ప్రశ్న: నేను 5 సంవత్సరాల నుండి టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను. అయితే నేను బి.ఇడి. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.ఎ. కాకతీయ యూనివర్సిటీ నుండి రెండు ఒకే సంవత్సరంలో పరీక్షలు రాస్తే భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? లేదా? తెలుపగలరు.
- హనుమంతు, ఆదిలాబాద్
జ. రెండూ దూర విద్యాకోర్సులు అయితే ఇబ్బంది లేదు. మీరు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు కనుక మీ నియామకపు అధికారి డి.ఇ.ఓ. నుండి రెండు కోర్సుల పరీక్షలు వ్రాయడానికి అనుమతి (ఎన్ఓసి) తీసుకోవాలి.
ప్రశ్న: నాకు తెలిసిన వ్యక్తి రెవెన్యూ డిపార్టుమెంటులో అటెండర్గా ఉద్యోగం చేసి 2010లో రిటైర్ అయి 2015 ఫిబ్రవరిలో చనిపోయారు ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఒక అబ్బాయి వయసు 22 సంవత్సరాలు. రెండవ అబ్బాయి వయసు 19 సంవత్సరాలు. ఒక అమ్మాయి వయసు 16, ఇంకో అమ్మాయి వయసు 13 సంవత్సరాలు అయితే ఇందులో ఫించన్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? తెలుపగలరు. ఫించను కోసం ఎన్ని రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి తెలుపగలరు.
- రఘు
జ. ఉద్యోగి లేదా పెన్షనరు చనిపోయినప్పుడు కుటుంబ పెన్షన్ భార్యకు మాత్రమే చెల్లిస్తారు. భార్య మరణించిన తదనంతరం పెద్దకుమారునికి 25 సం||ల వయస్సు లేదా ఉద్యోగం లభించే వరకు ఏది ముందైతే అప్పటి వరకు ఆ తర్వాత 2వ కుమారునికి, తర్వాత కుమార్తెకు ఉద్యోగం లేదా వివాహంలలో ఏది ముందైతే అప్పటి వరకు చెల్లిస్తారు. పెన్షనరు మరణించిన అనంతరం కుటుంబ పెన్షన్ కొరకు సంబంధిత ఎస్టిఓ/పెన్షన్ చెల్లింపు కార్యాలయం ద్వారా డిటిఓ/పిఎఓ కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతోపాటు వారసత్వ ధృవీకరణ పత్రం సమర్పించాలి.
పశ్న: వివిధ డిపార్టుమెంటులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం ఉందా? ఉంటే ఏ జి.ఓ. ప్రకారం చేస్తారు తెలుపగలరు.
- శంకర్రావు
జ. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వులు ఏమీలేవు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు తదితర కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. భద్రాచలం శాసన సభ్యులు సున్నం రాజయ్య కూడా ఇటీవల అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకొంటేనే సమస్య సానుకూలంగా పరిష్కారమౌతుంది.
పశ్న: నేను టిటిసి 2015వ సంవత్సరంలో జాయిన్ అయ్యాను. 2014లో అంబేద్కర్ యూనివర్సిటీ నుండి డిగ్రీ చేస్తున్నాను. అయితే రెండు ఒకే సంవత్సరంలో పూర్తి అయితే ఏదైనా ఇబ్బంది వస్తుందా?
- వెంకటయ్య, మెదక్
జ. ఒక రెగ్యులర్కోర్సు, మరొక దూర విద్యా కోర్సు ఒకే విద్యా సంవత్సరంలో చదవటానికి అనుమతించవచ్చని యుజిసి అన్ని యూనివర్సిటీలకు లేఖ నెం. డి.ఓ.నెం.1-6/2007 (సిపిపి-ఱఱ) తేది: 28.12.2012. వ్రాసింది కనుక మీరు డి.ఇడి, డిగ్రీ ఒకే విద్యా సం||లో పూర్తి చేసినందువలన ఇబ్బంది ఉండదు.
- సి.హెచ్. రవి
టీఎస్యుటీఎఫ్ రాష్ట్రనాయకులు
Authorization