ఆశా వర్కర్లు... 106 రోజులు నిర్విరామంగా సమ్మె చేసి చరిత్ర సృష్టించారు. శ్రమకు తగ్గ ఫలితం కోసం తమ గళాన్ని విప్పారు. అరిచి అరిచి వారి గొంతులు మూగబోయాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి. ముఖంలోని చిరునవ్వులు దూరమయ్యాయి. కానీ ఫలితం లేదు. పోరాటం కాదు అడుక్కుంటే ఇస్తామన్నారు. సమ్మె విరమిస్తే ఆలోచిస్తామన్నారు. చివరకు ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించారు. దాంతో వేతనాలు వస్తాయని నమ్మారు. అదే ఆశతో ఇన్ని నెలలు ఎదురు చూశారు. ఏడాది దాటినా ఆశాల ఆశ తీరలేదు. చేస్తున్న శ్రమకు ఫలితం లేదు. పారితోషికాలతోనే బతుకీడుస్తున్న వారి బతుకు కష్టాల గురించి మరొక్కసారి నేటి కొలువులో...
రాష్ట్రంలో మాతాశిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో 1995లో కమ్యూనిటీ, 2006లో ఆశా వర్కర్స్ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో సుమారు 26వేల మంది ఆశా వర్కర్లు 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. నెలకు 10 రోజులు మాత్రమే ఎన్ఆర్హెచ్ఎం స్కీం కింద పని చేస్తున్నారు. మిగతా 20 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న 108 ఆరోగ్యశ్రీ, హరిత హారం, గ్రామజ్యోతి పథకాలు, డెంగ్యూ, మలేరియా, జనాభా లెక్కలు, సర్వేలు, విద్యార్థుల బరువు చూడడం తదితర పనులన్నీ ఆశా వర్కర్లు చేస్తున్నారు.
ఎంత శ్రమించినా వీరికి ఇచ్చే పారితోషికం మాత్రం 1000 జనాభాకు మించి ఇవ్వడం లేదు. వారంలో రెండు రోజులు ఇమ్యూనైజేషన్, మిగతా రోజుల్లో డెలివరీ కేసులు, ఫ్యామిలీ ప్లానింగ్ కేసులు, 104, ఎఫ్డిహెచ్ఎస్ వాహనాలకు పేషంట్లను తీసుకురావటం, లెప్రసి, టీబీ పేషంట్లకు మందుల పంపిణీలో సహకరించడం, హెచ్ఐవి బాధితులకు సహకరించటం, పిఎస్సి మీటింగ్స్కు హాజరుకావటం ఇన్ని రకాల పనులు చేయడానికి నెల మొత్తం పనిచేసినా ఒక్క ఆషా వర్కర్కు రూ.400ల నుండి రూ.2000/-లోపు పారితోషికాలు మాత్రమే పొందుతున్నారు. వచ్చే పారితోషికాలు సరిపోక ఆశా వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు.
కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న పారితోషికాలకు అదనంగా మన పక్కనే ఉన్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆశా వర్కర్కు గౌరవ వేతనాన్ని చెల్లిస్తున్నారు. హర్యానా, కేరళ తదితర రాష్ట్రాల్లో వేతనాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషా వర్కర్స్కి పారితోషికాలు కాకుండా కనీస వేతనాలు ఇవ్వాలని, కార్మికులుగా గుర్తించాలని రెండవ ఎఎన్ఎం నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. పిహెచ్సిలు, ఎంఆర్ఓ ఆఫీసులు, డిఎంహెచ్ఓ ఆఫీసులకు ఛలో హైదరాబాద్ సందర్భంగా అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వినతి పత్రాలు ఇచ్చారు. ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాశారు. అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడంతో గత ఏడాది సెప్టెంబర్ 2నుండి రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది ఆశావర్కర్లు నిరవధిక సమ్మెలో కూర్చున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారినా ఆశా వర్కర్ల జీవితాల్లో మార్పు రాలేదు. సంవత్సరాల తరబడి వేతనాలు నిర్ణయించకుండా మోసం చేస్తున్నారు. కనీస మానవత్వం లేకుండా, సానుభూతి చూపకుండా మొండికేసింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు అధికార బలాన్నంత ఉపయోగించి సమ్మెను విచ్చిన్నం చేయాలని చూశారు. నిర్భందం, నిషేదాజ్ఞలు, లాఠీ ఛార్జీలు, జైళ్ళు... చివరకు మగ పోలీసులతోనే దాష్టికాలకు పాల్పడ్డారు. సమ్మె కాలంలో ఆశాలను ప్రభుత్వం ఎన్ని విధాలుగా హింసించినా వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. చరిత్రలో మర్చిపోలేనటువంటి సమ్మె చేశారు. సుదీర్ఘ కాలం సాగిన వారి సమ్మె చివరకు ప్రజల మద్దతును, సానుభూతిని పొందింది. అయినా ప్రభుత్వం మాత్రం సమ్మె విరమిస్తేనే సమస్యలు పరిష్కరిస్తామని మొండికేసి కూర్చుంది. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య శాఖ మంత్రి రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 16న హైదరాబాద్లో వేలాది మంది ఆశాలతో సభ నిర్వహించి సమ్మెను వాయిదా వేసుకున్నారు.
సుదీర్ఘకాలం సమ్మె కొనసాగుతున్న దశలో సామాన్య ప్రజల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. అయినా ప్రభుత్వం భాద్యతారహితంగా ప్రవర్తించింది. సమ్మెను పరిష్కరించడానికి ముందుకు రాలేదు. స్వయంగా ముఖ్యమంత్రే పట్టుదలకు పోయారు. సమ్మె విరమిస్తేనే పరిష్కరిస్తామని ప్రకటించారు. సమ్మెకాలంలో అనేకసార్లు ఆశాలు ప్రభుత్వ ఉన్నతాధికారులను, ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి విజ్జప్తి చేశారు. తెలంగాణలోని అన్ని పార్టీల, స్థానిక సంస్థల ప్రజాప్రతినిదులను కలిశారు. ప్రతిపక్ష పార్టీలయిన సిపిఎం, సిపిఐ(ఎం), కాంగ్రెస్, తెలుగుదేశం, ఇతర వామపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. సమ్మెను బలపర్చాయి. సిపిఎం పార్టీ విరాళాలు సేకరించి 18 లక్షలు సంఘీభావ నిధిని అందించింది. ఉద్యోగ కార్మిక సంఘాలు అండగా నిలిచాయి. అయినా ప్రభుత్వ వైఖరిలో మార్పురాలేదు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 16న హైదరాబాద్లో బహిరంగ సభ జరుగుతున్న దశలో ఆశాల నాయకత్వంతో ఆరోగ్య శాఖా మంత్రి మాట్లాడారు. ఈ పోరాటం ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రిని కలిశారు. ''తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తాం, సమ్మె విరమించండి'' అని మంత్రి చెప్పారు. నిర్థిష్టంగా హామీ రాని స్థితిలో సమ్మెను కొనసాగించటానికి సిద్దంగా ఉన్న ఆశాలకు రాష్ట్ర పరిస్థ్ణితులను దృష్టిలో పెట్టుకుని రిటైర్ట్ హైకోర్టు జస్టీస్ డి.చంద్రకుమార్, మాజీ ఎమ్మేల్సే డా|| కె.నాగేశ్వరావు, సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐఎం(ఎల్) పార్టీలు ప్రజాసంఘాల నాయకులు సమ్మెను వాయిదా వేసుకుని ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా చెప్పడంతో ఆశా వర్కర్లు అంగీకరించి సమ్మెను వాయిదా వేసుకున్నారు. సమ్మె సందర్భంగా రాష్ట్ర ఉన్నతాధికారులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రప్రభుత్వం స్పందిస్తూ ఆశా వర్కర్లకు వేతనాలు, ఇతర సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయిన ప్రభుత్వం అమలు చేయలేదు.
ప్రభుత్వం రానున్న 2,3 మాసాల్లో నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో తిరిగిపోరాటం కొనసాగించాలని ఆశా వర్కర్స్ యూనియన్ ప్రకటించింది.106 రోజులు విశ్రాంతి లేకుండా పోరాడినా, ఐదు నెలలు గడిచినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో మార్చి 18న ఇందిరాపార్క్ వద్ద సభ నిర్వహించి ప్రభుత్వానికి మరోసారి తమ సమస్యలు గర్తుచేశారు. చివరకు సమ్మె విరమించి విధుల్లో చేరారు. సమ్మె తర్వాత గతంలో ఇస్తున్న పారితోషికాన్ని కూడా తగ్గించారు. పారితోషికానికి మించిన పనులు, అధిక సర్వేలు చేయించడమే కాకుండా ఆశాలపై ఎఎన్ఎమ్ సూపర్వైజర్స్ ఒత్తిడిలు ఎక్కువయ్యాయి. సూపర్వైజర్స్ వేధింపులు భరించలేక ఆషా వర్కర్లు ఆత్మహత్యలు సైతం పాల్పడ్డారు.
ఏడాది గడిచిపోయినా నేటి వరకు వేతనాలు, ఇతర సౌకర్యాలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. సమ్మెకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలు, కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు మరొక్కసారు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
Authorization