గ్రామాల్లో చేతివృత్తులు నాశనమయ్యాయి. సరైన సదుపాయాలు లేక వ్యవసాయం దెబ్బతింటున్నది. పల్లెలో బతుకుదెరువు లేక పట్టణాలకు వలసలు సహజమైపోయాయి. ఎక్కడికెళ్ళినా నిరుద్యోగ సమస్య వెక్కిరిస్తూనే ఉంది. ఆరవ తరగతి నుంచే బడి మానుకుని తల్లిదండ్రులకు అండగా నిలవాలనో, గత్యంతరం లేకనో, ఇంకే కారణాలైనా 12,13 సంవత్సరాల పిల్లల నుంచి 40సంవత్సరాల వయసున్న వారు అసంఘటిత కార్మికులుగా మారుతున్నారు. కార్మిక చట్టాలకు దూరమై వెట్టి చాకిరి చేస్తూ బానిసలుగా బతుకుతున్నారు. ఉన్న చట్టాలు యజమానుల చుట్టాలై కాగితాలకే పరితమవుతున్నాయి. అలాంటి అసంఘటిత కార్మికుల్లో వివిధ షాపుల్లో పని చేస్తున్న ఎందరో ఉన్నారు. ఈ రోజు కొలువులో వారి సమస్యలేంటో తెలుసుకుందాం...
షాపింగ్మాల్స్, సూపర్బజార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, బుక్ షాప్లు వంటి పెద్ద పెద్ద గోడౌన్లతో నిర్వహించే వ్యాపార సంస్థల్లో ఒక్కొక్క దాంట్లో పది మంది నుంచి 50 మంది వరకు కార్మికులు ఉంటారు. డీమార్ట్, బిగ్బజార్, మోర్, రిలియన్స్ ఫ్రెష్ వంటి వాటితోపాటు బార్ అండ్ రెస్టారెంట్లలో 50నుండి 150మంది వరకు వర్కర్లు ఉంటారు.
నిలువు కాళ్ళపై నిలబడాల్సిందే
అకౌంట్స్ చూసేవారు, అమ్మేవారు, మూటలు మోసేవారు, క్లీనింగ్ చేసేవారు, క్యాటరింగ్ చేసేవారు... ఇలా అనేక రకాల పని చేసే వారుంటారు. వీరంత ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల నుంచి రాత్రి షాపు మూసేసే వరకు ఉండవలసిందే. పండుగలు, పెండిండ్ల సీజన్లప్పుడు ఎంత రాత్రయినా తప్పక ఉండాలి. కాని డ్యూటీ టైం కొన్ని సందర్భాలలో 12గంటలకు పైగా అవుతుంది. సీజన్ లేని సందర్భాల్లో కొనుగోలు దారులు లేక పోయినా వీరికి కూర్చుంనే హక్కు ఉండదు. షాపులో ఉన్నంత సేపు నిలువు కాళ్ళపై నిలబడాల్సిందే. కొన్ని షాపుల్లో అసలు కుర్చీలే లేకుండా చేస్తారు. లంచ్ సమయం కూడా ఒకరితరువాత ఒకరు పది నిమిషాలు, పావుగంట కంటే ఎక్కవ సమయం ఇవ్వరు.
జీతాల్లో తేడాలు
గత పదేండ్ల నుండి షాపింగ్ కాంప్లెక్సుల్లో మహిళా కార్మికుల సంఖ్య బాగా పెరిగింది. అందులో కొద్దో గొప్పో చదువుకున్న వారు చదువు రానివారుంటారు. చదువుని బట్టి పనీ, పనిని బట్టి జీతాలు. ఇలా చాలా తేడాలుంటాయి. కానీ పని సమయం మాత్రం అందరికీ ఒక్కటే. కొందరికి కేవలం మూడు వేలు మాత్రమే జీతం ఇస్తారు. అత్యధికం అంటే ఏడువేలు. ఇంత కంటే ఎక్కువ జీతాలు ఇచ్చే సంస్థలే లేవు. ఈ రకంగా జీతాల్లో తేడాలుంటాయి. కానీ బయట ధరలు మాత్రం అందరికీ అవే వర్తిస్తాయి కదా? అని ఆలోచిస్తే బతుకంతా ఆగమ్యగోచరమే. అందులోనూ సమాన చదువు, సమాన పని చేసే వారైనా పురుషులతో పోల్చుకుంటే మహిళలకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఇలా నడిమధ్యలో చదువులు మానుకున్న యువతీ యువకులు తమ రక్తం ప్రైవేట్ సంస్థలకు దారబోస్తున్నాయి.
కార్మిక చట్టాలు వర్తింప చేయాలి.
బతుకు తెరువు లేక గ్రామాల నుండి నగరాలకు వలస వచ్చిన యువతీ యువకులకు ప్రభుత్వం పని కల్పించి కార్మిక చట్టాలను వర్తింప చేయాలని సిఐటియు లాంటి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యూనియన్ వారు షాపింగ్మాల్స్, సూపర్బజార్స్, షోరూమ్స్లలో పని చేస్తున్న కార్మికుల సమస్యలపై సర్వే చేసి కొంత మంది యజమానులను నిలదీశారు. యూనియన్ వారు యాజమాన్యాన్ని నిలదీయడంతో 'వారికి సమాచారం ఇచ్చిందెవరు? మా ముందు చెప్పమనండి చూద్దాం' అంటూ కార్మికులను బెదిరిస్తున్నారు. కొందరిని పని నుంచి తీసి వేశారు. దాంతో కార్మికులు తమ హక్కులను అడిగే ధైర్యం చేయలేని పరిస్థితి ఉన్నది. ఇకనైనా ఇటువంటి కార్మికులను గుర్తించి ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. ఒకే రకమైన పని చేసే స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఇవ్వాలి. ఎనిమిది గంటల పని సమయం పాటించాలి. వారాంతపు సెలవులు, ఇఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలి. మహిళలకు వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. యూనిఫామ్స్ ఇచ్చి సబ్బులు, కొబ్బరి నూనె, చేతులకు గ్లౌజులు యాజమాన్యమే ఇచ్చేటట్లు చట్టం అమలు చేయాలి.
యజమానుల వేధింపులు తప్పవు
ఈ సంస్థల్లో యజమానుల వేధింపులు చాలా రూపాల్లో చూడొచ్చు. కొనుగోలు దారులు ఉన్నా లేకున్నా కౌంటర్లో నిలబడి ఉండాలి. ఒక్క నిమిషం కూడా కూర్చొనే హక్కు ఉండదు. దాంతో కాళ్ళు పీక్కుపోవటం, మోకాళ్ళ నొప్పుులు, తల నొప్పి, నడుము నొప్పులు రావటం వంటి వ్యాధులకు గురౌతున్నారు. అమ్మాయిలు కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుతున్నా యజమానులు పట్టించుకోరు. కొంత మంది టాయిలెట్ పేరుతో వెళ్ళి ఐదు నిమిషాలు కూర్చొని టాయిలెట్లో సెద తీర్చుకోవలసిన దుస్థితి ఎదురవుతుందంటే వీరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. డ్యూటీలో ఉన్నంత సేపు ఒకరితో ఒకరు కొన్ని చోట్ల మనస్పూర్తిగా మాట్లాడుకోవటం, నవ్వటం కూడా నిషేదం. అత్యవసరమై సెలవు అడిగినా, అడగకుండా డ్యూటీకీ రాలేక పోయినా ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో ఊహించకోలేని పరిస్థితి.. కొంత మంది యజమానులు అమ్మాయిలు, అబ్బాయిలు అని కూడా గమనించకుండా బూతులు తిట్టడం సహజంగా వినిపిస్తుంది.
కార్మికులుగా గుర్తించాలి
వేధింపులకు తాళలేక కార్మికులు పని మానేసుకునే వారుంటారనే ఆలోచనతో జీతాలు ఆపి వేయటం, 'చెప్పిన పని చేస్తేనే మీ డబ్బులు ఇస్తాము ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి' అని బెదిరించటం కూడా చేస్తారు. కాస్త గట్టిగా మాట్లాడితే అక్కడున్న విలువైన వస్తువును మాయం చేసి దొంగతనం కేసులు బనాయించటం, గదిలో పెట్టి దాడులు చేయటం యజమానులకు సులువైన విద్యగా మారింది. కొందరు అవసరం కోసం అడ్వాన్స్ అడిగినప్పుడు ఇస్తారు. ఆ తరువాత జీతాలు ఇచ్చే విషయంలో అందరితోపాటు ఇవ్వక పోవటమో, అదనపు పని చేయించుకోవటమో కాకుండా ఇంటికి పంపించి ఇంటి పని కూడా చేయించుకుంటారు. ఇటువంటి సమస్యల నుండి వీరంత కాపాడబడాలంటే ప్రభుత్వమే వీరిని కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కార్మికుల వేధింపుల నిషేధ చట్టాలు రావాలి. కార్మికులు వేధింపులకు గురైనట్లు రుజువైతే యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వ్యాపార సంస్థల్లో కార్మిక చట్టాలకు వినియోగ దారుల చట్టాలకు అనుసంధానం చేసి దోపిడీ నుంచి రక్షించాలి అని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
చాలీ చాలని బతుకులు
నల్లగొండ, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్ వంటి జిల్లాలోని గ్రామాల నుంచి బతుకు తెరువు కోసం వలసలు వచ్చిన యువతీ యువకులకు నగరాల్లో కూడా బతుకు గగనమే అవుతుంది. చదువులు మధ్యలోనే ఆపేసి షాపింగ్ మాల్స్, సూపర్బజార్లు, షోరూమ్స్, వంటి సంస్థలలో పని వెతుక్కుని గడుపుతున్న వీరు పని ప్రదేశంలో చూస్తే యూనిఫామ్స్ వేసుకుని మంచి సంపాదన ఉన్న వారిలా కనిపిస్తారు. కాని వారి జీవితాల్లో వెళ్లి చూస్తే ఏ ఒక్క సౌకర్యం కూడా లేక చాలి చాలని బతుకులు గడుపుతున్నారు. మొత్తానికి వీరి జీవితాలు పైన పటారం లోన లొటారం మాదిరిగా ఉన్నాయి. ఇంటి అద్దె కట్టాలంటే వచ్చే జీతం చాలదు. ఇలాంటి వారందరిని ప్రభుత్వం గుర్తించి డబుల్బెడ్రూం ఇండ్లు, రేషన్ కార్డులు, విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలి. నగరాల్లో కూడా పనికి ఆహార పథకం అమలు చేస్తే ఇటువంటి అసంఘటిత కార్మికులకు కొంత పని దొరుకుతుందని మేధావులు సూచిస్తున్నారు.
Authorization