మన రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రజలు బీడీ కార్మికులుగా బతుకుతున్నారు. వీరికి ఇది తప్పా వేరే జీవనాధారం లేదు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసినదే. ప్రస్తుతం రాష్ట్రంలో బీడీ కార్మికులు ఏడు లక్షల మంది ఉన్నారు. వీరిలో జీవన భృతి 1000 రూపాయల చొప్పున సుమారు మూడు లక్షల చిల్లర కార్మికులకు మాత్రమే అందుతుంది. మిగిలిన కార్మికులకు జీవన భృతి అందడం లేదు. దీనికి కారణం 2014 కటాఫ్ తేదీ. దీనివల్ల చాలా మంది బీడీ కార్మికులు జీవన భృతి పొందలేకపోతున్నారు. అందుకే ఈ కటాఫ్ను తొలగిస్తే మిగిలిన కార్మికులు కూడా లబ్దిపొందుతారు. అలాగే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1000 రూపాయల భృతి ఏ మాత్రం సరిపోవడం లేదు. సామాన్య ప్రజలు మార్కెట్కు వెళితే నిత్యావసర సరుకులు తెచ్చుకోలేకపోతున్నారు. కనీసం మూడు నాలుగు వేలు చేతిలో లేనిదే సరుకులు రావడం లేదు. ఈ విధంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి జీవనభృతిని ఐదు వేలకు పెంచి అందిస్తే కార్మికుల కుటుంబం కొంత వరకైనా బతకగలుగుతుంది. అలాగే ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో బీడీ కార్మికుల జీవన భృతి దరఖాస్తులు అందుకుంటున్నారు. కానీ ఇవి పై అధికారుల దృష్టికి వెళ్ళడం లేదు. దాంతో కార్మికులు మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవల్సి వస్తుంది. దీనికి ముఖ్య కారణం 2014 కటాఫ్ తేదీ. కాబట్టి దీనిని వెంటనే సవరించి బీడీ కార్మికులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున జీవన భృతి పెంచి ఐదు వేల రూపాయలు అందించాలని మనవి.
- రాచకొండ మనోహర్, రాజగోపాలపేట, సిద్ధిపేట
Authorization