మూడునెలలకు ముందు నుండే ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్స్ పర్వం మొదలయింది. అందులో పనిచేసే ఉపాధ్యాయులకు టార్గెట్స్ విధిస్తున్నారు. ఒంటిపూట బడులు ప్రారంభమైనా మధ్యాహ్నం సిబ్బందిని రప్పిస్తున్నారు. వచ్చే ఏడాది కోసం ప్రచారం చేయిస్తున్నారు. బతుకుదెరువుకై చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ, కుటుంబాలను నడుపుకుంటున్న ఉపాధ్యాయులకు యాజమాన్యం విధించే టార్గెట్లు పూర్తిచేయలేక మనోవేదనకు గురౌతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్లు తమ సమస్యలను కొలువుతో ఇలా పంచుకుంటున్నారు...
నేడు యావత్తు దేశంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయింది. అయితే ఉద్యోగ కల్పనకు ఊసే ఎత్తడం లేదు ప్రభుత్వాలు .కేవలం ఎన్నికల హడావుడి మాత్రం నిరంతరం కొనసాగుతూ ఉంది .రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ , అవసరాలకొద్దీ పార్టీలు మారుతున్నారు. ఏది ఏమైనా తమకు, తమ కుటుంబాల మనుగడను శాశ్విత పరుచుకుంటున్నారు. ఓటర్లకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ మభ్యపెడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికొస్తే కేంద్రంపై అసహనాన్ని వ్యక్తపరుస్తూ, ఈ సమస్యలకు కారణం వారేనంటూ కాలం వెళ్ళ దీస్తున్నారు. మరోవైపు ఎంతోమంది ఉపాధ్యాయ శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలకు నోచుకోక ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టి కార్పోరేటు పాఠశాలల్లో బానిసల్లా పని చేస్తున్నారు. అరకొర సౌకర్యాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకోని వీరి శ్రమతో కార్పొరేట్ శక్తులు లాభాలు గడిస్తున్నారు.
వీరి కనుసన్నల్లో మెలగాలి
ప్రైవేటు యాజమాన్యాలు అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఏ పాఠశాలలోనైనా కష్టాలు భరించలేక ఉపాధ్యాయులు ఎరురుతిరిగితే అతనిని తొలిగిస్తున్నారు. అతనికి మరే ఇతర పాఠశాలలో అవకాశం రాకుండా జాగ్రత్త పడుతున్నారు .వీరి విద్యా వ్యాపారానికి ఎలాంటి నష్టం రాకుండా ఉపాధ్యాయులను ఎంచుకుంటున్నారు. ఉన్నతమైన చదువు చదివినవారు వీరికి అవసరం లేదు. వారి ఆర్థిక పరిస్థితి వీరిపైనే ఆధారపడేటట్లుండాలి. కష్టపడి పనిచేస్తూ, ఎదురు తిరగకుండా, వారి కనుసైగల్లో మెలిగితే చాలు. స్కూల్లో చదువు ఎలా చెప్పినా బయటికి మాత్రం ఏదో అద్భుతంగా, ఆదర్శవంతంగా ఉంటున్నట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. మరో ముఖ్యమైన విషయం ఉపాధ్యాయులందరూ సమైక్యంగా ఉండకూడదు. పాఠశాలలో ఒకరినొకరు మాట్లాడటానికి వీలు లేదు.
టీచర్దే బాధ్యత
విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వారి పిల్లల అల్లరిని ఇంట్లో తట్టుకోలేకపోతున్నారు. దాంతో వారికీ కావాల్సినవి సమకూర్చి ఉదయం 8 గంటలకు పాఠశాలలో వదిలి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చి తీసుకెళ్లతారు. ఆ తర్వాత రెండు గంటల పాటు ట్యూషన్స్కు పంపుతారు. ఇక రాత్రి 8 తర్వాత పిల్లలు అలసి భోజనం చేసి పడుకుంటారు. ఇదంతా తల్లిదండ్రులకు చాలా సంతోషాన్నిస్తుంది. ఒక్కరోజు స్కూల్కు సెలవు వస్తే పిల్లలు చేసే అల్లరిని తట్టుకోలేక మళ్ళీ పాఠశాల ఎప్పుడు తెరుస్తారా.. అని వేచి చూస్తుంటారు. ఒకరిద్దరు పిల్లలను సముదాయించలేని తల్లిదండ్రులు అలా ఆలోచిస్తే ఇక రోజంతా వందల మంది విద్యార్థులతో సతమతమయ్యే ఉపాధ్యాయుల గురించి ఆలోచించే వారు ఎవరు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి క్రమశిక్షణ వుంది, ఎలాంటి జ్ఞానం సంపాదించారో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించరు . ఓపికున్న తల్లిదండ్రులు ప్రయత్నిస్తే మరుసటి రోజు పాఠశాలకు వస్తారు. యాజమాన్యంతో మాట్లాడి సంబంధిత ఉపాధ్యాయులను పిలిచి వారిముందే ఆ టీచర్ను మందలించడం.
ఉద్యోగం పోతుందనే భయంతో
విద్య శాఖ అధికారులు అవినీతిలో కూరుకుపోవడంతో ప్రైవేట్ టీచర్ల జీవితాలు చాలా అధ్వానంగా మారిపోయాయి. యాజమాన్యాలు ప్రైవేట్ ఉపాధ్యాయులకు అడ్మిషన్స్ టార్గేట్స్ ఇచ్చి హుకూం జారిచేస్తారు. లేకుంటే ఉద్యోగాల నుండి తీసివేస్తామని బెదిరిస్తున్నారు. అందుకే విదిలేని పరిస్థితులల్లో ప్రైవేట్ టీచర్లు వీధుల్లో తిరిగి, ఇంటింటికి వెళ్ళి పిల్లలను మా బడిలో చేర్పించాలని ప్రచార కర్తలుగా పనిచేస్తున్నారు. ఇలా తిరుగుతున్నప్పుడు మహిళా ఉపాధ్యాయులు అనేక రకాలుగా అనుమానాలకు గురవుతున్నారు. వీధులల్లో వీరి గురించి చాలామంది అసభ్యంగా మాట్లాడటం, కొంతమంది వీరి మొహం మీదనే చివాట్లు పెట్టడం, ఇండ్లలో, అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు కుక్కలతో దాడి చేయిస్తున్నారు.అంతేకాకుండా చైన్స్నాచింగ్ సమస్యలను కూడా మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. ఎండకాలంలో బయట తిరగటం వల్ల వడదెబ్బ కొట్టడం, రక్తపోటు, థైరయిడ్ వంటి అనేక రోగాల పాలై ప్రైవేట్ టీచర్ల జీవితాలు ప్రశ్నార్దకంగా మారాయి.
సమాజంలో ఉన్న మేధావులు, రచయితలు, మహానుభావులు మరీ ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యను అర్ధం చేసుకోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా వున్నది. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని, ప్రైవేట్ ఉపాధ్యాయుల కష్టాలు తీరాలని ఆశిస్తూ...
రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి
ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యల పట్ల చొరవ చూపించాలి. ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇప్పించాలి. మా ఆత్మాభిమానాన్ని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. మానసిక ఆందోళనలను కల్పించకుండా, ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే జీతాలను నిర్ణయించి ప్రైవేటు యాజమాన్యం వద్ద వసూలుచేసి నేరుగా టీచర్ల బ్యాంక్ ఖాతాలోకి జమచేయాలి. మాకు కూడా ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఇఎస్ఐ, పీఎఫ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల వలే ప్రైవేట్ పాఠశాలల్లో జరిగే ప్రతి విషయం ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
- కళ్యాణి
ఎనిమిదేండ్ల నుండి పోరాడుతున్నాం
ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ అన్నింటినీ భరిస్తూ పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాద్యాయులకు అడ్మిషన్ టార్గెట్లు మానసిక ఆందోళనలకు గురిచేస్తున్నాయి . విద్యార్థుల నుండి 12 నెలల ఫీజు వసూలు చేసి సిబ్బందికి మాత్రం 10 నెలల జీతమే ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్లందరూ కలిసి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(టీపీటీఎఫ్) అనే సంఘాన్ని ఎర్పాటు చేసుకుని గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రైవేట్ టీచర్ల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం బాధాకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి మనుమడి నుండి గవర్నమెంట్ ఆఫీస్ అంటెండర్ పిల్లల వరకు అధిక శాతం కూడ ప్రైవేట్ టీచర్ల దగ్గరే విద్యని అభ్యసిస్తున్నా మా గురించి పట్టించుకునే ఒక్క అధికారి కూడ లేక పోవడం అన్యాయం.
- రేణుక
కనీసం మనిషిగా చూడడం లేదు
ఉపాధ్యాయులంటే సమాజంలో భావిభారత నిర్మాతలను తయారుచేసేవారు. సమాజాన్ని చెడు మార్గంలో పయనించకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. పిల్లల్ని సక్రమమైన మార్గంలో నడిపే మార్గదర్శకులు. అలాంటి వారికి ఎంతో గౌరవం ఉండాలి. కానీ పరిస్థితులు అలా లేవు. గౌరవించకపోయిన కనీసం మనిషిగా కూడా చూడడం లేదు. ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయునికిచ్చే నెలజీతంతో పది మందికి పైగా ప్రైవేటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సమాజంలో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల వెలసి , చిత్ర విచిత్ర వేషాలతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ పూటగడుపుతున్నాయి. టీచర్లను మాత్రం బానిసలుగా చూస్తున్నారు.
- భాస్కర్
Authorization