నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చుల నేపథ్యంలో కనీస వేతనాలు పెంచాలని, రెగ్యులర్ చేయాలని సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. 10వ పీఆర్సీ సమయంలో తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఉద్యోగుల పోరాటాలకు తలొగ్గి వారిని శాంత పరిచేందుకు అప్పుడు ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓఎం.ఎస్.నెం.14ను తీసుకువచ్చారు. కానీ దాని వల్ల వారికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మరో రెండు నెలల్లో 11వ పీఆర్సీ కూడా రాబోతున్నది. ఇందులోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ వస్తే అసలు కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ అనే శ్రమ దోపిడి పద్ధతే ఉండదన్నారు. రాష్ట్రానికి మొదటి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకాకరం చేసిననాడు ఇదే విషయాన్నీ కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆచరణలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ చేస్తానన్న ప్రభుత్వ హామి అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. అప్పట్లో జరిగిన క్యాబినేట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే పర్మినెంట్ చేస్తామని నిర్ణయించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మొండిచేయి చూపారు.
మళ్ళీ నమ్మించారు
కొత్త రాష్ట్రంలో కూడా ఉద్యోగులను తమ మాయ మాటలతో మభ్య పెట్టారు. ముందే ఎన్నికలు వెళ్ళి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని నమ్మించారు. ఈసారైనా తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఉద్యోగులు నమ్మారు. మళ్ళీ కేసీఆర్కే అధికారం అప్పగించారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఒక పక్క కార్మికులు, ఉద్యోగులు కనీస వేతనం 18 వేలు అడుగుతున్నారు. సుప్రీం కోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అని తీర్పు ఇచ్చింది. దీన్ని పట్టించుకోకుండా కొంత మందికి అరకొరగా జీతాలు పెంచి చేతులు దులుపుకుంటున్నారు. మరి కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేస్తానని చెప్పి రెండో సారి కూడా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.
ఎన్నో విజ్ఞప్తులు...
కాంట్రాక్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించాలని, వేతనాలు పెంచాలని 2014, జూన్30 తర్వాత కొనసాగింపు ఉత్తర్వులివ్వాలని యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు అనేక పోరాటాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డా||కె.నాగేశ్వర్ గారి ఆధ్వర్యంలో సచివాలయంలో ఆందోళన చేశారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. శాసన మండలిలోనూ, శాసన సభలోనూ వారి వేతనాలు పెంచాలని, రెగ్యులరైజేషన్ అంశంపై మాట్లాడాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలందరికీ విజ్ఞప్తులు చేశారు.
ప్రభుత్వం నిరూపించుకోవాలి
గతంలోని ప్రభుత్వాలకు భిన్నంగా తమ పాలన ఉంటుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అది నిజమని రుజువు చేసుకోవాలంటే 11 పీఆర్సీలోనైనా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి. తద్వారా ప్రతి క్యాటగిరీలోని పర్మినెంట్ ఉద్యోగి బేసిక్ను వేతనంగా నిర్ణయించాలి. డిఏ, హెచ్ఆర్ఏ వర్తింపచేయాలి. ఆరోగ్య బీమా, బస్పాస్ సౌకర్యం కల్పించాలి. పర్మినెంట్ ఉద్యోగుల మాదిరి సెలవులు, మహిళా ఉద్యోగులకు మెటర్నటీ లీవులు ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆటంకంగా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలోని అసెంబ్లీ చేసిన యాక్టు.2/94ను సవరించాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరి సర్వీసుల క్రమబద్దీకరణకు వెంటనే పూనుకోవాలి. రాష్ట్రంలోని వివిధ శాఖలు(కార్పొరేషన్స్), ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సీటీలు, గ్రామ పంచాయతీ మున్సిపాల్టీలు వంటి తదితర స్థానిక సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీంలలో పనిచేస్తున్న 2.50లక్షల మందికి వేతనాలు పెంచాలి. కానీ ప్రభుత్వం కేవలం 55వేల మందికి మాత్రమే పెంచినట్లుగా ప్రకటించింది. ఇది అన్యాయం. అందుకే వీరు ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.
జీవోల వల్ల ఉపయోగం లేదు
10వ పీఆర్సీ సమయంలో ప్రభుత్వం కనీస వేతనాలు పెంచుతామని జీవో 14ను తీసుకొచ్చింది. కాని ఈ జీవో వల్ల ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. పైగా ఎన్నో సంవత్సరాల నుండి పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఈ జీవోను వర్తింపజేయలేదు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి డిఏ పెంపుదల ఉంటుంది. కాని ఇది ఆచరణలో అమలవుతుందో లేదో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాంట్రాక్స్ కార్మికులను కూడా ఔట్సోర్సింగ్ కిందకు మార్చేస్తున్నారు. ఏపీ జెన్కోలో ఈ జీవో 14ను వర్తింప జేస్తున్నారు. పైగా ఈ జీవో ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణం ఉద్యోగులకు కనీస వేతనాలు వచ్చే అవకాశమే లేదని కార్మిక సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు 11వ పీఆర్సీలో ఉద్యోగులకు కనీస వేతనం 24 వేలుగా నిర్ణయించాలని సీఐటీయూ డిమాండ్ చేస్తున్నాది.
ఇది ఏక పక్ష నిర్ణయం
అసలు గతం నుండి అన్ని కార్మిక సంఘాలు కలిసి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలా పర్మినెంట్ చేయలేని పరిస్థితుల్లో కనీసం పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా వేతనాలు ఇవ్వాలి. గతంలో కార్మికులు ఎలాంటి అన్యాయానికైతే గురవుతున్నారో అదే అన్యాయాన్ని కొనసాగించడానికి మాత్రమే జీవో ఉపయోగపడుతున్నాయి. పైగా ప్రభుత్వం 14వ జీవోని ఏకపక్షంగా తీసుకొచ్చింది. ఈసారైనా ఉద్యోగులకు నష్టం కలిగించని విధంగా చర్యలు తీసుకోవాలని, కొత్తగా తీసుకు వచ్చే జీవో ద్వారా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు.
వేతనం 24 వేలుగా నిర్ణయించాలి
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఏండ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే తమ కష్టాలు తీరిపోతాయని తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశపడ్డారు. టీఆర్ఎస్ను నమ్మి అధికారం ఇచ్చారు. కానీ దారుణంగా మోసపోయారు. కనీసం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాతైనా సమస్యలను పట్టించుకున్నా రనుకున్నారు. కానీ దాని గురించి ఆలోచన లేదు. మరో రెండు నెలల్లో 11వ పీఆర్సీ రాబోతున్నది. గతంలో 10వ పీఆర్సీ సమయంలో ముఖ్యంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. అందుకే ఈసారి 11వ పీఆర్సీలోనైనా వీరికి నాయ్యం చేయాలి. ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయాలి. 11వ పీఆర్సీలో మున్సిపల్ కార్మికుల వేతనం 24 వేలుగా నిర్ణయించాలి. పీఆర్సీ ప్రకటించిన నాటి నుండే కొత్త వేతనాలు అమలు చేయాలి. డ్రైవర్స్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రీషియన్, బిల్ కలెక్టర్, జవాన్, వర్క్ ఇన్స్పెక్టర్, ఆఫీసు సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లకు స్కిల్డ్ వేతనాలను కేటగిరీల వారీగా అమలు చేయాలి. కొత్త మున్సిపాల్టీలు, విలీన గ్రామ పంచాయితీ కార్మికులకు కూడా పాత మున్సిపాల్టీ కార్మికులు వలే సమానంగా వేతనాలు, పీఎఫ్, ఇఎస్ఐ, సెవవులు ఇవ్వాలి. ఈ సమస్యలన్నీ పరిష్కరించపోతే సీఐటీయూ జెండా అండతో ఆ ఉద్యోగులు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు.
Authorization