తక్కువ సమయంలో వైద్యవిద్యా కోర్సును పూర్తి చేయవచ్చంటే నమ్మారు. త్వరగా కోర్సు పూర్తి చేసి పేదలకు వైద్యసేవలు అందించ వచ్చనుకున్నారు. ఎంబీబీఎస్తో సమానం ఈ కోర్సు అంటే ఆశపడ్డారు. లక్షలు అప్పులు చేసి మరీ కాలేజీల్లో చేరారు. ఆరు ఏండ్ల పాటు కష్టపడి ఎండీతో సమానమైన వైద్య విద్యను అభ్యసించారు. కానీ కోర్సు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఉపాధి దొరకలేదు. దాంతో ఇప్పుడు వాళ్ళు బతుకు పోరాటం ప్రారంభించారు. వాళ్ళే ఫార్మ్.డి విద్యార్థులు.
వైద్య సేవలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం, పీసీఐ(ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా) వారు ఫార్మ్.డి అనే కోర్సును 2008లో మన దేశంలో ప్రవేశపెట్టారు. ఈ కోర్సు కాలపరిమితి 6 సంవత్సరాలు. ఇప్పటికి 10 ఏండ్లు గడిచాయి. కాని వీరికంటూ ఓ గుర్తింపు (క్యాడర్) లేదు. ఇప్పటి వరకు తెలంగాణలో 63 ఫార్మ్.డి కళాశాలలు ఉన్నాయి. వీటిలో 5000 మంది విద్యార్థులు కోర్పు పూర్తి చేశారు. ఇంకా 11 వేల మంది కోర్సును అభ్యసిస్తున్నారు. కానీ వీరెవరికీ ఉపాధి అవకాశాలు చూపించలేదు. దాంతో క్లినికల్ ఫార్మ్సిస్ట్ క్యాడర్ కోసం 2015లో పోరాటం చేశారు. ఫలితంగా ప్రభుత్వం త్రిసభ్య కమిటీతో పాటు జీఓ. ఆర్.టీ: 515 విడుదల చేసింది. మూడు సంవత్సరాలు గడిచినా దాని రిపోర్టు ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాంతో వరంగల్, కరీంనగర్ జిల్లాలలో గత 36 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. 16 వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. 6 ఏండ్ల చదవుచదివి మన దేశానికి ఎలాంటి సేవ చేయలేని పరిస్థితి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసేలా ఫార్మ్.డి విద్యార్థులు ఈ రోజు వరంగల్లో మహాగర్జన చేస్తున్నారు.
సరైన సేవలు అందిస్తారు
ఫార్మ్.డి డాక్టర్లు ఔషదసేవలను అందించడంలో యండీ వైద్య నిపుణులతో సరిసమానమైన నైపుణ్యత కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు ఔషద చికిత్సలందు ప్రత్యేక శిక్షణ పొందుతారు. అధునాతనమైన వైద్య పద్దతులను ఆచరిస్తూ వైద్యాన్ని అందిస్తారు. ఔషదపరమైన కౌన్సెలింగ్ ఇచ్చి సైడ్ఎఫెక్ట్లు తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తారు.
రోగులకు తగ్గ వైద్యులు లేకనే...
డాక్టర్ రోగానికి తగ్గట్టుగా మందు రాస్తే దానిని ఎలా వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? రోగికి ఆ మందు ఎంత మేర పనిచేస్తుందన్న విషయాలను తెలియచెప్పడమే ఫార్మా-డికోర్సు ముఖ్య ఉద్ధేశ్యం. వైద్యులు ప్రిస్కిప్షన్ రాస్తే దానిని రోగి ఎలా వాడాలో సంపూర్ణ పరిజ్ఞానం వీరు అందిస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోగులను నిశితంగా పరీక్షించే సమయం కూడా వైద్యులకు లేదు. రోగుల తాకిడికి తగ్గట్టుగా వైద్యుల భర్తీలు లేవు. ఫార్మా-డి విద్యార్థుల వలన వైద్యులపై భారం తగ్గించ వచ్చన్న ఆలోచనతో కేంద్రం అప్పట్లో ఈ కోర్సుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది.
ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం
వందకోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశంలో ప్రజల ఆరోగ్య విషయమై ఫార్మ్డి లాంటి క్లినికల్ ఫార్మసీ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిబడిన ఆరోగ్య శ్రీలో జరుగు అవకతవకలను తగ్గించి ప్రభుత్వ ధనాన్ని, వ్యయాన్ని, నియంత్రించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వైద్య పరమైన సేవలను అందజేయటంలో ముందుంటుంది. ఇలాంటి వారిని గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే పి.హెచ్.సిలో వైద్యుల కొరతను తగ్గిస్తూ ఫార్మ్డి డాక్టర్లు వైద్య సేవలను ప్రభుత్వం వినియోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వం అలాంటి ప్రయత్నమే చేయడం లేదు.
ఉద్యోగ కల్పనలో స్పష్టత లేదు
ఈ కోర్సు అన్ని దేశాల కంటే ముందుగా అమెరికాలో ప్రారంభించారు. మనదేశంలో 2008లో ప్రారంభించారు. ఐదు సంవత్సరాల కోర్సు పూర్తిచేసిన వీరు ఏదైనా నాలుగు విభాగాల్లో మరో ఏడాదిపాటు శిక్షణ పొందాలి. జనరల్ మెడిసన్ అనేది ప్రతి విద్యార్థి కచ్చితంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. అయితే ఈ కోర్సు చదివిన విద్యార్థులకు ఎక్కడ ఉద్యోగం కల్పించాలన్నా దానిపై కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలకు ఇప్పటి వరకు స్పష్టత లేదు. దాంతో 2013 నుంచి ఈ కోర్సు చదివిన విద్యార్థులు ప్రభుత్వం చుట్టూ తిరిగారు.
త్రిసభ్య కమిటీ ఏమైనట్టు?
చివరకు 2015 ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. ఈ కమిటీలో డీఎంఈతో పాటు డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి ఒకరు, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి మరొకరు ఉండాలని జీఓలో పేర్కొంది. అయితే ఈ కమిటీ ఏర్పడి మూడేండ్లు గడిచినా ఇంతవరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు. మనకు డీఎంఈ, డ్రగ్ కంట్రోల్ ఉన్నా ఫార్మసీ కౌన్సిల్ అనేది లేదు. కమిటీ సమావేశం కాకపోవడానికి ఇది ఒక కారణమని వైద్య ఆరోగ్య శాఖాధికారులు అన్నారు. వీరికి ప్రభుత్వం చెప్పే మాట ఒక్కటే. త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి కార్యాచరణ ఉంటుందని.
కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే...
ఇప్పటి వరకు ఒక్క మహారాష్ట్రంలో మాత్రమే ఈ కోర్సు చదివిన విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం 2015లో ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులరైజేషన్ పేరుతో ఒక చట్టాన్ని రూపొందించింది. దీనిని కేరళ, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. దీనివల్ల ఫార్మా-డీ కోర్సు చేసిన వారికి ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీనిని మిగతా రాష్ట్రాలు ఆమోదం తెలపలేదు. ఈ విషయమై ఇటీవల రాజ్యసభలో చర్చకూడా జరిగింది. దాంతో కేంద్ర మంత్రి ఫార్మా-డికు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేశామని దీనిని అన్ని రాష్ట్రాలు ఆమోదించాలని తెలిపారు. దీన్ని మనరాష్ట్రం ఆమోదిస్తే ఇక్కడి వారికి ఉపాధి దొరుకుంది. పేదలకు వైద్యం అందుబాటులో ఉంటుంది.
డిమాండ్స్
- తెలంగాణ ప్రభుత్వం జారిచేసిన జీవో ఆర్.టి: 515ను అమలుపరచాలి.
- ప్రభుత్వ ఆసుపత్రులలో క్లీనికల్ ఫార్మసిస్ట్ కేడర్ను ఏర్పాటు చేసి వీరికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
- ప్రభుత్వ ఆసుపత్రులలో డ్రగ్ ఇన్ఫర్మమేషన్ సెంటర్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
- పేషంట్ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
- ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులలో హాస్పిటల్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అవకాశాలు కల్పించాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో పి.హెచ్.సిల నందు వైద్యుల కొరతలు తగ్గిస్తూ ఫార్మ్డి డాక్టర్ల వైద్య సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలి.
అరెస్టులతో మమ్మల్ని అణచలేరు
నేను 2012-13 బ్యాచ్. 2018లో కోర్సు పూర్తయింది. ప్రస్తుతం ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఈ కోర్సు పూర్తి చేయడానికి 15 నుండి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ కోర్సు పూర్తి చేస్తే మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో మా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ మమ్మల్ని చదివిస్తున్నారు. కానీ కోర్సు ప్రారంభించిన నాటి నుంచి ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. పైగా మాకు అసలు ఎలాంటి గుర్తింపు లేదు. ఎండి చేసిన వారితో సమానంగా మా కోర్సు ఉంటుంది. రోగులకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందించగలం. చేసిన అప్పులు తీర్చలేక కోర్సు పూర్తి చేసిన చాలామంది 12 వేలకు కాలేజీల్లో పని చేస్తున్నారు. అన్ని లక్షలు ఖర్చుపెట్టి చివరకు ఇలా బతకాల్సి వస్తుంది. అందుకే మా చదువుకు తగిన గుర్తింపు, ఉపాధి కోసం ఈ పోరాటం చేస్తున్నాం. 23 రోజులు రిలే దీక్షలు చేశాం. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆమరణ దీక్షకు కూర్చుంటే పోలీసులు అరెస్టు చేసి హాస్పిటల్కు తీసుకెళ్ళారు. అరెస్టులతో మా ఉద్యమాన్ని అణచలేరు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. అందుకే ఈ రోజు వరంగల్లో మహాగర్జనకు పూనుకున్నాం.
- అనిత, ఖమ్మం
స్పష్టమైన హామీ ఇస్తేనే
నేను 2013లో చేరాను. మేము చేరుతున్నప్పుడు ఈ కోర్సుకు ఎంతో డిమాండ్ ఉందని ప్రచారం జరిగింది. ఎంసెట్ చేసి లాంగ్ టర్మ్ తీసుకొని ఎంబీబీఎస్ చేసేసరికి ఓ ఏడాది వేస్ట్ అవుతుంది. అదే ఈ కోర్సు చేస్తే అన్ని విధాలుగా ఉపయోగం అంటే చేరాను. మా పేరంట్స్ అప్పు చేసి నా ఫీజుకట్టారు. ఇప్పుడు ఉద్యోగాలు రావడం లేదు. ఆడపిల్లలం ఇలా రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తున్నా మా గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేము రోగులకు సరైన చికిత్స చేయగలం. బహుశా అందుకే ప్రభుత్వానికి భయమేమో. మేము వాళ్ళకు మంచి చికిత్స చేసి పంపిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు డబ్బులు ఎలా వస్తాయి? ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బు కోసం ఆలోచించడం వల్లనే మాకు ఉపాధి కల్పించడం లేదు. ముఖ్యమంత్రి అయితే అసలు స్పందించడం లేదు. కేటీఆర్, కవిత పోరాటం ఆపేస్తే న్యాయం చేస్తామంటున్నారు. ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలా ఆపేస్తాం? ఇప్పుడు మా పోరాటం ఆపేస్తే తర్వాతన్యాయం జరగకపోతే ఎలా?15 రోజుల కిందట డీఎంఈ పేరుతో ఓ కమిటీని వేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ ఏమీ చేయలేదు. 2015లో కూడా ఇలాగే కమిటీ వేశారు. వీటి వల్ల మాకు ఎలాంటి లాభం లేదు. ఇక ఈ ప్రభుత్వాన్ని మేం ఎలా నమ్మాలి. అందుకే మాకు న్యాయం జరిగేవరకుఈ పోరాటం ఆపేదే లేదు.
- నిహారిక, ఖమ్మం
Authorization