కొలువు దొరికినందుకు ఎంతో సంతోషించారు. నెలకింత జీతం వస్తుందని ఆనందించారు. సమాజంలో గౌరవంగా బతకొచ్చని ఆశపెట్టుకున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే ఇక చెప్పుకోవల్సింది ఏముంటుంది. ఎవరో చేసిన తప్పుకు మరెవరో శిక్ష అనుభవిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు డబ్బు ఎగొట్టి పోయిన నీరవ్మోడీ ప్రభావం మన హైదరాబాద్ నగరంలోని కార్మికులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. శారీరక వైకల్యంతో కష్టాలుపడుతున్న వారు నేడు ఉన్న కొలువును పోగొట్టుకొని, రోడ్డున పడి, ఆవేదన చెందుతున్న వారి కష్టాలు ఈ వారం కొలువులో...
అసలేం జరిగింది?
ఇది హైదరాబాద్ జెమ్స్ (గీతాంజలి వజ్రాల పరిశ్రమ)లో పని చేస్తున్న కార్మికుల ఆవేదన. ఎవరిని కదిలించినా తమ భవిష్యత్ ఏమిటన్న ఆందోళనలో వున్నారు. ఎమిటి వజ్రాల పరిశ్రమ?! ఇప్పుడీ కార్మికులకెందుకు ఆందోళన?! 14 వేల కోట్ల రూపాయాలను పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్మోడీ కుటుంబానికి చెందినదే ఈ గీతాంజలి వజ్రాల పరిశ్రమ. ఎన్పోర్స్మెంట్ డైరెక్టర్ ఈ పరిశ్రమను సీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేయడంలో కార్మికులు రోడ్డున పడుతున్నారు.
ఎప్పుడు ప్రారంభించారు
కేంద్రం ప్రభుత్వం ప్రారంభించిన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఎస్ఇజెడ్)లలో రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, రావిరాల గ్రామంలో రాజీవ్ జెమ్స్ పార్కును ఏర్పాటు చేసింది. ఈ పార్కులో గీతాంజలి పరిశ్రమను 2005 నవంబర్ 22న ప్రారంభించారు. 2006 నవంబర్ 9 నుండి ఉత్పత్తి ప్రారంభమైంది. పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం 171 ఎకరాల భూమిని కేటాయించింది. (కేవలం రూ. 4 కోట్ల రూపాయలకే). యాజమాన్యం ఇదే భూమిని ఎల్ఐసి వద్ద తాకట్టుపెట్టి రూ. 120 కోట్ల రుణం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, మౌళిక సదుపాయాలు, ఇతర రాయితీలు ఇచ్చింది. ఇక్కడ ముడి వజ్రాలకు సాన పెట్టి, వజ్రాల, ఆభరణాలు తయారు చేస్తారు.
పని చేస్తుంది ఎవరు?
ఇక్కడ 700 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా సమాజం నుంచి నిరాదరణకు గురైనవారు. వీరిలో అత్యధికులు ఒంటరి మహిళలు, వికలాంగులు, మైనార్టీలు. నాడు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల నుండి వికలాంగులను తీసుకొని వచ్చి డిఆర్డిఎ ద్వారా శిక్షణ ఇచ్చి సుమారు 300 మందికి (వీరిలో 100 మంది మహిళలు) ఇక్కడ ఉపాధి కల్పించింది. వీరంతా తమసొంత గ్రామాలను విడిచిపెట్టారు. బతకడానికి ఆధారం దొరకటంతో జీవితానికి భరోసా ఏర్పడి పెళ్ళిళ్ళు చేసుకోని ఇక్కడే స్థిరపడ్డారు. లోన్లు తీసుకోని ట్రై సైకిళ్ళు కొనుక్కున్నారు. నెలకు రూ. 750 జీతంతో తమ జీవితాలను ప్రారంభించి నేడు రు. 12 నుండి 15 వేల వరకు జీతాలు పొందుతున్నారు.
అంతా ప్రశాంతమనుకుంటే..!
వీరంతా ఈ పనులు తప్ప మరోరకమైన పనులు చేయలేరు. మరో గొప్ప విషయం ఏమిటంటే అత్యధిక సంఖ్యలో వికలాంగులకు ఉపాధి కల్పించినందుకుగాను యాజమాన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు కూడా ప్రకటించాయి. అంతా ప్రశాంతంగా నడుస్తున్న సమయంలో నీరవ్మోడీ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పుకు ప్రస్తుతం వీరంతా రోడ్డున పడుతున్నారు. ఇందులో కేవలం ఉపాధి సమస్య మాత్రమే కాదు. సామాజిక సమస్యలు కూడా ఉన్నాయి. తమ ఉపాధిని కాపాడాలని కార్మికులు ఆందోళన బాట పట్టారు.
కార్మికుల కష్టాలు వారికి పట్టవు
నీరవ్మోడీ 14వేల కోట్ల కుంభకోణాకిని పాల్పడి దేశం వదిలి పారిపోయి దర్జగా వున్నాడు. కానీ కుంభకోణానికి సంబంధంలేని, అసలు నీరవ్మోడీ ఏవరోతెలియని కార్మికులు శిక్ష అనుభవించాల్సి వస్తున్నది. బ్యాంకులు కానీ, పాలకులుగాని తమ రికవరీల గురించి ఆలోచిస్తున్నారు. తప్ప రోడ్డున పడుతున్న కార్మికుల కుటుంబాల గురించి ఏమాత్రం ఆలోచించకపోవడం శోచనియం. దావోస్లో ప్రధాని, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ గార్లతో కలసి నీరవ్మోడీ పారిశ్రామిక సదస్సులో పాల్గొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి గురించి ప్రపంచ వేదికల మీద, టివీలలో అట్టహసంగా ప్రకటనలు చేస్తున్న కెటిఆర్ గారు మూతపడుతున్న పరిశ్రమల, కార్మికుల ఉపాధి గురించి మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు.
అండగా నిలవాలి
ఇక్కడ శిక్షణ పొందిన కార్మికులున్నారు. భూమి ప్రభుత్వానిదేే దానిలో యాంత్రాలు ఉత్పత్తికి అవసరమైన అన్ని సౌకర్యాలు వున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమను స్వాధీనం చేసుకోని నడిపించాలి. తద్వారా కార్మికుల ఉపాధి నిలబడుతుంది. అక్కడి ప్రాంతాల అభివృద్ధి కొనసాగుతుంది. అందుకని పరిశ్రమల శాఖమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకొని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేక పోతే మంత్రిగారి మాటాలను ప్రజలు శంకించాల్సి వస్తుంది. తమ బతుకుకోసం కార్మికులు చేస్తున్న ఆందోళనకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి మీద ఉంది.
- బి.మధు,సీఐటీయు
ఫోన్:9490098155
ఎవడో మోదీ అంట ఆయనవరో మాకు తెల్వదు. బ్యాంకులో డబ్బులెత్తకపోయిండట, తప్పు చేసినోడ్ని వదిలిపెట్టి మానోటికాడ కూడుని లాగేసి మాకు శిచ్చ ఎత్తరా అయ్యా! ఇది ఎట్టెట్ట న్యాయం?
-ఒక కార్మికురాలి ప్రశ్న
Authorization