ఉపాధి హామీ... ఈ పథకం అమలు కోసం వామపక్షాలు ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకానికి అనేక పరిమితులు పెడుతున్నది. దీనివల్ల కొద్దో గొప్పో పని చేసుకొని బతుకుతున్న పేదలు గంజిమెతుకులకు కూడా దూరం చేయాలని చూస్తున్నది. ఈ పథకం వచ్చిన తర్వాత ఎంతో మంది కూలీలుగా పని చేస్తున్నారు. వీరిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో నర్సరీలు పెంచే కూలీలు కూడా ఉన్నారు. అలాంటి ఈ నర్సరీ కూలీల సమస్యల గురించి నేటి కొలువులో...
అడవి సంరక్షణ కోసం మొక్కలు పెంచడానికి వీరిని నియమించారు. వీరు పెంచిన మొక్కల్నే ఖాళీగా ఉన్న మిగిలిన అడవి ప్రాంతానికి తీసుకెళ్ళి నాటుకుంటారు. ఇలాంటి నర్సరీలను ప్రతి అడవి ప్రాంతంలో ''వన్య సంరక్షణ'' పేరుతో ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో పనిచేయడం కోసం ఉపాధి హామీ కూలీలనే నియమించారు.వీరందరూ సర్సరీల్లో మొక్కలను సంరక్షిస్తారు. ఒక్క నర్సరీ పరిధిలో సుమారు 30 మంది విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో 20 మంది వరకు మహిళా కూలీలే ఉంటారు. మొక్కల్ని అంటుకట్టే పద్ధతి చేసే వారు కొందరైతే విత్తనాల ద్వారా మొక్కలను పెంచే వారు మరికొందరు. విత్తనాల ద్వారా మొక్కలు పెంచేవారు మట్టి కవర్లో పోసి అందులో విత్తనాలు వేసి అవి మొలకెత్తే విధంగా ఎంతో జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తారు.
కూలి తక్కువ
ఇలా వీళ్ళు వంద ప్యాకెట్లను ప్యాకింగ్ చేస్తే 80 రూపాయలు ఇవ్వాలి. అంటే ఒక్కో ప్యాకింగ్కి ఎనభై పైసలు ఇవ్వాలన్న మాట. కాని వీరికి కేవలం ఉపాధి కూలీలకు ఇచ్చే పైసలు మాత్రమే చేతిలో పెడతారు. ఒక్క ప్యాకింగ్ ప్రకారం లెక్క వేసి ఇచ్చినా రోజుకు చాలా మొత్తంలో కూలి వీరి చేతికి అందుతుంది. వీరిలో ఒక్కొక్కరూ రోజుకు 150 నుండి 200 ప్యాకింగ్లు చేయగలరు. ఇంకాస్త నైపుణ్యం కలిగిన వారు మూడు వందల ప్యాకింగ్లు కూడా చేయగలరు. కాని వీళ్ళకు కూలి ఇచ్చేటప్పుడు మాత్రం ఉపాధి హామీ కూలీలుగా నియమించుకున్నారు కాబట్టి ఆ ప్రకారమే కూలి ఇస్తారు.
అందరూ నిరక్ష్యరాస్యులే
అధికారులు ఈ కూలీలకు చెప్పడం మాత్రం వారు చేసే ప్యాకింగ్ లెక్క ప్రకారమే కూలి ఇస్తున్నామని మాయమాటలు చెబుతుంటారు.ఈ నర్సరీల్లో పని చేసే వాళ్ళందురూ దాదాపు గిరిజనులు, దళితులే ఉంటారు. అందరూ నిరక్ష్యరాస్యులే. వీరికి హక్కుల గురించి తెలీదు. కనీసం తాము శ్రమ దోపిడికి గురవుతున్నామని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఒకవేళ అధికారులు ఎవరైనా వచ్చినా తమ సమస్యలు చెప్పుకోవాలంటే భయం. దాంతో శ్రమకు తగ్గ ఫలితం తీసుకోకుండానే ఈ కూలీలు రోజంతా కష్టపడుతుంటారు. ఉపాధి కూలి పేరుతో వీరికి రోజుకు 180 రూపాయలు మాత్రమే ఇస్తారు. కాని వీరు పని చేసిన ప్రకారం చూస్తే కొందరికి రోజుకు మూడు వందల వరకు కూడా రావాల్సి ఉంటుంది. కానీ ఆ డబ్బును వారికి ఇవ్వరు.
కూలీలకు చేరనీయరు
ఆ ఇచ్చే కూలీలో కూడా కొంత కోత విధిస్తుంటారు. దీనికి అనేక సాకులు చెబుతుంటారు. సమయానికి పనికి రావడం లేదని, సెలవులు పెడుతున్నారని, పై నుండి సరిగా బడ్జెట్ పంపడం లేదని చెబుతుంటారు. వాస్తవానికి పై నుండి ప్రభుత్వం పంపాల్సిన బడ్జెట్ ఈ కూలీలకు పంపిస్తారు. కానీ ఆ మొత్తం కూలీల వరకు రావడం లేదు. పైగా వీళ్ళు నర్సరీలు పెంచేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ కూలీలకు కొంత మొత్తం ఇస్తారు. కానీ వాటి గురించి వీరికి అసలు తెలియనే తెలీదు. ఆ డబ్బు ఏమౌతుందో ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోతుంది. వీటన్నింటి గురించి ప్రశ్నిస్తే వచ్చే కూలీ కూడా రాదేమోనని ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా బయట ఉపాధి కూలీలు ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తారు. అంటే వీరు ఆరుగంటలు మాత్రమే పని చేస్తారు. ఈ నర్సరీల్లో పని చేసే కూలీలు మాత్రం రోజుకు పది నుండి పన్నెండు గంటల వరకు కూడా పని చేస్తుంటారు. కానీ వీరికి ఇచ్చే కూలి మాత్రం మిగిలిన వారికి ఇచ్చినంతే ఇస్తారు.
ప్రమాదాలు ఎక్కువ
వీరందరూ ఈ నర్సరీలలో పని చేయడానికి ఎక్కడెక్కడి నుండో వస్తారు. వీరికి ఆ పూటకి కొన్ని వసతులు కల్పించాలి. ప్రభుత్వమే వారికి టెంట్, ప్రాథమిక చికిత్సకు కావల్సిన సౌకర్యాలు, భోజన వసతి కూడా కల్పించాలి. ఇంకా వీరంతా అడవి ప్రాంతంలో పనిచేస్తుంటారు కాబట్టి అనేక ప్రమాదాలు సంభవిస్తుంటాయి. పాములు, విష కీటకాల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరికి ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండాలి. కాని ఇలాంటి సౌకర్యాలేవీ వీరికి అందుబాటులో ఉండవు. ఎంత ప్రమాదమైనా కూలి చేసుకోవాల్సిందే. లేదంటే రోజు గడవడం కష్టం.మిగిలిన ఉపాధి కూలీలకు సీజన్ల ప్రకారం పని కేటాయిస్తారు.
పస్తులతో బతుకుతున్నారు
వీరికి 150 పని దినాలు కల్పించాలి. కుటుంబంలో ఇద్దరికి కచ్చితంగా పని కల్పించాలి. చెరువుల పూడిక తీయడానికో, గుంతలు తీయడానికో వీరిని కేటాయిస్తారు. ఈ మధ్య కాలంలో యంత్రాలు వచ్చిన తర్వాత ఉపాధి కూలీలకు సరైన పని దొరకడం లేదు. దాంతో వీరు ఆదాయం లేక పస్తులతో బతకాల్సి వస్తుంది. ఇక నర్సరీల్లో పని చేస్తే కూలీలకు ఆ పని తప్పా వేరే పని కేటాయించారు. సీజన్లో మాత్రం నర్సరీల్లో పని చేస్తారు. అన్సీజన్లో ఈ కూలీలు పని లేకుండా ఖాళీగా గడపవల్సి వస్తుంది.దాంతో వారు సీజన్లో మాత్రమే కాస్త కడుపునిండా తినగలుగుతారు. మిగిలిన సమయంలో పస్తులతో బతకాల్సిందే. అందుకే వీరికి కూడా అన్ని సమయాల్లో పని కల్పించాలి.
శ్రమకు తగ్గ ఫలితం ఏది..?
వీరి సమస్యలపై రూరల్ డెవలప్మెంట్ అధికారులను కలిసినపుడు 'అన్ని ప్రాంతాల్లో బాగానే ఉంది. కూలీలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నాం. ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకు రండి, మేం వెంటనే పరిష్కరిస్తాం' అని సమాధానం చెబుతారు. కానీ సమస్యలను వారి దృష్టికి తెచ్చినప్పుడు మాత్రం అధికారులు పట్టించుకోరు. పేరుకు ఈ కూలీలందరూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న కార్మికులు. వీరికి ఎలాంటి సౌకర్యాలూ లేవు. కనీసం శ్రమకు తగ్గ ఫలితం కూడా లేదు. వీరంతా కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్న వారే. వీరికి పని భద్రత లేదు. పని చేసే చోట రక్షణ లేదు. అందుకే ఆ కార్మికులు శ్రమకు తగ్గ ఫలితం కావాలని కోరుకుంటున్నారు. మొత్తానికి ఉపాధి హామీ పథకాన్నే కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుంది. పేదలకు కాస్త పని కల్పించి తిండి పెడుతున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఉద్యమాలు చేయక తప్పదు.
Authorization