సింగరేణిలోని అడ్రిమాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్పి)లో పని చేస్తున్న సుమారు 300 మంది కాంట్రాక్ట్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో జూలై 19 నుండి 29 వరకు 11 రోజుల పాటు సమ్మె చేశారు. కాంట్రాక్టర్లు, సింగరేణి యాజమాన్యం మెడలు వంచి తమ వేతనాలను 1800 నుండి 3000 వరకు పెంచుకున్నారు. వారి పోరాట విశేషాల గురించి కొలువు పాఠకుల కోసం...
సింగరేణి యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న ప్రాజెక్ట్ ఏఎల్పి. ఈ ప్రాజెక్ట్లో మొత్తం యంత్రాలు, కాంట్రాక్టు కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేస్తారు. ఇక దీనినో పర్మినెంట్ కార్మికులు నామ మాత్రమే. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ జెఎంఎస్ అనే మల్టీనేషనల్ కంపెనీ నిర్వహిస్తున్నది.
అమలు కాని చట్టబద్ద సౌకర్యాలు
ఏఎల్పిలో కాంట్రాక్టు కార్మికులు ఎన్నో ఏండ్ల నుంచి సరైన సౌకర్యాలు లేకుండా అనేక కష్టాలు పడుతున్నారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా పని చేస్తున్నారు. కనీ వీరికి కనీస వేతనాలు మాత్రం అమలు చేయడం లేదు. సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన బోనస్ సర్క్యులర్, మెడికల్ సర్క్యులర్స్ ఈ కార్మికులకు అమలు చేయడం లేదు. అంతేకాదు అండర్ గ్రౌండ్, గ్రేడిమంట్ అలవెన్స్లు, చట్టబద్ద ఓటీ చెల్లించడం లేదు. ఏయిడ్ వాలిడేస్, ఆర్జిత సెలవులు అమలు చేయడంలేదు. కనీసం మస్టర్ కార్డులు, పే స్లిప్స్ కూడా ఇవ్వడం లేదు. వీరితో స్కిల్డ్ పనులు చేపించుకుంటూ అన్ స్కిల్డ్ వేతనాలు చెల్లిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంట్రాక్టర్లు, సింగరేణి యాజమాన్యం గత నాలుగు ఏండ్లుగా కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఈ కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు.
సమస్యలకు మూలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే
చట్టం ప్రకారం అండర్ గ్రౌండ్లో కాంట్రాక్టు కార్మికులను నియమించకూడదు. కానీ దీనికి విరుద్ధంగా ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తున్నాయి. కనీసం వీరికి ప్రత్యేక వేతనాలు కూడా నిర్ణయించలేదు. రోడ్స్ అండ్ బిల్డింగ్ వేతనాలను అమలు చేయకపోవడం శోచనీయం. కోలిండియా స్థాయిలో నిర్ణయించిన వేతనాలను సహితం అమలు చేయకుండ సింగరేణి యాజమాన్యం, టీఆర్ఎస్ ప్రభుతం మొండికేస్తున్నాయి. దీంతో సింరేణి కాంట్రాక్టు కార్మికులు శ్రమకు తగ్గ వేతనాలు అందక శ్రమ దోపిడికి గురవుతున్నారు. కుటుంబాలు గడవటమే కష్టంగా మారింది. అందుకే తమ వేతనాల పెంపు కోసం పోరుబాట పట్టారు. సీఐటీయూ వీరికి అండగా నిలిచింది.
11 రోజుల సమ్మె
కనీస వేతనాలు, కార్మిక చట్టాలు, రక్షణ సౌకర్యాలు అమలు చేయాలనే డిమాండ్లతో సింగరేణి కాంట్రక్ట్ కార్మికుల సంఘం(సీఐటీయూ) నాయకత్వంలో జూలై 5న సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్కు యాజమాన్యం స్పందించకపోవడంతో జూలై 19 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్ళారు. 11 రోజుల పాటు కార్మికులు దశల వారిగా పోరాటాలు నిర్వహించారు. జీఎం కార్యాలయాన్ని, జేఎంఎస్ కార్యాలయాలను ముట్టడించి దర్నాలు చేశారు. వరుసగా 4 రోజుల పాటు జేఎంఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. చివరకు వారి కాంపులో వుంటున్న బెంగాల్ కార్మికులను కూడా విధులకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. వీరు చేస్తున్న పోరాటానికి మద్దతు అడిగారు. ఈ విధంగా రాత్రింబవళ్ళు అక్కడే వుండి ఇల్లూ, కుటుంబం మరిచి పోరాటం చేశారు. వంటావార్పు చేసుకుంటూ అక్కడ పడుకొని పోరాటాన్ని కొనసాగించారు. దీంతో సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు దిగివచ్చి కార్మికులతో ఒప్పందం చేసుకున్నారు.
అండగా నిలబడ్డ పర్మినెంట్ కార్మికులు
ఏఎల్పీ కార్మికుల చేస్తున్న న్యాయమైన పోరాటానికి సింగరేణి పర్మినెంట్ కార్మికులు అండగా నిలబడ్డారు. సింగరేణి కాలరీస్ ఎంప్లారుమెంట్ ముఖిమన్ పిలుపు మేరకు జూలై 28న అన్ని ఏరియాలలో నిరసన దినం పాటించారు. అలాగే ఆర్జిత్రి కమిటి ఈ పోరాటాన్ని అంటి పెట్టుకొని వున్నది. ఇంతమంది వారి న్యాయమైన పోరాటానికి తోడు నిలబడటంతో మరింత పట్టుదలతో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేశారు. చివరకు విజయం సాధించారు.
ఒప్పంద అంశాలు
- ఈ ఒప్పందం ఫలితంగా ప్రతి కార్మికునికి నెలకు 1800 రూపాయల నుండి 3000 రూపాయల వరకు వేతనాలు పెరిగాయి.
- వేతనం రోజకు అన్స్కిల్డ్కు 462 రూపాయలు, సెమి స్కిల్డ్ 553 రూపాయలు, స్కిల్డ్ కార్మికులకు 645 రూపాయలు, హై స్కిల్డ్ కార్మికులకు 722 రూపాయలు చెల్లించుటకు, 6 నెలల కొకసారి వీడీఏ చెల్లించుటకు అంగీకారం కుదిరింది.
- వేతనంపై 8.33 శాతం బోనస్, 15 శాతం ఇతర అలవెన్స్లు చెల్లించుటకు ఒప్పుకున్నారు.
- కార్మికులు చేస్తున్న పని ఆధారంగా సింగరేణి నామ్స్ ప్రకారం సెమీస్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్గా క్యాటగిరైజేషన్ చేయుటకు అంగీకారం కుదిరింది.
- రక్షణ పరికరాలు సరిపోను, సకాలంలో ఇచ్చుటకు అంగీకరించారు.
- సింగరేణి హాస్పిటల్స్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించుటకు అంగీకారం కుదిరింది.
ఎన్నాండ్లని భరించాలి?
గత నాలుగు సంవత్సరాలుగా ఏఎల్పిలో పని చేస్తున్నాను. లోపట కనీస రక్షణ లేదు. పని ఎక్కువ వుంటుంది. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదు. ఈ బాధలు భరించే ఓపిక లేదు. ఇంకా ఎన్నాండ్లని చాలీ చాలని వేతనాలతో బతకాలి. అందుకే అందరం ఒకటైనం. తెగించి పోరాడినం. సీఐటీయూ జెండా కింద వేతనాలు పెంచుకున్నాం.
- సంపత్, కార్మికుడు
వెనకడుగు వేయలేదు
విడివిగా వున్న మమ్మల్ని సీఐటీయూ నాయకులు ఐక్యం చేశారు. మొదట కాంట్రాక్టర్లు జీతాలు పెంచమని మొండికేశారు. సింగరేణి అధికారులు కూడా వారికే సపోర్ట్ చేశారు. మేము వెనకడుగు వేయకుండా రాత్రీ పగలు అక్కడే వుండి పోరాడాం. వేతనాలు పెంచుకున్నాం.
- రవిగౌడ్, కార్మికుడు
సీఐటీయూ జెండా అండతో
సింగరేణిలో ప్రత్యేకమైన మైను ఏఎల్పీ. పేరులో మాత్రమే ప్రత్యేకత వుంది. మా జీవితాలలో, జీతాలలో మాత్రం ప్రత్యేకత ఏమీ లేదు. చేసే పని ఎక్కువ. వచ్చే జీతం తక్కువ. అందుకే ఐక్యం అయినాం. సీఐటీయూ జెండా, నాయకులు రాత్రి పగలు మాతో వుండి పోరాడి జీతాలు పెంచారు. - ఆర్. ప్రసాద్, కార్మికులు
మరిన్ని పోరాటాలు
సింగరేణి అధికారులు అండర్ గ్రౌండ్ బావులలో చట్ట విరుద్దంగా కాంట్రాక్టు కార్మికులను దింపుతున్నారు. వారికి అమలు కావాల్సిన హెచ్పిసీ వేతనాలు, రక్షణ సౌకర్యాలు, సీఎంపీఎఫ్, మైన్ చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, డీజీఎంఎస్ రూల్స్ వంటి ఏ ఒక్క చట్టబద్ద వేతనాలు, సౌకర్యాలు అమలు చేయకుండా కాంట్రాక్టు కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. ఏఎల్పీ కార్మికుల పోరాట స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తాం.
- బుర్ర తిరపతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, పెద్దపల్లి
- బి.మధు
(సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి)
సెల్: 9490098155
Authorization