నిర్దిష్ట పనిగంటలు లేవు. ఓవర్ టైమ్ పని చేసినా లెక్క కట్టరు. క్యాంటిన్, ట్రాన్స్పోర్టు అలవెన్స్లు లేవు. ప్రమాదాలు జరిగినా, అనారోగ్యం పాలయినా ఆదుకునే వారు లేరు. సంఘటితమై తమ హక్కుల గురించి మాట్లాడితే ఉద్యోగాలకే ఎసరొస్తొంది. యాజమాన్యాలు, కాంట్రాక్టర్ల కక్షసాధింపు చర్యలకు పూనుకుంటున్నారు. అక్రమంగా తొలగిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంతటి ఘోరమైన పరిస్థితులుంటే ప్రిన్సిపుల్డ్ ఎంప్లాయర్గా ఉన్న యాజమాన్యాలు ఉదాసీన వైఖరితో ఉంటున్నాయి. అత్యధిక చోట్ల కాంట్రాక్టర్లకే కొమ్ముకాస్తున్నాయి. ఇక ప్రైవేట్ సంస్థల్లోనైతే కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులంతా బానిసలుగా వెట్టి చేస్తున్నారు.
తమ సమస్యలు పరిష్కరించమని కార్మిక శాఖ అధికారులకు పిర్యాదులు చేసినా ఫలితం లేదు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కార్మిక వివాదాలను పరిష్కరించడంలో లేబర్ అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం చేస్తున్నారు. కార్మిక చట్టాలను సమర్ధవంతంగా ఎన్ఫోర్స్ చేసి కార్మికులకు తగిన న్యాయం చేయటంలో కేంద్ర లేబర్ డిపార్ట్మెంట్ పూర్తి వైఫల్యం చెందుతున్నది. కాంట్రాక్టర్ల విచ్చలవిడి దోపిడీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాల ఉదాసీనత, లేబర్ అధికారుల అసమర్ధత మూలంగా కాంట్రాక్టు, క్యాజువల్, ఔట్ సోర్సింగ్, టెంపరరీ కార్మికులంతా తీవ్రమైన శ్రమదోపిడీకి గురౌతున్నారు. పని స్థలాల్లో భద్రత లేదు.
జీవోలు వచ్చినా ఉపయోగం లేదు
కనీసం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు సవరిస్తూ కొత్త జీవోలు విడుదల చేయాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించారు. అప్పుడప్పుడూ విడుదల చేసిన జీవోలకు కూడా ఎలాంటి ప్రమాణికం ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జస్టిస్ మాథుర్ కమిటీ 7వ కమిషన్ సందర్భంగా కనీస వేతనం 18 వేల రూపాయలు సిఫారసు చేసింది. దీన్ని నరేంద్ర మోది ప్రభుత్వం అంగీకరించి కూడా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అమలు చేయడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఇండియన్ లేబర్ కాంగ్రెస్ 15వ తీర్మానం(1957), డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం కనీస వేతనం 26 వేల రూపాయలకు పైగానే రావల్సి ఉంది. అయినా కార్మికుల శ్రమను కారుచౌకగా కొల్లగొట్టేందుకు కనీస వేతనాలను ప్రభుత్వం తక్కువగా నిర్ణయిస్తున్నది.
పెట్టుబడిదారుల కోసమే...
ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వ్యాపారం) పేరుతో పెట్టుబడి దారులకు, బహుళజాతి సంస్థల లాభాల కోసం కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులను బలిపెడుతున్నది. అందువల్లనే పెట్టుబడిదారులు తెగబలసిపోతుంటే కార్మికులు చాలీచాలని వేతనాలు అందుకుంటూ అర్ధాకలితో జీవిస్తున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్మికులంతా సంఘటితం కావాలి. యజమాన్యాల దోపిడీని నిలువరించాలి. కనీస వేతనాలు, రెగ్యులరైజేషన్, చట్టబద్ద సౌకర్యాల అమలుకై ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని2016 అక్టోబర్ 26 న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ అత్యున్నత న్యాయం స్థానం ఇచ్చిన ఈతీర్పును కనీసం ఒక్క సంస్థలోనైనా అమలు చేసిన దాఖలా లేదు. కార్మికులకు ఇంత హోరమైన అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తనకేమీ పట్టనట్టుంటున్నది. మరోవైపు కార్మిక సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి.
వ్యత్యాసం లేకుండా చూడమంటే..!
శాశ్వత ఉద్యోగులతో పాటు తాత్కాలిక ఉద్యోగులూ సమాన వేతనానికి అర్హులని, పర్మినెంట్ కార్మికులు నిర్వర్తించే విధులు, బాధ్యతలు కాంట్రాక్టు కార్మికులు నిర్వర్తిస్తే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కరువు భత్యం(డీఏ) కూడా వర్తింపచేయాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. రెగ్యులర్, టెంపరరీ అనే వ్యత్యాసం లేకుండా సమాన పనికి సమాన వేతనం కోరే హక్కు ప్రతి ఉద్యోగికీ ఉందనీ, సంక్షేమ రాజ్యంలో ఒకే పని చేసే ఇద్దరు ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం అర్ధం లేనిదని, మానవాళి గౌరవానికే ముప్పు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సమాన పనికి తక్కువ వేతనంతో పని చేయడానికి ఇష్టపూర్వకంగా ఏ కార్మికుడు ముందుకు రాడన్న వాస్తవం గుర్తించాలని కోర్టు వివరించింది.
రాజ్యాంగం ప్రకారం...
1979 ఏప్రిల్ 10వ తేదీన మన దేశానికి అంతర్జాతీయ సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒప్పందం పై సంతకం లభించిందని సుప్రీంకోర్టు చెప్పింది. భారత రాజ్యాంగంలోని అర్టికల్ 141 ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని ప్రతి కార్మికుడు పొందాలి. కాంట్రాక్టు లేబర్ (రెగ్యులేషన్ అండ్ అబాలిషన్) చట్టం 1970, రూల్ 25(వి) ప్రకారం కూడా ఏదైనా పరిశ్రమలో పర్మినెంట్ కార్మికులు-కాంట్రాక్టు కార్మికులు ఒకేరకమైన పనులను చేస్తుంటే పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే వేతనాలు, అలవెన్స్లు కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇవ్వాలని చెబుతుంది. అయినప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దీన్ని అమలు చేయడం లేదు.
ఉద్యమాల ఫలితమే...
కాంట్రాక్టు కార్మికుల పోరాటం ఫలితంగా 2016 జనవరి 19 నుండి కేంద్ర ప్రభుత్వం గెటిజ్ నెం:173 ద్వారా వేతనాలు పెంచింది. దీని ప్రకారం 'ఎ' ఏరియాలో రోజుకు అన్స్కిల్డ్ 536 రూసాయాలు, సెమిస్కిల్డ్ 593 రూపాయలు, స్కిల్డ్ 653 రూపాయలు, హైస్కిల్డ్ 710 రూపాయలు. 'సీ' ఏరియాలో అన్స్కిల్డ్ 359 రూపాయాలు,సెమిస్కిల్డ్ 420 రూపాయలు, స్కిల్డ్ 506 రూపాయలు, హైస్కిల్డ్ 593 రూపాయలు చెల్లించాలి. కాని ఈ వేతనాలను కూడా అనేక సంస్థల్లో అమలు చేయడం లేదు.
ప్రశ్నించాలి...
రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు. ఊరూరా వెళ్ళి ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. నాలుగున్నరేండ్లు పాలించిన కేసీఆర్ ఆ పర్మినెంట్ ఊసే ఎత్తలేదు. పైగా ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గొంతెత్తితే అరెస్టులు చేయిస్తున్నారు. నిర్ధాక్షిణ్యంగా ఉద్యమాలను అణచివేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ముందస్తు ఎన్నికలు పెట్టి ''ఎంతో అభివృద్ధి చేశాం. మళ్ళీ అధికారం ఇస్తే ఇంకా చాలా చేస్తాం'' అంటూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులంతా ఏకమవ్వాలి. సమాన పనికి సమాన వేతనం వచ్చే వరకు పోరాడాలి. ఓటు కోసం ఇంటి ముందుకు వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రశ్నించాలి. నిజంగా కార్మిక పక్షాన నిలబడే వారికి మాత్రమే ప్రజలు పట్టం కట్టాలి.
Authorization