కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల్లోవున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వేగం పెరిగింది. ఇన్సూరెన్స్ రంగంలో ఫార్మా రంగంలో ఎఫ్డీఐల వల్ల మందుల ధరలు భారీగా పెరిగాయి. చిల్లర వ్యాపారాన్ని బహుళజాతి సంస్థలకు ఎఫ్డీఐల ద్వారా ధారాదత్తం చేసింది. దీనిపై ఆధారపడ్డ 5కోట్ల మంది ఉపాధికి తీవ్ర హాని కల్గుతున్నది. దేశంలో పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయ సంక్షోభం కూడా తీవ్రమవుతున్నది. రైతాంగం పండిస్తున్న పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించడంలో (ఎంఎస్పి) కూడా బీజేపీ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ఉపాధి హామీ పథకాన్ని నీరుకారుస్తున్నది. కూలీలకు పని దినాలు తగ్గిపోతున్నాయి. వలసలు పెరుగుతున్నాయి. ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు పోతున్నాయి. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు చెయ్యాలి. అందుకు అఖిల భారత స్థాయిలో కార్మిక లోకం నవంబర్ 9,10,11 ''పార్లమెంటు మహా పడావ్'' కు పిలుపునిచ్చింది.
అచ్ఛేదిన్, మేక్ ఇన్ ఇండియా, ఏటా 2 కోట్ల ఉద్యోగాల వంటి నినాదాలతో 2014 ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన వాగ్ధానాలను వమ్ము చేసింది. గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, టెలికాం, రక్షణ, ఫార్మా, రిటైల్ వ్యాపారంలో 100% ఎఫ్డిఐలకు అనుమతిచ్చింది. అతికీలకమైన ఆయుధాలు, సబ్మెరైన్లు, ఎయిర్ క్రాఫ్ట్ల కోసం విదేశాలపై ఆధారపడటం దేశ సార్వభౌమత్వానికి దేశ భద్రతకు ప్రమాదం. బిఎస్ఎన్ఎల్లో కీలక భాగాలైన 65వేల సెల్టవర్లను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నది.
కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి యాజమాన్యాలకు ఊడిగం చేయాలని చూస్తున్నది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో 50లక్షల మందికి ఉపాధి పోయింది. దీనికి తోడు జీఎస్టీని తెచ్చి ప్రజలందరిపై పన్నుల భారాన్ని మోపింది. సమాన పనికి సమాన వేతనం, సమాన సౌకర్యాలు అనే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన రాజ్యాంగ బద్దమైన తీర్పును సైతం నిరాకరిస్తున్నది. ప్రజోపయోగ సర్వీసుల అన్ని విభాగాలు, ఆరోగ్య, విద్యా, రవాణా, భారత రైల్వేలు, ద్రవ్య సంస్థల సేవలు, విద్యుత్, మంచినీరు లాంటి సంస్థలను ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నది.
ఐక్యంగా తిప్పికొట్టాల్సిందే
రక్షణ రంగ ఉత్పత్తులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, అన్ని రకాల రవాణా సంస్థలు, ఆయిల్, ఖనిజాలు, పోర్టు Ê డాక్ (ఓడరేవులు), విద్యుత్ రంగాలతో సహా కీలకమైన వ్యూహాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రైవేటుపరం చేస్తున్నది. కేంద్ర ఎన్.డి.ఎ ప్రభుత్వం పార్లమెంట్లో తనకున్న మెజారిటీని ఉపయోగించి ఏక పక్షంగా చట్టాల సవరణ చేస్తున్నది. ఈ విధానాలను ప్రతిఘటించకపోతే దేశ ఆర్థిక స్వావలంబన, సార్వబౌమత్యం ప్రమాదంలో పడతాయి. అందుకే దేశ కార్మిక వర్గం ఐక్య ఉద్యమం ద్వారా ఈ విధానాలను తిప్పికొట్టాలి.
సమానవేతన ఊసేలేదు
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రంలో కార్మికవర్గం నేడు తీవ్రకష్టాలు పడుతున్నది. టిఎస్ ఐపాస్ పేరిట పెట్టుబడిదారులకు ప్రభుత్వ భూములు కారుచౌకగా కట్టబెడుతున్నది. రాయితీలు కల్పిస్తున్నది. లక్షలాది కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచకుండా కాలం గడుపుతున్నది. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల జీవో.14అమలులో ఘోరంగా విఫలమైంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో16 హైకోర్టులో వీగిపోయాక రాష్ట్ర సర్కార్ చేతులు దులుపేసుకుంది. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు అమలు ఊసేలేదు.
ఉద్యమాలపై ఉక్కుపాదం
రైతాంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసినందున వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హరితహారం పేరుతో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులతో ప్రభుత్వం దాడులు చేయిస్తున్నది. గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో విష జ్వరాలతో పేదలు, మృత్యు వాత పడుతున్నారు. కేజీ టూ పీజీ విద్య నినాదాన్ని గాలికొదిలేసింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీకి మద్దతు ఇచ్చి మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. మూసివేసిన పరిశ్రమలను తెరిపించటంలో విఫలమైంది. కాలపరిమితి ముగిసిన కనీస వేతనాల జీవోలను సవరించలేదు. ఉద్యమాలు, సమ్మెలపై ఉక్కుపాదం మోపుతున్నది. ఇందిరాపార్కు ధర్నా చౌక్ను సైతం ఎత్తివేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నది. ఈ నేపథ్యంలో 2017 నవంబర్ 9,10,11 తేదీలలో ఢిల్లీలో జరుగుతున్న 3 రోజుల మహాధర్నాకు మన రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో కార్మికులు పయనం కాబోతున్నారు.
డిమాండ్లు
- నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, అదుపులో పెట్టాలి. పీడీఎస్ ను పరిరక్షించాలి.
- కనీస వేతనం నెలకు రూ.18వేలుగా నిర్ణయించాలి.
- కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలి.
- సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
- అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి.
- కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
- కార్మిక చట్టాల సవరణను ఆపాలి, ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.
- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకాన్ని ఆపాలి.
- రక్షణ, రైల్వే, బ్యాంక్, ఇన్సూరెన్స్, ఫార్మా, రిటైల్, టెలికాం రంగాలలో ఎఫ్డీఐలను అనుమతించరాదు.
- రోడ్ ట్రాన్స్పోర్టు, విద్యుత్ చట్టసవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలి.
- పీఎఫ్, ఇయస్ఐ, బోనస్ చట్టాలను విధిగా అమలు చేసి, అందరికీ పెన్షన్ గ్యారంటీగా ఇవ్వాలి.
- 45 రోజుల్లోపు కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
Authorization