పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తప్పక న్యాయం చేస్తామన్నారు. అందుకే కేసీఆర్ ఇచ్చిన స్పష్టమైన హామీ అమలు కోసం 1998 డి.ఎస్.సి బాధితులు ఆశతో ఎదురు చూస్తున్నారు. 'అధికారులు సహకరించకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అయినా మీ అందరికీ మానవతా దృక్పథంతో టీచర్ ఉద్యోగాలు' ఇచ్చి ఆదుకుంటాను అని స్వయంగా ముఖ్యమంత్రి అభయం ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి నోటివెంట వచ్చిన ఆ మాటలను విన్నటువంటి బాధితులు, వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. సంతోష సంబరాలలో మునిగితేలారు.
1998 డీఎస్సీ సమయంలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో డీఎస్సీ-98 ఎస్.జి.టి రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో మెరిట్ అభ్యర్థులకు తీరని నష్టం జరిగింది. అంతేకాదు సున్నా మార్కులు వచ్చిన వారికి టీచర్ ఉద్యోగాలు వచ్చి మెరిట్ అభ్యర్థులు రోడ్డున పడ్డారు. స్వయంగా కేసీఆర్ చెప్పినా న్యాయం జరగలేదు. దాంతో డీఎస్సీ బాధితుల పరిస్థితి దైన్య స్థితికి చేరింది.
సగం వయసైపోయిందంటా
2016 డిసెంబర్ వరకూ 1998 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని మీడియా సమావేశాల్లో పదే పదే చెప్పిన విద్యా శాఖ మంత్రి హఠాత్తుగా మాట మార్చారు. 'డీఎస్సీ -98 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వలేం' అంటూ ఆఫ్ ది రికార్డ్గా చెప్పి లీకింగ్...బ్రేకింగ్ వార్త వదిలారు. ఆ తర్వాత కూడా కలిసిన డీఎస్సీ-1998 బాధితులకు 'నా వర్క్ కంప్లీట్ అయ్యింది. ముఖ్యమంత్రికి దగ్గరగా వుండే ముఖ్యులకు చెప్పి పని చేయించుకోండి' అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో 'అర్హులకు న్యాయం చేస్తాం అంటూ' చట్ట సభల్లో విపక్షాలు అడిగిన ప్రశకు సమాధానంగా చెబుతూనే మరోవైపు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్స్ ''ఔట్ డేటెడ్'' అని సగం ముసలోళ్లు అయ్యారు అంటూ ముఖ్యమంత్రి సహా విపక్షాలు, స్వపక్షాల ప్రజా ప్రతినిధులకు నూరిపోశారు.
మానసిక సంఘర్షణతో...
ఆ తర్వాత ముఖ్యమంత్రికి గోడు చెప్పుకుందామంటే అప్పాయింట్మెంట్ లభించక, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చుట్టూ తిరిగితే విద్యా శాఖ మంత్రిని కలవండి అని వారు హితవు పలకడం నిత్యకృత్యంగా మారింది. సెక్రటేరియట్, మంత్రుల క్వార్టర్స్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఉద్యోగాలు ఎండమావిలా మారాయి. క్వాలిఫైడ్స్ బాధితులు, వారి కుటుంబ సభ్యుల్లో మానసిక సంఘర్షణ నానాటికీ తీవ్రతరం అయ్యింది. ముఖ్యమంత్రి 2014 డిసెంబర్ నుంచి ఇస్తున్న హామీ అమలులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇస్తానన్న హామీకి విద్యా శాఖ ఉన్నతాధికారులు మోకాలు అడ్డుతున్నారు.
ప్రాణాలు తీశారు
'డీఎస్సీ -1998 బాధితుల సమస్యను స్పెషల్ కేసుగా పరిగణనలోకి తీసుకుని పరిష్కరిస్తా. వారంతా చెప్పులరిగేలా ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. వయోపరిమితితో సంబంధం లేకుండా వారికి మానవతా దృక్పథంతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటాను' అంటూ కేసీఆర్ పదే పదే మీడియా ముందు చెప్పిన మాటలు ప్రజల్లోకి కూడా చొచ్చుకుపోయాయి. దాంతో బాధితులు తమకు ఎలాగైనా ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టుకున్నారు. కానీ అదే ఆశ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 మంది డీఎస్సీ బాధితుల ప్రాణాలు తీసింది. ఉద్యోగాలు రావడంలేదన్న బాధ గుండెల నిండా చేరి గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలారు. అయినప్పటికీ విద్యా శాఖ ఉన్నతాధికారులలో వారికి న్యాయం చేద్దాం అనే జాలి, దయ మచ్చుకయినా కానరావడం పోవడం గమనార్హం.
ఫలితాలు ప్రకటించకుండా
1998 మెగా డీఎస్సీ లో దాదాపు 40 వేల టీచర్ పోస్టుల భర్తీకి విద్యా శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. రాత పరీక్ష 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు మొత్తంగా 100 మార్కులకు ఎస్జీటీ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు. ఓ.సి అభ్యర్థులకు 50, బి.సీలకు 45, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు (కటాఫ్) నిర్ణయిస్తూ జీ.ఓ నెంబర్ 221 నోటిఫికేషన్ పై పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. రాత పరీక్ష ఫలితాలు ప్రకటించే సమయానికి నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతున్నందున ఈ 4 జిల్లాల్లో రాత పరీక్ష ఫలితాలను ప్రకటించలేదు. ఈ పరిణామం డీఎస్సీ-1998 అభ్యర్థుల పాలిట శాపమై కూర్చుంది.
అవినీతి పరులకు వరం
రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ప్రకటించిన డీఎస్సీ రాత పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. దీంతో...అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో ప్రత్యేక జీ.ఓ విడుదల చేసి కటాఫ్ మార్కులను తగ్గించింది. ఓసి 45, బిసి 40, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు 35 మార్కులను కనీస అర్హత మార్కులు (కటాఫ్)గా నిర్ణయించారు. ఇలా చేయని పక్షంలో సుమారు 15,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోతాయని భావించి ప్రభుత్వం జీ.ఓ నెంబర్ 618 విడుదల చేసింది. అయితే ఉపఎన్నికలు లేనటువంటి 19 జిల్లాల్లో కనీస అర్హత (కటాఫ్)మార్కులను తగ్గిస్తూ ఇంటర్వ్యూ కోసం 1:2 చొప్పున రెండవ జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ఎన్నికలు పూర్తి అయిన తర్వాత నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రెండు జాబితాలను కలిసి ఒకేసారి ఇంటర్వ్యూ కోసం ఎంపిక అయిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో అవినీతి, అక్రమార్కులకు వరంగా మారింది.
కోర్టుతీర్పును లెక్కచేయట్లేదు
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ (నేటి తెలంగాణ రాష్ట్రం) జిల్లాలు తప్ప మిగతా 19 జిల్లాల్లో డి.ఎస్.సి-1998 ఫస్ట్ లిస్టులో ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు అందరికీ టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఈ 4 జిల్లాలలో కటాఫ్ మార్కులు తగ్గించక ముందు అంటే 221 జీ.ఓ ప్రకారం మెరిట్ సాధించిన అభ్యర్థులు ఉద్యోగాలు రాకుండా నష్టపోయారు. 2007లో ఈ 4 జిల్లాల్లో నష్టపోయి మిగిలిపోయిన అభ్యర్థుల వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక ఫార్మెట్ ద్వారా వివరాలు సేకరించింది. డీఎస్సీ -1998 లో మిగిలిపోయిన 15,000 ఉపాధ్యాయ పోస్టులకు గాను 6,000 మంది మాత్రమే ఉన్నారు అని అధికారులు నిగ్గుతేల్చారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు చివాట్లు పెట్టినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదు.
ఇంకెప్పుడు నెరవేరేను హామీ
కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధకావడంతో డీఎస్సీ-1998 క్వాలిఫైడ్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తమ సమస్య పరిష్కారం సంగతి ఏమిటని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 2014 డిసెంబర్ నుంచి కేసీఆర్ స్వయంగా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటాను అని పలుసార్లు మీడియాకు వెల్లడించడంతో తప్పకుండా ఉద్యోగాలు ఇస్తారు అనే నమ్మకాన్ని క్వాలిఫైడ్స్ పెంచుకున్నారు. 1998 డీఎస్సీలో బాధితులుగా ఉన్నవారు సుమారు 2,000 మంది ఉంటారని, విద్యా శాఖ అధికారులు 4,310 మంది ఉంటారని ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు అని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్ తెలిపారు. నాటి నుంచి నేటి వరకూ 20 ఏండ్ల కాలంలో చాలా మంది రిటైర్మెంట్ ఏజ్ పూర్తి అయిపోయిందని, ఉద్యోగాలు ఇచ్చినట్లయితే అధికసంఖ్యలో అభ్యర్థులకు తక్కువ ఏండ్ల సర్వీసు మాత్రమే ఉంటుందని, అది ప్రభుత్వానికి ఎంతమాత్రం భారం కాదని తెలియజేశారు. డీఎస్సీ-98 క్వాలిఫైడ్స్ గత సీమాంధ్ర పాలకుల హయాంలో అడుగడుగునా అన్యాయానికి గురై తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దారిలో ఎట్టి పరిస్థితుల్లో నడవదు అనే ధృడ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు. 20 ఏండ్ల నుంచి న్యాయపోరాటంలో అభ్యర్థులు అందరూ మానసిక సంఘర్షణకు గురిఅవుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి తీపికబురు కోసం ఎదురుచూస్తున్నారు.
రావుల రాజేశం,
9848811424
ప్రశ్నలకు ఆహ్వానం
ప్రభుత్వోద్యోగులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం! 'కొలువు' శీర్షికన రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సందేహాలకు, పారిశ్రామిక రంగ ఉద్యోగుల, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికుల సమస్యలు, సందేహాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కాబట్టి ఉద్యోగులు తమ సందేహాలను ఇ-మెయిల్ koluvu@navatelangana.com కు పంపండి.
మా చిరునామా:
'కొలువు'
ఎడిటర్, నవతెలంగాణ దినపత్రిక, ఎం.హెచ్. భవన్, ప్లాట్ నెం. 21/1, 1-8-664, అజామాబాద్, ఆర్.టి.సి. కల్యాణ మండపం సందు, బాగ్లింగంపల్లి, హైదరాబాద్ - 500 020. లేదా 94900 99016కు ఫోన్ చేయండి.
Authorization