ఆర్థిక సమస్యలు చదువుకు దూరం చేస్తే... కడుపు నింపుకోవడానికి చేసే పని మనిషినే తక్కువ చేస్తున్నది. కానీ బతకడానికి కడుపు నిండాలి. అలాంటి వారు ఎంచుకునే పని ఇంటిపని. ఇండ్లల్లో పనులు చేసుకొని బతికేవారంటే అందరికే అలుసే. ఇండ్లల్లో పాచిపనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్న వీరి సమస్యలు పట్టించుకునే వారు మాత్రం లేరు. అందుకే తమ బతుకులకు భరోసా ఏది? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇండ్లల్లో పని చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఆ గృహకార్మికుల సమస్యలపై ప్రత్యేక కథనం నేటి కొలువులో...
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 45 వేల నుండి 50 వేల వరకు ఇండ్లల్లో పనులు చేసుకుని బతుకీడ్చేవారు ఉన్నారు. ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే సుమారు 15 వేల మంది ఉన్నట్లు అంచనా శ్రమచేసేవారందరిని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలి. కాని ఎంతో కష్టపడే వీరిని మాత్రం ప్రభుత్వం గుర్తించడం లేదు. వీరికి ఇచ్చే వేతనాలు యజమాని దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటాయి. ఎక్కడో ఒక పనిమనిషి దొంగతనం చేస్తే, ఇక ఏ ఇంట్లో దొంగతనం జరిగినా ముందు ఇంట్లో పనిచేసేవారినే అనుమానిస్తారు. వారిని మానసికంగా శారీరకంగా హింసిస్తారు. కొన్ని ఇండ్లల్లో లైంగిక దాడులను కూడా వారు గురౌతున్నారు.
ఇండ్లల్లో పాచిపనులు చేస్తూ జీవిస్తున్న మహిళల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. గ్రామాల్లో పనుల్లేవు. పట్టణాలకు వలసవస్తే ఇక్కడ పని దొరకడంలేదు. బతుకుబండిని లాగాలి. కాబట్టి పట్టణంలోని ఇళ్ళల్లో పాచిపనులు చేస్తూ తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అయితే ఇదేమీ రోజువారి కూలి కాదు. ఎన్ని ఇండ్లల్లో పని చేసుకుంటే అంత ఆదాయం. నాలుగైదు ఇళ్ళల్లో పని కుదుర్చుకుంటే తప్ప వీరి ఇల్లు గడవడం కష్టం. అందుకే తెల్లవారు జామున నాలుగ్గంటకే వీరి రోజు ప్రారంభమవుతుంది. వీరికి వచ్చే ఆదాయం తమ ఖర్చులకు సరిపోవడం పక్కన పెడితే ఆ వచ్చే దాంట్లో మూడోవంతు వీరికి వచ్చే ఆరోగ్య సమస్యలకే ఖర్చు చేయవల్సి వస్తుంది. వచ్చేడబ్బులు కూడా పెరుగుతున్న ధరలతో పోటీ పడలేకపోతున్నాయి. దాంతో తాము తీసుకునే ఆహారాన్ని తగ్గించుకొని ఇంట్లో పిల్లల కడుపులు నింపుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారి బతుకులు నిజంగా దుర్భరం. వీరందరూ కార్మిక చట్టాలను అనుసరించి తమకు కనీస బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
పని ఎక్కువ చేయించుకొని, తక్కువ వేతనం వస్తుంది. ఆరోగ్య సమస్యలు జ్వరం, జలుబు, కీళ్ళనొప్పులు, కాళ్ళు పగుళ్ళు, సరైన పౌష్టక ఆహారం లేక రోగాల బారినపడుతున్నారు. ప్రభుత్వం వీరిని గుర్తించటం లేదు. వేధింపులు, అవమానాలు, దొంగతనాలు, అదనపు పని, రెండు రోజులు పని ఆరోగ్యం బాగా లేక పనికి పోకపోతే పనిపోయే పరిస్థితి ఉంది. పనుల దగ్గర సమానత్వం గౌరవం లేదు. ఇలా చాలీ చాలని జీతాలతో, కడుపునిండా తిండి లేక బతుకీడుస్తున్న వీరిలో 97 శాతం మంది చదువులేని వారుఉన్నారు. 20 శాతం మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వీరి సమస్యలపై అఖిల భారత ప్రజాసంఘం(ఐద్వా) అనేక సార్లు సర్వేలు చేసింది. ఐక్యం కాకపోతే సమస్యలు పరిష్కారం కావని వారిలో చైతన్యాన్ని నింపింది. ఐద్వా అందిచిన స్ఫూర్తిఓ తమ సమస్యల పరిష్కారం కోసం 2002లో ఇంటిపనివారందూ ఏకమయ్యారు. 'స్నేహా ఇంటిపనివారల సంక్షేమ సంఘం' ఏర్పాటు చేసుకొని ఒక తాటిపైకి వచ్చారు. సంఘంగా ఏర్పడిన వీరు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కలిశారు. తమ పోరాటాల ఫలితంగా కొందరు గుర్తింప కార్డులను కూడా సాధించుకున్నారు. కాని ఇంకా ఎన్నో సమస్యలు అలానే మిగిలిపోయాయి.
మేమూ కార్మికులమే
నేను గత 20 సంవత్సరాలనుండి పని చేస్తున్నాను. 4 ఇండ్లల్లో చేస్తాను. ఆదాయం రూ||4,800/-లు వస్తుంది. ధరలు బాగా పెరిగాయి. వచ్చే ఆదాయం కుటుంబం గడవటం చాలా కష్టంగా ఉన్నది. నేను మహబూబ్నగర్ జిల్లా నుండి హైదరాబాద్కి వలస వచ్చాను. సంఘం పెట్టుకున్న తర్వాతనే మా కష్టాలు కాస్తయిన తగ్గాయి. మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలి. మా సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు సంఘం ఆధ్వర్యంలో పోరాడతాం'' అంటుంది జ్యోతి అనే ఓ కార్మికురాలు.
పూట గడవదు...
మాదమ్మ అనే ఆమెను కదిలిస్తే ''నేను పొట్ట కూటి కోసం సొంత ఊరిని వదిలి హైదరాబాద్కి వలస వచ్చాను. నాకు ముగ్గురు పిల్లలు. నాభర్త వదిలేసి పోయాడు. పనిచేయకపోతే పూట గడవడం కష్టం. పిల్లల్ని చదివించాలి. వాళ్ళను ప్రయోజకులను చేయాలి. నాలెక్క వాళ్ళు కష్టపడకూడదు. అందుకే ఈ పని చేసుకుంటున్నా. పది సంవత్సరాల నుండి ఇండ్లల్లో పాచిపని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాను'' అంటూ ఆవేదన చెందింది.
మాకు గుర్తింపులేదు
''మాది పాలమూరు జిల్లా. పని కోసం హైదరాబాద్ వచ్చాం. 8 ఏండ్ల నుండి ఇండ్లల్లో పని చేస్తున్నాను. 3 ఇండ్లల్లో చేస్తాను. నెలకు 4,500 రూపాయల వరకు వస్తుంది. నాకు నలుగురు పిల్లలు, ప్రభుత్వ బడిలో చదువుకుంటున్నారు. ఎంత చేసినా ఆదాయం పెరగదు. గుర్తింపులేదు'' అంటుంది నర్సమ్మ.
అవమానాలు మామూలే
సాయమ్మ మాట్లాడుతూ ''మా సొంత ఊరు వరంగల్. 20 ఏండ్ల కిందట హైదరాబాద్ వచ్చాము. మూడు ఇండ్లల్లో పని చేస్తున్నాను. ఈ ఆదాయం సరిపోక కూలి పనికి కూడా పోతుంటాను. మేం పనిచేసే దగ్గర తిట్టడం, అవమానించటం, దొంగతనాలు పెడుతుంటారు. చాలా బాధ అని పిస్తుంది. కానీ పని చేసుకోకపోతే రోజు గడవదు. అందుకే ఎన్ని అవమానాలనైనా భరిస్తున్నాం'' అంటుంది.
మా బతుకులు ఇంతేనా
''మేము కరీంనగర్ నుండి హైదరాబాద్కి వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. మాది చాలా పేద కుటుంబం రెక్కఅడితే గాని డొక్కాఆడని పరిస్థితి. అతి తక్కువ వేతనాలతో జీవనం గడుపుతున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు బాగు చేసేవారే లేరు'' అంటుంది తులసి.
అప్పులు చేస్తున్నాం
లక్ష్మి తన సమస్యలను చెప్పుకుంటూ ''మాది మహబూబ్నగర్. 30 సంవత్సరాల నుండి పొట్ట గడవటం కోసం మా ఊరిలో పనిలేక హైదరాబాద్కి వలస వచ్చాం. నేను ఆరు ఇండ్లల్లో పని చేస్తాను. ఆదాయం 5.000 రూపాయల వరకు వస్తుంది. అయినా సరిపోదు. హైదరాబాద్లో ఇంటి అద్దె కట్టడమంటే మామూలు విషయం కాదు. ఇంటి ఆదె,్ద కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, కుటుంబ అవసరాలు, పిల్లల చదువులకి సరిపోక అప్పులు చేస్తూ బతుకుతున్నాం'' అంటుంది.
డిమాండ్స్
- ప్రభుత్వం వీరిని కార్మికులుగా గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
- ఇ.ఎస్.ఐ., పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలి.
- వారంతపు సెలవులు ఇవ్వాలి.
- ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలి.
- అర్హులైన వారికి రేషన్కార్డులు పెన్షన్, ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.
- ఆమ్ఆద్మీ యోజన పథకం రాష్ట్ర మొత్తం ఇండ్లల్లో పని చేసేవారికి వర్తింప చేయాలి.
Authorization