండం నూరేళ్ళాయుషు'' అన్న చంగదంగా బతకాల్సిన దుస్తితిని ఫించను పథకం మదుపుదారులకు కల్పించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.
- కల్పన
Authorization