ఎలా పుట్టాలో, ఎవరికి పుట్టాలో మన చేతుల్లో లేదు. అంతా ప్రకృతే నిర్ణయిస్తుంది. అవయవ లోపాలతో పుట్టడం వారి తప్పు కాదు. కానీ శిక్ష పడుతుంది మాత్రం వారికే. ఏదో సాధించాలనే తపన. అందరితో సమానంగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక. కానీ పరిస్థితులు అనుకూలించవు. పైగా అవహేళనలు. ఇలాంటి వారికి చేయూతనివ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికుంది. వారిలోని ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి సాధించాలే వారి ఆశయానికి ఊతమివ్వాల్సింది ప్రభుత్వాలే. శారీరక లోపాలతో పుట్టి తప్పు తమది కాకపోయినా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వికలాంగుల ఉపాధి సమస్యలపై నేటి కొలువులో...
డిమాండ్స్
- రాష్ట్రంలోని పదిన్నర లక్షల మందిలో కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే పింఛన్ పొందుతున్నారు. మిగతావారందరికి పింఛన్లు ఇవ్వాలి.
- నిరుద్యోగ వికలాంగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
- అర్హులైనవారందరికి అంత్యోదయ కార్డులు ఇవ్వాలి.
- ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వికలాంగులకోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలి
- ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా 4శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
- కేజీ నుండి పీజీ వరకు వికలాంగుల కోసం ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి.
- ప్రత్యేక ప్రభుత్వ వసతి గృహాలు ఏర్పాటు చేయాలి.
- బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి.
- వికలాంగులపై దాడులు, లైంగిక వేధింపులు అరికట్టేలా చర్యలు తీసుకోవాలి.
- వికలాంగులను వేధించినవారిపై ఆర్.పి.డి 2016యాక్ట్ కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
- గ్రామపంచాయితీ నిధుల్లో 5శాతం వీరి కోసం ఖర్చు పెట్టాలి.
- సంక్షేమ పథకాల్లో ఇచ్చే ఆర్థిక సహాయం వికలాంగులకు 25శాతం అదనంగా ఇవ్వాలి.
- ఉపాధిహామీ పథకం కింద 150రోజులు పని వీరికి కూడా కల్పించాలి.
వృత్తిలోన్లు ఇచ్చి, తలదాచుకునేందుకు చిన్న ఇల్లు ఇచ్చి, కనీస సౌకర్యాలు కల్పిస్తే అందరితో సమానంగా శ్రమిస్తారు. చేతనైన పని చేసి తమ బతుకు తాము బతుకుతారు. తమపై ఆధారపడిన వారిని బతికించుకుంటారు. అంతేకాదు సమాజ ఉత్పత్తిలో భాగస్వాములు అవుతారు. వారే వికలాంగులు. వీరికి ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి అభివృద్ధికోసం ఉన్న జీవోలు సక్రమంగా అమలు చేయిలి. బడ్జెట్లో వారికోసం ప్రత్యేక వాటా కేటాయించాలి. ఆ నిధులను సక్రమంగా ఖర్చుపెట్టాలి. వారి జనాభా, ఆర్థిక, సామాజిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి రంగంలో రిజర్వేషన్లు కేటాయించాలి. అందరికీ పెన్షన్లు ఇవ్వాలి. అప్పుడే వారి అభివృద్ధికి తోడ్పాటునిచ్చినట్లవుతుంది.
అవసరాలు తీర్చినప్పుడే
సమాజంలో స్త్రీలు, పురుషులు, ట్రాన్స్జెండర్స్లాగే వికలాంగులు కూడా ఒక ప్రత్యేకమైన గుంపుగానో, వర్గంగానో కనిపిస్తారు. వారికీ ప్రత్యేకమైన సౌకర్యాలు, సౌలభ్యాలు అవసరం. వారి శారీరక, మానసిక అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని వారి అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. వారుకూడా సమాజంలో భాగస్వాములనీ, అందరితో పాటు సమానంగా ఎదగాలనీ, గౌరవం పొందాలనీ వారు అనుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు. తమపై ''అయ్యో! పాపం'' అనే భావం కంటే చేతనైతే మా హక్కులకై పోరాడటానికి మద్దతివ్వండి. ఉచిత పరామర్శలు అవసరం లేదనే వారు చాలామంది ఉంటారు. వారి మనోభావాలు సమ్మతమైనవే.
గౌరవంగా బతకాలని
అంధులు, చెవిటి, మూగ, మానసిక వైకల్యం శారీరక వైకల్యం... ఇలాంటి అన్ని రకాల సమస్యలు ఉన్న వికలాంగులు దేశవ్యాప్తంగా రెండున్నర కోట్లు, రాష్ట్రంలో 10లక్షల 50వేల మంది ఉంటారు. మన రాష్ట్రంలో రెండు లక్షల మంది విద్యార్థులున్నారు. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, గౌరవంగా బతకాలి అనే ఆశలతో ఉన్నవారు ఇంకా చాలా మందే ఉంటారు. కాని వీరికోసం కేవలం ఏడు మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థలున్నాయి. మరో 18 ప్రైవేట్ విద్యాసంస్థలున్నాయి. అప్పోసప్సో చేసి ప్రైవేట్ విద్యాసంస్థల్లో కొందరు చదువుకున్న వారు ఇప్పటికే రెండు లక్షల మంది ఉన్నారు. చాలామందికి ఇలాంటి పెద్దపెద్ద పాఠశాలల్లో చదువుకోవడం ఆచరణసాధ్యం కానిపని.
రాణించాలని ఉన్నా...
రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో కేవలం మూడు శాతం మాత్రమే వికలాంగులకు కేటాయించారు. మరోవైపు సైగలభాష, బ్రెయిలీ లిపి వంటివి అందుబాటులో లేవు. ర్యాంపులుండవు. ఈ కారణంగా అనేకమంది విద్యార్థులు రాణించలేకపోతున్నారు. ఆర్థిక స్థోమత లేక చాలామంది పాఠశాల స్థాయిలోనే డ్రాప్ఔట్ అవుతున్నారు. ఇలాంటి విద్యార్థులు ఇటువంటి సమస్యల నుండి బయట పడాలంటే కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యలో భాగంగా పెట్టబోతున్న గురుకులాల్లో వీరి కోసం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం గుర్తించాలి
శారీరక వికలాంగులతో పాటు మానసిక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలేర్పాటుచేయాలి. వీరికోసం ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను కేటాయించాలి. వీరికి అడ్మీషన్ ఇవ్వడానికే విద్యాశాఖవారు జంకుతున్నారు. బదిరులు దాదాపు 37వేల మంది ఉంటే కేవలం 5శాతం మంది మాత్రమే చదువుకున్నవారున్నారు. వీరికి ఇంటర్మీడియెట్ వరకు మాత్రమే ప్రత్యేక విద్యా అవకాశాలున్నాయి. ఆపై సైగల భాషలో విద్యావకాశాలు లేక ఉన్నత విద్యకు దూరమై ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు. ఎవరికి అవసరమైన సౌకర్యాలు వారికి కల్పించి చదువు ఉద్యోగాల్లో అవకాశం కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు.
భరోసా ఇవ్వాలి
మహిళా వికలాంగులకు ప్రత్యేక సమస్యలున్నాయి. వీరు ఎక్కువ మంది ఇంటినుండే వివక్షకు గురవుతున్నారు. అన్నీ మంచిగ ఉన్న ఆడపిల్లల్ని చదివించడానికి ముందుకు రాని కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇక వీరి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. పెండ్లి అవుతుందో కాదో వంటి ఆందోళనకు గురవుతూ వారు కూడా మానసికంగా కుంగిపోతుంటారు. ఇటువంటి వారికి జీవితంపై భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం, కుటుంబ సభ్యులపై ఉంటుంది. ఎలాంటి ఆదరణకు నోచుకోక కొందరు అనివార్యంగా ట్రాఫిక్ సిగల్స్, దేవాలయాల వద్ద భిక్షగాళ్ళుగా మారుతున్నారు. వీరి జీవితాలు రోడ్లపై మగ్గుతున్నాయి. కారణంగా దోపిడీదొంగలు, అరాచకుల చేతుల్లో అనేక రకాల దాడులకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ప్రభుత్వ నిరాదరణే దీనంతటికి కారణమవుతున్నదనేది స్పష్టం. ఇకనైనా మహిళా వికలాంగుల కోసం ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేయిలి. డ్వాక్రా గ్రూపులతో సమానంగా వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి. అర్హులైనవారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే అంగన్వాడీ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది.
నిరుద్యోగమే కారణం
పనిచేసే శక్తి ఉన్నా అంగవైకల్యం కారణంగా ఆ శక్తిని గుర్తించలేక పోవడం సామాజిక తప్పిదమే అవుతుంది. కారణంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ ఆదరణ లేక కనీస సౌకర్యాలకు నోచుకోవడంలేదు. కనుక కూలీ పనులు ఇచ్చేవారు కూడా వికలాంగులకు పని ఇవ్వడానికి ముందుకు రావడం అరుదు. ప్రైవేటు కార్యాలయాల్లో, విద్యా, వైద్య, వ్యాపార సంస్థల్లో, నిర్మాణ కేంద్రాల్లో, ఇంటిపనుల్లో వీరికి పని ఇవ్వడానికి ముందుకు రారు. కనుక ప్రభుత్వ పథకాల్లో వీరిని పనిలో పెట్టుకోవడానికి అవసరమైన ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. పనికి ఆహారపథకం, చెట్లు నాటడం, పారిశుద్ధ్యం, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వాచ్మెన్, అటెండర్ వంటి ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి.
Authorization