మహిళలకు ఆరోగ్యం, పిల్లలకు పౌష్టిక ఆహారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను నడుపుతున్నాయి. వీటి నిర్వహణ మొత్తం మహిళలదే. అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించిన తర్వాత మాతా శిశు మరణాల రేటు తగ్గిందని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. గొప్పలు చెప్పకోవడమే కాదు ఇది అక్షర సత్యం. ఎవ్వరూ కాదనలేని నిజం. అయితే అందరి ఆరోగ్యం గురించి, పసిపిల్లల పౌష్టికాహారం గురించి పట్టించుకునే మినీ వర్కర్ల కష్టాలు మాత్రం మన సర్కారుకు పట్టడం లేదు. అందుకే కొలువు వారిని పలకరించింది.
తెలంగాణ రాష్ట్రంలో 152 ఐసిడిఎస్ ప్రాజెక్టులున్నాయి. 32882 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇవి కేవలం గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఉన్న గర్భిణీలు, బాలింతలు, మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు వయసు పిల్లలకు మాత్రమే సేవలు అందించేవి. 2008 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ సేవలను ఎస్.సి, ఎస్.టి, వెనకబడిన ప్రాంతాలలో వారికి కూడా అందించాలనే ఉద్దేశంతో అదనంగా మరో 4201 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించింది. ఇది చాలా మంచి విషయం. దీని వల్ల సేవలు మరింత ఎక్కువ మంది పొందగలుగుతారు. ఈ కేంద్రాలు ప్రారంభించిన కొత్తలో వారికి మెయిన్ అంగన్వాడీ వర్కర్ ద్వారానే గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఆహార పంపిణీ జరిగేది. ఈ ఆహారాన్ని తీసుకెళ్ళడానికి తల్లులను ఇల్లిల్లూ తిరిగి పిలవడానికి ఉమ్మడి రాష్ట్ర్ర ప్రభుత్వం ఒక మినీ వర్కర్ను నియమించింది. అయితే ప్రస్తుతం ఈ మినీ వర్కర్లు అనేక సమస్యలతో అల్లాడుతున్నారు.
అన్నీ ఒక్కరే చూసుకోవాలి
గతంలో అంగన్వాడీ ప్రధాన, మినీ కేంద్రాలలో ఆహారాన్ని (బిహెచ్ఆర్) రేషన్ ద్వారా పంచేవారు. 2012 నవంబర్ 9న గత ప్రభుత్వం ఇందిరమ్మ అమృత హస్తం పేరుతో నడిపితే ప్రస్తుతం దాన్నే ఆరోగ్యలక్ష్మి పథకం పేరుతో అమలు చేస్తున్నారు ఈ పథకం అమలైన కేంద్రాలలో ఆహారాన్ని వండి తల్లులకు, పిల్లలకు, గర్భిణీలకు అందించాలనే నిబంధన పెట్టారు. ప్రధాన కేంద్రాలలో అంగన్వాడీ హెల్పరు వంటచేస్తే, వర్కర్లు ఫ్రీస్కూలు నిర్వహిస్తారు. కానీ మినీ అంగన్వాడీ కేంద్రాలలో అలాకాదు. మినీ వర్కరు ఒక్కరే ఉండడంతో తానే ఇల్లిల్లూ తిరిగి పిల్లలను కేంద్రానికి పిలుచుకు రావాలి. తానే అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రం చేసి వంటచేసి పెట్టాలి. బయట నుండి వంటకు నీళ్ళు తెచ్చుకోవడం, తర్వాత వంట పాత్రలను శుభ్రం చేయడం అన్నీ మినీ వర్కరే చేయాలి.
వర్కర్లే దోషులు
అమృతహస్తం పథకం అమలైనప్పటి నుండి రికార్డు నిర్వహణ పని కూడా పెరిగింది. ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో వర్కర్ నిర్వహించే రిజిస్టర్లు, మినీ అంగన్వాడీ రిజిస్టర్లు రాయాలి. సర్వేలు చేయాలి. ఫ్రీ స్కూలు నిర్వహించాలి. రెండు రకాల పనులు అంటే హెల్పర్, వర్కర్కు సంబంధించిన రెండు పనులు మినీ వర్కరే చేయాలి.దీంతో ఫ్రీ స్కూలు సరిగా నిర్వహించలేకపోతున్నారు. పై అధికారులు కేంద్రానికి తనిఖీలకు వచ్చినపుడు పిల్లలకు ఏమీ నేర్పడం లేదని బెదిరిస్తారు. గోడ చార్టులు లేవనీ, పాటలు పాడించడం లేదని, మెయిన్ అంగన్వాడీ కేంద్రంలా సిలబస్ పిల్లలకు నేర్పడం లేదని మినీ వర్కర్స్ను నోటికి వచ్చినట్లు మాటలంటారు. వీటన్నింటికీ మినీ వర్కర్నే దోషిగా చూస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా మినీ అంగన్వాడీ కేంద్రాలకు ఒక హెల్పర్ను నియమించాలి. ఒకవేళ చదువుకోని వర్కర్ ఉంటే అక్కడ మినీ వర్కర్ను నియమించాలి. అప్పుడే ఫ్రీ స్కూలు నిర్వహణ సక్రమంగా నిర్వహించబడుతుంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
వసతులు కరువు
మినీ అంగన్వాడీ కేంద్రాలు ఎక్కువగా లంబాడీ తండాలలో, ఎస్.సి ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడ కేంద్రాలను నిర్వహించడానికి అన్ని రకాల సదుపాయాలతో కూడిన ఇల్లు అద్దెకు దొరకదు. దొరికినా చిన్నపాటి ఇల్లుకు సరైన వసతులుండవు. వంటకు నీటి సౌకర్యం ఉండదు. దూరంగా ఉన్న పొలాలలో ఎక్కడ వ్యవసాయ బోరు ఉంటే అక్కడి నుండి నీటిని తెచ్చుకోవాలి. అదికూడా కరెంటు ఉంటేనే. లేకపోతే ఎంతదూరం నుంచైనా నీటిని తెచ్చుకోవలసిందే. పిల్లలకు చిన్న గదులలో సరైన స్థలం లేక చెట్లకింద కొన్ని సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఐసిడిఎస్ నుండి అందించే వంట సామాగ్రి బగోనాలు, ప్లేట్లు, గ్లాసులు సరిపోవు. అన్నం, పప్పు, కూర, గుడ్లు, పాలకు ఐదు రకాల వంట పాత్రలు అవసరం. కాని ప్రభుత్వం కేవలం రెండు బగోనాలు చిన్నవి ఇచ్చి వాటితోనే సరిపెట్టుకోమని చెబుతుంది. మినీ వర్కర్ల కుటుంబాల నుండి సామాగ్రిని ప్రభుత్వమే మౌలిక వసతులతో కూడిన మినీ అంగన్వాడీ కేంద్రాలను నిర్మించి ఇవ్వాలి.
నిర్వహించడం ఎలా?
మినీ వర్కర్లే వంట పని ఫ్రీ స్కూలు నిర్వహించడంతో వారికి పని ఒత్తిడి ఎక్కువయింది. ఉదయాన్నే వచ్చి అంగన్వాడీ ఊడ్చుకోవడం, నీళ్ళు తెచ్చుకోవడం, వంట చేయడం, గ్యాస్ లేని చోట కట్టెల పొయ్యి మీదనే వంట చేయవలసి వస్తుంది. ఇల్లిల్లూ తిరిగి పిల్లలను తీసుకొచ్చుకోవాలి. తండాలలో సెంటర్లు అద్దెకు దొరకడం లేదు. దొరికినా చిన్నవిగా ఉంటున్నాయి. అందులోనే ఒక రూంలో పిల్లలకు ఫ్రీ స్కూలు నిర్వహించడం, వంట సామాగ్రి ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్నారు. పై అధికారులు దాంట్లోనే పప్పి హౌస్ కట్టాలని చెబుతున్నారు. ఇరుకుగదిలో పిల్లలు, తల్లులు భోజనాలకు వచ్చి తినడానికే సరిపోదు. ఇక పప్పి హౌస్ నిర్వహించేదెలా?
అన్నీ చూసుకున్న తర్వాతనే
సెక్టార్, ప్రాజెక్టు స్థాయి సమావేశాలకు వెళ్లేరోజున భోజనం వండి పిల్లలకు తల్లులకు తినిపించిన తర్వాతనే వెళ్ళాలి. వంట చేయకపోతే జనాలతో సమస్య, సమావేశాలకు లేటుగా వెళితే అధికారులతో సమస్య. లేటుగా వచ్చావని మీటింగ్ రిజిస్టర్లో సంతకం పెట్టనీయకుండా గైర్హాజరు వేస్తున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా, అత్యవసర పనిమీద వెళ్ళాలన్నా, లేక శుభ కార్యాలకు, చావులకు వెళ్లాలన్నా సెలవులు లేవు. ఎక్కడికి వెళ్ళినా సెంటర్ నిర్వహించిన తర్వాతనే వెళ్లవలసి వస్తుంది. వేసవి కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మే 15 రోజులు సెలవులు కూడా పొందే అవకాశం లేదు. సెలవు రోజులు కూడా సెంటర్లు నిర్వహించవలసి వస్తుంది.
వేధింపులు ఎక్కువే
మినీ అంగన్వాడీ వర్కర్లపై స్థానికంగా రాజకీయ వేధింపులు అధికమయ్యాయి. గతంలో తక్కువ వేతనం చెల్లించినపుడు మినీ వర్కర్గా పని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. వేతనాలు పెరిగిన కొద్దీ కొంతమంది రాజకీయ నాయకులు మినీ వర్కర్లపై పెత్తనం చెలాయిస్తూన్నారు. ఉన్నవారిని తొలగించి కొత్తవారిని నియమించాలని చూస్తున్నారు. ఎన్.టి తండాలలో ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఆగిపోయినా, రాకపోయినా మినీ వర్కరే బాధ్యురాలని చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారులు సెంటర్ విజిట్స్కు వచ్చినపుడు రికార్డులు సరిగా లేకపోయినా, ఏదైనా పొరపాటు జరిగినా మినీ వర్కర్లను బెదిరిస్తున్నారు.
మినీ వర్కర్లకు చెల్లించే వేతనం
మినీ వర్కర్లు ఆయాగా, వర్కర్గా రెండు రకాల పనులను నిర్వహిస్తున్నారు. కాని ప్రభుత్వం వారికి చెల్లించేది. 2200 రూపాయలు మాత్రమే. అంటే హెల్పర్ వేతనం అన్నమాట. పని మాత్రం రెట్టింపు చేయాలి. వారు ఇచ్చే ఆ కొద్ది వేతనానికి ఉదయం నుండి సాయంత్రం వరకు విరామం లేకుండా ద్విపాత్రాభినయం చేయాలి. ఇంతా చేసినా ప్రభుత్వం వారిని వర్కర్గా కూడా గుర్తించడం లేదు.ప్రభుత్వం వీరితో వెట్టిచాకిరి చేయించుకుంటూ అన్యాయం చేస్తుంది. వీరు ప్రాజెక్టు సెక్టార్ మీటింగ్లకు వెళ్ళినపుడు కనీసం టి.ఎ, డి.ఎ కూడా కొన్ని ప్రాజెక్టులలో చెల్లించడం లేదు. కొన్ని ప్రాంతాలలో ఫ్రీ స్కూలు పిల్లలు మెయిన అంగన్వాడీ కేంద్రాల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వం ఇటువంటి కేంద్రాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య లక్ష్మి పథకం నిర్వహిస్తే మెయిన అంగన్వాడీ హెల్పర్ 250 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కాని మినీ వర్కర్కు కొన్ని ప్రాంతాలలో చెల్లించడం లేదు. కేంద్ర ప్రభుత్వం మినీ వర్కర్లకు 750 రూపాయలు వేతనాన్ని పెంచుతూ 2013 జూన్ నెలలో జీవోను జారీ చేసింది. ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి బడ్జెట్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శీతాకాల బడ్జెట్ సమావేశాల్లో వారికి కేంద్రం పెంచిన వేతనాలు-ఏరియర్స్తో సహా చెల్లించడానికి 2014 అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. మన తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పైగా 2015 మార్చిన వేతనాలు పెంచిన సందర్భంగా మినీ వర్కర్ల ప్రస్తావనే ప్రభుత్వం ఎత్తకపోవడం శోచనీయం. హెల్పర్లకు చెల్లించే వేతనాలే మినీ వర్కర్లకు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికీ అదే వేతనంతో వర్కర్లు పనిచేస్తున్నారు.
Authorization