మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదలు... ఇలా ఎవరైనా డబ్బు పొదుపు చేయాలనుకుంటారు. తాము కష్టపడిన సంపాదనలో కడుపు మార్చుకుని పిల్లల భవిష్యత్ కోసం ఎంతో కొంత పొదుపు చేస్తారు. ఇలా పొదుపు చేసుకునేందుకు దేశంలో ఎన్నో సంస్థలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి మొత్తాల పొదుపు సంస్థల్లో పీర్లెస్ కూడా ఒకటి. ప్రజలు పొదుపు చేసుకున్న మొత్తాన్ని వారికి సక్రమంగా అందించేందుకు, వారికి అవసరమైన సేవలు అందించేందుకు అందులో పని చేసే ఉద్యోగుల పాత్ర కీలకమైనది. ఇలా ఎన్నో సేవలు అందిస్తుంటే విదేశీ కంపెనీలో ప్రభావం వల్ల సంస్థలో కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో పని చేసే ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోవల్సి వచ్చింది. ఆ సమయంలో ఉద్యోగులకు నష్టం జరగకుండా సీఐటీయూ అనుబంధ సంస్థగా ఉన్న ''ఆల్ ఇండియా పీర్లెస్ యూనియన్'' ఎంతో కృషి చేసింది. ఆ వివరాలు ఈ రోజు కొలువులో...
దేశంలోని ప్రైవేట్ రంగంలో ఉన్న చిన్న మొత్తాల పొదుపు సంస్థల్లో ప్రముఖ స్థానంలో ఉన్న పీర్లెస్ సంస్థలో 2018 నవంబర్ నెలలో విఆర్ఎస్ పథకం అమలు చేయబడింది. ఈ సంస్థలోని ఉద్యోగుల సంఘం 'ఆల్ ఇండియా పీర్లెస్ ఎంప్లాయిస్ యూనియన్' అతిపెద్ద సంఘంగా వుంటూ సీఐటీయూ అనుబంధ సంఘంగా వుంది.
ప్రత్యేక పరిస్థితుల్లో
సీఐటీయూ అనుబంధ సంఘాలు విఆర్ఎస్ పథకాన్ని వ్యతిరేకిస్తాయి. కానీ పీఆర్లెస్ సంస్థలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో యాజమాన్యం దిగివచ్చి ఉద్యోగ సంఘంతో చర్చలు జరిపిన సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థలో వీఆర్ఎస్ పథకం అమలుకు యూనియన్ ఒప్పందం చేసుకోవలసి వచ్చింది. యూనియన్ను బేఖాతరు చేసి 2017లో వీఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిన యాజమాన్యం ఆ ప్రయత్నంలో విఫలమై తిరిగి దిగివచ్చి యూనియన్తో చర్చించాల్సి వచ్చింది. తద్వారా యూనియన్ ఉద్యోగులకు ఉపయోగపడేలా ఓ మంచి ఒప్పందం చేయగలిగింది. ఈ పరిస్థితి రావడానికి యూనియన్ ఎన్నో రకాల పోరాటాలు చేపట్టాల్సి వచ్చింది.
సమస్యల్లో అండగా
ఏదైనా సంస్థ మనుగడ బాగుంటేనే ఉద్యోగుల మనుగడ బాగుంటుందని విశ్వసించే యూనియన్ 'ఆల్ ఇండియా పీర్లెస్ ఎంప్లాయూస్ యూనియన్'. కనుక సంస్థ మనుగడకు సమస్యలు ఏర్పడినప్పుడల్లా యూనియన్ ఆ సమస్యలను అధిగమించేందుకు ముందుండి కృషి చేసింది. 1987లో కేంద్ర ప్రభుత్వం పీర్లెస్ సంస్థ వ్యాపారంపై ఆంక్షలు పెడితే యూనియన్ ముందుండి పోరాడింది. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీసోమనాథ్ ఛటర్జీ గారు కంపెనీకి సానుకూకల తీర్పు వచ్చే విధంగా ప్రయత్నించారు. అప్పటి నుండి సంస్థ చిన్న మొత్తాల పొదుపు ద్వారా సేకరించిన మొత్తాలను కష్టమర్లకు నిజాయితీగా చెల్లించడం జరుగుతోంది. మెచ్యూరిటీ మొత్తాలను ఖాతాదారులకు కచ్చితంగా తిరిగి చెల్లిస్తున్నారని స్వయంగా ఆర్బీఐ పీర్లెస్ సంస్థకు క్లీన్చీట్ ఇచ్చింది. అయినా కూడా దేశీయ కంపెనీలను దెబ్బతీసి విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా తెరుస్తున్న ప్రభుత్వం 2011వ సంవత్సరంలో సంస్థ వ్యాపారంపై ఆంక్షలు విధించింది.
తమ వేతనాలను వెచ్చించిన ఉద్యోగులు
దీనిలో సంస్థనూ, సంస్థలోని ఉద్యోగులనూ రక్షించాలనే సంకల్పంతో యూనియన్ పీర్లెస్ సంస్థ వ్యాపారానికి అనుమతి నివ్వాలని ఆర్బీఐ పై కలకత్తా హైకోర్టులో కేసు వేసింది. అయితే ముందు వ్యాపారం చేస్తానని చెప్పిన యాజమాన్యం తరువాత మాట మార్చి వ్యాపారం చేయమని చెప్పడమే కాక ఏకపక్షంగా 2017 ఆగస్టులో వీఆర్ఎస్ పథకం ప్రవేశపెట్టింది. ఒకవైపు యాజమాన్యం చేయాల్సిన న్యాయ పోరాటాన్ని యూనియన్ నెత్తికెత్తుకోవడమే కాక ఉద్యోగులు ఒక్కొక్కరు 35 రోజుల తమ వేతనాలను వెచ్చించి కోర్టులో పోరాడుతున్న సందర్భంలో యాజమాన్య అనుసరిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక వైఖరిని యూనియన్ ఎదిరించింది. దానితో 90 శాతం మంది ఉద్యోగులు వీఆర్ఎస్ను తిరస్కరించారు. తరువాత సంవత్సర కాలంలో యూనియన్ అటు యాజమాన్యంపై ఇటు ప్రభుత్వంపై అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టింది.
ఒప్పందం జరిగేలా కృషి
చివరకు ఆగస్టు 28, 2018న దేశవ్యాప్తంగా అన్ని ఆర్బీఐ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలకు యూనియన్ పిలుపునివ్వడంతో యాజమాన్యం దిగివచ్చి యూనియన్ను చర్చలకు పిలిచింది. కంపెనీ వ్యాపారం చేయదలచుకోలేదని స్పష్టం చేసింది. దీనితో యూనియన్ యాజమాన్యంతో చర్చించి ఉద్యోగులకు ప్రయోజన కరమైనన ఒప్పందం జరిగేలా కృషి చేసింది. ఈ ఒప్పందంతో 2018 నవంబరు 30వ తేదీన సంస్థలో వీఆర్ఎస్ పథకం అమలు చేశారు. 2017లో 12 లక్షల సీలింగుతో వీఆర్ఎస్ ఇచ్చిన యజమాన్యాన్ని యూనియన్ పోరాటాల ద్వారా 40 లక్షల సీలింగుకు ఒప్పించడం జరిగింది. దీనిని ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు.
పెన్షన్ సాధించుకునేందుకు
ఈ పోరాటాల కాలంలో యూనియన్కు దేశవ్యాప్తంగా సీఐటీయూ అనుబంధ సంఘాలు ఎన్నో తమ సహాయ సహకారాలు అందించాయి. సుదీర్ఘ కాలం యూనియన్తో అనుబంధం కలిగి వున్నన పీర్లెస్ ఉద్యోగులు వీఆర్ఎస్ అనంతరం కూడా యూనియన్తో, సీఐటీయూతోను సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నారు. 2019, జనవరి 8,9 తేదీల్లో జరిగిన కార్మిక సమ్మె కార్యక్రమాలలో దేశవ్యాప్తంగా పీఆర్లెస్ ఉద్యోగులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పేపథ్యంలో పీర్లెస్ ఉద్యోగుల సంఘంను పెన్షనర్ల అసోసియేషన్గా ఏర్పాటు చేసుకొని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కువ పెన్షన్ సాధించుకునేందుకు పీర్లెస్ ఎంప్లాయిస్ యూనియన్ సమాయత్తమవుతోంది. ఈ దిశలో ఫిబ్రవరి 1,2,3 తేదీలలో కలకత్తాలో యూనియన్ సెంట్రల్ కమిటీ సమావేశాలు జరుపుకొని, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొన్నారు.
Authorization