ఫిబ్రవరి 1 నుండి రేషన్ షాపుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని సప్లై చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంగన్వాడీలే రేషన్షాపులకు వెళ్ళి బియ్యాన్ని తెచ్చుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. దీనివల్ల అంగన్వాడీలకు మరింత పని భారం పెరుగుతుంది. అంగన్వాడీ సెంటర్ సమయం వృధా అవుతుంది. పైగా క్వింటాళ్ళ బరువులు మోయటం అంగన్వాడీలు సాధ్యం కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. రేషన్ డీలర్లే అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని సప్లై చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు. అలాగే పెండింగల్లో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంగన్వాడీలకు ప్రతి నెలా వేతనాలు రావటం లేదు. ఈ నెల వేతనాలు వచ్చే నెల చివరపడుతున్నాయి. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ గ్యాప్ కూడా వస్తుంది. వచ్చే వేతనాలు ఏ నెలవి అనే నిర్ధారణ ఉండటం లేదు. దీనివల్ల మధ్యమధ్యలో మా వేతనాలు మిస్ అవుతున్నాయని అంగన్వాడీలు ఆందోళన చెందుతున్నారు.
జీతానికి మించి ఖర్చులు
తల్లిపాల వారోత్సవాలు, పోషకాహార వారోత్సవాలు, బాలల దినోత్సవం, అన్నప్రాసన, ఫ్రీస్కూల్ పిల్లల బర్త్డేలు, కిశోర బాలికలకు ఆటల పోటీలు నిర్వహించడం, అంగన్వాడీల కేంద్రాలలో తల్లుల సమావేశాలు, గర్భిణీలకు శ్రీమంతాలు ఇంకా అనేక ప్రోగ్రామ్స్ నిర్వహించాలని అధికారులు అంగన్వాడీలపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఖర్చులకు డబ్బులు మాత్రం ఇవ్వటం లేదు.
పెండింగ్ బిల్లులు చెల్లించకుండా
రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం 3 చీరలు (యూనిఫామ్) మాత్రమే అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ వర్కర్లకు ఇచ్చారు. ఇంకా 7 చీరలు ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక్క చీరకు మూడు వందల రూపాయల చొప్పున 70 వేల మందికి 14 కోట్ల 7 లక్షల రూపాయలను ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. 5 వేల ఖాళీ పోస్టులు రాష్ట్రం ఏర్పడ్డ 4 ఏండ్లకు ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ కాలంలో బాధ్యత వహించిన అంగన్వాడీ టీచర్లకు ఇన్ఛార్జ్ అలవెన్సులు చెల్లించలేదు. నెలకు రెండు వందల రూపాయల చొప్పున 4 ఏండ్లకు 48 లక్షలు ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. స్టేషనరీ కోసం ప్రతి సంవత్సరం ఒక అంగన్వాడీ కేంద్రానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి. ఐదు ఏండ్ల నుండి ప్రభుత్వం ఈ అమౌంట్ను చెల్లించడం లేదు. ఒక అంగన్వాడీ కేంద్రానికి ఐదు వేలు చొప్పున 35 వేల అంగన్వాడీ కేంద్రాలకు ఒక కోటి 75 లక్షలు ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. అంగన్వాడీలకు వేతనాలతో పాటు సీనియారిటీ ప్రకారం 5 ఏండ్లకు 31 రూపాయలు, 10 ఏండ్లకు 62 రూపాయలు 2015 ఏప్రిల్ నుండి చెల్లించకుండా ప్రభుత్వం వీరికి అన్యాయం చేస్తున్నది.
ప్రజలకు నమ్మకం పోతుంది
ఐసీడీఎస్కు సంబంధం లేని అనేక పనులను ప్రభుత్వం అంగన్వాడీలతో చేయిస్తున్నది. రైతుబంధు పాస్ పుస్తకాలు, బతుకమ్మ చీరల పంపిణీ, గ్రామ సభలు, అనేక సర్వేలు, అనేక ప్రోగ్రామ్స్, అవసరం లేని రిజిష్టర్లు, రికార్డు వర్క్ బాగా పెంచారు. ఇవన్నీ మళ్ళీ ఆన్లైన్లో చేయాలి. రిపోర్టు ట్యాలీ అయ్యే వరకు రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాలి. మన టీవి ప్రోగ్రాంకు అటెండ్ కావాలి. ఇంకా అనేక పనులు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ కేంద్రాలలో అతి తక్కువ రోజులు మాత్రమే ఉంటున్నారు. దీనివల్ల టీచర్ల పట్ల ప్రజలకు నమ్మకం పోతున్నది. వచ్చే పిల్లల సంఖ్య తగ్గుతున్నది. ఈ సమస్యను పరిష్కారం చేయకుండా సిలబస్ ప్రకారం పిల్లలకు పాఠాలు చెప్పటం లేదని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, పిల్లలు తక్కువవున్నారని కేంద్రాలను క్లబ్ చేస్తామనడం, విజిట్కు వచ్చిన అధికారులు అంగన్వాడీ టీచర్ ఏ వర్క్లో ఉందని ఎంక్వయిరీ చేయకుండానే యాక్షన్ తీసుకోవడం దుర్మార్గం.
ఆధార్కార్డులకు లింక్ చేయడంతో...
అన్నింటికీ మించి పోషకాహారం ప్రభుత్వం సప్లై చేయడం లేదు. ముక్కిపోయిన బియ్యం, కుళ్ళిపోయిన గుడ్లు, పాడైపోయిన పాలప్యాకెట్లను సప్లై చేస్తున్నారు. కొలతల్లో భారీగా తేడాలుంటున్నాయి. ఈ ఇచ్చే ఫుడ్ కూడా 3, 4 నెలలు కంటిన్యూగా గ్యాప్ ఉంటుంది. గుడ్లు, పాలు నెలల తరబడి రావడం లేదు. దీనివల్ల పోషకాహారలోపం తగ్గకపోగా, పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోషకాహారాన్ని ఆధార్కార్డుకు లింకు చేయడం వల్ల చాలామంది పిల్లలు పోషకాహారానికి దూరం అవుతున్నారు.
జీఓ 14ను సవరించాలి
అంగన్వాడీలకు అత్యంత ప్రమాదకరమైన జీఓ నెం: 14ను ప్రభుత్వం వెంటనే సవరించాలి. ఏదైనా పొరపాటు జరిగితే, జరిగిన పొరపాటు సరైందా? కాదా? అని ఎంక్వైరీ చేసే పద్ధతి ఈ జీఓలో లేదు. అంటే అధికారులు కానీ, అంగన్వాడీలంటే పడని వారు ఏది చెబితే అదే వేదం. ఒక్క కంప్లెయిట్ ఇస్తే చాలు క్షణంలో ఉద్యోగం నుండి తొలగిస్తారు. ఎంక్వైరీ లేకుండా, నిర్దారణ చేయకుండా ఏకపక్షంగా ఇష్టానుసారంగా ఇంటికి పంపించే చర్యలుండకూడదు. పొరపాటును సరిచేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలి.
డిమాండ్స్
- రేషన్ డీలర్లే అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని సప్లై చేయాలి
- కేంద్రం పెంచిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
- ప్రతి నెల వేతనాలు మొదటి వారంలోనే చెల్లించాలి.
- పెండింగ్ ఉన్న 7 చీరల డబ్బులు వెంటనే చెల్లించాలి.
- 5 సంవత్సరాల పెండింగ్ స్టేషనరీ డబ్బులు వెంటనే చెల్లించాలి.
- 5 సంవత్సరాల ఇన్ఛార్జ్ అలవెన్స్లు వెంటనే చెల్లించాలి.
- 4 సంవత్సరాల పెండింగ్ సీనియారిటీ వేతనాలు వెంటనే చెల్లించాలి.
- శ్రీమంతాలకు ఒక్క ప్రోగ్రామ్ ఖర్చులకు రెండు వేలు చెల్లించాలి.
డిమాండ్స్
- పోషకాహారానికి పెట్టిన లబ్దిదారుల లింక్ను తొలగించాలి.
- అంగన్వాడీ సెంటర్ టైంలోనే పోషకాహారాన్ని సప్లై చేయాలి.
- అంగన్వాడీ కేంద్రాలను క్లబ్ చేయకూడదు.
- పోషకాహారాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకూడదు.
- జీఓ నెం. 14ని సవరించాలి. అంగన్వాడీలకు సర్వీస్ రూల్స్ రూపొందించాలి.
- జీఓ నెం. 19ని సవరించాలి. గ్రాట్యూటీ పెంచాలి, పెన్షన్ నిర్ణయించాలి.
- వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి.
- గతంలో రద్దుచేసిన 12 జాతీయ సెలవులను పునరుద్ధరదించాలి.
డిమాండ్స్
- అంగన్వాడీలకు ఆసరా, కళ్యాణలక్ష్మి పథకాలను వర్తింపచేయాలి.
- ఉత్తమ అంగన్వాడీల అవార్డుల్లో జరుగుతున్న అక్రమాల అరికట్టాలి. అర్హులైన వారికే అవార్డులివ్వాలి.
- సూపర్వైజర్స్ ఎగ్జామ్స్ వెంటనే నిర్వహించాలి.
- మిగిలిన ఖాళీ పోస్లును భర్తీ చేయాలి.
- ఆయాలకు వేతనం పెంచాలి. ప్రమోషన్ సౌకర్యం అమలు చేయాలి.
- మినీలను మెయిన్ టీచర్లుగా గుర్తించాలి. ఆయాలను నియమించాలి.
- అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇఎస్ఐ, ఉద్యోగభద్రత కల్పించాలి.
- ఐసీడీఎస్ను సంస్థాగతం చేయాలి. నగదు బదిలీ, పోస్టాఫీసుల ద్వారా ఫుడ్ సప్లై నిర్ణయాన్ని తక్షణమే ఉప సంహరించుకోవాలి.
డిమాండ్స్
- అంగన్వాడీ సెంటర్లో చార్ట్స్ డిజైనింగ్ చేయడానికి ప్రతి ఏడాది రెండు వేలు ఇవ్వాలి.
- జనవరి 26, ఆగస్టు 15, జూన్ 2న జెండా ఆవిష్కరణ ఖర్చులకు డబ్బులు చెల్లించాలి.
- అవసరమైన రిజిష్టర్స్ను వెంటనే సప్లై చేయాలి.
- రిపోర్ట్స్ జిరాక్స్లకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి.
- అంగన్వాడీ కేంద్రాలకు స్టేషనరీ, అసవరమైన వంటపాత్రలు ఇవ్వాలి.
- ఆరోగ్యలక్ష్మి మెను ఛార్జీలు పెంచాలి. సబ్సిడీ గ్యాస్తోపాటు డబుల్ సిలెండర్ ఇవ్వాలి.
- అంగన్వాడీలను పని భారాన్ని తగ్గించాలి. అదనపు పనులు చేయించకూడదు.
- నాణ్యమైన పోషకాహారం సకాలంలో సప్లై చేయాలి.
Authorization