గ్రామంలోని ప్రజల అత్యవసరాలను తీర్చడంలో వీరు ముందుంటారు. కానీ వీరికి కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం వివక్ష చూపుతుంది. సుమారు 20 ఏండ్ల నుంచి గ్రామ పంచాయితీ వర్కర్లు, ఉద్యోగులుగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇన్నేండ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న కనీస వేతనాలకు నోచుకోలేకపోయారు. కుటుంబాలు గడవడం కష్టమై కడుపుమండీ గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయితీ కార్మికులు, ఉద్యోగుల సమస్యల గురించి నేటి కొలువులో...
గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలచే తీవ్ర నిర్లక్ష్యానికి గురౌతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు దాటిపోయినా వీరి సమస్యల్లో ఒక్కటీ పరిష్కరించలేదు. గతంలో ఈ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసిన సందర్భంగా కేటీఆర్ ఇచ్చిన హామీలు కూడా నీటిమూటలే అయ్యాయి. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లోనూ వీరికి మొండి చెయ్యే చూపారు.
ఎన్ని వినతులు ఇచ్చినా
నూతన పంచాయితీరాజ్ చట్టం వీరిని మనుషులుగా కూడా గుర్తించలేదు. గత ప్రభుత్వాల లాగానే ఈ ప్రభుత్వం కూడా వీరిని మోసగించింది. మళ్ళీ పోరుబాట పట్టడం తప్ప వీరికి మరో మార్గం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మిక సంఘాలన్నీ ఒక్కటై జూన్ 11న వందలాది మంది నాయకత్వంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ప్రభుత్వ నిరక్ష్య వైఖరిని నిరసిస్తూ అప్పటి నుంచి సంబంధిత అధికారులకు ఎన్నో వినతులు అందించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే వీరు ఈ నెల 23 నుంచి తెలంగాణ గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెను చేపట్టారు.
ఉద్యోగులు, కార్మికుల పట్ల వివక్ష
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఈ నాలుగేండ్ల కాలంలో సర్పంచ్ మొదలుకొని ముఖ్యమంత్రి వరకు భారీగా వేతనాలు పెంచుకున్నారు. వీరి వేతనాలకు ప్రభుత్వమే బడ్జెట్ ఇస్తుంది. కానీ పేద, దళిత గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచమంటే మాత్రం చేతులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంటు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తుంటే 'మీరు స్థానిక సంస్థలకు చెందిన వారు. మాతో మీకేం సంబంధం' అంటున్నారు. కానీ అదే స్థానిక సంస్థలలో ప్రజా సేవ చేయడానికి ఎన్నుకోబడిన సర్పంచుల నుండి జిల్లా పరిషత్ ఛైర్మన్ల వరకు రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంటు ద్వారా వేతనాలు చెల్లిస్తున్నది. ఇది ద్వంద్వనీతి కాదా? గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికుల పట్ల వివక్ష చూపడం కాదా? పంచాయితీ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి వివక్ష తగునా?
పని ఒత్తిడితో...
ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. మరొకవైపు దానికి సరిపడా పంచాయితీ కార్యదర్శుల నియామయం చేపట్టకపోవడంతో చాలా పంచాయితీలు ఇన్చార్జ్ల చేతిలో మగ్గుతున్నాయి. పంచాయితీల్లో కార్యదర్శిలేని లోటు కనబడకుండా విధులన్నీ ఆ గ్రామ పంచాయితీ కారోబార్లు, బిల్ కలెక్టర్లే నిర్వహిస్తున్నారు. అర్హత వున్నప్పటికీ వారికి పంచాయితీ కార్యదర్శులుగా ప్రమోషన్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలలో అర్హులైన ఉద్యోగ, కార్మికులను పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలి.
పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి
ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 50,114 మంది గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం 10,225 రూపాయల నుండి 13,635 రూపాయల వరకు నిర్ణయించి అమలు చేస్తోంది. వేతనాల చెల్లింపుకు రాష్ట్ర బడ్జెట్ నుండి ఏడాదికి 736 కోట్లు కేటాయించి, వేతనాలు నేరుగా ఉద్యోగ, కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నది. పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ పింఛనుతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. పొరుగునే ఉన్న కేరళ ప్రభుత్వం ఏ కార్మికుడికైనా కనీస వేతనం రోజుకు 600 రూపాయల చొప్పున నెలకు 18000 రూపాయలు చెల్లిస్తోంది. బెంగాల్, తమిళనాడు, చత్తీస్ఘడ్ లాంటి రాష్ట్రాలు బడ్జెట్ నుండి నేరుగా నిధులు విడుదల చేస్తూ, వేతనాలు చెల్లింపుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో బడాయిలు కొట్టుకునే రాష్ట్రప్రభుత్వానికి పొరుకు రాష్ట్రాలలో గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికులకు ఇస్తున్న వేతనం, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? మొద్దు నిద్ర నటిస్టున్న ప్రభుత్వానికి సమ్మె ద్వారా లేపాలి.
అందకికీ అన్నీ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికుల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ కార్మికులు, ఉద్యోగులు అందరూ ఏకమై అన్ని సంఘాలను కలుపుకుని ప్రభుత్వం మెడలు వంచి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని వీరి దీక్ష బూనారు.
డిమాండ్స్
- మున్సిపల్ కార్మికుల వలె వేతనాలు పెంచాలి. వేతన చెల్లింపులకు ప్రభుత్వమే గ్రాంటు ఇవ్వాలి.
- జీఓ.నెం. 112, 212 లను సవరించి అర్హులందరినీ పర్మినెంట్ చేయాలి.
- కర్ణాటక రాష్ట్ర తరహాలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
- కారోబార్లు, బిల్కలెక్టర్లతోపాటు అర్హులైన ఉద్యోగ, కార్మికులందరికీ పంచాయితీ కార్యదర్శులుగా ప్రమోషన్లు ఇవ్వాలి.
- పీఎఫ్, ఇఎస్ఐ, పింఛను సౌకర్యాలను వర్తింపజేసి, అమలు చేయాలి.
- జనశ్రీ బీమా స్థానంలో 5 లక్షల బీమా సౌకర్యాన్ని అమలు చేయాలి.
- అంత్యక్రియలకు చెల్లించే మొత్తాన్ని 5 వేల నుండి 20 వేలకు పెంచాలి.
పరిష్కారమయ్యే వరకు
గత నెల రోజుల నుండి మా సమస్యలు పర్కిరించాల్సిందిగా ఎన్నో వినతులు ఇచ్చాం. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఇక చివరకు 23 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో సమ్మె విజయవంతంగా జరుగుతుంది. గతంలో కంటే కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొంటున్నారు. 12,757 పంచాయితీల్లో 30 వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అందరూ ఒకేసారి సమ్మెలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అంటే సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సమ్మెలో కారోబార్లు, బిల్కలెక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. పంచాయితీ కార్యదర్శి చేయవల్సిన పనులన్నీ వీళ్ళే చూస్తారు. పారిశుద్ధకార్మికులు, ఎలక్ట్రిషన్స్, పంప్ ఆపరేటర్స్, వాటర్మెన్స్ ఇలా ఎంతో మంది కార్మికులు ఉద్యోగులు ఉన్నారు. వీరంతా గ్రామాల్లో ఎమర్జెన్సీ సర్విస్ అందించేవారు. ఈ ఐదు రోజుల కాలంలో అధికారులపై ఒత్తిడి బాగా పెరిగింది. రెండు రోజుల నుండి చర్చలు జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 9200 మంది గ్రామ కార్యదర్శుల పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటన ఇచ్చారు. కానీ 20 ఏండ్ల నుంచి ఇదే పని చేస్తున్న వాళ్ళను కాదంటున్నారు. వీరికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి. సీనియార్టీ ఉంది. వీరిని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నిరవధిక సమ్మె ప్రారంభించిన తర్వాత అధికారుల్లో కదలిక వచ్చింది. ప్రస్తుతానికి జీతాలు పెంచేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇంకా ఇది అధికారికంగా ప్రకటించలేదు. గతంలో ఇలాగే ఎన్నో సార్లు చెప్పారు. కానీ మాట తప్పారు. అందుకే ఈసారి నిర్థిష్టంగా సమస్యలు పరిష్కారమైతే తప్ప సమ్మెమ విరమించారు.
- ఐ.శ్రీపతిరావు, స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు
జనరల్ సెక్రటరీ, గ్రామపంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్.
Authorization