రెక్కలు ముక్కలు చేసుకోనిదే పూట గడవదు. నాలుగిండ్లల్లో పనులు చేసుకోనిదే ముద్ద నోట్లోకి వెళ్ళదు. అలాంటి వారు నగరంలో ఎందరోవున్నారు. వారికి ఎటువంటి భద్రతా లేదు. నిత్యం నీటిలో నాని చేతులూ, కాళ్ళు పాచిపోతాయి. ఒక్క రోజు విశ్రాంతి తీసుకోవడానికి ఉండదు. అయినా వీరి పనికి గుర్తింపు లేదు. అసలు ఇంటి పనివారంటేనే చిన్న చూపు.
ఒక్క రోజు వీరు పనిలోకి రాకపోతే రోజు గడవదు. చాకిరి ఎంత చేసినా బెదిరింపులు. చాలీ చాలని కూలి. ఎక్కడో ఒక దగ్గర పని వాళ్ళు డిమాండ్ చేస్తే. అది అందరికీ ఆపాదిస్తారు. వారికి ఏం జరిగినా అడిగే దిక్కులేదు. ఒకవేళ ఎదిరిస్తే బెదిరింపులు పెరుగుతాయి. అందుకే మౌనంగా భరిస్తున్నారు. ఇలా ఇండ్లల్లో పనులు చేసుకుంటూ బతుకుతున్నవారు ఈ మహానగరంలో వేలల్లో ఉంటారు.
రాష్ట్ర రాజధానిలో ఇండ్లల్లో పనులు చేసుకుంటూ బతుకున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. వారందరికి ఎలాంటి రక్షణా లేదు. ఒక విధంగా చెప్పాలంటే వీరూ కార్మికులే. అయినా ప్రభుత్వానికి వీరి శ్రమ పట్టదు. అసలు నిజం చెప్పాలంటే చాలా మంది దృష్టిలో వీరసలు మనుషులు కాదు. కేవలం కూలికి పనులు చేసే యంత్రాలు. నిత్యం నీటిలో తడిసే చేపలు. వీరంతా నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలల నుంచి నగరానికి వలస వస్తుంటారు.
గ్రామంలో ఉన్న కాస్త పొలం వానలు లేక పండదు. బోరు వేయించుకునే ఆర్థిక స్థోమత వీరికి ఉండదు. అందుకే పొట్ట చేత పట్టుకొని నగరానికి వలస వస్తున్నారు. ఇక్కడ వారు చేయలిగిన పని రోజువారీ కూలి. మగవారు ఉదయాన్నే అడ్డా మీద నిలబడి దొరికిన పని చేసుకుంటారు. రోజంగా కష్టపడతారు. కానీ ఇంట్లో పైసా ఇవ్వరు. వారి తాగుడిగే వచ్చిన డబ్బు సరిపోతుంది. ఇక కడుపున పుట్టిన బిడ్డలకు, కట్టుకున్న భార్యకు తిండేం పెడతారు. పిల్లలకు చదువులు ఎలా చెప్పిస్తారు.
అలాంటి కుటుంబాల్లోని మహిళలకు తెలిసిన పని నాలుగిండ్లల్లో పని చేసుకోవడం. ఇండ్లల్లో పని చేసి వారు పెట్టిన కాస్త తిండితో ముందు పిల్లల కడుపు నింపుతారు. వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుతారు. పెద్దలు కాస్త పట్టించుకుంటే పిల్లలు పోతే సర్కారు బడికి పోతారు. లేదంటే అది కూడా లేదు. ఈ మహానగరంలో ఇంటి అద్దె, రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు, తిండి, బట్ట, వైద్యం... ఇలా ప్రతీది భరించరాని ఖర్చే. ఇక వారికి వచ్చే పైసలు ఎలా సరిపోతాయి. అందుకే ప్రభుత్వాన్ని తమ శ్రమను గుర్తించమని కోరుకుంటున్నారు.
ఎన్నో ఏండ్ల నుంచి ఇంట్లో పనిచేస్తున్నా యజమానులు తమ ఇంట్లో ఏదైనా పోతే మొదట అనుమానించేది ఇంట్లో పని చేసేవారినే. అలా అనేక రకాల వేధింపులకు వారిని గురిచేస్తున్నారు. ఇంటి చాకిరి చేయించుకొని తమకు ఇష్టమున్నంత ఇస్తారు. ఇష్టమైతే చేయమంటారు, లేదంటే పొమ్మంటారు. పూట గడవని వీరు ఏం మాట్లాడతారు. వారు ఇచ్చింది తీసుకొని శ్రమించడం తప్ప.
ఇలా ఇండ్లల్లో పనులు చేసుకుంటూ బతుకుతూ తమ కష్టాలను గుండెల్లో దాచుకున్న వీరికి ఐద్వా అండగా నిలిచినది. 'స్నేహ' పేరుతో ఇంటిపనివారల సంఘాన్ని ఏర్పాటు చేసినది. వారి సమస్యలపై పోరాడుతున్నది. అప్పటి నుంచి వారు కూడా తమ మౌనాన్ని విడిచి తమ సమస్యలపై ఐద్వాతో సహకారంతో పోరాడుతున్నారు.
ఇంటి పనివారి డిమాండ్స్
1. గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
2. యాజమాన్యాల నుంచి వేధింపులు నివారించాలని,
3. డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించాలి.
4. కార్మికులుగా గుర్తించాలి.
5. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి.
ఒక్క రోజు సెలవు పెట్టినా...
గత ఇరవై ఏండ్లుగ ఇండ్లల్లో పనులు చేసుకుంటూ బతుకుతున్న రాజమ్మ మాట్లాడుతూ 'నేను గత ఇరవై ఏండ్ల నుంచి ఈ పనే చేసుకుంటున్నా. ఇప్పుడు నా వయసు 55. ఇంటికి నెలకు 60 రూపాయలు ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. ఇప్పుడు నాలుగు ఇండ్లల్లో పని చేస్తున్నా. మేము ఉండే ఇంటికి అద్దె రెండు వేలు కట్టాలి. బతుకుదామని వస్తే మాతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. మా కష్టానికి తగ్గ ఫలితం లేదు. రోజూ నీళ్ళల్లో పనిచేసీ చేతులు పాచిపోయాయి. పని చేస్తుంటే మంటలు పుడతాయి. అయినా పని చేసుకోవల్సిందే. ఒక్క రోజు సెలవు పెట్టినా జీతం కత్తిరించుకుంటారు. మాకు ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
మా గురించి పట్టించుకోరు
మహబూబ్నగర్ నుంచి వలస వచ్చిన రజియా మాట్లాడుతూ 'నా భర్త పిల్లలు పుట్టాక నన్ను మోసం చేసి వేరే ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక నేను పిల్లల్ని బతికించుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. నాకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దామ్మాయికి పెండ్లి చేశాను. ఆమె బతుకేం సక్కగా లేదు. ఆమెను సరిగా చదివించలేకపోయాను. అందుకే రెండో అమ్మాయినైనా బాగా చదివించాలని కష్టపడుతున్నాను. ఇప్పుడు ఆమె ఇంటర్ చదువుతున్నది. నాకు చదువు రాదు. ఇంట్లో పని తప్ప వేరే పని రాదు. అందుకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇండ్లల్లో పనులు చేసుకుంటూ బతుకుతున్నా. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తానంటే అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నాకు రాలేదు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగ్గంటల వరకు పనులు చేసుకుంటూ ఉంటా. ఎంత కష్టపడినా కుటుంబం గడవటమే కష్టంగా మారింది. మా గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అప్పుడే స్నేహ ఇంటి పనివారి సంఘం వారు కలిశారు. ఇప్పుడు అందులో నేను కూడా పని చేస్తున్నా. సంఘంగా పోరాటం చేస్తున్నాం' అంటున్నది.
మేమే దొంగలం
'మమ్మల్ని పని చేసే దగ్గర బూతులు తిడతారు. చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి అనేక మాటలు అంటారు. మమ్మల్ని అసలు మనుషులుగానే చూడరు. చులకన చేసి మాట్లాడతారు. నేను గతంలో పని చేసిన ఇంట్లో డబ్బులు పోయాయి. అవి నేనే తీశానని పోలీస్ట్స్టేషన్లో కేసుపెట్టారు. అప్పుడు స్నేహ ఇంటి పని వారు వచ్చి నాకు సాయం చేశారు. స్టేషన్లో మాట్లాడి నన్ను విడిపించారు. మా బతుకులు ఇలాంటివి. పోలీస్స్టేషన్లో నేను దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సంఘంగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చని అప్పుడే తెలిసింది. ధైర్యం వచ్చింది. నా భర్త ఆటో నడుపుతాడు. మాకు ఓ బిడ్డ, కొడుకు కున్నారు. ఇద్దరూ సర్కారు బళ్ళోనే చదువుకుంటున్నారు' అంటుంది స్వప్న.
ఒంటరి పోరాటం
సరిత మాట్లాడుతూ... 'నా కష్టాలు మీకెలా చెప్పనమ్మా.15 ఏండ్ల నుంచి ఇండ్లల్లో పనులు చేసుకొని బతుకుతున్నాను. నా భర్త అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అప్పటి నుంచి ఆయన ఏ పనీ చేయలేడు. మాకు ముగ్గురు పిల్లలు. పెద్దాబ్బాయి కూడా పనికి పోతాడు. కానీ డబ్బులు ఇంట్లో సరిగా ఇవ్వడు. చిన్న వయసులోనే వాడు తాగుడుకి అలవాటు పడ్డాడు. మావారు మంచిగా ఉన్నప్పుడు నాకు ఈ కష్టాలు లేవు. నేను నాలుగు ఇండ్లల్లో పని చేస్తూ పిల్లల్ని పెంచుతున్నాను. మా పెద్దబిడ్డ బాగా చదువుతుంది. దానికి చదువుకోవాలని ఉంది. కానీ చదివించాలంటే చాలా ఖర్చు. అందుకే వచ్చే ఏడాది మాన్పించాలనుకుంటున్నాను' అంటుంది.
Authorization