నిత్యం బస్సులో అటూ ఇటూ తిరుగుతూ ఎక్కిన వారి దగ్గర టికెట్ తీసుకోవడం వారి వృత్తి. చాతగాకపోయినా కూర్చోవటానికి అవకాశం లేని ఉద్యోగం. అటువంటి వృత్తిలో వున్న వీరి సమస్యల గురించి ప్రభుత్వాలకు ఏమీ పట్టడంలేదు. మహిళల సంక్షేమమే తమ ధ్యేయమంటూ మాటలు చెబుతున్న ప్రభుత్వాలకు మహిళా కండక్టర్ల సమస్యలు మాత్రం చెవికెక్కడం లేదు. ఇంటా బయటా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ మహిళా కండక్టర్లు తమ జీవనోపాధిని సాగిస్తున్నారు. ఇలా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ, నిత్య పోరాటం చేస్తున్న మహిళా కండక్టర్లపై స్పెషల్ స్టోరీ 'కొలువు' పాఠకుల కోసం...
ప్రస్తుతం ప్రతి డిపోలో సుమారు ముప్ఫై మందివరకు మహిళా కండక్టర్లు వుంటారు. రాత్రి డ్యూటీలు, వందల కిలో మీటర్ల ప్రయాణం. వాతావరణ కాలుష్యం. అనారోగ్యాలు, లింగ వివక్ష, రద్దీగా ఉండే రూట్లూ, ప్రయాణికులతో గొడవలు. ప్రశ్నిస్తే ఎదురుదాడులు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దాదాపు అన్నీ రూట్లు చాలా రద్దీగా ఉంటాయి. ఉద్యోగాలకు, స్కూల్స్కు, కాలేజీలకు వెళ్ళే వారితో సిటీ బస్సులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. జనాభా సంఖ్యకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఉన్నబస్సుల్లోనే కిక్కిరిసి ప్రయాణిస్తారు. వెరసి ఆ భారమంతా కండక్టర్లపైనే పడుతుంది. ఎంత శ్రమించినా, సర్వీసెంతున్నా కండక్టర్గానే రిటైర్ కావాలి.
జాలి లేని ప్రభుత్వాలు
బస్సు రద్దీగా ఉంటే ఇదే అదనుగా కొంత మంది టికెట్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉంటారు. అడిగినా సమాధానం చెప్పరు. టికెట్ తీసుకున్నారో లేదోఅని అనుమానంతో రెండో సారి అడిగితే ప్రయాణికులలో కొందరు ఎన్ని సార్లు తీసుకోవాలని అంతెత్తు ఎగురుతారు. అదే ప్రశ్న అడిగింది ఆడ కండక్టరైతే! 'మతిమరుపు కండక్టరనో, ఆడవాళ్ళు ఇంతే, ఏమీ చేతకాదని', 'చాతకాకపోతే ఉద్యోగాలెందుకనీ' నోటి కొచ్చినట్లు మాట్లాడతారు. సాధారణంగానే మహిళలు అనేక శారీరక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వాటికి తోడు కండక్టర్గా బస్సులో నిత్యం నిలబడే పని చేయాల్సి వుంటుంది. నలభై సంవత్సరాలు దాటిన తర్వాత బస్సులో నిలబడలేక అనేక రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన అన్నీ సంస్థల మాదిరిగా ఆర్టిసిలో పనిచేస్తున్న కండక్టర్లకు కూడా సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు కల్పిస్తే మహిళలకు సౌకర్యంగా ఉంటుందని వారు కోరుతున్నారు.
అడుగడుగునా సమస్యలే
ఒక్కొక్క సారి మహిళా కండెక్టర్ టికెట్లు తీసుకునే హడావుడిలో ఉన్నప్పుడు డబ్బుల బ్యాగ్లను దొంగతనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ఎదురైనపుడు తను మహిళా కండక్టర్ కావడం వల్లే ఇలా జరిగిందని అధికారులు తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు, సస్పెండ్ చేసిన ఘటనలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ జామ్ వల్ల డ్యూటీలు దిగవల్సిన మహిళా కండక్టర్లు సమయం దాటి, నాలుగైదు గంటలు ఆలస్యంగా దిగాల్సి వస్తుంది. 'ఒక సారి ఒక లేడీ కండెక్టర్ ట్రాఫిక్ జామ్ వల్ల రాత్రి పది గంటలకు దిగాల్సిన డ్యూటీ రాత్రి రెండు గంటలకు దిగింది. ఆ సమయంలో ఇంటికి వెళ్ళటానికి సాధ్యం కాక డిపోలో ఉండి ఉదయం ఇంటికి వెళ్ళింది. దాంతో ఆమెకు, ఆమె భర్తకు పెద్దగొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా ఆమె ఉద్యోగాన్ని వదిలి ఇప్పుడు ఇంట్లో కూర్చుంది'. మహిళలకు ఎదురవుతున్న ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారికి రాత్రి సమయంలో డ్యూటీలు వేయకూడదని కోరుతున్నారు.
సౌకర్యాలు కరువు
మహిళా కండెక్టర్లకు డిపోలల్లో, టర్మినల్ పాయింట్లలో కనీస సౌకర్యాలు లేవు. మరుగుదొడ్ల సౌకర్యం లేదు. వెయిటింగ్ రూమ్లు ఉండవు. కనీస సౌకర్యాలు కల్పించమని అడిగితే తక్కువ చేసి మాట్లాడతారని మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బొంబే విధానం తెస్తామన్నారు
బొంబే విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీని మార్చేస్తామని కెసిఆర్ అన్నారు. అక్కడ పాసింజర్ టికెట్ తీసుకోకపోతే పాసింజరే ఫైన్ కట్టాలి. మనదగ్గర మాత్రం పాసింజర్ టికెట్ తీసుకోకపోతే కండక్టర్ను సస్పెండ్ చేస్తారు. ఈ విధంగా గడిచిన ఒక్క సంవత్సరంలో 637 మంది కండక్టర్లను సస్పెండ్ చేశారు. దాంతో చాలా బస్సులు తిరక్కుండా ఆగిపోయాయి.
పదేండ్ల సర్వీసుంటే ప్రమోషన్స్ ఇవ్వాలి
''ఆర్టీసి కండక్టర్గా ఇరవై ఏండ్ల నుండి పని చేస్తున్నా. ఈ పనిలో మానసిక ఒత్తిడి ఎక్కువ. మహిళా కం డక్టర్స్కు ప్రత్యేక సౌకర్యాలంటూ ఏమీ వుండవు. సమస్యలు అడిగితే మగవాళ్ళతో సమానంగా జీతాలు తీసుకుంటున్నారుగా మళ్లీ మీకు ప్రత్యేక సౌకర్యాలేంటని మాట్లాడతారు. సర్వీసును బట్టి ప్రమోషన్స్ ఇచ్చి మహిళలకు ఆఫీస్ పని కేటాయించాలని ఏన్నో ఏండ్లుగా పోరాడుతున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఎప్పుడు నిలబడే ఉండటం వల్ల నడుము నొప్పి, మెడ నరాల నొప్పులు, కీళ్ళ నొప్పుల వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఇంటికెళ్ళి ఇంటి పనులు చేసుకోవాలి. కనీసం మహిళలకు ఓ.డి చేసుకుందామన్నా అవకాశం ఇవ్వరు. పాసింజర్స్ విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా మంది రన్నింగ్లో వచ్చి బస్సు ఎక్కుతారు. అలా ఎక్కొద్దని వాళ్ళ మంచికి చెప్పినా మమ్మల్నే మాటలంటారు. మా రూట్ ఇండిస్టీయల్ ఏరియా కావడంతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అనుకున్న సమయానికి ఎప్పుడూ ఇంటికి చేరుకోము. ట్రాఫిక్ వల్ల ఎప్పుడూ గంట నుండి రెండు గంటలు ఆలస్యం అవుతుంది. సీనియర్స్ ఉదయం షిఫ్ట్లో డ్యూటీ చేసుకోవచ్చు. కానీ జూనియర్స్ మాత్రం అధికారులు చెప్పిన ప్రకారమే డ్యూటీ చేయాలి. వాళ్ళ డ్యూటీ ఒక్కొక్క సారి రాత్రి ఒకటి, రెండు గంటల వరకు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. బస్సు రూట్లకు సరిపడా కండక్టర్లు లేరు. ప్రయాణికులకు తగిన బస్సులు లేవు. మాకు వారాంతర సెలవులు ఇవ్వరు. ముఖ్యంగా మహిళా కండక్టర్లకు పది సంవత్సరాల సర్వీస్ అయిన వెంటనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి'' అంటున్నారు మరో మహిళా కండెక్టర్.
బేబీ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
''గత 19 సంవత్సరాల నుండి ఆర్టీసి కండక్టర్గా పని చేస్తున్నా. నేను చేరే నాటికి కేవలం ఒక్క సంవత్సరంలోనే పర్మినెంట్ చేశారు. నేడు కాంట్రాక్ట్ విధానం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు నిండితే గాని పర్మినెంట్ చేయడం లేదు. మహిళా కండక్టర్లు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మరీ హైదరాబాద్లో రద్దీగా ఉండే బస్సులో టికెట్ కోసం అటూ ఇటూ తిరగలేక ఊపిరాడని పరిస్థితి. ఇదే సందుకదా అని కొంత మంది ప్రయాణికులు టికెట్ లేకుండానే ప్రయాణిస్తారు. ఆ సందర్భంలో చెకింగ్ చేసే వారు వస్తే దానికి అపరాధ రుసం మా జీతంలో నుండే కత్తిరిస్తారు. బస్సులో జనం ఎక్కువగా ఉన్నప్పుడు మగవాళ్ళలోకి దూసుకొని వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఆ సమయంలో మేము ఆడవాళ్ళమనే విషయమే మర్చిపోవాలి. డ్యూటీ ఉదయం నాలుగంటలకే ప్రారంభమవుతుంది. ఆ సమయంలో డ్యూటీకి రావడానికి చిన్న పిల్లల తల్లులు పిల్లల్ని ఎక్కడ ఉంచి రావాలో అర్థం కాని పరిస్థితి. అందుకే ప్రతి డిపోకి అనుసందానంగా బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే మంచిది'' అంటున్నారు మిధానీ డిపోకు చెందిన ఓ మహిళా కండెక్టర్.
Authorization