సనత్నగర్ ఇఎస్ఐ హాస్పిటల్లో ఇటీవల సుమారు 300 మంది ఉద్యోగులు గత 8 రోజుల నుండి విధులు బహిష్కరించి ధర్నాలు, భిక్షాటనలు చేశారు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న వీరికి ఇదే పాడు బుద్ది అని చాలా అనుకుంటున్నారేమో. కాంట్రాక్టర్, ప్రభుత్వం వారిపై చూపుతున్న వివక్షను వ్యతిరేకిస్తూ నిసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐక్యంగా పోరాడారు. అధికారులు ఇచ్చిన హామీలను నమ్మి పోరాటాన్ని విరమించిన వారి గురించి ఈ వారం కొలువులో...
నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్స్కు ఏప్రిల్, మే నెలల జీతాలు ఇంత వరకు చెల్లించ లేదు. హౌస్కీపింగ్ సర్వీస్ కాంట్రాక్టర్ని నడిగితే ''నాకు ఇఎస్ఐ యాజమాన్యం బిల్లులు చెల్లించడం లేదు'' అని చెబుతున్నాడు. ఇఎస్ఐ డీన్తో తమ సమస్యను చెప్పుకుంటే ''నాదగ్గర బిల్లులు ఏమీ పెండింగ్లో లేవు, అన్నీ చెల్లించేశాను'' అని చెపుతున్నారు. దీనిలో ఏది నిజమో ఉద్యోగులు తేల్చుకోవాలనుకున్నారు. సీఐటీయూ అండగా పోరాటం మొదలుపెట్టారు.
ఎంత వివక్ష..?
అధికారులు, కాంట్రాక్ట్ర్ ఒకరిమీద ఒకరు దిగజారుడు మాటలు మాట్లాడుకుంటూ కార్మికులకు జీతాలు చెల్లించటం లేదు. డీన్కి - కాంట్రాక్టర్కి వున్న చాటుమాటు ఆర్థిక లావాదేవీలతో కార్మికులను ఎందుకు బలి చేస్తున్నారని యూనియన్ నాయకులు ప్రశ్నించారు. బకాయిపడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులందరికీ సమానపనికి సమాన వేతనం యివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే 2012లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం.11 ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఇఎస్ఐలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓని అమలు చేయటమేంటి? కష్టపడి చదువుకుని రోగులకు సేవలు చేస్తున్న ఈ ఉద్యోగులకు 9,500 రూపాయల నుండి 13 వేల రూపాయలు జీతమా? అది కూడా రెండు మూడు నెలలకొకసారి చెల్లించటమా? అదే పర్మినెంట్ ఉద్యోగులకు వీరికి ఇచ్చే దానికంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ జీతాలు ఉంటాయి. ఒకే చోట పని చేస్తున్న ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష చూడపం ఘోరం.
తల్లి కావటమే శాపంగా...
మహిళలు లేనిదే ఈ ప్రపంచం లేదు. పాత తరంపోతుంటే కొత్త తరాన్ని సృష్టించేది స్త్రీలు. అటువంటి స్త్రీలకు ఇఎస్ఐలో రక్షణ లేదు. గర్భం ధరించిన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి మెటర్నిటీ లీవ్పై వెళ్ళిందంటే ఆ పోస్టును వెంటనే లక్షల రూపాయిలకు అమ్మేస్తున్నారు. డెలివరికి వెళ్ళిన మహిళా ఉద్యోగికి ఇఎస్ఐలో ఉద్యోగ భద్రత లేదు. అసలు పిల్లలను కనటమే శాపంగా మారింది. వాస్తవానికి ఆరు నెలలు మెటర్నిటీ లీవుయివ్వాలి. ఈ ఆరు నెలలకు వేతనం కూడా చెల్లించాలి. ఇది చట్టం. కానీ సనత్నగర్ ఇఎస్ఐ హాస్పిటల్లో వేతనం చెల్లించరు. ఉద్యోగం వుండదు. ''దీనికి కాంట్రాక్టర్, ఇఎస్ఐ యాజమాన్యానిది బాధ్యత కాదా ? ఉద్యోగం చేస్తున్న ఒక గర్భిణీస్త్రీ లీవుపై బయటకు వెళితే పండగ చేసుకొంటున్నారు కొంత మంది అవినీతి పరులు. అంతేకాదు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంవత్సరానికి రెండే లీవులని గౌరవ మెడికల్ సూరింటిండెంట్గారు చెప్పారు. కార్మిక చట్టాలు తెలియని ఇటువంటి వాళ్ళని ఎట్లా ఆ బాధ్యత లిస్తారో అర్థం కావటం లేదు. చట్ట ప్రకారం 8 జాతీయ పండుగ సెలవులు, 12 క్యాజువల్ లీవులు, 18 వరకు ఎరన్ట్ లీవులు ఇవ్వాలి. ఈ చట్టం కూడా తెలియని అధికార్లను ఎట్లా నియమించిందీ కేంద్ర ప్రభుత్వం'' అని సీఐటీయు నాయకులు ప్రశ్నించింది. వారి న్యాయమైన పోరాటానికి అండగా నిలిచింది.
డబ్బులు దండుకోవటమే లక్ష్యంగా
ఈ ఉద్యోగులందరూ సుమారు మూడు సంవత్సరాలయింది ఇఎస్ఐలో జాయిన్ అయ్యి. ఇప్పటి వరకు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా ఇస్తామంటారేతప్ప ఇవ్వరు. ఇక పేస్లిప్ సంగతి చెప్పనక్కర్లేదు. ఈ మూడు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పే స్లిప్ ఇవ్వలేదు. అసలు ఈ కార్మికులు జీతం ఎంతో కూడా తెలియకుండా కాంట్రాక్టర్, ఇఎస్ఐ యాజమాన్యం జాగ్రత్త పడుతున్నారు. ఎవరైనా కార్మికుడు గట్టిగా అడిగితే ఆ కార్మికుడికి ఉద్యోగిగా అదే ఆఖరి రోజు. గతంలో జీతాలు పెంచండని అడిగినందుకు 29 మంది ఉద్యోగులపై కక్షకట్టి ఉద్యోగం నుండి తొలగించారు. కార్మికులను బానిసలకన్నా హీనంగా చూస్తున్నారు. అందుకే తెగించి పోరాటం చేశారు ఆ కార్మికులు. అన్ని సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగుతుందని యాజమాన్యాన్ని హెచ్చరించారు.
అక్రమ మార్గంలో
''విధులు బహిష్కరించక ముందే మా సమస్యలు పరిష్కరించాలని ముందుగానే నోటీస్ ఇచ్చాం. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఇఎస్ఐ యాజమాన్యాన్ని, కాంట్రాక్టర్ని ఆదేశించారు. అయినా సమస్యలు పరిష్కరించ కుండా లోపల వున్న సెక్యూరిటీ గార్డులతో పనిచేయించుకున్నారు. సెక్యూరిటీ గార్డులు కార్మికుల అవతారం ఎందుకెత్తారు. అట్లానే కేర్ హాస్పిటల్, ఇతర హాస్పిటల్ నుండి నర్సింగ్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి పని చేయిస్తున్నారు. కేర్, ఇతర హాస్పిటల్స్ వాళ్ళు ఇఎస్ఐకి స్టూడెంట్స్ని ఎందుకు పంపిస్తున్నట్లు? సమస్యను ఎందుకు పరిష్కరించటం లేదు. 2016 సంవత్సరం మార్చి నెల జీతం కూడా ఇంత వరకూ చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో'' అంటున్నారు యూనియన్ నాయకులు.
మాట నమ్మమన్నారు
యూనియన్ నాయకులు అండతో జూన్ 18 నుండి తమ పోరాటాన్ని ప్రారంభించారు. విధులను బహిష్కరించమని అనేక విధాలుగా తమ నిరసన తెలియజేశారు. కొంత దిగి వచ్చిన అధికారులు ఒక నేల జీతం మాత్రం అకౌట్లో వేశారు. మిగిలినది పోరాటం విరమిస్తే వేస్తామన్నారు. కానీ దానికి ఉద్యోగులు అంగీకరించలేదు. దాంతో తమను మోసం చేస్తున్న కాంట్రాక్ట్ర్ను తొలగించి వచ్చే నెల నుండి 41వేల జీతం వచ్చే విధంగా చూస్తామని మాట ఇచ్చారు. మాటలు కాదు రాతపూర్వకంగా ఇవ్వమంటూ అడిగారు. కానీ రాతపూర్వకంగా ఇచ్చేందకు అధికారులు అంగీకరించలేదు. నా మాట మీకు నమ్మకం లేదా? అంటూ డీన్సెంటిమెంట్ డైలాగులు చెప్పారు. అంత పెద్ద మనిషి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని సిబ్బంది అనుకున్నారు. కాని పోరాటం విరమించి 20 రోజులు గడిచింది. ఇస్తానని చెప్పిన రెండు నెలల జీతం ఇప్పటి వరకు ఇవ్వలేదు.
అన్నీ ఉత్తి మాటలే
పోరాటం చేస్తున్న క్రమంలో ఎన్నో హామీలు ఇచ్చారు. యూనియన్ నాయకుల అండ ఉండడంతో ఉద్యోగులను ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు వారి మాటలు నమ్మి విధుల్లో చేరిన తర్వాత రావల్సిన బకాయి జీతాలు ఇవ్వకపోగా పోరాటంతో ముందు నిలబడిన 40 మంది ఉద్యోగులను గుర్తించారని సమాచారం. లోలోపలే వారిని టర్మినెంట్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. దీనికి బలాన్ని ఇస్తూ సిబ్బంది ఉన్నప్పటికీ కొత్త సిబ్బంది కావాలంటే నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళను తొలగించి కొత్త వారికి ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు దీని ద్వారా అర్థమవుతుంది. తమకు న్యాయం చేస్తామంటూ ఇప్పుడు మాట మార్చిన అధికారులను నిలయదీయాలనుకుంటున్నారు. ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తే సహించేది లేదని, మళ్ళీ మరో పోరాటం చేస్తామంటూ అక్కడి సిబ్బంది అంటున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
''యాభై మంది రోగులకు ఒక్కరినే నియమిస్తారు. ఏదైనా తేడా వస్తే నోటీలు ఇస్తారు. మా జీతం కట్ చేస్తారు. మెటర్నటీ లీవ్కు వెళితే అందరికీ ఆరు నెలలు సెలవులు ఇస్తారు. కానీ మాకు మాత్రం మూడు నెలలు మాత్రమే. అది కూడా జీతం ఉండదు. ఆ డబ్బు కోసం వెళితే కమిషన్ ఇవ్వాలి. స్ట్రక్ చేసే ముందే నోటీసు ఇచ్చినా ఎలాంటి సమాచారం లేకుండా విధులు బహిష్కరించారంటూ మా ఇండ్లకు నోటీసులు పంపారు. అయినా భరించాం. చివరకు రోగుల కోసం, ఆధికారులపై ఉన్న నమ్మకంతో పోరాటం విరమించాం. కానీ 20 రోజులు గడిచినా మిగిలిన రెండు నెలల జీతం వెయ్యలేదు. మా పోరాటంలో న్యాయం ఉంది. కానీ మా సమస్యలకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంత మంది ఈ ఏడాది పిల్లలకు ఫీజులు కట్టలేక స్కూల్లో కూడా చేర్పించలేదు. మరికొంత మంది సిటీలో అద్దెలు కట్టలేక ఊరి నుండి ఉద్యోగానికి వస్తున్నారు. ఇలా మేము ఎన్నో కష్టాలు పడుతున్నార'' అంటున్నారు ఇఎస్ఐ ఉద్యోగులు.
Authorization