ఓ పక్క దేశ ప్రధాని అన్ని రంగాల్లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్టు ఉపన్యాసాల్లో ఊదరగొడుతున్నారు. మరోపక్క తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులను మన ముఖ్యమంత్రి నమ్మించారు. మహిళలంతా నా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు అంటే నమ్మారు. తమ శ్రమకు తగ్గ ఫలితం రాబోతుందని ఎదురు చూశారు. కానీ ఏండ్లు గడుస్తున్నా కనీస వేతనాల ఊసేలేదు. శ్రమకు తగ్గ ఫలితం రాదు. ముఖ్యంగా ఈ కష్టాలు స్కీం వర్కర్లు గత పదిహేనేండ్ల నుంచి ఎదుర్కొంటున్నారు. స్కీం వర్కర్లలో 90 శాతం మంది మహిళా శ్రామికులే. తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఇటీవల వారు దేశవ్యాప్తంగా సమ్మె కూడా చేశారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో మహిళల పట్ల ప్రభుత్వాల వివక్ష, స్కీం వర్కర్ల పట్ల చిన్న చూపు ఏ విధంగా ఉన్నాయో నేటి కొలువులో తెలుసుకుందాం...భారతీయ సమాజంలో అన్ని అసమానతలతో పాటు స్త్రీ పురుషుల మధ్య అసమానత అన్ని వర్గాలలో నెలకొని ఉంది. కుటుంబం మొదలు పార్లమెంటు వరకు ఎక్కడా సమానత్వం కానరాదు. పెరుగుతున్న విద్యా స్పృహ, చైతన్యం మహిళలను సంకెళ్ళు చేధించుకుని అన్ని రంగాల్లో దూసుకుపోయే సమర్థతను కలిగించినా ఇప్పటికి మహిళలకు ద్వారాలు తెరవని రంగాలు చాలానే ఉన్నాయి. ఎవరైనా మహిళలు పట్టుదలగా ఆయా రంగాల్లో ప్రవేశించినా తమ సమర్థతను రుజువు చేసుకోవాలని ప్రయత్నించినా ఈ పురుషాధిక్య సమాజంలో వారికి నిరాశేమిగుల్తున్నది తప్ప ప్రోత్సాహం ఇవ్వడం లేదు. వెట్టిచాకిరి చేయాల్సి పనిలో మాత్రం మహిళలను పెద్ద ఎత్తున నియమిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీం కోర్టు ఆదేశం కూడా అమలుకు నోచుకోని పరిస్థితులు నెలకొని వున్నాయి.
భవన నిర్మాణ రంగంలో పురుషులతోపాటు స్త్రీలు అనేక రకాలైన పనులు చేస్తున్నప్పటికి వేతనాల్లో వ్యత్యాసంతోపాటుగా కొంచెం తేలికైన నైపుణ్యంతో కూడిన తాపి పని, పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఇప్పటికి వంద శాతం మొగవాళ్ళదే. నిజానికి శిక్షణతో ఈ పనులు స్త్రీలు కూడా చేయగలిగేవేనన్నారు.
వ్యవసాయ రంగంలో 55 శాతం పనులు స్త్రీలే చేస్తున్నప్పటికి కలుపులు, నాట్లు, పత్తి నాటడం, పత్తి తీయడం కూరగాయలు కోయడం, ప్యాకింగ్ వంటి పనులు వంచిన నడుం ఎత్తకుండా చేస్తుంటే కొంచెం సులువుగా వుండే యంత్రాలతో చేయగలిగే పనులు ట్రాక్టరుతో దున్నడం, మిషన్స్తో వరికోతలు వంటి పనులు మగవాళ్ళ పనులుగా ముద్రపడి వున్నాయనీ, అత్యంత శ్రమతో కూడిన పనులు ఆడా మగా సమానంగా చేస్తున్నపటికి కూలీ విషయంలో వ్యత్యాసం వుంటుంది.
విద్య, ఐటి, రంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య 37 శాతం మాత్రమే వుండటం, అర్హతలు, పని సమానమైన వేతనాల్లో 27 శాతం తేడా వుందన్నారు. పత్రికా రంగంలో స్త్రీల సంఖ్య నామమాత్రమే. బాంబెలో జర్నలిస్టులపై లైంగికదాడి, తెహల్కా అధిపతి, సహ జర్నలిస్టులపై అసభ్య ప్రవర్తన ఆ రంగంలోని మహిళల పట్ల వివక్షకు పరాకాష్ట. రవాణా రంగంలో, మోటారు వాహనాలు నడపడంలో వృత్తిగా స్వీకరించడంలో మహిళలు వెనకంజ వేయడానికి ఆ రంగాల్లో మహిళల పట్ల వున్న చులకన భావం వివక్షతే కారణం.
గుర్తింపు కార్డులు ఇవ్వాలి
మధ్యాహ్న భోజన కార్మికురాలిగా ఉన్న అంజమ్మ మాట్లాడుతూ 'నేను పదిహేనేండ్ల నుంచి మధాహ్న భోజన పథకం కింద పని చేస్తున్నాను. మా సమస్యలు పరిష్కరించాలని ఎన్నో సార్లు ధర్నాలు చేశాం. ఇప్పుడు బిల్లులు మాత్రం నెలనెల ఇస్తున్నారు. నెలకు నాలుగు గ్యాస్ సిలెండర్లు పడతాయి. గ్యాస్ అయిపోతే మేమే తెచ్చుకోవాలి. గుడ్లు మేమే తెచ్చుకోవాలి. గ్యాస్, గుడ్లు సబ్సిడీలో ఇవ్వాలి. ఎంత ఖర్చు చేస్తే అంత బిల్లులు వస్తాయి. మాకు మిగిలేది ఏమీ లేదు. మేమే కూరగాయలు తెచ్చుకోవాలి, కొయ్యాలి, వండాలి వడ్డించాలి. ఇంత పని చేస్తే నెలకు మాకు ఇచ్చేది వెయ్యి రూపాయలు. కాస్త అన్నం మిగులుతుంది. ఆ అన్నంతో మా కడుపు నింపుకుంటాం. ఇది తప్ప మాకు వేరే దిక్కు లేదు. అంగన్వాడీలు ఎన్నో ఎండ్ల నుంచి పోరాటం చేస్తుంటే ఇప్పుడు జీతాలు పెంచారు. అలాగే మాకూ జీతాలు పెంచి, పింఛన్లు, గుర్తింపు కార్డులు ఇస్తే బాగుంటుంది' అంటూ ఆవేదన చెందింది.
ఫలితం లేదు
''ప్రస్తుతం ఆశా వర్కర్ల పరిస్థితి ఆయోమయంలో ఉంది. అన్ని రోజులు సమ్మె చేసినా ఎటువంటి పలితం లేకుండా పోయింది. ప్రభుత్వం మా సమస్యలపై స్పందించడం లేదు. వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ సర్వే చేయాల్సి వచ్చిన ముందుండేది ఆశా వర్కరే. ఎవరికి ఏ సమస్య వచ్చినా సమయం చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తీరాలి. ఒక్క గర్భిణీ స్త్రీని గుర్తిస్తే 25 రూపాయలు పారితోషికం ఇస్తారు. అదే కేసు లేకపోతే అవి కూడా రావు. ఎంత చాకిరి చేసినా ఫలితం మాత్రం శూన్యం. మహిళల కోసం ఏమోమో చేస్తున్నట్టు ప్రచారాలు మాత్రం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పెంచుతామన్న జీతాలు అమలు చేస్తే సంతోషిస్తాం'' అంటున్నారు ఆశా వర్కర్ నిర్మల.
సమస్యలు ఇంకా పెరిగాయి
''రాష్ట్రం రాకముందు మున్సిపల్ వర్కర్స్ అందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు. మహిళలందరినీ నా తల్లులు, దేవతలు అన్నారు. ఇప్పుడు మమ్మల్ని నిజంగానే ఆ దేవతల మాదిరిగా ప్రాణం లేని రాళ్ళను చేసి నోరు ఎత్తనీయకుండా కూర్చోబెట్టాడు. జీతాల కోసం సమ్మె చేస్తే బెదిరించారు. ఇప్పుడు సూపర్వైజర్లు ఎదైనా ధర్న చేస్తే ఒప్పుకోవడం లేదు. మాతో పూటపూటకు వేలిముద్రలు వేయించుకుంటున్నారు. మహిళలన్నాక పని చేసేటప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. డ్యూటీకి వచ్చిన తర్వాత చావు కబురు తెలిసినా వెళ్ళనీయరు. గతంలో సమ్మె చేసినప్పుడు హైదరాబాద్లో పండుగలున్నాయని, కార్పొరేట్ ఎన్నికలు దగ్గర్లోకి వచ్చాయని ఒక్క హైదరాబాద్లోని మున్సిపల్ కార్మికులకు మాత్రమే జీతాలు పెంచారు. అది కూడా దానికి ఎలాంటి జీవో లేదు. జిల్లాల్లో ఎంతో మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ జీతాల గురించి మాత్రం మాట్లాడడం లేదు. డబుల్బెడ్రూం ఇండ్లు అన్నారు. ఉన్నవాటిని కూడా కూల్చి వెళ్ళారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మా సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి'' అంటున్నారు మున్సిపల్ వర్కర్ యాదమ్మ.
Authorization