కమలమ్మకు 45 ఏండ్లు. సుమారు 15 సంవత్సరాలు ఇండ్లల్లో పనులు చూసుకుంటూ కుటుంబాన్ని పోషించింది. ఆమె చేతులు చూస్తే కాయలు కాసి ఉంటాయి. కాళ్ళు నీళ్ళలో నాని పాచిపట్టి ఉంటాయి. ఇలాంటి తన జీవితంలో ఆరేండ్ల కిందట ఓ కొత్త మలుపు. ఓ ప్రభుత్వ ఆఫీసులో స్వీపర్గా పని చేసే అవకాశం ఉందని తెలిసిన వారు చెప్పారు. అయితే అది కాంట్రాక్ట్ ఉద్యోగం. కాంట్రాక్ట్ అయితే ఏంటి మరేదైతే ఏంటి? ఆఫీస్లో పని... నెల నెలా జీతం వస్తది. ఇన్నేండ్లు తను పడ్డ కష్టాల నుంచి బయటపడొచ్చనుకుంది. సంతోషంగా పనిలో చేరింది. కానీ చెరిన మూడు నెలలకే కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి సమస్యతో బాధపడుతుంది ఒక్క కమలమ్మనే కాదు. ఆమెలాంటి వారు మరెందరో ఉన్నారు. ఆ కార్మికులంతా తమ ఆవేదనను కొలువుతో పంచుకున్నారు.
గత ఆరు సంవత్సరాల నుంచి వీరంతా స్వీపర్లుగా పనిచేస్తున్నారు. వీరి సంఖ్య సుమారుగా 28 వరకు ఉంటుంది. వీరంతా ఓ ప్రభుత్వ ఆఫీసులో పని చేస్తున్నారు. అధికారులు ఎవ్వరూ ఆఫీస్కు చేరుకోక ముందే ఉదయం ఎనిమిది గంటలకల్లా వచ్చి ఆఫీస్ మొత్తం శుభ్రం చేస్తారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్త చేస్తారు. వివిధ సేవలు అందరికీ అందుబాటులో ఉంచడం కోసం, వైద్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన సేవలు అందుకుంటారు. అయితే ఇందులో పనిచేస్తున్న స్వీపర్లు మాత్రం ఎలాంటి సదుపాయాలు లేకుండా పనిచేస్తున్నారు.
వీరి ఉద్యోగాలకు భద్రత లేదు. ఇఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు లేవు. పీఎఫ్ కట్ చేస్తున్నామని కాంట్రాక్టర్ చెబుతాడు. కాని ఆ స్లిప్పులు వీరి చేతికి రావు. గత ఆరు సంవత్సరాలుగా ఇదే వరస. కాంట్రాక్టర్లు ఎంత మంది మారినా వీరి జీవితాలు మాత్రం మారడం లేదు. ఇచ్చే జీతాలైనా సక్రమంగా ఇస్తారా అంటే అదీలేదు. జీతాల కోసం ప్రతి నెలా పోరాటం చేయాల్సిందే. కాంట్రాక్టర్ను అడిగే బిల్లులు రాలేదంటాడు. ఇక ధర్నాకు కూర్చోవడం తప్పదు. ధర్నా చేసినన్ని రోజులు పనిపోయినట్లే. ఆరోజు జీతం కట్ చేస్తారు. ఇక ఆరోగ్యం బాగోక రాకపోయిన, ఏదైన ఇబ్బంది వచ్చి పనిలోకి రావడం కాస్త ఆలస్యమైనా ఆరోజు జీతం పోయినట్టే.
దూరదూర ప్రాంతాల నుండి ఇక్కడికి పనులోకి వస్తారు. ఎనిమిది గంటలకల్లా పనిలో ఉండాలి. అంటే ఇంటి దగ్గర ఏడు గంటలే బయలు దేరాలి. దూర ప్రాంతాల వారైతే ఇంకా త్వరగా రావాలి. బస్సులు దొరకవు. బస్సులు బంద్ ఉంటే ఆటోలో రావాలి. ఇక్కడ పనికి రాకపోతే జీతం కట్, ఆటోలో వస్తే ఆటో కిరాయి. ఇలా రెండు విధాలుగా ఈ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎప్పుడైనా జీతం పెంచమని, ఇఎస్ఐ, పీఎఫ్ కల్పించమని అడిగితే అడిగిన వారిని పనిలో నుండి వెళ్ళిపొమ్మంటారు. ''ఇష్టం ఉంటే పని చేయండి, లేదంటే వెళ్ళండి'' అంటూ కసురుకుంటారు. ఇక అలాంటి పరిస్థితుల్లో ఆకార్మికులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నోరుమూసుకొని ఆ పనే చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ పని మానేసి మళ్ళీ ఇండ్లల్లో పనులు చేసుకోవాలంటే శరీరం సహకరించదు. దాంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ పనిచేసుకోక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే వీరంతా ఏకమయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం సీఐటీయు ఆధ్వర్యంలో సంఘం పెట్టుకున్నారు. తమని పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇఎస్ఐ,పీఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలిని కోరుతున్నారు.
నెలనెలా కొట్లాడాల్సిందే
యాదమ్మ అనే స్వీపర్ను కదిలిస్తే...'డ్యూటీకి వచ్చిన కొత్తలో మాకు 2700 జీతం ఇచ్చేవారు. పని రెండు గంటలే అని చెప్పారు. ఇండ్లల్లో పని చేసుకోవడం కంటే ఇది కాస్త బాగానే ఉంది కదా అని చేరిపోయాం. ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. జీతం కోసం ప్రతి నెలా కొట్లాడాల్సిందే. ఆంధ్ర పోయి తెలంగాణ వస్తే మా డ్యూటీ పర్మినెంట్ చేస్తామని చెప్పారు. కాని ఇప్పటి వరకు మా గురించి పట్టించుకోవడం లేదు. నెలనెలా జీతాలు ఇవ్వకపోతే మేం ఎలా బతకాలి' అంటూ కంట నీరు పెట్టుకుంది.
కటింగ్లో తేడాలు ఎక్కువ
'2010 నుంచి ఇదే పని చేస్తున్నా. నేను సికింద్రాబాద్ నుండి వస్తా. కొత్త కాంట్రాక్టర్ వచ్చి రెండు సంవత్సరాలవుతుంది. ఇప్పటి వరకు మాకు పీఎఫ్ స్లిప్పులు ఇవ్వలేదు. అసలు మాకు పీఎఫ్ ఉందో లేదో తెలియడం లేదు. ఎంత కట్ అవుతుందో చెప్పడం లేదు. ఆ కటింగ్లో కూడా మనిషిమనిషికీ తేడా చూపిస్తున్నారు. బిల్లులు రావడం లేదని నెలనెలా జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. మీకు పీఎఫ్ స్లిప్పులు వెంటనే ఇవ్వాలి. మమ్మల్ని పర్మినెంట్ చెయ్యాలి' అంటూ డిమాండ్ చేస్తుంది కమలమ్మ.
ఆశతో బతుకుతున్నాం
'సరూర్నగర్ నుంచి నేను పనిలోకి వస్తాను. నా భర్త మెకానిక్ షాపులో పని చేస్తాడు. మాకు ఆరుగురు పిల్లలు. నలుగురు ఆడపిల్లలకు పెండ్లి చేశాం. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళను మంచిగా చదివిద్దామంటే మాకు వచ్చే ఆదాయం చాలదు. దీని కంటే ఇండ్లల్లో పనులు చేసుకుంటే ఆదాయం బాగుంటది. కాని ఆరు సంవత్సరాల నుంచి ఈపని చేస్తూ ఇప్పుడు ఇండ్లల్లో చేయాలన్నా చేయలేకపోతున్నా. ఆడపిల్లల కాన్పులు చేసి,చాకిరి చేసి చలికి కాళ్ళు, చేతులు వణుకుతున్నాం. ఎప్పటికైనా మా జీతాలు పెరుగుతాయని, పర్మినెంట్ చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం' అంటుంది సరోజ.
జీతాలే సరిగ్గా ఇవ్వరు
భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 'మాకు పెద్ద సమస్యంటే జీతాలు. మూడు నాలుగు నెలలైనా జీతాలు సరిగ్గా ఇవ్వరు. జీతాల కోసం గేటు దగ్గరే పని చేయకుండా నిలబడతాం. అప్పుడు రెండు, మూడు రోజులు పని చెయ్యకుండా సమ్మె చేస్తాం. అప్పుడు జీతం కట్ చేస్తారు. ఎప్పుడైనా జ్వరం వచ్చి సెలవుపెడితే జీతం కట్. అసలు మేం పని చేసేది హెల్త్ ఆఫీస్లో కాని మా ఆరోగ్యానికి మాత్రం ఎలాంటి రక్షణా లేదు. మా సమస్యల గురించి ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. పర్మినెంట్ చేస్తామని చెయ్యడం లేదు. కనీసం జీతాలన్నా నెలనెలా ఇస్తారా అంటే అదీ లేదు' అంటుంది.
ఉత్తర్వులను పట్టించుకోరు
'నేను పదోతరగతి వరకు చదువుకున్నా. నా భర్త కూడా కాంట్రాక్ట్ ఉద్యోగమే చేస్తాడు. అలా నాక్కూడా ఇక్కడ ఉద్యోగం ఇప్పించాడు. గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేసుకుంటున్నా. మాకు జీవో ప్రకారం 9500 జీతం రావాలి. కాని జీవోని పక్కన పెట్టేశారు. కానీ ప్రస్తుతం 5,500 మాత్రమే ఇస్తున్నారు. జీతాలు అడిగితే బిల్లులు రాలేదు, బడ్జెట్ రాలేదని కాంట్రాక్టర్ చెబుతాడు. అధికారులను అడిగితే మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు మీతో మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇదీ మా పరిస్థితి' అంటుంది దీనమ్మ.
రాష్ట్రం వచ్చినా ఉపయోగం లేదు
'పది సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నా. కాంట్రాక్టర్లు వస్తున్నారు, పోతున్నారు. మా సమస్యలు మాత్రం ఇలాగే ఉన్నాయి. మా గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇఎస్ఐ, పీఎఫ్ ఇస్తామని మా ఫొటోలు కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. తెలంగాణ వస్తే మా సమస్యలు పరిష్కారమవుతాయనుకున్నాం. మా ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని ఆశపెట్టుకున్నాం. రెండు సంవత్సరాలు గడిచినా పర్మినెంట్ గురించి మాట్లాడడం లేదు' అంటుంది సరిత.
Authorization