దేశ వ్యాప్తంగా వివిధ స్కీంలలో పనిచేస్తున్న అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆషా ఎన్హెచ్ఎం సర్వశిక్షా అభియాన్ వంటి స్కీంలలో పనిచేసే వారందరినీ కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం18 వేల రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్ఐ సౌకర్యం, 45వ ఇండియన్ లేబర్ సిఫారస్లను అమలు చేయాలని, స్కీంలకు సరిపడ బడ్జెట్ కేటాయించాలని ఈ పథకాలను ప్రైవేటీకరించవద్దని, మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ 2018 జనవరి 17న రాష్ట్రంలోని స్కీమ్ వర్కర్లంతా సమ్మెకు సిద్ధమవుతున్న సందర్భంగా...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆషా, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) చైల్డ్ లేబర్ ప్రాజెక్టు ఎంజిఎన్ఆర్ఇజిఎ, కస్తూరీబాగాంధీ, సర్వశిక్షా అభియాన్ రోజ్గార్ సేవకులు, స్వచ్ఛ కార్మికులు, ఐకెపి విఓఏ, మెప్మా, ఆర్.పిలు, సెర్ప్ తదితర పథకాలు అమలౌవుతున్నాయి. ఈ స్కీంలలో పనిచేసే వర్కర్లు సుమారు కోటి మంది ఉన్నారు. అత్యధికులు అట్టడుగు వర్గాలకు చెందిన ఈ మహిళలు సమాజ సేవలో అంకిత భావంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వ స్కీంలను ప్రజల దగ్గరకు పట్టుదలగా తీసుకుపోవడంలో కృషి చేస్తున్నారు. అయినా వీరి శ్రమకి తగ్గ ఫలితం లేదు. కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. కార్మిక చట్టాలు, సౌకర్యాలు అమలు కావడంలేదు.
తాత్కాలిక పథకాలుగా...
గ్రామీణ ప్రాంతాలలో ఉండే అట్టడుగు వర్గాలైన ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు అందే ఈ కొద్దిపాటి సేవలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. పేదలకు అందుతున్న ప్రాధమిక హక్కులను తిరస్కరిస్తున్నది. 70 సంవత్సరాల స్వాతంత్రం తరువాత కూడా జనాభాలో అధిక సంఖ్యలో ఆహారం, ఆరోగ్యం, విద్యకు తగిన ప్రాధాన్యం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రాధమిక సేవలకు శాశ్వతమైన చర్యలు చేపట్టటం లేదు. మానవాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న స్కీంల సేవలను పరిమితం చేయాలని చూస్తున్నారు. కొద్ది రోజులు మాత్రమే సేవలు అందించే తాత్కాలిక పథకాలుగా వీటిని మార్చాలనే ప్రయత్నం చేస్తున్నది. దీనికి పైలట్, మిషన్మోడ్ అని ముద్దు ముద్దు పేర్లను ప్రభుత్వం పెడుతుంది. ఈ నిర్ణయాలు అమలు జరిగితే రానున్న కాలంలో స్కీంల సేవలు పేదలకు దూరం అవుతాయి.
పథకాల ప్రభావం ప్రాముఖ్యం
తాజా నివేదిక ప్రకారం ఆకలిలో 119 దేశాలలో మన దేశం 100వ స్థానంలో ఉంది. భారత ప్రభుత్వం సామాజిక, ఆర్థిక గణంకాల ప్రకారం భారతదేశంలో 75 శాతం గ్రామీణ కుంటుంబాలకు నెలకు రూ.5000/-ల కన్నా తక్కువ ఆదాయం లభిస్తున్నది. భారత దేశంలో సగం మంది పిల్లలు తక్కువ బరువుతో పోషకాహార లోపంతో ఉన్నారు. 79 శాతం భారత మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. డబ్ల్యుఎల్డి మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 2.5 కోట్ల జననాలు జరుగుతుండగా 1.75 కోట్ల మంది పిల్లలు మాత్రమే వారి మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అంటే ఒక ఏడాదికి ముందే 75 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు.
ప్రభుత్వాల ద్వంద్వ నీతి
మాతా, శిశు మరణాలను తగ్గిచటం. పౌష్టికాహార లోపాన్ని, స్కూల్స్ డ్రాపౌట్స్ను తగ్గించటం, ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచటంలో స్కీం వర్కర్ల కృషి ఎనలేనిదని అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు సుప్రీం కోర్టు కూడా తెలియజేసింది. ఈ పథకాలను ప్రభుత్వ శాఖలుగా గుర్తిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించింది. స్థూల జాతీయ ఉత్పత్తిలో 5 శాతం బడ్జెట్ కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. 45వ ఇండియన్ లేబర్ కాన్ఫెరెన్స్ స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని, స్కీంలను ప్రైవేటీకరణ చేయకూడదని సిఫారసు చేసింది. కానీ గత కాంగ్రెస్, ప్రస్తుత బీజెపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు ఈ అంశాలను ఏనాడు పరిగణలోకి తీసుకోలేదు.
మన రాష్ట్ర పూర్తి మద్దతు
బీజెపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. స్కీములకు బడ్జెట్ పెంచకపోగా ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం పెట్టాలని నిర్ణయించారు. స్కీం వర్కర్ల వేతనాలు, స్కీంలకు పెట్టే పోషకాహారం, మెడిసిన్ తదితర రోజువారీ ఖర్చులను రానున్న కాలంలో రాష్ట్రం భరించాలని కేంద్రం చెప్తున్నది. ఇప్పుడు అమలులో ఉన్నవి ముఖ్యమైన పథకాలు కావనీ సాధారణ పథకాలని నీతి ఆయోగ్ చెబుతోంది. అవసరమైనప్పుడు వీటిని నిలిపివేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. స్కీమ్లలో నగదు బదిలీ అమలు చెయ్యాలని కేంద్రం నిర్ణయించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోగా పైగా నీతి ఆయోగ్ కమిటీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి మద్దతు ప్రకటించారు.
వాగ్దానాలు విస్మరించారు
కేంద్రం ఒక పక్క స్కీంలకు బడ్జెట్లో కోతలు పెడుతూ మరొక ప్రక్క స్వచ్ఛంధ సంస్థలైన అక్షయపాత్ర, మన్న ఇస్కాన్ సంస్థలకు అప్పగిస్తున్నది. ఈ స్కీంలలో ఉన్న వారితో రాష్ట్ర ప్రభుత్వం చాకిరీ చేయించుకుంటూ అదనపు వేతనం ఇవ్వడానికి నిరాకరిస్తుంది. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారు. పని భారం పెంచుతున్నారు. ఆశా వర్కర్ల కిచ్చిన వాగ్ధానాలను సర్కార్ విస్మరించింది. అచ్చేదిన్ పేరుతో నరేంద్రమోదీ, బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు అన్యాయం చేస్తున్నాయి. దళిత, గిరిజన, బలహీన తరగతులకు చెందిన లబ్ధిదారులకు కూడా ద్రోహం తలపెడుతున్నాయి.
సంఘటితంగా పోరాడుదాం
పెట్టుబడి దార్లకు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రాయితీలను చెల్లిస్తూ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్కీం వర్కర్లందరూ ఐక్యంగా ఉద్యమించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలువంచేందుకు 2018 జనవరి 17న జరిగే స్కీం వర్కర్ల సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
Authorization