ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోపక్క పనులు తగ్గాయి. ఫలితంగా ఆదాయం తగ్గటం వల్ల రెక్కాడితేగాని డొక్కాడని కార్మికులు అర్ధాకలితో బతుకీడుస్తున్నారు. రోజు రోజుకీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. ఒకపక్క కార్మికుల రక్తాన్ని రుచి మరిగిన పెట్టుబడిదారులు కోట్లు సంపాదిస్తున్నారు. కానీ కార్మికులు మాత్రం పనులు తగ్గిపోవడం, కొన్ని ప్రాంతాలలో పూర్తిగా ఉపాధి కోల్పోవటం, సకాలంలో కూలి రేట్లు పెంచకపోవటం వంటి కారణాలతో దుర్భర స్థితిలో బతుకుతున్నారు. ఇలాంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న వారిలో బేవరేజస్ హమాలి కార్మికులు కూడా ఉన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే వచ్చే కూలితో, రోజు గడవక అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆ కార్మికుల గురించి నేటి 'కొలువు'లో చదువుదాం..
తెెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17 గోడౌన్లలో 1000 మంది హమాలీ కార్మికులు పనిచేస్తున్నారు. గోడౌన్ల ద్వారా జరుగుతున్న పని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సైంజ్ రూపంలో 25 శాతం ఆదాయం లభిస్తుంది. దేశ స్థూలజాతీయోత్పత్తిలో 60 శాతం అసంఘటిత రంగ కార్మికుల నుండే ఆదాయం వస్తున్నది. ఇంత ఆదాయానికి కారణమైన హమాలీ కార్మికుల సంక్షేమాన్ని మాత్రం ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయి.
ఎన్నో ప్రమాదాలు
బేవరేజస్ హమాలీలు రోజుకు 13-14 గంటల పని చేస్తున్నారు. పండుగలు, ఆదివారాలలో సైతం పని చేసి ప్రభుత్వ ఖజాన నింపుతున్నారు. ఈ కార్మికులు గాజు సీసాలతో కూడిన బాక్స్లు మోయడంతో, కొన్ని సందర్భాలలో బీర్ బాటిల్స్ పలిగి తీవ్రగాయాలు అవుతాయి. కొందరికి గాజు పెంకులు తగిలి కండ్లు పోయిన సంఘటనలు కూడా జరిగాయి. మరికొందరు వికలాంగులుగా మారినవారు ఉన్నారు. పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగి, కార్మికులు చచ్చినా పట్టించుకునే దిక్కులేదు. ఇలాంటి ఎన్నో ప్రమాదాల కారణంగా రెండుపదుల వయసు నిండకముందే నడుములు విరిగి మంచాలకే అతుక్కుని జీవచ్ఛవాలుగా మిగిలిన వారికి నష్టపరిహారం ఇచ్చేవారు లేరు.
తోటి కార్మికులే దిక్కు
ఎంత పెద్ద ప్రమాదానికి గురైనా హమాలీ కార్మికులను ప్రభుత్వాలు గానీ, యాజమాన్యాలుగానీ పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగినపుడు ప్రస్తుతం వైద్య ఖర్చుల నిమిత్తం రెండు నుండి మూడు వందల రూపాయల వరకు ఇచ్చి వదిలించుకుంటున్నారు. దాంతో దిక్కూ మొక్కూ లేని ఆ కుటుంబాలకు తోటి కార్మికులే చందాలు వేసుకొని సహయం చేస్తున్నారు. ఓవైపు వయసు మీదపడి పని చేయలేని స్థితిలో ఉన్న చాలామంది కార్మికులకు ఎలాంటి ఆదారం లేదు. మరోవైపు ప్రభుత్వాలు వీరి శ్రమ ద్వారా వేల కోట్ల రూపాయాలు పొందుతూ, వీరి సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల అసమర్ధతను ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు చట్ట విరుద్దమైన చర్యలకు పాల్పడుతున్నారు.
హక్కులను హరిస్తున్నారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన సౌకర్యాలు, ఉద్యోగభద్రత కల్పించమని అడిగిన వారికి లాఠీÄ దెబ్బలు, నిర్భందాలు రుచి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అధికారులు, పాలకుల నిర్లక్ష్య వైఖరి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాలే. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మూడన్నరేండ్ల కిందట అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పాత విధానాలనే కొనసాగిస్తున్నది. నిజం చెప్పాలంటే అంతకంటే దారుణంగా కార్మికుల పట్ల వ్యవహరిస్తున్నది. నియంతల్లా కార్మిక హక్కులను కాలరాస్తున్నారు. అసంఘటితరంగ కార్మికులకు, హమాలీలకు సమగ్ర కార్మికశాసనం, సంక్షేమం, భద్రత చట్టాలను తీసుకువస్తామని ప్రకటించిన పాలకులు వాటిని అమలుచేయడం లేదు. పైగా ఉన్న చట్టాలను పెట్టుబడిదార్లకు, వ్యాపారులకు అనుకూలంగా మారుస్తున్నారు. కార్మికవర్గానికి ప్రాణప్రదమైన యూనియన్ పెట్టుకొనే హక్కు, సమ్మె చేసే హక్కుల వంటి ప్రాధమిక హక్కులు హరించడానికి సిద్దపడుతున్నారు.
పోరాటమే మార్గం
ఇప్పటికైనా హమాలీ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. యాజమాన్యాల నిరంకుశ చర్యలను నిరోధించి కార్మికులకు భద్రత కల్పించాలి. బేవరేజస్ కార్పొరేషన్ ప్రారంభించిన నాటి నుండి యూనియన్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపోలలో యూనియన్లు ఏర్పాటు చేసి సమస్యలపై కృషి చేస్తున్నారు. హమాలీలను సంఘటితపరచి ఉద్యమం బలపర్చటం, రేట్ల పెంపుదలకు పోరాటం, టెండర్ల విధానం రద్దు చేయాలని, పోటీ కార్మికులు రాకుండా రక్షించుకోటం, సంస్థ కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందించాలని పోరాడుతున్నారు. ఈ కాలంలో చట్టబద్ద హక్కులు, పనిభద్రత, వేతనాలు, రెగ్యులరైజేషన్, రెండు సంవత్సరాలకు ఒక్కసారి రేట్లు పెంచాలని ప్రదర్శనలు, ధర్నాలు, పోరాటలు కొనసాగించారు అనేక సంఘాలతో కలిసి ఐక్యంగాను అనేక పోరాటాలు నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటారు.
డిమాండ్స్
- హమాలీలకు వెల్ఫేర్బోర్డును ఏర్పాటు చేయాలి.
- పనిగంటలు, పనిభద్రత, గుర్తింపు కార్డులు, కనీసవేతనాలు, పీఎఫ్.,ఇ.ఎస్.ఐ వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించాలి.
- ఇఎస్ఐ, చట్టం ప్రకారం బీమా హాస్పిటల్ కార్డులు ఇవ్వాలి.
- బేవరేజస్ హమాలీ కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.
- ప్రమాదంలో మృతి చెందిన వారికి 10 లక్షలు, సాధారణ మృతికి లక్ష ఆర్థిక సహాయం అందించాలి.
- పని స్థలాల్లో హమాలీలకు మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి.
- హమాలీలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి.
- ఉపాధిని కుదించే చర్యలకు పూనుకోరాదు.
Authorization