జనవరి 17... దేశ కార్మికులందరూ ఓ తాటిపైకి రానున్నారు. స్కీం వర్కర్లందరూ తమ కనీస హక్కుల సాధనకై గొంతు విప్పనున్నారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధాలను ప్రశ్నించనున్నారు. కనీస వేతనం ఇవ్వాలనీ, పని చేసే ప్రదేశాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలనీ, ఇఎస్ఐ, పీఎఫ్ వంటి కనీస హక్కులు కావాలని సమ్మె రూపంలో దేశ వ్యాప్తంగా వివిధ స్కీంల పరిధిలో పని చేస్తున్న కార్మికులందరూ ఏకం కానున్నారు. ఈ సందర్భంగా ఏడాదిలో వందరోజులు పని తప్పని సరిగా కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ప్రత్యేక కథనం ఈ వారం కొలువులో...
తింటానికి తిండిలేదు. చేయటానికి పని లేదు. ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో ఎంతో మంది పేదలు తమ కుటుంబం గడవక ఉన్న ఊరిని, కన్న వారిని వదిలి వలసలు వెళ్ళేవారు. ఇతర ప్రాంతాల్లో దొరికిన పని చేసి తమ శ్రమను అమ్ముకొని పొట్టనింపుకునేవారు. ఇలాంటి వారికి ఉపాధి హామీ పథకం కాస్త తిండి పెడుతుంది. కొద్ది చదువు వున్న వారికి ఈ పథకం ద్వారా చిన్న చిన్న కొలువులు దొరికాయి. అయితే ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఉద్యోగులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ ప్రభుత్వాలు వీరితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పేరుతో వీరి శ్రమను దోచుకుంటున్నారు.
నిధులు తగ్గిస్తున్నారు
గ్రామాల్లో పని లేక, తిండిగడక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వామపక్షాలు పోరాడి పేదల కడుపు నింపడం కోసం ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చాయి. ఈ చట్టం ఫలితంగా కొద్దో గొప్పో గ్రామాలల్లో ప్రజలకు పని దొరికి కడుపు నింపుకోగలుగుతున్నారు. కాని కేంద్రంలో అధికారంలో వున్న బిజేపీ ప్రభుత్వం పేదలకు ఇంత తిండిపెడుతున్న ఉపాధి హామీ చట్టానికి ఏడాదికేడాది నిధులను తగ్గిస్తుంది. దాంతో ఆ కార్మికులకు రావాల్సిన కూలి డబ్బులు చేతికి అందడం లేదు. పైగా ఎన్నో సంవత్సరాల నుండి కార్మికులుగా పనిచేస్తున్న ఉపాధి హమీ కార్మికులు తమని పర్మినెంట్ చేయమని కోరుతున్నారు. కాని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
కార్మికుల సమస్యలు పట్టవు
ఈ కార్మికులు చాలీ చాలని జీతాలతో బతుకుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం గుడులకోసం, రకరకాల భవనాల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుంది. కాని తిండి దొరకని ఉపాధి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. అందుకే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ కార్మికులు గతంలో కూడా ఎన్నోసార్లు సమ్మె బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం ఆపమంటున్నారు. ఉపాధి కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు వీరి పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ కార్మికులు కోరుతున్నారు.
గతంలో ఎన్నో పోరాటాలు
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం కోసం 2015 జూన్ 17న కమిషనర్, గ్రామీణాభివృద్ది శాఖతో చర్చలు జరిపారు. కాని అవి విఫలమయ్యాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వారు జూన్ పద్దెనిమిది నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించారు. 26.06.2015వ తేదీన మండల, డివిజన్ స్థాయిలో ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 27.06.2015వ తేదీన డివిజన్ స్థాయిల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు. 28.06.2015వ తేదీన స్థానిక ఎమ్మేల్యేలు, ఎంపిలకు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందించారు. 29.06.2015వ తేదీన తమ సమస్యల పరిష్కరించని ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్లు శుభ్రం చేశారు. 30.06.2015వ తేదీన డివిజన్ స్థాయిలో బిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం వీరి సమస్యలపై సానుకూలంగా స్పందించలేదు. పైగా ఇప్పటికీ ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే చూస్తున్నారు. అందుకే జనవరి 17న జరిగే ఈ సమ్మెలో వీరూ భాగస్వాములు కానున్నారు.
కార్మికుల డిమాండ్స్
- గ్రామీణాభివృద్ది శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రాష్ట్ర ప్రభుత్వం వారు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దికరణ కొరకై విడుదల చేసిన జి.ఓ సంఖ్య-22 మార్గదర్శకాలకనుగుణంగా రెగ్యులరైజేషన్ చేయాలి.
- ఉద్యోగులను నియమించుకున్నప్పుడు లేని (2006 సంవత్సరంలో) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉద్యోగుల వేధింపు, డెవలప్ మెంట్ సొసైటిని (యస్.ఆర్.డి.యస్) రద్దుపరచాలి.
- ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరినీ 'గ్రామీణాభివృద్ది శాఖ ఉద్యోగులుగా'' గుర్తించాలి.
- ఉద్యోగుల కేడర్ ప్రకారం పేస్కేలు రివిజన్ చేసి (కేడర్ అసమానతలను సరిచేసి) ఉద్యోగుల ప్రస్తుత జీత భత్యాలను 43శాతం వరకు పెంచాలి.
- నిబంధనలకు విరుద్ధంగా అమలు చేస్తున్న ప్రస్తుత ఉద్యోగుల భవిష్యనిధిని(ఇ.పి.ఎఫ్) ఉద్యోగుల నియామకపు తేదీ నుండి అందజేయాలి.
- హెల్త్ కార్డులను(ముందస్తు ఉచిత వైద్యం అందేలా) అందజేయాలి.
- తెలంగాణ రాష్ట్ర ఇంక్రిమెంట్ను అందజేయాలి.
- కాంట్రాక్టు ఉద్యోగుల కొరకై గతంలో హెచ్ఆర్ పాలసీ ద్వారా విడుదల చేసిన కెరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీని ఉద్యోగుల ప్రమోషన్ల కొరకై తక్షణమే అమలు పరచాలి.
- గతంలో అమలు పరచి ప్రస్తుతం తొలగించిన అలవెన్సులు(వాహన అలవెన్సు, సెల్ఫోను అలవెన్సు) కొనసాగించాలి.
- మరణించిన కాంట్రాక్టు ఉద్యోగుల విషయమై అర్హతలను బట్టి వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు జరపాలి.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో వరంగల్, మహబూబ్నగర్ ఉద్యోగులకు తొలగించిన 2009 సంవత్సరపు ఇంక్రిమెంట్ను అందజేయాలి.
- గ్రామపంచాయితీ కార్యాలయంలో (ఫీల్డ్ అసిస్టెంట్) యఫ్.ఏల విధుల నిర్వహణ కొరకై కనీస వసతులు కల్పించాలి.
- యఫ్.ఏలకు సంబంధించి జి.ఓ 491ని రద్దుపరుస్తూ, సీనియర్ మేట్లుగా మారిన వారిని తిరిగి యఫ్.ఏలుగా నియమించాలి.
- కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ, నగర పంచాయితీలో తొలగించిన యఫ్, ఏలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి.
- యఫ్.ఏ లకు మండల పరిధిలో బదిలీ అవకాశాలు కల్పించాలి.
- యఫ్.ఏలను కూడా కాంట్రాక్టు ఉద్యోగులుగా (యఫ్.టి.ఈ) గుర్తించాలి. యఫ్.ఏలకు రవాణా భత్యం వెయ్యి రూపాయలకు అందజేయాలి.
Authorization