అంగన్వాడీలు ఎన్నో ఏండ్లు శ్రమకు తగ్గ ఫలితం కోసం ఆందోళన చేశారు. చివరకు ప్రభుత్వం స్పందించింది. వారి పోరాటానికి దిగొచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 18 వేల రూపాయలు కనీసం వేతనం కాకపోయినా కొంత వరకు వేతనాలు పెంచుతూ నిర్ణయించింది. అయితే వారికి రాష్ట్రంలో వేతనాల సమస్య కొంత వరకు పరిష్కారమైనా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. వాటికోసం నవంబర్లో దేశవ్యాప్తంగా మహాపడావ్ పేరుతో తమ న్యాయమైన డిమాండ్లతో అంగన్వాడీలు కార్యక్రమాని చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలు ఈ వారం కొలువులో...
శిశువుల ఆరోగ్య వృద్ధిలో ఐసీడీఎస్ ముఖ్య పాత్ర పోషిస్తున్నది. అందుకే దేశవ్యాప్తంగా అన్ని ఆవాస ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా అంగన్వాడీలను ప్రజలకు దూరం చేసే కుట్ర పన్నుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు 10 కోట్ల మందికి పైగా సేవలందిస్తున్నాయి. ఇందులో 1.9 కోట్ల మంది ఆరు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారు. ఐసీడీఎస్ పథకం వలన జాతీయ స్థాయిలో శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయి. 2015లో 9.30 లక్షల మంది చిన్నారులు మృతి చెందగా 2016లో ఆ సంఖ్య 8.40 లక్షలకు తగ్గింది. 2015లో ప్రతి వెయ్యి మందికి 37 మంది మృతి చెందగా 2016లో 34 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 2005తో పోల్చితే ఆస్పత్రులో ప్రసవాల సంఖ్య పెరిగింది. 2005లో 38 శాతం ప్రసవాలు నమోదు కాగా 2016లో 79.8 శాతం నమోదయ్యాయి. అందుకే సామాజిక భద్రతకు సంబంధించిన ఐసీడీఎస్ ప్రాజెక్టును లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. అయితే మోడీ అధికారంలోకి వచ్చాక వివిధ ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేసేందుకు వాటిని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే పనిని వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఐసీడీఎస్ను ప్రైవేటు వారికి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వాస్తవానికి ఐసీడీఎస్ను బలహీన పరిచే క్రమం 2012లోనే మొదలయింది. 2016 నాటికి దీనిని దేశమంతటికి మిషన్ మోడ్లోకి మారుస్తామని ప్రకటించింది. మిషన్ మోడ్ ప్రధాన ఉద్దేశం ఐసీడీఎస్ నిర్వమణను స్వచ్ఛంద సంస్థలకు, స్థానిక సంస్థలకు, కార్పొరేట్ యాజమాన్యానికి అప్పగించడమే. దీనికి కమ్యూనిటీ పార్టిసిపేషన్ (ప్రజల భాగస్వామ్యం) అని ముద్దు పేరు పెట్టారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐసీడీఎస్కు మొదటిసారిగా బడ్జెట్లో నిధులను తగ్గించారు. ఐసీడీఎస్ నిర్వహణకు ఇప్పటి వరకు 90-10 శాతంగా ఉన్న కేంద్ర రాష్ట్ర వాటాలు 60-40 శాతంగా మర్చారు. దీని నిర్వహణను రాష్ట్రాలే చూసుకోవాలని బడ్జెట్లో కోత విధించారు. 4,000 సెంటర్లను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించారు.
నేటికీ మన దేశంలో, రాష్ట్రంలో సగటును ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 34 మంది మృతి చెందుతున్నారు. వీటిని అరికట్టడానికి అదనపు బడ్జెట్ కేటాయింపులు చేసి అదనపు ఆహారాన్ని అందించాలి. కానీ ఇప్పటి వరకు అంగన్వాడీ సెంటర్లకు అందిస్తున్న ఆహారాన్ని కూడా ఇవ్వకుండా వేడి అన్నం స్థానంలో ప్యాకెట్లలో ఆహారాన్ని సరఫరా చేయాలని, 0-3 ఏండ్ల పిల్లలకు అందిస్తున్న టేక్హౌం రేషన్కు బదులుగా నగదు బదిలీని అమలు చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రకటన చేశారు. మొదటి దశలో దీనిని దేశంలోని 300 జిల్లాల్లో అమలు చేయాలని దశల వారీగా మిగిలిన అన్ని జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు. అంగన్వాడీ సెంటర్లకు ఆహార సరఫరాను పెప్సీకోలా, పతంజలి వంటి సంస్థలకు అప్పగించే కుట్రలు పన్నుతున్నారు.
ఇప్పటి వరకు 400-800 జనాభా పరిధిలో మెయిన్ అంగన్వాడీ సెంటర్లు, 150-400 జనాభా ఉన్న చోట మినీ అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలకు అంగన్వాడీ సేవలను దూరం చేయడానికి 3211 మెమోను తీసుకొచ్చి 3 సెంటర్లు కలిపి ఒక సెంటర్గా చేశారు. మున్సిపల్ పట్టణాల్లో దాదాపు 200 సెంటర్లను కుదించారు. దాంతో ఆ పరిధిలోని గర్భిణులకు, బాలింతలకు చిన్న పిల్లలకు సెంటర్లు దూరం అవుతున్నాయి. మెర్జి చేయడం వల్ల చిన్న పిల్లలు, బర్భిణులు, బాలింతలకు సెంటర్ దూరం అయింది. దాంతో అక్కడకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది.
అంగన్వాడీల జాబ్ చార్టలో లేని అనేక అదనపు పనులు. బీఎల్ఓ డ్యూటీలు, మరుగుదొడ్లు సర్వే, స్మార్టు పల్స్ సర్వేలు, ఆన్లైన్ బ్యూటీ, రొమ్ము క్యాన్సర్ సర్వే అప్పగించటం వల్ల ప్రీ స్కూల్ దెబ్బతింటుందని అంగన్వాడీలు చెప్తున్నా వినకుండా డిపార్ట్మెంట్కు సంబంధం లేని ఎంఆర్ఓలు, ఎండీఓలు మెమోలు ఇచ్చి బెదిరిస్తూ పనులు చేయిస్తున్నారు.
ఐసీడీఎస్ బడ్జెట్ తగ్గించడం వల్ల అంగన్వాడీలకు వేతనాలు టీఏ బిల్లులు, సెంటర్ అద్దెలు, నెలల తరబడి ఇవ్వడం లేదు. 63 రూపాయల ఇంక్రిమెంట్ను కట్ చేశారు. లబ్దిదారులకు ట్రాన్స్పోర్టు చార్జీలను రోజుకు కేవలం 3 పైసలుగా నిర్ణయించారు. అవి కూడా 15 నెలలుగా ఇవ్వటం లేదు. కొన్ని ప్రాంతాల్లో సెంటర్కు సరుకులు తెచ్చుకోడానికి 1000 నుండి 1500 రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. వర్కర్లే వడ్డీకి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి సెంటర్లను నడుపుతున్నారు. ఇన్ని ఇబ్బందులతో సెంటర్లు నడుపుతున్నా కొంత మంది అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులు పెరిగాయి. పుండు మీద కారం చల్లినట్లు రాజకీయ నాయకులకు నచ్చకపోతే అంగన్వాడీలను ఇళ్ళకు పంపిస్తున్నారు. కొంత మంది అంగన్వాడీలను మానసికంగా వేధిస్తున్నారు. అందుకే వీరంతా తమ సమస్యలపై ఏకమై నవంబర్ 9,10,11 తేదీలలో ఢిల్లీలో మహా ధర్నా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు.
డిమాండ్స్
- నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి.
- ఐసీడీఎస్ను సంస్థాగతం చేయాలి.
- మిక్స్డ్ ఫుడ్ ప్యాకెట్ సరఫరా, నగదు బదిలీని రద్దు చేయాలి.
- అంగన్వాడీ సెంటర్లను మెరుగుపరచడానికి అదనపు పనులు కేటాయించకూడదు.
- కేంద్రాల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
- సెంటర్లకు నాణ్యమైన ఫీడింగ్ సరఫరా చేయాలి.
- ఖాళీగా ఉన్నహెల్పర్లు, సూపర్వైజ్ పోస్టులను భర్తీ చేయాలి.
- పెండింగ్ వేతనాలు, సెంటర్ అద్దెలు, ఇతర బిల్లులు వెంటనే చెల్లించాలి.
- కనీస వేతనం 18 వేలు చేయాలి.
Authorization