కాబోయే తల్లులకు సేవలందిస్తున్నారు. గర్భధారణ సమయంలో అవగాహన కల్పిస్తారు. ఆ సమయంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో చెబుతారు. ఇలాంటివన్నీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. ఇంతగా శ్రమిస్తున్న వీరికి మాత్రం తింటానికి కడుపు నిండా తిండిలేదు. ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా కొద్దో గొప్పో గౌరవ వేతనాన్ని పెంచుకున్నారు. అలాంటి ఆశావర్కర్ల సమస్యల గురించి మళ్ళొక్కసారి కొలువులో తెలుసుకుందాం.
2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామంటూ ఆ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాకముందు ఎన్నో కబుర్లు చెప్పిన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కష్టజీవులను మర్చిపోయాడు. కొంత మందికి మాత్రం జీతాలు పెంచి ఆశా వర్కర్ల కష్టాన్ని పక్కకు పెట్టారు. పోరాటాలు చేసిన ఫలితంగా వీరి పారితోషికాన్ని మూడు వేల నుండి ఆరు వేలకు పెంచారు. ముందస్తు ఎన్నికలకు పోయే ముందు మరో 15 వందలు పెంచారు. ప్రస్తుతం మొత్తం కలిపి వీరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే, అదికూడా పారితోషిక రూపంలో వస్తుంది.
అణిచివేయాలని చూశారు
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆశా వర్కర్లు సమ్మె బాట పట్టారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా తమ సమస్యలను పరిష్కరించమంటూ ఉద్యమ బాట పట్టిన వీరిని అణిచివేయాలని చేశారు. జైల్లో పెట్టించారు. ఐక్యంగా ఉద్యమిస్తున్న వీరిలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేశారు. కార్మికుల్లో విభేదాలు సృష్టించాలని చూశారు. ప్రభుత్వం ఎన్ని కట్రలు పన్నినా ఐక్యంగా నిలబడ్డారు. ఇప్పుడు మళ్ళీ అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఉద్యమ నాయకుడు తమ సమస్యలు ఇప్పటికైనా పట్టించుకుంటాడేమోనని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
కీలకపాత్ర పోషిస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలో 25 వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుండి ఎన్ఆర్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం ప్రజలకు సేవలందిస్తున్నారు. ఫ్యామిలి ప్లానింగ్, ఆస్పత్రిలో డెలవరీలు, ఇమ్యునైజేషన్స్ ప్రోగ్రామ్లతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను జయప్రదం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటికి అదనంగా రాష్ట్రంలో 104, 108, ఆరోగ్య శ్రీ తదితర స్కీంలను జయప్రదం చేస్తున్నారు. ఈ పనులకు గాను నామ మాత్రపు పారితోషికాలను ప్రభుత్వం ఇస్తున్నది.
అధికారుల చుట్టూ తిరిగారు
ప్రస్తుతం ప్రతి ఆశా వర్కర్కు నెలకు 400 నుండి రెండు వేలలోపు పారితోషికాలు వస్తున్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందిస్తున్న వారికి అతి తక్కువగా అందుతున్నాయి. రోజంతా కష్టపడినా వచ్చే పారితోషికాలు సరిపోవడం లేదు. కనీస వేతనం 15 వేలు ఇవ్వాలని గత మూడు ఏండ్ల నుండి అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళారు. పీహెచ్సీలు, ఎంఆర్ఓ ఆఫీసులు, డీఎం అండ్ హెచ్ఓ ఆఫీసులు, ఛలో హైదరాబాద్లు నిర్వహించారు. అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలిచ్చారు. ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు రాశారు. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని వీరు భావించారు. అందుకే గతంలో ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను చేశారు.
హామీలను మరచి...
మన పక్కనే ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయించిన పారితోషకాలతోపాటు ఆషావర్కర్లకు ప్రతీ నెల ఫిక్స్డ్ వేతనాలు చెల్లిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ 1800లు, కేరళ 1000 అదనంగా ఇస్తున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా 7,500 మాత్రమే ఇస్తున్నారు. కానీ యాదగిరిగుట్టకు, వేములవాడకు, గోదావరి పుష్కరాలకు వందల కోట్లు కేటాయిం అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నారు. ప్రజాప్రతి నిధులకు ఏడు వేల నుండి లక్ష రూపాయలు వేతనాలు పెంచారు. పార్లమెంట్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న లక్షా 50 వేలు సరిపోవటం లేదని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 50 వేలు చెల్లిస్తున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు కార్మికులకు ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కింది.
పని లేకుండా చేస్తున్నారు
పదమూడు సంవత్సరాల కిందట ఎన్ఆర్హెచ్ఎం స్కీంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ను నియమించింది. ఈ కాలంలో ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని పారితోషికాలు కాదు వేతనాలు నిర్ణయించాలని 'తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటి హెల్త్ వర్కర్క్ యూనియన్' ఆలిండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనేక సార్లు దేశ వ్యాప్తంగా ఆందోళనా, పోరాటాలు నిర్వహించారు. గత ప్రభుత్వాలు ఆశా వర్కర్లను మోసం చేస్తే, ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామంటూ అధికారంలోకి వచ్చి ఈ వర్కర్లకు ప్రస్తుతం చేస్తున్న పని కూడా లేకుండా చేయాలని చూస్తుంది.
కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ
ఎన్ఆర్హెచ్ఎం స్కీంతో పాటు ఐసిడిఎస్, మధ్యాహ్న భోజనం తదితర స్కీంలకు సగం నిధుల కోత విధించారు. 2016 నుండి స్కీంలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. ఇలాంటి విధానాలు కార్మిక చట్టాలను యజమాన్యాలకు అనుకూలంగా సవరణ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను ప్రైవేట్ వారికి కారుచౌకగా అమ్ముతుంది. ఎన్డిఏ ప్రభుత్వం ఏక పక్షంగా, నిరంకుశంగా తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఏకమై సమ్మె చేశారు. దేశ కార్మిక వర్గంతో పాటు ఆ సమ్మెలో ఆశా వర్కర్స్ యూనియన్ కూడా కలిసింది. చాలీచాలని పారితోషికాలు వద్దు, నెలవారి వేతనం కావాలన్న డిమాండ్తో సమ్మెలో పాల్గొన్నారు.
పోరాడితేనే పరిష్కారం
రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఇప్పటికే అనేక రంగాల కార్మికులు పోరాట మార్గం పట్టారు. గతంలో ఆర్టిసి, 108, తదితర రంగాల కార్మికులు పోరాడి సమస్యలు పరిష్కరించుకున్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పోరాటం చేస్తే తప్ప తమ సమస్యలు పరిష్కారం కావు అని గుర్తించిన మున్సిపల్, గ్రామ పంచాయితీ కార్మికులు కూడా సమ్మె చేశారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించాలని, పారితోషికాలకు బదులు జీతాలు ఇవ్వాలని ఆశావర్కర్లు కోరుకుంటున్నారు.
సమస్యలను అర్థం చేసుకోవాలి
ఆశా వర్కర్లుగా సేవలు అందిస్తున్న వారందరూ మహిళలే. మహిళల శ్రమను ప్రభుత్వం దోచుకుంటుంది. కనీస వేతనాలు ఇవ్వకుండా వీరి కడుపు కొడుతుంది. కాబోయే తల్లుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న వీరు తల్లులైతే మాత్రం సెలవులు ఇవ్వరు. ప్రసవం జరిగిన ఇరవై రోజులకే డ్యూటీకి రావాలి. లేకపోతే జీతం రాదు. జీతం రాకపోతే రోజు గడవదు. ఇంటిని, బిడ్డల్ని వదిలి ఇంతగా శ్రమిస్తున్న వీరు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఆశావర్కర్ల సమస్యలను గుర్తించాలి. పనిని బట్టి పారితోషికం కాకుండా, ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలి. మొదటి సారి అధికారంలోకి రాక ముందు వీరికి కనీస వేతనాలు అమలు చేస్తానని మాట ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు రెండో సారి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికైనా వీరి సమస్యలను పరిష్కరించాలి.
డిమాండ్స్:
- కనీసవేతనం 18వేలు నిర్ణయించాలి.
- అర్హులైన వారిని సెకండ్ ఎ.ఎన్.ఎం.లుగా తీసుకోవాలి.
- పెన్షన్, గ్రాడ్యూటి, వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల సౌకర్యం కల్పించాలి.
- పారితోషికాలకు బదులు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.
- సేవలందించిన ప్రతి గర్భిణీ ప్రసూతికి పారితోషికం చెల్లించాలి.
Authorization