ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు నెలల నుండి ఆషాలకు పారితోషికాలు రావటం లేదు. అసలే చాలీచాలని పారితోషికాలు. అవికూడా నెలల తరబడి పెండింగ్ ఉండటంతో కుటుంబాలు గడవటమే కష్టమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆషావర్కర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారు. అందుకే వారిలో ఓపిక నశించింది. పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలని రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేకసార్లు వినతిపత్రాలిచ్చారు. అయినా నేటికీ వీరి సమస్య పరిష్కారం కాలేదు. పెండింగ్ పారితోషికాలు తక్షణమే చెల్లించాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7న కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆషా) యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా కొందరు ఆషా వర్కర్లు తమ సమస్యలను కొలువుతో పంచుకుంటున్నారు.
టీఆర్ఎస్ మళ్ళీ ప్రభుత్వాన్నేర్పాటు చేసుకుని చాలా సంతోషంగా గద్దెనెక్కింది. కానీ ఆషాలకు సంతోషం లేకుండా చేసింది. రాష్ట్ర ఏర్పడక ముందు వీరికి జీతమే ఇస్తామని మాట ఇచ్చారు. కానీ మాట మార్చి మళ్ళీ పారితోషికమే ఇచ్చారు. వాటిని కూడా నెలల తరబడి బకాయి పెడ్తున్నారు. దీంతో ఆషాల బతుకు ఆగమ్యగోచరంగా తయారయింది.
పెండింగ్ పారితోషికాలు చెల్లించాలి
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీని రద్దు చేసిన రోజు ఆషా వర్కర్లకు 1500 రూపాయలు పారితోషికాలు పెంచుతున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికీ పెంచిన పారితోషికాలు ఆషాలకు ప్రభుత్వం చెల్లించలేదు. గతంలో చెల్లించే పారితోషికాలు ఆరు వేలు కూడా ప్రభుత్వం 2018 సెప్టెంబర్ నుండి పెండింగ్లో పెట్టింది. ఈ కాలంలో దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు కూడా వచ్చిపోయాయి. పండుగల సందర్భంగా పారితోషికాలు రాకపోవడం, అవికూడా నెలల తరబడి పెండింగ్లో ఉండటంతో ఆషాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారు. అధిక వడ్డీలకు అప్పు తెచ్చి కుటుంబాలను పోషిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలని ఆషా యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
అదనపు పనుల సంగతేంటి?
ఆషాలకు పనిని బట్టి పారితోషికాలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఏ పనికి ఎన్ని పైసలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది. సంబంధిత సర్క్యులర్ కూడా జారీ చేసింది. కానీ ఆచరణలో దీనికి భిన్నంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. పారితోషికాలు లేని అనేక పనులను ఆషాలతో చేయిస్తున్నారు. కంటి వెలుగు, అసెంబ్లీ, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో డ్యూటీలు చేస్తే పారితోషికం చెల్లించలేదు. ఇంకా అనేక సర్వేలు అధికారులు బెదిరింది ఉచితంగా చేయిస్తున్నారు. ప్రతిరోజు మాకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆషాలపై ఒత్తిడి చేస్తున్నది. అనేక పనులు చేయించుకొని కొన్ని పనులకు మాత్రమే ప్రభుత్వం పారితోషికాలు చెల్లిస్తున్నది. ఈ పద్ధతిని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
డిమాండ్స్
ఆషాలు చేస్తున్న అన్ని పనులకు వెంటనే పారితోషికాలు నిర్ణయించాలి. పారితోషికాలు లేని పనులు ఆషాలతో చేయించకూడదు. అలాగే రిజిష్టర్స్, రిపోర్ట్స్ తదితర మెటీరియల్ మొత్తం ప్రభుత్వమే సప్లై చేయాలి. సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7వ తేదీన కలక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలకు రాష్ట్రవ్యాప్తంగా ఆషాలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారి యూనియన్ పిలుపు నిచ్చింది.
అధికారులు బెదిరిస్తున్నారు
2006 నుండి జహిరాబాద్ మండలంలో ఆషా వర్కర్గా చేస్తున్నాను. ఐదు నెలల నుండి పారితోషికాలు రావడం లేదు. ఒకదాని తర్వాత ఒక సర్వే చేయిస్తున్నారు. వీటికి అవసరమైన పేపర్లు మేమే కొనుక్కోవాలి. బైండింగ్ కూడా మేమే చేయించుకోవాలి. అధికారులను ఏమైనా అడిగితే 'మీరు చేయకపోతే మానేయండి. వేరే ఎవరైనా వచ్చి చేస్తారు' అని బెదిరిస్తారు. ఫిబ్రవరి 7వ తేది సమ్మె చేస్తున్నామని నోటీసు ఇవ్వడానికి వెళితే నెలాఖరులో పారితోషికాలు వస్తాయంటున్నారు. మాకు తింటానికి తిండి లేదు. ఒంటి మీద బంగారం తాకట్టు పెట్టి ఇల్లు గడుపుకుంటున్నాం. ఇంకా ఎన్ని రోజులని ఆగాలి. అందుకే ఏదో ఒకటి తేల్చుకోవాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నాం.
- శశిరేఖ
పారితోషికాలు కూడా లేవు
1999 నుండి ఆషా వర్కర్గా పని పచేస్తున్నా. పారితోషికాలు కాకుండా వేతనం ఇవ్వాలని 2014లో సమ్మె చేశాం. అప్పుడు ముఖ్యమంత్రి 'నెలకు ఆరు వేలు ఇస్తాం సమ్మె విరమించండి' అన్నారు. అవి పేపర్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇప్పటి వరకు చెప్పినట్టు ఆరు వేలు ఇవ్వడం లేదు. గర్భిణి అని తెలిసన వెంటనే అంటే మూడో నెల లోపు ఆమె పేరురు ఆస్పత్రిలో నమోదు చేయించాలి. అలా నమోదు చేయిస్తే 150 రూపాయలు ఇస్తారు. మూడో నెల దాటితే అది కూడా రాదు. ఐదో నెలలో తీసుకెళితే 60 రూపాయలు ఇస్తారు. ఆమెను డెలివరీకి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళితే 800 వందలు ఇస్తారు. ప్రతి నెల మొదటి మంగళవారం ఆషా డే అని ఉంటుంది. ఆ రోజు మేము ఆస్పత్రికి వెళితే 300 ఇస్తారు. అలాగే గర్భిణీకి, బిడ్డలకు అంగన్వాడీ కేంద్రంలో బరువు చూస్తారు. అలా చూసిన రోజు మేం ఉంటే 200 ఇస్తారు. ప్రతి నెలా 10వ తేదీన కిషోర బాలికలకు ఆ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి, ఆహారం గురించి అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించిన తర్వాత ఆ బాలికతో, అంగన్వాడీ టీచర్తో సంతకం చేయించుకుని అది ఆస్పత్రిలో చూపిస్తే 300 రూపాయలు ఇస్తారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఆస్పత్రికి వెళితే 600 ఇస్తారు. ఇవన్నీ కలిపి ఆరు వేలు వేస్తామన్నారు. కానీ ఇవన్నీ చేసినా నెలకు 2500, 3000 రూపాయల కంటే ఎక్కువ రావు. ఇక కంటి వెలుగుకు ఎలాంటి పారితోషికం లేదు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఎన్సీడీ ప్రోగ్రామ్ అని పెట్టారు. 30 నుండి 39 ఏండ్ల వయసు వారిని రోజుకు 30 మందిని కలిసి వారి ఆరోగ్య వివరాలు సేకరించాలి. దీనికి ఒక్క రూపాయి కూడా లేదు. ఎలక్షన్స్ కంటే ముందు ఏడు వేలు ఇస్తామన్నాను. దాని గురించి ఆలోచనే లేదు. పనులన్నీ మాతో ఫ్రీగా చేయించుకుంటున్నారు. కనీసం వేరే పని చేసుకునే అవకాశం కూడా లేదు. అక్టోబర్ నుండి ఈ పారితోషికాలు కూడా రావడం లేదు. కొత్తగూడం వెళ్ళి అధికారులను అడిగే బడ్జెట్ ఇంకా రాలేదు అంటున్నారు. ఖమ్మం, మహబూబాబాద్కు వచ్చిన బడ్జెట్ ఒక్క కొత్తగూడెంకు మాత్రమే రాలేదు. మరి మేం ఏమి తిని బతకాలి. మాతో పారితోషికం లేని పనులే చేస్తున్నారు.
- రమణ, భద్రాద్రి
పని భారం ఎక్కువయింది
10 ఏండ్ల నుంచి వనపర్తి జిల్లాలో ఆషా వర్కర్గా పని చేస్తున్నాను. మమ్మల్ని చేర్చుకున్న కొత్తలో 'నెలలో రెండు రోజులు పని చేస్తే చాలు మీకు కొంత పారితోషికం వస్తుంది' అని చెప్పారు. రెండు రోజులే కదా మిగిలిన రోజులు ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చు అనుకున్నాం. అలాగే ప్రజల ఆరోగ్యం కోసం కొంత సేవ చేసిన తృప్తి కూడా ఉంటుందని భావించాం. కానీ ఇప్పుడు ప్రతి రోజూ పని చేయించుకుంటున్నారు. పని చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పనికి తగ్గ ఫలితం లేదు. రకరకాల సర్వేలతో పాటు కంటి వెలుగు చేయించుకుంటున్నారు. మిషన్ ఇంద్రధనస్సు, లెప్రసీ సర్వే ఇలా అన్నీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే డాక్టర్లు మమ్మల్ని తీసిపడేస్తారు. మేము తీసుకెళ్ళిన గర్భిణిని అసలు పట్టించుకోరు. వీటికంటే కూడా అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. సడన్గా పని చెబుతారు. గంటలో వాళ్ళకు కావల్సిన సమాచారం ఇచ్చేయాలి. ఇవన్నీ ఉచితంగానే చేయాలి. అసలు ఆదాయమే లేకుండా పని చేస్తే మరి మేమెలా బతకాలి.
- గిరిజ
Authorization