దేశంలోని చిన్నమొత్తాల పొదుపు సంస్థలలో ప్రముఖ స్థానంలో వుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల కనుగుణంగా నడుస్తోంది. గత 85 సంవత్సల నుండి నిజాయితీగా తన ఖాతాదారులకు సేవలందిస్తోంది పీర్లెస్ జనరల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ సుదీర్ఘ ప్రస్థానంలో ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లలోనూ, సంస్థ ఉనికిని నిలబెట్టడంలోనూ సంస్థలోని ఉద్యోగుల పాత్ర కీలకం. అలాంటి ఉద్యోగులను యాజమాన్యం వీఆర్ఎస్ పథకంతో బలవంతంగా బయటకు నెట్టే ప్రయత్నం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పీర్లెస్ ఉద్యోగులందరూ 'పీర్లెస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)' నాయకత్వంలో పోరాడి విజయం సాధించుకున్నారు. తమకు నష్టం కలిగించే వీఆర్ఎస్ పథకాన్ని తిప్పికొటి,్ట 'సంఘటితమైతే గెలుపు తథ్యం' అని మరొక్కసారి నిరూపించి మరెందరో ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచిన వారి పోరాట పటిమ గురించి నేటి కొలువులో...
సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు రేయింబవళ్ళు కష్టపడి ఖతాదాలకే కాక వేలాది మంది ఫీల్డు ఉద్యోగులకూ సేవలందించారు. సంస్థ వ్యాపారం ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఓవర్టైం అలవెన్సులు ఇచ్చినా ఇవ్వకున్నా పనిగంటల విషయం కూడా పట్టించుకోకుండా సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు నిజాయితీగా సేవలందించారు. పీర్లెస్ సంస్థ నేటికీ లాభాలలో వున్న సంస్థ. 2000 సంవత్సరంలో 500 కోట్లున్న నికర స్వార్జిత ఫండు కంపెనీ ఉద్యోగుల కృషి ద్వారా నేటికీ 1700 కోట్లకు పెరిగింది. అంతే కాక కంపెనీలో చెల్లింపులు, ఖాతాదారుల మెచ్యూరిటీ డబ్బు 1560 కోట్లకు పైబడి వుంది. ఈ డబ్బు నుండి యాజమాన్యం వడ్డీ మొత్తాలను పొందడమే కాక కంపెనీ షేర్ హోల్డర్లు ప్రతి యేటా 70 నుండి 80 శాతం డివిడెండ్లు తీసుకుంటున్నారు.
విస్మరించారు
ఇలా ఎన్నో రకాలుగా కంపెనీని లాభాల బాటలో నడిస్తున్న ఉద్యోగుల పాత్రను విస్మరించిన యాజమాన్యం ఆగస్టు 2017లో ఖర్చు తగ్గింపు సాకుతో అక్రమ వీఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అతి తక్కువ మొత్తాలతో ఉద్యోగులను బయటికి పంపే ప్రయత్నం చేసింది.
యూనియన్ బాధ్యత తీసుకుని
ఇలాంటి పరిస్థితుల్లో సంస్థ ప్రయోజనాలనూ, సంస్థ ఉనికినీ నిరంతర కాపాడుతూ వస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ వీఆర్ఎస్ పథకాన్ని తిప్పికొట్టి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఘన విజయం సాధించింది. ఏ ఒక్కరూ వీఆర్ఎస్కు దరఖాస్తు చేయరాదని యూనియన్ ఇచ్చిన పిలుపు ప్రకారం 90 శాతం మంది ఉద్యోగులు యాజమాన్యం కుట్రపూరితమైన వీఆర్ఎస్ పథకాన్ని తిప్పికొట్టారు. వీఆర్ఎస్ పథకం గడువు కాలమైన ఆగస్టు 1వ తేదీ నుండి 30వ తేదీ వరకూ నెల రోజుల పాటు ప్రతిరోజూ ప్రతి బ్రాంచి ఆఫీసు ముందు భోజన విరామ సమయంలో ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.
అరుదైన రికార్డ్...
పీర్లెస్ ఉద్యోగుల భవిష్యత్ పాలసీదారుల సొమ్ము భద్రత పైనే ఆధారపడి వుందని పీర్లెస్ ఎంప్లాయిస్ యూనియన్ విశ్వసిస్తోంది. అందుకే సంస్థలోని డిపాజిట్లు ప్రభుత్వ భద్రతలో ఉండేలా కృషి చేయడమే కాక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 20,000 కోట్ల మెచ్యూరిటీ మొత్తాలను తన ఖాతాదారులకు అందించడంలో కృషి చేసింది. తద్వారా పీర్లెస్ సంస్థ ఫ్రైవేటు ఫైనాన్స్ కంపెనీల చరిత్రలో ఒక అరుదైన రికార్డు సృష్టించింది.
కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి
1978లో చిట్ఫండ్ కంపెనీల నిషేధ చట్టం కింద కంపెనీకి నోటీసులు వచ్చినపుడు యూనియన్ చొరవ తీసుకుని కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకునేలా యాజమాన్యానికి సూచించి అప్పటి ప్రముఖ న్యాయవాది సోమనాధ్ ఛటర్జీని కేసు వాదించాలని కోరింది. ఆమేరకు సోమనాథ్ ఛటర్జీ సుప్రీంకోర్టులో వాదించి కేసు గెలిపించారు. 1987లో కంపెనీకి అనుకూలంగా కోర్టు తీరు వెలువడింది. ఆ కోర్టు తీర్పు ప్రకారం ఆర్బీఐ కంపెనీని నియంత్రించవచ్చు కానీ ఆ ప్రక్రియలో ఖాతాదారుల, ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం కలుగరాదు అని పేర్కొంది. కానీ ప్రస్తుతం ఆర్బీఐ సుప్రీంకోర్టు ఆదేశాలను పెడచెవినపెట్టి పీర్లెస్ కంపెనీ వ్యాపారంపై 2011లో ఆంక్షలు విధించింది.
న్యాయపోరాటం చేసింది
దేశంలో శారదాచిట్ఫండ్, అగ్రిగోల్డ్, కృషిబ్యాంక్ లాంటి అనేక సంస్థలు ప్రజలను వంచించి ప్రజాధనంతో ఉడాయిస్తుంటే వాటిని నియంత్రించి ప్రజాధనానికి రక్షణ కల్పించలేని ప్రభుత్వం, ఆర్బీఐ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్న పీర్లెస్ లాంటి దేశీయ కంపెనీలపై ఆంక్షలు విధించడం అన్యాయమని పీర్లెస్ ఎంప్లాయిస్ యూనియన్ కలకత్తా హైకోర్టులో న్యాయ పోరాటం చేపట్టింది.
కుట్రకు పూనుకున్నా...
సంస్థ మనుగడ కోసం యాజమాన్యం చేయాల్సిన న్యాయ పోరాటాన్ని ఉద్యోగులు తమ భుజాలపై వేసుకున్నారు. దీని కోసం ప్రతి ఉద్యోగి 32 రోజుల తమ వేతనాన్ని వెచ్చించారు. తొలి దశలో న్యాయపోరాటాన్ని సమర్థించిన యాజమాన్యం 4 సంవత్సరాలు గడిచిన తరువాత ప్లేటు పిరాయించి ఉద్యోగులను కంపెనీ నుండి తొలగించే కుట్రకు పూనుకుంది. ఆర్బీఐ నిబంధనలు ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం కలిగించరాదనే గతంలోని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తిరిగి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి న్యాయం పొందాలని యూనియన్ సమాయత్తమవుతోంది.
మహిళా ఉద్యోగినుల కృషి
మహిళా ఉద్యోగినులు యాజమాన్య బెదిరింపులకు లొంగకుండా ఎంతో ధైర్య సాహసాలతో ఈ పోరాటంలో అగ్రభాగాన నిలిచారు. కొన్ని బ్రాంచి ఆఫీసులలో ఒకరిద్దరే ఉన్నా కూడా ప్రతి రోజూ భోజన విరామ సమయంలో ఆందోళనల్లో పాల్గొనడం వారి పోరాట పటిమకు చిహ్నంగా చెప్పుకోవచ్చు.
నాయకుల పట్టుదలతోనే
సీఐటీయు అనుబంధ సంఘంగా వున్న ఎంప్లాయూస్ యూనియన్ నాయకుల నిబద్ధత, పట్టుదల, అకుంఠిత దీక్ష, సరైన దిశా నిర్దేశాల వల్ల ఈ పోరాటం విజయవంతమైంది. ఈ పోరాటంలో అనేక మంది సీఐటీయూ నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ సహాయ సహకారాలు అందించారు. తెలంగాణ, ఎపీసీఐటీయూ కమిటీలు ఆందోళనకు సంఘీభావంగా పత్రికా ప్రకటనలు విడుదల చేసి ఉద్యోగులకు ఆత్మ స్థైర్యాన్నిచ్చారు. మొత్తంగా ఒక ప్రైవేటు రంగంలోని యూనియన్ శక్తివంతమైన యాజమాన్య బెదిరింపులకు లొంగకుండా విజయం సాధించడం ఉద్యోగుల సంఘటిత శక్తికి నిదర్శనం. ఈ విజయం ఉద్యోగులందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాక అనేక మంది చురుకైన కార్యకర్తలుగా తయారవడానికి దోహదం చేసింది.
వదంతులను ప్రచారం చేసి
వీఆర్ఎస్ పథకమనేది స్వచ్ఛంద విరమణ పథకం. అయినప్పటికీ యాజమాన్యం ఉద్యోగులను బలవంతంగా బయటికి నెట్టే ప్రయత్నాలు చేసింది. ఆగస్టు నెల తరువాత భారీగా బదిలీలు జరుగుతున్నాయనీ, బ్రాంచి ఆఫీసులన్నీ మూతపడతాయనీ, వేధింపులుంటాయనీ రకరకాల వదంతులను ప్రచారం చేశారు. అయినా కూడా యూనియన్ పిలుపుకు కట్టుబడ్డ ఉద్యోగులు వీఆర్ఎస్ పథకాన్ని విజయ వంతంగా తిప్పికొట్టారు.
సహకరించిన సోషల్ మీడియా
వీఆర్ఎస్ వ్యతిరేక పోరాటంలో సోషల్ మీడియా మాధ్యమాలైన వాట్సాఫ్, ఫేస్బుక్లు ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. దాదాపు 250 మంది ఉద్యోగులతో వాట్సాప్ గ్రూపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలలో వున్న జమ్ము కాశ్మీర్ మొదలుకొని అగర్తలా వంటి ప్రదేశాలలో వున్న ఉద్యోగులందరితో వాట్సాప్ ద్వారా రోజువారీ వార్తలను అందరూ పంచుకున్నారు. నెల రోజుల పాటు జరిగిన ఆందోళనల వార్తలూ, ఇతర సమస్యల వార్తలూ, స్ఫూర్తిదాయక సందేశాలూ, నాయకత్వ ఉపన్యాసాలు క్షణ క్షణం పంచుకున్నారు. దీనితో యూనియన్ సంఘటిత శక్తి మరింత బలపడింది. ఈ సంఘటిత శక్తి ద్వారా 90 శాతం మంది ఉద్యోగులు తమకు నష్టదాయకమైన ఈ పథకాన్ని విజయవతంగా తిప్పికొట్టారు.
యూనియన్ పుట్టుక
పీర్లెస్ సంస్థ 1932లో స్థాపించబడింది. 1956లో జీవిత బీమా, 1970లో సాధారణ బీమా, జాతీయకరణ అనంతరం 1971 నుండి పీర్లెస్ జనరల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా నడుస్తోంది. 1974లో పీర్లెస్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రారంభించబడింది. ప్రారంభం నుండి యూనియన్ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. 12 మంది తొలి నాయకత్వాన్ని యాజమాన్యం అక్రమంగా ఉద్యోగాల నుండి తొలగించింది. చివరకు అక్రమ లాకౌట్ను కూడా తట్టుకుని 1977లో పశ్చిమబెంగాల్లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడ్డాక యూనియన్ గుర్తింపు సాధించింది. 1977 నుండి 1985 వరకు అనేక రకాల యాజమాన్య వేధింపులు ఎదుర్కొని దృఢంగా నిలబడి ఉద్యోగుల మన్ననలతో దేశవ్యాప్త సంఘంగా విస్తరించింది.
- నాగలక్ష్మి
పీర్లెస్ ఎంప్లాయూస్ యూనియన్
అఖిలభారత నాయకులు
Authorization