సమస్యలు పరిష్కరించాలని అడగటమే వీరు చేసిన తప్పు. శ్రమకు తగ్గ ఫలితం అడగటమే వీరు చేసిన ఘోరం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడమే తప్పై పోయింది. కాంట్రాక్టర్లు శ్రమను దోచుకుంటున్నా వీరు నోరు ఎత్త కూడదు. అన్నీ మౌనంగా భరించాలి. గట్టిగా ప్రశ్నిస్తే ఇక ఉద్యోగం పోయినట్టే. పొట్ట చేతపట్టుకొని బీహర్ నుండి హైదరాబాద్ వచ్చిన కార్మికుల కష్టం ఇది. అన్యాయంగా పని పోగొట్టుకుని రోడ్డున పడ్డ ఆ కార్మికుల దీన గాథ నేటి కొలువులో...
కడుపు నింపుకోవడం కోసం సులభ్ కాంప్లెక్సుల్లో పనికి కుదిరారు. గత 30 ఏండ్ల నుండి వీళ్ళు సులభ కాంప్లెక్సుల్లో పని చేస్తున్నారు. ఇన్ని ఏండ్ల నుండి పని చేస్తున్నా వీళ్ళకు కార్మికులకు ఉండవలసిన కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఇఎస్ఐ, పీఎఫ్ వంటివి వీరికి వర్తించవు. 30 ఏండ్ల కిందట పనికి కుదిరినప్పుడు నెలకు 600 రూపాయలు వేతనంగా ఇచ్చేవారు. ప్రస్తుతం 6,500 రూపాయలు ఇస్తున్నారు. ఈ వేతనంతో కుటుంబం గడవడం ఎలా? అనేదే వీరి ఆవేదన.
ఇరుకు గదుల్లో జీవనం
హైదరాబాద్ మహానగరంలో కుటుంబం గడవటమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. అందుకే వీళ్ళు చాలామంది తన భార్యా పిల్లల్ని సొంత రాష్ట్రంలో వదిలిపెట్టి వీళ్ళు మాత్రం పని కోసం హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు. వస్తున్న ఆ కొద్ది ఆదాయంలోనే చిన్న ఇరుకు గది అద్దెకు తీసుకుని చాలీ చాలని తిండి తింటూ కొద్దో గొప్పో మిగిల్చి ఇంటికి కొంత డబ్బును పంపిస్తున్నారు.
శ్రమ దోపిడి
వీరు రోజుకు సుమారు 16, 18 గంటలు పని చేయాల్సి వుంటుంది. అందుకే శ్రమకు తగ్గ ఫలితం కోసం గత ఏడాది నుండి పోరాటం చేస్తున్నారు. గతంలో అసలు వీరి సమస్యల గురించి పట్టించుకునే వారే లేరు. 2010లో సీఐటీయూ వీరికి నాయకత్వం వహించింది. అప్పటి నుండి సమస్యలపై పోరాడుతున్నారు. సులభ్ కాంప్లెక్ ఎంప్లాయిస్ యూనియన్ ఏర్పాటు చేసుకొని పోరాటం మొదలుపెట్టారు. యూనియన్ ఆధ్వర్యంలోనే ఇఎస్ఐ, పీఎఫ్ కోసం లేబర్ కోర్టుకు ఆశ్రయించారు. దాంతో 'దళితులు, సులభ్ కాంప్లెక్స్లో పని చేసుకుంటూ బతికే వీరు మాపైనే కోర్టుకు వెళతారా?' అంటూ ఓ అధికారి వీరిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. దాంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కానీ ఆ కార్మికులను హీనంగా కించపరిచిన ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
యూనియన్ పెట్టుకోవడం తప్పా?
ఇక యూనియన్ పెట్టుకుని ప్రశ్నించడం మొదలుపెట్టిన నాటి నుండి వీరిపై వివక్ష ప్రారంభమైంది. సీఐటీయూలో చురుగ్గా పని చేస్తున్న 11 మందిని ఆరు నెలల కిందట పనిలో నుండి తొలగించారు. అప్పటి నుండి ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ''నేను సీఐటీయూలో పని చేస్తున్నానని హైదరాబాద్ నుండి సిరిసిల్లకు బదిలీ చేశారు.ప్రశ్నిస్తున్నామని, యూనియన్లో ఉన్నామాని తెలియని ప్రాంతానికి పంపించారు. ఇప్పుడు నా కుటుంబం రోడ్డున పడ్డది'' అంటున్నాడు ముఖేష్ కుమార్.
స్వచ్ఛభారత్ అంటూనే...
స్వచ్ఛభారత్ అంటూ కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛ హైదరాబాద్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం శుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం స్వయంగా ప్రకటనలు ఇస్తుంది. వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రజలకు హితవు పలుకుతుంది. ఇందులో భాగంగానే సులభ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేసి ప్రైవేటు వాళ్ళకు అప్పగించారు. వాటి వద్ద పడిగాపులు కాస్తూ వాటిని సక్రమంగా పని చేయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు.
సామాన్యులను దోచుకుంటున్నారు
వీటిని ఉపయోగించుకోవడానికి వచ్చిన వారు ఎంత ఇవ్వాలో తెలిసేలా రేట్ చాట్ పెట్టమంటే కాంట్రాక్టర్లు వీరి మాట పట్టించుకోరు. పైగా ప్రతి సులభ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఉద్యోగి రోజుకు 4000 రూపాయలు కచ్చితంగా వసూలు చేయాలని వీరిపై ఒత్తిడి తెస్తున్నారు. లేదంటే పనిలో నుంచి తొలగించి కొత్త వారిని పెట్టుకుంటున్నారు. నిజానికైతే మూత్రానికి 2 రూపాయాలు, మల విసర్జనకు 5 రూపాయలు, స్నానానికి 10 రూపాయలు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్ల వేధింపుల భరించలేక ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు. 10 రూపాయల నుండి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వీటిని ప్రశ్నించినందుకే 11 మందిని ఉద్యోగం నుండి తొలగించారు.
హక్కులను కాలరాస్తూ...
యూనియన్ మీటింగ్లకు వెళ్ళిన వారిని గుర్తుపెట్టుకుని వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు అక్రమంగా బదిలీ చేస్తున్నారు. యూనియన్ పెట్టుకోవడం కార్మికులకు ఉన్న ప్రాథమిక హక్కు. అ హక్కులను కాలరాస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ కార్మికులకు కనీస వేతనాలు, చట్టపరమైన హక్కులు కల్పించాలి.
పోరాటం ఆపేదిలేదు:నందకిషోర్ చౌదరి
నేను గత 30 ఏండ్ల నుండి సులభ్ కాంప్లెక్స్లోనే పని చేస్తున్నాను. బయట కూర్చొని డబ్బులు వసూలు చేసే బాధ్యత మాది. ముండా మార్కెట్ సులభ్ కాంప్లెక్స్ వద్ద నేను ఉంటాను. కాంట్రాక్టరు మా శ్రమను దోచుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించి నందుకు పనిలో నుండి తొలగించారు. సులభ్ కాంప్లెక్స్ వాడుకుంటున్న ప్రజల నుండి ఎక్కువ మొత్తం వసూలు చేయాలని మాపై ఒత్తిడి తెస్తున్నారు. యూనియన్లో ఉన్న మేము అలాంటి అరాచకమైన పనులు చేయమని గట్టిగా చెప్పాము. అందుకే పనిలో నుండి తొలగించారు. మమ్మల్ని పనిలోకి తీసుకునే వరకు పోరాటం చేస్తాం.
యూనియన్లోనే ఉంటాం:మున్నా సింగ్
మాపైన కాంట్రాక్టర్లు వేధింపులకు దిగుతున్నారు. మాకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఎంత అడుగుతున్నా అధికారులు మా సమస్యలు పట్టించుకోవడం లేదు. పైగా కులం పేరుతో దూషిస్తున్నారు. మాకు అండగా ఉంటున్న సీఐటీయూలో పని చేయకూడదని బెదిరిస్తున్నారు. యూనియన్లో పని చయకపోతే పని ఇస్తామంటున్నారు. మేము మాత్రం కచ్చితంగా యూనియన్లోనే కొనసాగుతాము. మా సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తాం.
డిమాండ్స్
- సులభ్ యాజమాన్యం తొలగించిన కార్మికులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలి.
- అక్రమ ట్రాన్స్ఫర్లు ఆపాలి.
- ఇఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి.
- కనీస వేతనం 18 వేలుగా నిర్ణయించాలి.
- సులభ్ కాంప్లెక్స్ వద్ద ప్రజలకు అర్థమయ్యే విధంగా రేట్ చాట్తో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలి.
- సలీమ
ప్రశ్నలకు ఆహ్వానం
ప్రభుత్వోద్యోగులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం! 'కొలువు' శీర్షికన రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సందేహాలకు, పారిశ్రామిక రంగ ఉద్యోగుల, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికుల సమస్యలు, సందేహాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కాబట్టి ఉద్యోగులు తమ సందేహాలను ఇ-మెయిల్
koluvu@navatelangana.com కు పంపండి.
మా చిరునామా:
'కొలువు'
ఎడిటర్, నవతెలంగాణ దినపత్రిక, ఎం.హెచ్. భవన్, ప్లాట్ నెం. 21/1, 1-8-664, అజామాబాద్, ఆర్.టి.సి. కల్యాణ మండపం సందు, బాగ్లింగంపల్లి, హైదరాబాద్ - 500 020. లేదా
94900 99016కు ఫోన్ చేయండి.