ఉపాధి, ఉద్యోగమే ఇప్పుడు చాలామందికి జీవన భద్రత. కానీ మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ చదువుకున్న వారిలో నూటికి 80 శాతం మందికి అలాంటి భద్రత లేదు. ఎందుకంటే చాలామందికి వారు చేయగలిగే రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ఆకాంక్షతోపాటు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వంటి నినాదాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. స్వరాష్ట్రంలో తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించారు. కానీ స్వరాష్ట్రంలో మూడున్నరేండ్ల పాలన తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పులూ రాలేదు.
ఉద్యోగ ప్రకటనల హడావుడి మొదలైంది. 25వేల ఉద్యోగాలు భర్తీచేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ప్రకటన ఊరటనిస్తోంది. అదే సందర్భంలో చదువుకోని వారు, పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నవారు తమ పరిస్థితి ఏమటని ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై పట్నాలకు వలసబాట పడ్తున్నారు. దీంతో పట్టణాల్లోని అసంఘటిత రంగంలో యువత సంఖ్య పెరుగుతోంది.
ఎదురు చూసీ చూసీ
హైదరాబాద్లోని కోఠి, ఆబిడ్స్, సికింద్రాబాద్, నాంపల్లి ఏరియాలల్లో బ్యాగులు, టోపీలు, హోమ్నీడ్స్ లాంటివి అమ్ముకునే వాళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు మెకానిక్ షెడ్డుల్లో, మటన్ షాపుల్లో, కిరాణ కొట్టుల్లో పనిచేసేవారు ఎక్కువగా కనిపిస్తుంటారు. వీరిలో ఎక్కువమంది 16 నుంచీ 30 సంవత్సరాలలోపు వాళ్లే. వీళ్లల్లో చదువుకున్నవారు కూడా ఉంటున్నారు. ఆర్థిక స్థోమత లేక మధ్యలో చదువు మానేసినవాళ్లు, అసలు చదువుకునే పరిస్థితులే లేని వాళ్లూ ఉంటున్నారు. కోఠిలో బ్యాగులకొట్టు పెట్టుకున్న సాయిలు, ఆరిఫ్లు. ఇలాంటి వాళ్లు హైద్రాబాద్లోనే కాదు, మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్ వంటి జిల్లా కేంద్రాల్లోనూ ఉంటున్నారు. వీరిలో చాలామంది సంవత్సరాల తరబడిగా మంచి ఉద్యోగం కోసం వెతికీ, వెతికీ ఏదోఒక పనిలో స్థిరపడిపోతున్నారు. అందులో వచ్చిన ఆదాయం కేవలం పూట గడిచేందుకు మాత్రమే సరిపోతోంది. కొందరికి ప్రయివేటు రంగంలో నెలకు 3 నుంచీ 10 వేల వరకు వేతనం గల ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అవి జీవించడానికి ఏమాత్రం సరిపోవట్లేదు. తక్కువ వేతనంగల కుటుంబాలు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో, ఆనారోగ్యంతో, కుటుంబ తగాదాలతో కాలం వెళ్లదీస్తున్నాయి.
ఇంత చదువు చదివీ..!
మరోవైపు చదువుకున్న నిరుద్యోగులకూ ఇలాంటి పరిస్థితే ఎదురౌతోంది. ప్రయివేటు రంగంలో పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత ఉండట్లేదు. ఇక ఉద్యోగ వేటలో ఉన్నవారికైతే ఎన్నో సమస్యలు. ''నాన్నకు పనికి చేతకావట్లేదు. నేను డిగ్రీ సెకండియర్ చదువుకున్నాను. ఇంకా చదువుకునే పరిస్థితి లేదు. పోనీ కూలో... నాలో చేసుకుందామంటే, ఇంత చదివీ ఆ పని చేస్తావా? అని నలుగురూ అంటారు. మూడు నెలలుగా ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని వెతుకుతున్నా కానీ ఇంతవరకేదీ లేదు'' అంటున్నాడు సురేష్. ఇలా ఎంతోమంది ఉద్యోగ వేటలో ఉన్నారు. కాని ఉద్యోగం రాక ఆవేదనకు, నిరాశకు లోనవుతున్నారు.
సమస్య వెంటాడుతోంది
''డిగ్రీ ఫస్టియర్ చదువు మానేశాను. ఓ మొబైల్ సేల్స్ విభాగంలో కొన్నాళ్లు ఉద్యోగం చేశాను. ఎనిమిది నెలల క్రితం తీసేశారు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాను. నెలకు 20 వేలు సంపాదించే ఉద్యోగం ఉంటే తప్ప నన్ను పెండ్లి చేసుకోనని ప్రేమించిన అమ్మాయి షరతు పెట్టింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నా బాధ మీకు అర్థం కాదు'' అని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రవీణ్. నిరుద్యోగ సమస్య ఒక వ్యక్తి జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో, ఎలా వేధిస్తుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలా రాష్ట్రంలోని ఎందరినో నిరుద్యోగ సమస్య నీడలా వెంటాడుతోంది. చదువూ, అర్హతలతో నిమిత్తం లేకుండా అందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఓ ప్రణాళిక రూపొందించి అమలు పరిచినప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని కార్మిక, ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
భర్తీకి నోచుకోని ఖాళీలు
ప్రభుత్వ లెక్కలు, ఇచ్చిన హామీల ప్రకారం చూసుకున్నా గత ఐదేండ్ల నుంచీ ఆర్థిక శాఖ ఆమోదానికి నోచుకోక వాయిదా పడుతూ వస్తున్న పోస్టుల సంఖ్యే సుమారు 19,059 ఉంది. ఇక కీలక శాఖల్లో ఏర్పడిన ఖాళీలనూ, విస్తరించిన సేవలను గమనిస్తే పెద్దమొత్తంలో ఖాళీలు ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న అరకొర సమాచారం ప్రకారం భర్తీకి నోచుకోని పోస్టులే 19 వేలపైన ఉన్నాయి. ఇవన్నీ కేవలం ఆర్థికశాఖ అనుమతికోసం వేచియున్నవి మాత్రమే. వాస్తవంగా చూస్తే ఆయా ప్రభుత్వ శాఖల్లో ఎక్కువమొత్తంలో ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ భర్తీ చేసినంత మాత్రానా నిరుద్యోగ సమస్య తగ్గదు. కానీ ప్రభుత్వ ప్రధాన శాఖల్లోనే ఖాళీలు భర్తీ చేయలేని ప్రభుత్వం నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తుందని ఎలా నమ్మగలమనేదే సమస్య.
కార్పొరేట్ రంగానికి దాసోహం
ఇంకా ఎన్నాళ్లీ నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాలి? పరిష్కారం లేదా? పాలకులు తల్చుకుంటే ఇది పరిష్కారం దొరకని ప్రశ్నే కాదు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కావలసిన వనరులున్నాయి. కాకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రతీ రంగంలో ఉపాధి మార్గాలు అన్వేషించవచ్చు. కొత్తగా కొలువులు సృష్టించవచ్చు. కానీ మన ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ప్రపంచబ్యాంకు షరతులూ, ప్రయివేటీకరణ విధానాలు తప్ప నిరుద్యోగ సమస్యపైన దృష్టి పెట్టట్లేదు. తాము ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతూ ప్రభుత్వ అనుమతి తీసుకొని ప్రయివేట్, కార్పొరేట్ సంస్థలు విస్తరిస్తున్నాయి. లక్షల్లో, కోట్లల్లో ప్రభుత్వ రాయతీలూ పొందుతున్నాయి. కానీ అవి తమ లాభాలూ, ప్రయోజనాలూ తప్ప నిరుద్యోగ సమస్యకోసం ప్రత్యేకించి చేస్తున్నదేమీ లేదు. అదే ప్రభుత్వ రంగంలో అవకాశాలు కల్పిస్తే జీవనభద్రతా, ఉద్యోగ భద్రతా రెండూ ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ పనిచేయకుండా ప్రయివేటు, కార్పొరేట్ రంగానికి దాసోహం అంటోంది.
చివరగా...
ఇప్పటికైనా ప్రయివేటీకరణ విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలి. ప్రస్తుతం ఉన్న ప్రయివేటు సంస్థలన్నీ ప్రభుత్వ షరతులకు లోబడి ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధికి, ఉద్యోగానికి గ్యారంటీ ఇచ్చే ఒప్పందంతో నడ్చుకోవాలి. ప్రభుత్వ రంగాలన్నింటిలోనూ ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నం చేయాలి. ఉద్యోగానికి కావల్సిన చదువూ, అర్హతా, నైపుణ్యం కల్పించే విధంగా ప్రభుత్వ విద్యావిధానాన్ని మార్చాలి. చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ గ్యారంటీ ఇవ్వాలి.
Authorization