సుమారు 20 ఏండ్ల నుంచి గ్రామ పంచాయితీ వర్కర్లు, ఉద్యోగులుగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇన్నేండ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న కనీస వేతనాలకు నోచుకోలేకపోయారు. కుటుంబాలు గడవడం కష్టమై కడుపుమండీ గతంతో ఎన్నో పోరాటాలు చేశారు. చివరకు నిరవధిక సమ్మె కూడా చేశారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందనా లేదు. అందుకే మళ్ళీ మరో పోరుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈ నెల 25న ఛలో హైదరాబాద్కు పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా పంచాయితీ కార్మికులు, ఉద్యోగుల సమస్యల గురించి నేటి కొలువులో ఓ సారి పరిశీలిద్దాం...
పంచాయితీ కార్యదర్శి చేయవల్సిన పనులన్నీ వీళ్ళే చూస్తారు. పారిశుద్ధకార్మికులు, ఎలక్ట్రిషన్లు, పంప్ ఆపరేటర్స్, వాటర్మెన్స్ ఇలా ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా గ్రామాల్లో ఎమర్జెన్సీ సర్విస్ అందించేవారు. అయినా వీరు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలచే తీవ్ర నిర్లక్ష్యానికి గురౌతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి కూడా అధికారంలోకి వచ్చింది. కానీ పంచాయితీ కార్మికులు, ఉద్యోగుల సమస్యల్లో ఒక్కటీ పరిష్కరించలేదు. గతంలో ఈ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసిన సందర్భంగా కేటీఆర్ ఇచ్చిన హామీలు కూడా నీటిమూటలే అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లోనూ వీరికి మొండి చెయ్యే చూపారు.
మోసం చేస్తూనే ఉన్నారు
నూతన పంచాయితీరాజ్ చట్టం వీరిని మనుషులుగా కూడా గుర్తించలేదు. గత ప్రభుత్వాల లాగానే ఈ ప్రభుత్వం కూడా వీరిని మోసగిస్తూనే ఉంది. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని భరించలేక గతంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మిక సంఘాలన్నీ ఒక్కటై వందలాది మంది నాయకత్వంలో రాష్ట్ర సదస్సు కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ప్రభుత్వ నిరక్ష్య వైఖరిని నిరసిస్తూ అప్పటి నుంచి సంబంధిత అధికారులకు ఎన్నో వినతులు అందించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే తెలంగాణ గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెను సైతం చేపట్టారు.
వివక్షను భరించలేక
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సర్పంచ్ మొదలుకొని ముఖ్యమంత్రి వరకు భారీగా వేతనాలు పెంచుకున్నారు. వీరి వేతనాలకు ప్రభుత్వమే బడ్జెట్ ఇస్తుంది. కానీ పేద, దళిత గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచమంటే మాత్రం చేతులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంటు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తుంటే 'మీరు స్థానిక సంస్థలకు చెందిన వారు. మాతో మీకేం సంబంధం' అంటున్నారు. కానీ అదే స్థానిక సంస్థలలో ప్రజా సేవ చేయడానికి ఎన్నుకోబడిన సర్పంచుల నుండి జిల్లా పరిషత్ ఛైర్మన్ల వరకు రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంటు ద్వారా వేతనాలు చెల్లిస్తున్నది. ఇది ద్వంద్వనీతి కాదా? గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికుల పట్ల వివక్ష చూపడం కాదా? పంచాయితీ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం ఇంత వివక్షా పూరితంగా వ్యవహరిస్తుంది.
గొప్పలు చెప్పుకుంటున్నారు
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 50,114 మంది గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం 10,225 రూపాయల నుండి 13,635 రూపాయల వరకు నిర్ణయించి అమలు చేస్తోంది. వేతనాల చెల్లింపుకు రాష్ట్ర బడ్జెట్ నుండి ఏడాదికి 736 కోట్లు కేటాయించి, వేతనాలు నేరుగా ఉద్యోగ, కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నది. పీఎఫ్, ఇ.ఎస్.ఐ, పెన్షన్తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. పొరుగునే ఉన్న కేరళ ప్రభుత్వం ఏ కార్మికుడికైనా కనీస వేతనం రోజుకు 600 రూపాయల చొప్పున నెలకు 18000 రూపాయలు చెల్లిస్తోంది. బెంగాల్, తమిళనాడు, చత్తీస్ఘడ్ లాంటి రాష్ట్రాలు బడ్జెట్ నుండి నేరుగా నిధులు విడుదల చేస్తూ, వేతనాలు చెల్లింపుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోనే కార్మిక సంక్షేమం గురించి మాకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు లేరంటూ గొప్పలు చెప్పుకుంటున్న మన ప్రభుత్వం పంచాయితీ కార్మికుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు. పొరుకు రాష్ట్రాలలో గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికులకు ఇస్తున్న వేతనం, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు కనిపించడం లేదా?
మళ్ళీ మాట తప్పారు
గతంలో ఈ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలు పర్కిరించాల్సిందిగా ఎన్నో వినతులు ఇచ్చారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే గతంలో నిరవధిక సమ్మెకు దిగారు. అన్ని జిల్లాల్లో సమ్మె విజయవంతంగా జరిగింది. గతంలో కంటే కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అప్పటి సమ్మెలో పాల్గొన్నారు. 30 వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. అందరూ ఒకేసారి సమ్మెలో పాల్గొనడం అదే మొదటిసారి. ఈ సమ్మెలో కారోబార్లు, బిల్కలెక్టర్లు కీలకపాత్ర పోషించారు. నిరవధిక సమ్మెకు దిగడంతో పనులన్నీ ఆగిపోయి అధికారులపై ఒత్తిడి బాగా పెరిగింది. చివరకు చర్చలు జరపడానికి ముందుకు వచ్చారు. దాంతో స్వయంగా ముఖ్యమంత్రి వీరికి 8500 రూపాయలు వేతనంగా చెల్లిస్తానని ప్రకటించారు. దాంతో గ్రామంలోని ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న గ్రామ పంచాయితీ ఉద్యోగులు సమ్మెను విరమించారు. ముఖ్యమంత్రి ఈ సారైనా మాట నిలబెట్టుకుంటారని నమ్మారు. కానీ ఇప్పటి వరకు పెంచిన వేతనాలను ఇవ్వడం లేదు. అందుకే తిరిగి పోరాటం మొదటుపెట్టారు. అందులో భాగంగానే ఈ నెల 25న ఛల్లో హైదరాబాద్కు పిలుపు ఇచ్చారు.
అందరికీ అన్నీ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికుల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ కార్మికులు, ఉద్యోగులు అందరూ ఏకమై తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు నిర్వహించబోతున్న ఈ మహాధర్నలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు.
పని భారం ఎక్కువై...
ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. మరొకవైపు దానికి సరిపడా పంచాయితీ కార్యదర్శుల నియామయం చేపట్టకపోవడంతో చాలా పంచాయితీలు ఇన్చార్జ్ల చేతిలో మగ్గుతున్నాయి. పంచాయితీల్లో కార్యదర్శిలేని లోటు కనబడకుండా విధులన్నీ ఆ గ్రామ పంచాయితీ కారోబార్లు, బిల్ కలెక్టర్లే నిర్వహిస్తున్నారు. అర్హత వున్నప్పటికీ వారికి పంచాయితీ కార్యదర్శులుగా ప్రమోషన్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలలో అర్హులైన ఉద్యోగ, కార్మికులను పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలి.
డిమాండ్స్
- పంచాయితీ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనం 8500 రూపాయలు అమలు చేయాలి.
- ప్రస్తుతం పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలి.
- అర్హులైన వారిని పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలి.
- పీఎఫ్, ఇఎస్ఐ, పింఛను సౌకర్యాలను వర్తింపజేసి, అమలు చేయాలి
Authorization