ఎండ, వాన, చలి, రాత్రి, పగలు తేడా లేకుండా వారు పనిచేస్తారు. ఎక్కడ విద్యుత్ సమస్య వచ్చినా అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారమయ్యే వరకు శ్రమిస్తారు. ఇంత చేసినా వారి జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. వారే విద్యుత్ శాఖలో ఏ సమస్య వచ్చినా నిరంతరం శ్రమించే కాంట్రాక్ట్ కార్మికులు. వర్ణనాతీతమైన వీరి కష్టాల గురించి ఈవారం కొలువులో...
ఓ వైపు ఉద్యోగ భద్రత లేదు. మరో వైపు జీవితానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడాల్సి వస్తుందో తెలియదు. దీనికి తోడు పని భారం. తగినంత సిబ్బంది లేకపోవడంతో పది మంది చేసే పని ఒక్కరే చేయాల్సి వస్తోంది. దీంతో నిత్యం 8 గంటలు కాదు, దాదాపు 12 గంటల పాటు తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఇది వారి శారీరక ఆరోగ్యంపైనే కాదు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో విద్యుత్ స్తంభాలపై పనిచేస్తున్న సమయంలో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాల బారిన పడి మృతి చెందాల్సి వస్తోంది.
చట్టాన్ని తుంగలో తొక్కి...
ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. పెరిగిన సర్వీసులకనుగుణంగా పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య పెంచటం లేదు. కాంట్రాక్ట్ అనే ముద్దు పేరు పెట్టి అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడి చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అనే చట్టాన్ని తుంగలో తొక్కి ప్రమాదకరమైన పనులను కాంట్రాక్ట్ కార్మికులతో చేయిస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వాలని సుఫ్రీకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
సీనియార్టీ ప్రకారం పర్మినెంట్ చేయాలి
ఇదేమి అన్యాయమని అడిగితే వైర్లు చుట్టడమే కదా అని ప్రశ్నిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అంటే జె.ఎల్.ఎంకి ఇస్తున్న జీతం కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలి. బేగంబజార్ డివిజన్ పరిధిలో తొమ్మిది డిస్ట్రిబ్యూషన్లు ఉన్నాయి. వీటిలో 230 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ఎప్పుడో ఒకప్పుడు పర్మినెంట్ అవుతామనే నమ్మకంతో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. సంస్థకు వీరు చేస్తున్న సేవలను గుర్తించి చదువు, వయసుతో సంబంధం లేకుండా సీనియార్టీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సిబ్బందిపై అదనపు భారం
ప్రభుత్వానికి ఆదాయం తప్ప మరేమీ కన్పించడం లేదు. సెక్షన్లో ఎన్ని సర్వీసులుండాలి? ఎన్ని వున్నాయి? ఎంత మంది ఓ అండ్ ఎం ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులున్నారనే దానితో సంబంధం లేకుండా పని భారం మోపుతున్నారు. పెరిగిన కరెంటు బిల్లులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలను మన కార్మికులు పోయి బిల్లులు కట్టండని వత్తిడి చేస్తే చాలు వెంటనే దాడులకు పాల్పడుతున్నారు.
ప్రైవేటీకరణకు దారి
ఏపీఎస్ఐబీ ముక్కలైన తరువాత కాంట్రాక్టీకరణ బాగా పెరిగిపోయింది. రోజు రోజుకి శాశ్వత ఉద్యోగులు, ఇంజనీర్ల సంఖ్య తగ్గుతుంది. ఎన్.ఎం.ఆర్, క్యాజువల్ అనే పదాలే కన్పించటం లేదు. ప్రపంచ బ్యాంక్ షరతుల్లో భాగంగా ఏపీఎస్ఐబీని ముక్కలు చేసింది ఆనాటి టీటీడీ ప్రభుత్వం. అదే తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తోంది.మరో పక్క జన్కోను నాశనం చేసి మర్చెంటు పవర్ ప్లాంటులకు అనుమతినిస్తుంది.
సమ్మెకు దిగారు
రాష్ట్రం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు గడుస్తున్నా పట్టించుకోలేదు. అందుకే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరు టీఇటీయుఎఫ్(టిటఫ్)గా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం కోసం కరెంటోళ్ళ సమ్మె ప్రారంభించారు. సమ్మె నోటీసులు యాజమాన్యానికి ఇచ్చారు. ఆ సందర్భంగా విద్యుత్ శాఖా మంత్రి టిఎఫ్ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఈ చర్చలలో ప్రధానంగా 10 డిమాండ్లకు అగ్రిమెంట్ జరిగింది.
ప్రధానమైన డిమాండ్లు
కాంట్రాక్ట్ లేబర్కు డైరెక్ట్ పేమెంట్ మూడు నెలల్లో కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా జీతాలు అందజేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆర్డర్స్ ఇవ్వలేదు. అదే విధంగా మిగతా డిమాండ్స్ అయిన ఇపీఎఫ్ను జీపిఎఫ్గా మార్చాలి, అదనపు పోస్టులు, సీజెఎల్ఎం రెగ్యులరైజేషన్ జాయినింగ్ తేదీ నుండి ఇవ్వాలి. ప్రతి సెక్షన్ రెండు లైన్ ఇన్షఎ్పక్టర్ పోస్టులు, కాంట్రాక్ట్ లేబర్కు 10 లక్షలు ఇన్సూరెన్స్ మొదలైన డిమాండ్స్ అన్నీ పెడింగ్లో ఉన్నాయి. రాతపూర్వక హామీ ఇచ్చిన యాజమాన్యం తర్వాత కాలంలో చర్చలకు పిలిచి చేతులెత్తేసింది.
అందుకే విద్యుత్ కార్మికులు 2016లో సమ్మెకు దిగి 33 రోజుల సమయమిచ్చారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. దాంతో నిరవధిక సమ్మె కూడా చేశారు. ప్రభుత్వం, యాజమాన్యంతో పలు దఫాలుగా టీటఫ్ చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేదు. దాని కారణంగా విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులలో అసహనం పెరిగింది. రెండున్నరేండ్లుగా ఇచ్చిన మాటకు కట్టుబడకుండా యాజమాన్యం మొండి వైఖరి అవలంభించింది. దీని కారణంగానే టిటఫ్ రాష్ట్ర నాయకత్వం భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకో బోతోంది.
టిటఫ్ పిలుపులో భాగంగా జరిగే ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రజలు విద్యుత్ కార్మికులన్యాయమైన సమస్యలు పరిష్కారం కొరకు జరపబోయే ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని వారు కోరుకుంటున్నారు.
పోరాటం చేస్తేనే ఫలితం
''పోరాటం ద్వారానే మా సమస్యలు పరిష్కరించుకోవాలి. డైరెక్ట్ వేతనమివ్వాలని మేము డిమాండ్ చేస్తుంటే సొసైటీలు పెట్టుకోమంటున్నారు మేనేజ్మెంటువారు. ఎందుకంటే ఆ సొసైటీలకు డైరెక్టుగా బట్వాడా చేస్తారట. సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటే దానికేమి చెప్తారో? ''టిఎఫ్'' ఏర్పడిన 2015 సెప్టెంబర్ నుంచి నేటి వరకు కబుర్లతో కాలక్షేపం చేసిన యాజమాన్యం చివరికి ఏం చేసుకుంటారో చేసుకోండని మొరాయిస్తే మేము కీలకమైన విద్యుత్ రంగంలో పనిచేస్తూ ఊరుకుంటామా? చేతులు కట్టుకుని కూర్చుంటాం అనుకుంటే పొరపాటు. మమ్మల్ని నమ్మించి మోసం చేసినోళ్ళకు కరెంటు షాకిస్తాం. అన్ని రంగాల కార్మికులతో మొండిగా ప్రవర్తించే రాష్ట్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పగలిగేది మేమే. వెంటనే మా సమస్యల్ని యాజమాన్యం, ప్రభుత్వం పరిష్కారం చేయాలి. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, ఇపీఎఫ్ నుంచి జీపిఎఫ్, సమాన పనికి సమాన వేతనం, పరిమితిలేని వైద్య సదుపాయము ఇవ్వాలని, డైరెక్ట్ పేమెంట్, అదనపు పోస్టుల మంజూరు వంటి సమస్యల పరిష్కారం కోసం భవష్యత్లో పోరాటాలకు సిద్ధమైతుం'' అంటున్నాడు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక నాయకుడు మున్నాలాల్
సమాన పనికి సమాన వేతనం ఏది
విద్యుత్ కార్మికుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ''గత పద్దెనిమిదేండ్ల నుంచి నేను కాంట్రాక్ట్ వర్కర్గా పని చేస్తున్నాను. లైన్మెన్ పని మొదలుకొని రీడింగ్ చూడడం, ఇండ్లల్లో ఏ సమస్య వచ్చినా వెళ్ళాలి. ఇంజనీర్స్ చేయాల్సిన పని కూడా మాతోనే చేయిస్తారు. వాస్తవానికి చిన్న పరిశ్రమలు, హాస్పిటల్స్ రీడింగ్ ఇంజనీర్స్ చూడాలి. కానీ వాటికి కూడా మమ్మల్నే పంపిస్తారు. అయితే జీతాలు మాత్రం మాకు తక్కువగా ఇస్తారు. ప్రమాదకరమైన పనులకు కూడా పంపిస్తారు. పని చేయడానికి మాకు ఇబ్బంది ఏమీ లేదు. అయితే సమాన పనికి సమాన వేతనం మేము అడుగుతున్నాము. సుఫ్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే భవిష్యత్లో మేం చేసే పోరాటాలకు ప్రజలందరూ సహకరించాలి'' అంటున్నారు.
దారుణంగా మోసం చేస్తున్నారు
''2005లో సీఐటీయు పాదయాత్ర చేస్తే మాకు ఇఎస్ఐ, పీఎఫ్ అమలయ్యింది. ప్రారంభంలో కాంట్రాక్ట్ కార్మికుల జీతం 600 రూపాయలు. ఇప్పటికీ చాలీ చాలని జీతాలతో బతుకుతున్నాం. అద్దె ఇండ్లల్లో బతుకులీడుస్తున్నాం. ప్రభుత్వం మాతో వెట్టి చాకిరి చేయించుకుంటుంది. రాష్ట్రం రాకముందు మమ్మల్ని పర్మినెంట్ చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు మా గురించి పట్టించుకోవడం లేదు. కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నాడు. విద్యుత్ శాఖలో 25 వేల నుంచి 30 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పర్మినెంట్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ చేయడంలేదు. దాంతో ఆ పని భారం మొత్తం మేమే భరించాల్సి వస్తుంది. ఆర్థికంగా, మానసికంగా మేం నలిగిపోతున్నాం'' అంటూ సుధాకర్ అవేదన చెందుతున్నాడు.
Authorization