హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల నుండి లక్షల మంది పేద ప్రజలు రోజూ కూలి కోసం నగరాల్లోని అడ్డాలపై నిలబడి ఎదురు చూస్తుంటారు. ఎవరు వచ్చి ఈ రోజు పనికి పిలుస్తారా..! అని ఆశగా వాళ్ళ కండ్లు వెదుకుతుంటాయి. ఎందుకంటే ఆరోజు కూలి దొరికితేనే వారి కడుపు నిండేది. ఒక్కొక్క అడ్డా వద్దకు రోజుకు సుమారు వంద మంది నుండి నాలుగు వందల మంది పని కోసం ఉదయం ఆరుగంటలకే వచ్చి చేతిలో క్యారేజీలు పెట్టుకొని కూర్చుంటారు. ఒక్కహైదరాబాద్ నగరంలోనే ఇటువంటి అడ్డాలు దాదాపు 1200 వరకు ఉంటాయి. ఈ అడ్డాల్లో సుమారు 25వేల మంది భవన నిర్మాణ కార్మికులుంటారు. అడ్డాను ఆధారం చేసుకొని పని వెతుక్కునే వారేకాక ఎటువంటి అడ్డా లేకుండా ఈ పని చేసేవారు వేల సంఖ్యల్లో ఉంటారు. అసలు వారి సమస్యలేంటో తెలుసుకుందాం....
అడ్డాకూలీల్లో తాపీ మేస్త్రీ నుండి పెయింటర్, కార్పెంటర్, ఫ్లంబర్, కరెంట్ వైరింగ్ వంటి పనులు చేసేవారు. వీరికి హెల్పర్లు కూడా ఉంటారు. వీరే కాకుండా దాల్మిల్లు, ఆయిల్మిల్లు, రైస్మిల్లు, చాక్లెట్, బిస్కెట్, సబ్బులు, ఇంకా చిన్న చిన్న ఫ్యాక్టరీలలో రోజు కూలి చేసేవారుంటారు. వీరందరిలో ఒక్క భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ గుర్తింపు కార్డులు జారీ చేసింది. కాని ఇతర పనులు చేసేవారెవరికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు. వీరంతా తెలంగాణా వస్తే తమ కోసం కొన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఆశపడ్డారు. కాని గత పాలకుల కంటే తెలంగాణా పాలకుల అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
వలస వచ్చినవారే...
సరళీకరణ ఆర్థిక విధానాల పుణ్యమా అని గ్రామాలలో పని దొరక్క నగరాలకు వలస వచ్చిన వారే. మరి కొంతమంది గ్రామంలో వ్యవసాయం గిట్టుబాటు కాక ఉన్న కొద్ది భూమి, ఇల్లు అమ్ముకొని నగరంపై గంపెడాశ పెట్టుకొన్ని కుటుంబంతో కలిసి వలస వచ్చిన వారు ఉన్నారు. మన హైదరాబాద్ నగరంలో మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలతోపాటు శ్రీకాకుళం నుంచి వచ్చిన వారు అత్యధికంగా కనిపిస్తారు. వీరి పరిస్థితులపై ఆరాతీస్తే ఒకపక్క పుట్టి పెరిగిన గ్రామం, మరోపక్క గంపెడాశతో వచ్చిన నగరంలోనూ పనులు దొరక్క దిక్కు లేని పరిస్థితుల్లో దుర్బరమైన జీవితాలు అనుభవిస్తున్నామని వారు అంటున్నారు. మరోపక్క ఆర్థిక మాంద్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపడి పోవడం, అధిక ధరలు, మిషనరీతో పని చేయించడం వంటివి వీరి జీవితాలపై ప్రభావం చూపి నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది.
బాధ్యత ప్రభుత్వానిదే
గ్రామాల నుంచి పని వెతుక్కుంటూ వలస వచ్చిన కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే.కార్మిక సంఘాలు గతంలో 15 సంవత్సరాలుగా పోరాడితే భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారిచేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. కాని ఇతర పనులు చేసే అసంఘటిత కార్మికులకు నేటికీ ఎటువంటి గుర్తింపు లేదు. తెలంగాణా ప్రభుత్వం అయినా అన్నీ రకాల కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పని గ్యారెంటీ, ఇఎస్ఐ, పి.ఎఫ్, ప్రమాదబీమా, ధరలకు అనుకూలంగా కూలి సౌకర్యాలు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. వీటితో పాటు అడ్డాల వద్ద పనికోసం ఎదురుచూసే కార్మికులకు షెడ్, మంచినీటి సౌకర్యం, మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Authorization