మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మహిళలంతా నా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు అంటే నమ్మారు. తమ శ్రమకు తగ్గ ఫలితం రాబోతుందని ఎదురు చూశారు. కానీ ఏండ్లు గడుస్తున్నా కనీస వేతనాల ఊసేలేదు. శ్రమకు తగ్గ ఫలితం రాదు. ముఖ్యంగా స్కీం వర్కర్లు గత పదహారేండ్ల నుంచి ఎదుర్కొంటున్నారు. స్కీం వర్కర్లలో 90 శాతం మంది మహిళా శ్రామికులే. తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా గతంలో వారు దేశవ్యాప్తంగా సమ్మె కూడా చేశారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సమస్యలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో మహిళల పట్ల, అందులోను స్కీం వర్కర్ల పట్ల వివక్ష, చిన్న చూపు ఏ విధంగా ఉందో నేటి కొలువులో తెలుసుకుందాం...
మన సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అసమానత అన్ని వర్గాలల్లోను నెలకొని ఉంది. కుటుంబం మొదలు పార్లమెంటు వరకు ఎక్కడా సమానత్వం కానరాదు. అడుగడుగునా వివక్షే. అయితే రోజురోజుకు పెరుగుతున్న విద్యా స్పృహ, చైతన్యం మహిళలు తమ కట్టుబాట్లను, సంకెళ్ళు చేధించుకుని అన్ని రంగాల్లో దూసుకుపోయే సమర్థతను పెంచుకుంటున్నారు. అయినా ఇప్పటికీ మహిళలు అడుగుపెట్టలేని రంగాలు చాలానే ఉన్నాయి. ఎవరైనా మహిళలు పట్టుదలగా ఆయా రంగాల్లో ప్రవేశించినా తమ సమర్థతను రుజువు చేసుకోవాలని ప్రయత్నించినా ఈ పురుషాధిక్య సమాజంలో వారికి నిరాశేమిగుల్తున్నది. ప్రోత్సాహం మాత్రం లభించడం లేదు.
వెట్టి చాకిరికి మాత్రమే మేము
ఇలాంటి పరిస్థితుల్లో వెట్టిచాకిరి చేయాల్సి చోట మాత్రం మహిళలను పెద్ద ఎత్తున నియమిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీం కోర్టు ఆదేశం కూడా అమలుకు నోచుకోని పరిస్థితులు నెలకొని వున్నాయి.
భవన నిర్మాణ రంగంలో పురుషులతో పాటు స్త్రీలు అనేక రకాలైన పనులు చేస్తున్నప్పటికి వేతనాల్లో తీవ్రమైన వివక్ష కొనసాగుతుంది. కొంచెం తేలికైన నైపుణ్యంతో కూడిన తాపి పని, పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఇప్పటికి వంద శాతం మొగవాళ్ళదే. నిజానికి శిక్షణతో ఈ పనులు స్త్రీలు కూడా చేయగలిగేవే. కానీ అవకాశం మాత్రం ఇవ్వరు.
కూలీలో వ్యత్యాసం
వ్యవసాయ రంగంలో 55 శాతం పనులు స్త్రీలే చేస్తున్నప్పటికి కలుపులు, నాట్లు, పత్తి నాటడం, పత్తి తీయడం కూరగాయలు కోయడం, ప్యాకింగ్ వంటి పనులు వంచిన నడుం ఎత్తకుండా చేస్తుంటే కొంచెం సులువుగా వుండే యంత్రాలతో చేయగలిగే పనులు ట్రాక్టరుతో దున్నడం, మిషన్స్తో వరికోతలు వంటి పనులు మగవాళ్ళ పనులుగా ముద్రపడి పోయాయి. అత్యంత శ్రమతో కూడిన పనులు ఆడా మగా సమానంగా చేస్తున్నపటికి కూలీ విషయంలో వ్యత్యాసం వుంటుంది. ఐటి రంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య 37 శాతం మాత్రమే వుంది. మగవారితో సమానమైన అర్హతలు కలిగి పని చేస్తున్నప్పటికి వేతనాల్లో 27 శాతం తేడా వుంది.
ఎన్ని పనులు చేసినా ప్రస్తుతం ఆశా వర్కర్ల పరిస్థితి
ఆయోమయంలో ఉంది. అన్ని సార్లు సమ్మె చేసినా ఎటువంటి పలితం లేకుండా పోయింది. ప్రభుత్వం మా సమస్యలపై స్పందించడం లేదు. వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ సర్వే చేయాల్సి వచ్చిన ముందుండేది ఆశా వర్కరే. ఎవరికి ఏ సమస్య వచ్చినా సమయం చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తీరాలి. ఒక్క గర్భిణీ స్త్రీని గుర్తిస్తే 25 రూపాయలు పారితోషికం ఇస్తారు. అదే కేసు లేకపోతే అవి కూడా రావు. ఎంత చాకిరి చేసినా ఫలితం మాత్రం శూన్యం. మహిళల కోసం ఏమోమో చేస్తున్నట్టు ప్రచారాలు మాత్రం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పెంచుతామన్న జీతాలు అమలు చేస్తే సంతోషిస్తాం' అంటున్నారు ఆశా వర్కర్గా పని చేస్తున్న మానస.
ప్ర్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తే ఊరుకోం
మధ్యాహ్న భోజన కార్మికురాలిగా ఉన్న అనూరాధ మాట్లాడుతూ 'నేను పదిహేనేండ్ల నుంచి మధాహ్న భోజన పథకం కింద పని చేస్తున్నాను. మా సమస్యలు పరిష్కరించాలని ఎన్నో సార్లు ధర్నాలు చేశాం. నెలనెలా బిల్లులు కూడా సరిగారావు. ధర్నాలు చేసినప్పుడు మాత్రం కొన్నినెలులు వేస్తారు. మళ్ళీ మామూలే. నెలకు నాలుగు గ్యాస్ సిలెండర్లు పడతాయి. గ్యాస్ అయిపోతే మేమే తెచ్చుకోవాలి. గుడ్లు మేమే తెచ్చుకోవాలి. గ్యాస్, గుడ్లు సబ్సిడీలో ఇవ్వాలి. ఎంత ఖర్చు చేస్తే అంత బిల్లులు వస్తాయి. మాకు మిగిలేది ఏమీ లేదు. మేమే కూరగాయలు తెచ్చుకోవాలి, కొయ్యాలి, వండాలి వడ్డించాలి. ఇంత పని చేస్తే నెలకు మాకు ఇచ్చేది వెయ్యి రూపాయలు. కాస్త అన్నం మిగులుతుంది. ఆ అన్నంతో మా కడుపు నింపుకుంటాం. ఇది తప్ప మాకు వేరే దిక్కు లేదు. ఇప్పుడు అది కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. వంట ప్రైవేట్ వాళ్ళకు అప్పగించాలని చూస్తున్నారు. జీతాలు పెంచినట్టే పెంచి ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తే మాకు జరిగే న్యాయం ఏంటి' అని ప్రశ్నిస్తుంది.
మా సమస్యలు పట్టించుకోరు
'రాష్ట్రం రాకముందు మున్సిపల్ వర్కర్స్ అందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు. మహిళలందరినీ నా తల్లులు, దేవతలు అన్నారు. ఇప్పుడు మాత్రం నోరు ఎత్తనీయకుండా కూర్చోబెట్టాడు. జీతాల కోసం సమ్మె చేస్తే బెదిరిస్తారు. ఇప్పుడు సూపర్వైజర్లు ఎదైనా ధర్న చేస్తే ఒప్పుకోవడం లేదు. మాతో పూటపూటకు వేలిముద్రలు వేయించుకుంటున్నారు. మహిళలన్నాక పని చేసేటప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. డ్యూటీకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఎలాంటి కబురు వచ్చినా వెళ్ళనీయరు. గతంలో సమ్మె చేసినప్పుడు ఒక్క హైదరాబాద్లోని మున్సిపల్ కార్మికులకు మాత్రమే జీతాలు పెంచారు. అది కూడా దానికి ఎలాంటి జీవో లేదు. జిల్లాల్లో ఎంతో మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ జీతాల గురించి మాత్రం మాట్లాడడం లేదు. డబుల్బెడ్రూం ఇళ్ళు అన్నారు. కానీ వాటి మాటే ఎత్తడం లేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత మా సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మా సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు' అంటున్నారు
- మున్సిపల్ వర్కర్ రాజమ్మ.